breaking news
miryala Srisailam
-
పంతంగి పంతం
చిత్రహింసకు విచిత్ర సమాధి గ్రామీణ మహిళకు అవమానం అంటే ఏంటో తెలియదు! తాము అవమానానికి గురువుతున్నారన్నది గ్రహించలేని వ్యవస్థలో కూరుకుపోయారేమో అనిపిస్తుంది. అత్తమామల సేవలు, పిల్లల పెంపకం, భర్తకు ఊడిగం, ఇంటి పని, కూలి పని... ఇంత చేస్తున్నా... గుర్తింపు మాట దేవుడెరుగు... అవమానం మాత్రం రోజూ మింగాల్సిన ముద్దే. ఇది కాకుండా అప్పుడప్పుడూ... చీత్కారాలు, చిత్రహింసలు! ఇంకొన్నిసార్లు చావు దెబ్బలే! పంతంగి పంతం పట్టింది. భార్యను చంపిన భర్త ఇంటి ముందే ఆవిడ సమాధి కట్టింది. కట్టింది... ఈ దుర్మార్గపు వ్యవస్థను కూల్చడానికే. చిత్రహింసకు ఇంతకంటే విచిత్రమైన సమాధి మనం ఎప్పుడూ చూసి ఉండం. హైదరాబాద్కు 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ గ్రామం. పేరు పంతంగి. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో ఉండే ఈ గ్రామంలో నాలుగు నెలల క్రితం ఓ దారుణ హత్య జరిగింది. మిర్యాల శ్రీశైలం అనే అతను తన భార్య పార్వతమ్మను తలపై రోకలిబండతో బాది చంపాడు. ఊరు ఊరంతా ఈ సంఘటనతో అదిరిపోయింది. పంచనామా తర్వాత అందరిలాగే పార్వతమ్మ మృతదేహాన్ని కూడా శ్మశానంలో ఖననం చేసేవారే! కానీ, ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలని, మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని, నిందితుడి ఇంటి ఎదుటే మృతదేహంతో ఆందోళనకు దిగారు ఆ గ్రామ మహిళలు. అయితే శ్రీశైలం కుటుంబ సభ్యుల నుంచి స్పందన కరువైంది. దీంతో నిందితుని ఇంటి ఎదుటే గుంతను తవ్వి శవాన్ని పూడ్చిపెట్టారు. దానిపై సమాధిని నిర్మించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల సహకారంతో నిందితుని ఇంటి పక్కనే ఉన్న రెండెకరాల స్థలంలో పార్వతమ్మ మృతికి స్మారకంగా స్థూపాన్ని నిర్మించారు. అక్కడే సంతాపసభ నిర్వహించారు. స్త్రీలపై జరిగే ఇలాంటి కిరాతక చర్యలకు పూనుకునేవారికి ఈ సంఘటన ఓ గుణపాఠం కావాలని నినదించారు. అసలు ఏం జరిగిందంటే... పార్వతమ్మ వయసు 24, శ్రీశైలం వయసు 28. ఇద్దరిదీ ఒకే గ్రామం. నాలుగేళ్ల క్రితం వీరికి వివాహమైంది. పెళ్లైన నాటి నుంచి శ్రీశైలం నిత్యం పార్వతమ్మను వేధింపులకు గురి చేసేవాడు. అతనికి అతని కుటుంబసభ్యులూ మద్దతుగా ఉండేవారు. ఈ వేధింపులు తాళలేక పార్వతమ్మ ఆర్నెల్లుగా పుట్టింటిలోనే ఉంటోంది. శ్రీశైలం అప్పుడప్పుడు పార్వతమ్మ దగ్గరికి వెళ్లి, ఇంటికి రమ్మని పిలిచేవాడు. పార్వతమ్మ ససేమిరా అనేది. రెండు నెలల క్రితం మళ్లీ పార్వతమ్మ దగ్గరికి వెళ్లిన శ్రీశైలం ‘ఇంటికి రమ్మని, లేదంటే కత్తిపీటతో కోసుకుంటా’నని బెదిరించాడు. ఆమె భయపడి కత్తిపీటను లాక్కుంది. శ్రీశైలమే చాకుతో చేయి కోసుకున్నాడు. ఇంటికి రమ్మని పిలిచినందుకు పార్వతమ్మే తనను కత్తితో కోసిందని ఊర్లో అందరికీ చెప్పాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య సమస్య మరింత జటిలమైంది. నెల రోజుల తర్వాత శ్రీశైలం మళ్లీ పార్వతమ్మ వద్దకు వెళ్లాడు. ఇంటికి రమ్మని అడిగాడు. ‘కత్తితో చేయి కోసిందెవరో తేలాలి, ఈ విషయం ఊళ్లో అందరికీ తెలియాలి. అప్పుడే వస్తాన’ని చెప్పింది. అందుకు శ్రీశైలం పెద్ద మనుషుల సమక్షంలో తప్పు ఒప్పుకుంటానని చెప్పాడు. తప్పు ఒప్పుకున్ననాడే వస్తానని చెప్పి, తన పనిలోకి వెళ్లిపోయింది పార్వతమ్మ. తనను భార్య ఏ మాత్రం లెక్కచేయడం లేదని