breaking news
mandal parishad development
-
పింఛన్ల సర్వేలో తేడాలొస్తే అధికారులే బాధ్యులు
కలెక్టర్ విజయకుమార్ హెచ్చరిక ఒంగోలు టౌన్ : జిల్లాలో ఈ నెల 19, 20వ తేదీల్లో జరిగే పింఛన్ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని, సర్వేలో ఏదైనా తేడాలు వస్తే కమిటీలో ఉన్న ప్రభుత్వ అధికారులను బాధ్యులను చేస్తామని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులను హెచ్చరించారు. ప్రకాశం భవనంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇచ్చిన సూచనలు పాటించి సర్వే చేయాలన్నారు. ఎంపికైన కమిటీ సభ్యులకు అవగాహన కల్పించి సర్వే చేయాలని, ఏ ఒక్క అర్హునికి అన్యాయం జరగకూడదని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వితంతువులు, వికలాంగులు, చేనేత పింఛన్లలో వయసుతో ఇబ్బంది లేదని, వృద్ధాప్య పింఛన్లతో వయసు నిర్ధారించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో సర్వే సమయంలో రేషన్కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుల్లో ఎందులో ఎక్కువ వయసు ఉంటుందో దాన్ని పరిగణించాలని సూచించారు. పదవీ విరమణ పొంది పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్, అవుట్సోర్సింగ్, నెలసరి జీతం, 2.50 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట ఉన్న వారు, ఆదాయపన్ను చెల్లించేవారు, కారు ఉన్న కుటుంబ యజమాని పింఛన్కు అర్హులు కాదని చెప్పారు. సర్వేలో ఎట్టి పరిస్థితుల్లో లోపాలు లేకుండా సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పచ్చని ప్రకాశం కోసం లక్ష మొక్కలు: జెడ్పీ చైర్మన్ పచ్చదనం, పరిశుభ్రతలో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన చర్యల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ వెల్లడించారు. జిల్లాను పచ్చని ప్రకాశంగా తీర్చిదిద్దడంలో ఈ నెల 20వ తేదీన లక్ష మొక్కలను నాటేందుకు నిర్ణయించినందున నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆ రోజున జిల్లావ్యాప్తంగా మొక్కలను నాటాలని ఆదేశించారు. ఈ మొక్కలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఆవరణలో, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణలో నాటడంతో పాటుగా మొక్కలను నాటేందుకు ముందుకు వచ్చిన వారందరినీ ప్రోత్సహించాలని, మొక్కలను నాటడమే లక్ష్యంగా కాకుండా పూర్తి సంరక్షణను కూడా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లాను పరిశుభ్రంగా తయారు చేసేందుకు మండలంలోని 2 గ్రామాలను ఎంపిక చేసి అక్టోబర్ 2వ తేదీ నాటికి వంద శాతం పూర్తి చేయడమే కాకుండా వాటిని ఉపయోగించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్లో జిల్లా మొదటిస్థానంలో ఉందన్నారు. ఈ నెల 25వ తేదీన జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లను పరిశుభ్రంగా చేస్తారని, ఈ విషయంలో పాఠశాల హెడ్మాస్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని చెప్పారు. డీఆర్డిఎ పీడీ పద్మజ మాట్లాడుతూ ఈ నెల 19,20 తేదీల్లో పింఛన్ల పరిశీలన కార్యక్రమానికి కమిటీ సభ్యులను నియమించని మండలాలు వెంటనే జాబితా అందజేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు సూచించారు. ఆధార్ అనుసంధానం లేని పింఛన్దారుల వివరాలను సేకరించి రెండు రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. కమిటీ సభ్యుల నియామకం, కమిటీ సభ్యుల సమావేశం, 19,20వ తేదీల్లో పరిశీలన, తర్వాత ఎంపీడీఓలు లాగిన్లో అప్లోడ్ చేయాలని ఆమె వివరించారు. ఒకరోజు వేతనం కట్ - జెడ్పీ సీఈఓ కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు హాజరుకాని మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఒకరోజు వేతనం కట్ చేస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ ఎ.ప్రసాద్ స్పష్టం చేశారు. అంతేగాకుండా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్లో డ్వామా పీడీ పోలప్ప, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ నరసింహారావు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక
ఒంగోలు కలెక్టరేట్ : గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కలెక్టర్ విజయకుమార్ వెల్లడించారు. మండల స్థాయిలో అధికారులతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, వైద్యాధికారులతో స్థానిక అంబేద్కర్ భవన్లో బుధవారం సాయంత్రం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధ్యక్షతన ఏర్పాటు చేసే కమిటీలో తహసీల్దార్, ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజినీర్లు సభ్యులుగా ఉంటారన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి గ్రామాల వారీగా సమీక్షించుకుని అందుబాటులో ఉన్న నిధులతో మంచినీటి పథకాలకు మరమ్మతులు చేయించుకోవాలని కమిటీలను ఆదేశించారు. మూడు నెలలకు సరిపడా మందులు ఉండాలి... వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని వైద్యారోగ్య శాఖాధికారులను కలెక్టర్ హెచ్చరించారు. రానున్న మూడు నెలలకు సరిపడా మందులను ఆస్పత్రుల్లో సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. వ్యాధుల నివారణకు తహసీల్దార్ అధ్యక్షతన మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పరిశుభ్రతకు ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు. వరదలు, తుఫాన్లు, కరువులు వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. 15 రోజుల్లో స్థలాలు సేకరించాలి... జిల్లాలో ప్రభుత్వ శాఖల భవనాల నిర్మాణాలకు భూసేకరణ చేపట్టాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. 15 రోజుల్లో స్థలాలను సేకరించి ప్రతిపాదనలు పంపించాలన్నారు. పెద్దఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందుకోసం వెయ్యి ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలన్నారు. అందుకు అనువైన స్థలాల కోసం తహసీల్దార్లంతా గ్రామాల్లో పర్యటించి సేకరించాలని సూచించారు. ఇందిరమ్మ పచ్చతోరణం పథకం కింద ఒక్కో మండలంలో వెయ్యి ఎకరాల్లో మొక్కలు పెంచనున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి సీనియర్ అధికారి... రెండోవిడత అక్షర విజయం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సీనియర్ అధికారిని నియమించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. డివిజన్లో 1.82 లక్షల మంది నిరక్షరాస్యులుండగా, మొదటి విడతలో లక్షా 2వేల మందిని అక్షరాస్యులను చేసినట్లు చెప్పారు. మిగి లిన వారిని రెండో విడతలో అక్షరాస్యులను చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు, ఉపాధి హామీ పథకంలోని జాబ్ కార్డుదారులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ది జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాదర్గౌడ్, డీఆర్డీఏ పీడీ పద్మజ, జిల్లా పరిషత్ సీఈవో ప్రసాద్, ముఖ్య ప్రణాళికాధికారి పీబీకే మూర్తి, డ్వామా పీడీ పోలప్ప, హౌసింగ్ పీడీ ధనుంజయుడు తదితరులు పాల్గొన్నారు.