Minister Chaudhry Nisar Ali Khan
-
'అఫ్రిది తలరాతను ట్రంప్ నిర్ణయించలేడు'
ఇస్లామాబాద్: అమెరికా నిఘా సంస్థ సీఐఏ గుర్తించిన అబోటాబాద్ లోని ఆ ఇంట్లోనే అల్ కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించిన వైద్యుడు, ప్రస్తుతం పాకిస్థాన్ జైలులో ఉన్న డాక్టర్ షకీల్ అఫ్రిదిని రెండు నిమిషాల్లో బయటికి తెప్పిస్తానన్న డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా మండిపడింది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో రిపబ్లికన్ ఫ్రంట్ రన్నర్ పై పాక్ నిప్పులు చెరిగింది. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా యూఎస్ తో స్నేహమే కోరుకునే పాకిస్థాన్ గురించి ట్రంప్ కు ఏమాత్రం అవగాహనలేదని దుయ్యబట్టింది. 'పాకిస్థాన్ కు మనం(అమెరికా) భారీగా నిధులు ఇస్తున్నాం. అందుకని వాళ్లు మన మాట వింటారనే అనుకుంటున్నా. నేను అధ్యక్షుడిగా గెలిస్తే రెండంటే రెండే నిమిషాల్లో పాకిస్థాన్ తో మాట్లాడి డాక్టర్ అఫ్రిదిని విడిపిస్తా' అని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి పోటీపడుతోన్న ట్రంప్ సోమవారం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి చౌదరీ నిసార్ అలీ ఖాన్ ట్రంప్ కామెంట్లపై స్పందించారు. 'చిల్లర విదిల్చినంత మాత్రాన పాకిస్థాన్ అమెరికాకు భయపడుతుందని అనుకోవడం ట్రంప్ పొరపాటు. ఆయనది అలాంటి విదేశాంగ విధానమే అయితే అది శుద్ధతప్పు. ట్రంప్ ఇతర దేశాలను గౌరవించడం నేర్చుకోవాలి' అని హితవు పలికిన నిసార్.. డాక్టర్ అఫ్రిది పాకిస్థాన్ పౌరుడని, అతని తలరాతను నిర్ణయించేది ఇస్లామాబాదే తప్ప డోనాల్డ్ ట్రంప్ కాదని తేల్చిచెప్పారు. ఒకవేళ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటికీ ఈ విషయంలో ఏమీ చెయ్యలేడని పేర్కొన్నారు. పాకిస్థాన్ లోని అబోటాబాద్ లో బిన్ లాడెన్ తలదాచుకున్నాడని తెలుసుకున్న అమెరికా నిఘా సంస్థ సీఐఏ.. ఆ విషయాన్ని రూఢీ చేసుకునేందుకు పాకిస్థాన్ జాతీయుడే అయిన డాక్టర్ షకీల్ అఫ్రిది సాయం తీసుకుంది. వ్యాక్సిన్ నెపంతో అఫ్రిదిని లాడెన్ ఉంటోన్న ఇంటిలోపలికి పంపిన సీఐఏ.. అక్కడి పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చింది. తర్వాత కొద్ది రోజులకే ఆ ఇంటిపై దాడిచేసి లాడెన్ ను మట్టుపెట్టింది. ఆపరేషన్ క్రమంలో 'సీఐఏ డాక్టర్' గా పేరుపొందిన అఫ్రిదిని పాక్ ప్రభుత్వం దేశద్రోహం ఆరోపణలపై అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. విచారణ పేరుతో ఐదేళ్లుగా జైలులో మగ్గిపోతోన్న షకీల్ అఫ్రిదీని బయటికి తీసుకొస్తానని ట్రంప్ వ్యాఖ్యనించడంతో మరోసారి అతను వార్తల్లోకెక్కాడు. -
పాక్ జట్టుకు పచ్చ జెండా
► టి20 ప్రపంచకప్లో పాల్గొనేందుకు అనుమతి ► నేడు భారత్కు రాక ► ఆదివారం లంకతో ప్రాక్టీస్ మ్యాచ్ ఇస్లామాబాద్: టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్ జట్టు పాల్గొనడంపై కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. టోర్నమెంట్లో పాల్గొనేందుకుగాను భారత్కు వెళ్లేందుకు పాక్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం షాహిద్ ఆఫ్రిది నాయకత్వంలోని పాక్ బృందం భారత్కు రానుంది. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి చౌదరీ నిసార్ అలీఖాన్తో జరిగిన సుదీర్ఘ సమావేశం తర్వాత తమ జట్టును భారత్కు పంపుతున్నామని పీసీబీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నజమ్ సేథీ ప్రకటించారు. ‘క్రికెట్ అభిమానులకు ఓ శుభవార్త. పాక్ జట్టు భారత్కు వెళ్లేందుకు మా అంతర్గత వ్యవహారాల మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. న్యూఢిల్లీలోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్తో సంప్రదింపుల తర్వాత భద్రతపై భారత్ గట్టి హామీ ఇచ్చింది. భద్రతా అంశాలపై భారత హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహరిషి కూడా చర్చలు జరిపారు. వీటిపై మేం సంతృప్తిగా ఉన్నాం. దీంతో మా జట్టు శుక్రవారం రాత్రి దుబాయ్కు వెళ్లి అక్కడి నుంచి నేరుగా శనివారం కోల్కతాకు చేరుకుంటుంది’ అని సేథీ పేర్కొన్నారు. మరోవైపు భద్రతపై చర్చల అనంతరం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) కూడా ఓ ప్రకటనను విడుదల చేసింది. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని వెల్లడించింది. పాక్ హై కమిషనర్... కేంద్ర హోంశాఖ కార్యదర్శితో జరిపిన చర్చలు ఫలవంతంగా ముగిశాయని ఎంఈఏ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. పాక్ ప్రధాని అనుమతితోనే... భద్రతపై లిఖితపూర్వక హామీ కావాలని పాక్ పట్టుబట్టడంతో ఉదయం నుంచి రెండు దేశాల మధ్య పెద్ద స్థాయిలోనే చర్చలు జరిగాయి. అయితే అన్ని జట్లకు పూర్తి భద్రత కల్పిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించడం, ఆ తర్వాత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాక్ జట్టుకు అత్యున్నత ఏర్పాట్లు చేస్తామని నేరుగా పీసీబీకి ట్వీట్ చేయడంతో పాక్ ప్రభుత్వం మెట్టు దిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పాక్ హై కమిషనర్ మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని సౌదీ పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు నిసార్ అలీఖాన్ నివేదించారు. దీంతో షరీఫ్ పాక్ జట్టు పర్యటనపై ఆమోద ముద్ర వేశారని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. తొలి ‘ప్రాక్టీస్’ రద్దు పాక్ జట్టు భారత్కు రావడం ఆలస్యం కావడంతో శనివారం బెంగాల్ రంజీ జట్టుతో జరగాల్సిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయింది. అయితే ఆదివారం కోల్కతాలో శ్రీలంకతో రెండో వార్మప్ మ్యాచ్ ఆడనుంది.