కోపంతో ఉడికిపోయాడు శ్రీశైలం. అక్కడే ఉన్న రోకలిబండను అందుకుని, పార్వతమ్మ కోసం వెదుక్కుంటూ వెళ్లాడు. నీళ్ల సంపు వద్ద బట్టలు ఉతుకుతున్న పార్వతమ్మ కనిపించింది. ఆమె తలపై రోకలిబండతో మోదాడు. దాంతో పార్వతమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. శ్రీశైలం, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. శ్రీశైలం జైలులోనే ఉన్నాడు. అతని కుటుంబసభ్యులు మాత్రం విడుదలయ్యారు. ఊర్లోకి వచ్చిన వారు ఇంటి ముందు సమాధి, స్మారకస్తూపాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. - కనకల లింగస్వామి సాక్షి, చౌటుప్పల్, నల్లగొండ జిల్లా కరెక్టు కావచ్చు కానీ... పార్వతమ్మను క్రూరంగా హత్య చేసిన భర్త, అత్తమామలను రెండు రోజుల్లోనే రిమాండ్ చేశాం. పకడ్బందీ సాక్ష్యాలతో చార్జిషీటు వేశాం. ఇక అతని ఇంటి ముందే పార్వతమ్మ మృతదేహాన్ని పూడ్చిపెట్టడం సామాజిక న్యాయపరంగా ప్రజలకు సమర్థనీయమైన చర్యగా అనిపించినా, చట్టపరంగా ఇది సరికాదు. - భూపతి గట్టుమల్లు పోలీస్ ఇన్స్పెక్టర్, చౌటుప్పల్ మరణ శిక్ష విధించినా తక్కువే అన్యాయంగా నాబిడ్డను పొట్టన పెట్టుకుండు, నా ఇంటికే వచ్చి, ఇక్కడున్న నాబిడ్డను కొట్టిచంపిండు. వాడికి మరణశిక్ష విధించినా తక్కువే. జీవితాంతం జైలులోనే ఉంచాలి. ఇంటి ముందు శవాన్ని పూడ్చిపెడితే, వాళ్ల ఇంటిని ధ్వంసం చేశామని, ఇంట్లోని విలువైన వస్తువుల్ని ఎత్తుకెళ్లామని మాపైనే, 18మందిపై పోలీసు కేసు పెట్టిండ్రు. కోర్టు చుట్టు తిరుగుతున్నం. - కడగంచి బీరప్ప పార్వతమ్మ తండ్రి మరో మహిళకు జరగకూడదు పార్వతమ్మ తల్లిదండ్రులకు ఇద్దరే కూతుళ్లు. పెద్ద కూతురే పార్వతమ్మ. పెళ్లి అయిన నాటి నుంచే పార్వతమ్మను నానా రకాలుగా వేధింపులకు గురి చేసేవాడు శ్రీశైలం. ఏ పనీచేసేవాడు కాదు. కుటుంబ సభ్యులు కూడా అతనికి వంతపాడారు. అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటిలో తలదాచుకుంటున్న పార్వతమ్మను ఆమె బతుకేదో ఆమెను బతకనీయకుండా దారుణంగా చంపాడు. మరో మహిళకు ఇలా జరగకూడదు. - బోయ కవిత, గ్రామస్థురాలు పార్వతమ్మ మరణాన్ని అంతా తలుచుకోవాలి భార్యలను వేధించే వారు పార్వతమ్మ మరణాన్ని తలుచుకోవాలి. ఆ కుటుంబంలో అలుముకున్న చీకట్లు తమ జీవితంలోనూ పొడసూపవచ్చని గుర్తించాలి. నేరస్థుడి కుటుంబ సభ్యులు పార్వతమ్మ సమాధిని, స్థూపాన్ని చూసి నిత్యం పశ్చాత్తాపపడాలి. అందుకే వారి ఇంటి ఎదుటే సమాధిని కట్టించాం. - కడగంచి ధనమ్మ గ్రామస్థురాలు -
భర్త ఇంటి ఎదుటే భార్య అంత్యక్రియలు
చౌటుప్పల్: భార్యను అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు భర్త. అతడి ఇంటిముందే మృతదేహంతో ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నా అత్తింటి వారి కనికరం కరువైంది. మృతురాలి తల్లిదండ్రుల రోదనలు వర్ణనాతీతం.చివరకు ఇంటి ముందే గుంతను తవ్వి శవాన్ని పూడ్చారు. నిందితుడికి చెందిన రెండెకరాల పొలంలో భార్య మృతికి సార్మక చిహ్నంగా స్థూపాన్ని నిర్మించాలని, ఆ భూమిని పార్కుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. చౌటుప్పల్ మండలం పంతంగిలో మిర్యాల శ్రీశైలం(28) తన భార్య పార్వతమ్మ(24)ను గత ఆదివా రం రోకలిబండతో కొట్టి చంపిన విషయం తెలిసిందే. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పార్వతమ్మ మృతదేహాన్ని నిందితుడి ఇంటి ఎదు ట ఉంచి నాలుగు రోజులుగా బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. నిందితుడి వాటాకు 6ఎకరాల భూమి ఉంది. ఇరువర్గాల పెద్ద మనుషులు కూర్చొని 2.10ఎకరాల భూమి మృతురాలి కుటుంబానికి ఇచ్చే లా ఒప్పందం చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుడి తండ్రి పోలీ సుల రక్షణలో ఉన్నారు. తల్లి యశోధ పరారీలో ఉంది. ఈ భూమి యశోధ పేరున ఉండడంతో, ఒప్పందం ముం దుకు సాగలేదు. దీంతో పార్వతమ్మ చనిపోయి 5రోజులు గడిచినా అంత్యక్రియలు చేయకుండా ఆందోళన సాగించారు. అసలు పార్వతమ్మను చంపింది ఎందుకంటే.. పార్వతమ్మ, శ్రీశైలంలది ఒకే గ్రామం. నాలుగేళ్ల కిందట వివాహమైంది. శ్రీశైలం ఓ రకమైన సైకో మనస్తత్వం. నిత్యం పార్వతమ్మను వేధింపులకు గురి చేసేవాడు. ఇతని వేధింపులకు తాళలేక పార్వతమ్మ దసరా పండుగ నుంచి తల్లి గారి ఇంటి వద్దే ఉంటోంది. శ్రీశైలం అప్పుడప్పుడు పార్వతమ్మ వద్దకు వెళ్లి వస్తున్నాడు. 2నెలల క్రితం ఓ సారి వెళ్లి ఇంటికి రమ్మని, లేదంటే కత్తిపీటతో కోసుకుంటానని బెదిరించాడు. ఆమె భయపడి కత్తిపీటను లాక్కుంది. శ్రీశైలమే చాకు తో చేయి కోసుకుని, భార్యపై నింద మోపాడు. అప్పటి నుంచి భార్యభర్త మధ్య సమస్య మరింత జఠిలమైంది. గత ఆదివారం మళ్లీ పార్వతమ్మ వద్దకు వెళ్లాడు. ఇంటికి రమ్మని అడిగాడు. అందుకు ఆమె చాకుతో చేయి కోసిందెవరో, తేలాకే వస్తానని తెగేసి చెప్పింది. అందు కు శ్రీైశైలం పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకుంటానని చెప్పాడు. దీంతో పార్వతమ్మ అప్పుడే వస్తానని చెప్పింది. అప్పటి దాకా నేనెక్కడ ఉండాలని శ్రీశైలం ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీం తో శ్రీశైలం రోకలిబండతో నీళ్ల సంపు వద్ద బట్టలు ఉతుకుతున్న పార్వతమ్మ తలపై మోదాడు. తల పగిలి, మెదడు చిట్లి బయటికొచ్చింది. కుటుంబ సభ్యులు గుర్తించి హైదరాబాద్కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు. తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం.. కడగంచిబీరప్ప,యశోద దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె పార్వతమ్మ, రెండో కుమార్తె శ్వేత ఐదో తరగతి చదువుతోంది. కొడుకులు లేరు. పెద్దకుమార్తె తమ కళ్ల ముందే ఉంటుందనే ఉద్దేశంతో అదే గ్రామానికి చెందిన అబ్బాయితో పెళ్లి చేశారు. వివాహమై నాలుగేళ్లయినా సంతానం లేదు. కూతురు చనిపోయి, ఐదు రోజులుగా శవం కళ్లముందే ఉండడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. వారి రోదన అరణ్య రోదనగానే మారింది. తండ్రి బీరప్ప బుధవారం స్పృహ తప్పడంతో ఆస్పత్రిలో చేర్చారు. తల్లి యశోద ముందు నడిచి అంత్యక్రియలు నిర్వహించింది. పార్వతమ్మ మృతికి చిహ్నంగా స్థూపం.. పార్వతమ్మ పెళ్లి సమయంలో ఇచ్చిన కట్న కానుకలు, నిందితుడికి చెందిన 2.10ఎకరాల భూమిని మృతురాలి కుటుంబానికి ఇచ్చేలా ఒప్పందం చేశారు. నిందితుడి తల్లి పరారీలో ఉండడం, భూమి ఆమె పేరున ఉండడం తో, ఒప్పందం ముందుకు సాగలేదు. చివరకు మృతురాలి బంధువులు గురువారం అంత్యక్రియలు చేశారు. శ్రీశైలం ఇంటి ఎదుటే గుంతను తవ్వి శవాన్ని పూడ్చిపెట్టారు. ఈ 2.10ఎకరాల భూమిలోనే ఈ ఇల్లు ఉంది. శవాన్ని పూడ్చిన చోటే పార్వతమ్మ మృతికి స్మారక చిహ్నంగా స్థూపాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ రెండెకరాల భూమిని పార్కుగా అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నారు.