నేడు పీసీసీ కార్యవర్గ భేటీ
పార్టీ తాజా పరిస్థితి, వలసలపై ప్రధాన దృష్టి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో దిగజారిన పార్టీ పరిస్థితి, నేతల వలసలు, పరస్పర విమర్శల నేపథ్యంలో ఆదివారం గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్సింగ్ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రోత్సహిస్తున్న వలసల ధాటికి కాంగ్రెస్ పార్టీ కకావికలమవుతోంది. సీనియర్ నేతలందరూ వలసబాట పడుతున్నారు. తాజా గా నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్లు కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సీనియర్ నేతలు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించి నా మార్పు కనిపించడంలేదు. అలాగే ఇటీవలి కాలంలో సీనియర్నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎల్పీ నేతలపైనే మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇప్పటికే పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైన నేపథ్యంలో నేతల తీరు హైకమాండ్కు మరింత చికాకు తెప్పిస్తోంది. దాంతో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించింది.
మరో ముగ్గురికి షోకాజ్లు
కాంగ్రెస్లో షోకాజ్ నోటీసుల పర్వం కొనసాగుతోంది. ఉత్తమ్కుమార్రెడ్డిపై విమర్శలు చేసిన నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన పార్టీ క్రమశిక్షణ సంఘం తాజాగా మరో ముగ్గురు సీనియర్లకు నోటీసులిచ్చింది. సీఎల్పీ నేత జానారెడ్డి కోవర్టని ఆరోపించిన పాల్వాయి గోవర్దన్రెడ్డితోపాటు కరీంనగర్ సభలో పరస్పర విమర్శలు చేసుకున్న డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, ఎస్సీసెల్ రాష్ట్ర చైర్మన్ ఆరేపల్లి మోహన్కు షోకాజ్ నోటీసులిచ్చింది. శనివారం గాంధీభవన్లో క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి, సభ్యుడు బండ ప్రకాశ్లు సమావేశమై పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించిన నేతల వివరణ తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నెల 17న తమ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సింది గా నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా, వ్యక్తిగత విమర్శలకు పాల్పడే వారె వరైనా కఠిన చర్యలు తప్పవని క్రమశిక్షణ సంఘం హెచ్చరించింది.
ప్రెస్మీట్లపై ఆంక్షలు...
పార్టీ నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించడంపై ఒక విధానాన్ని అనుసరించాలని క్రమశిక్షణ సంఘం సూచించింది. గాంధీభవన్లో నిర్వహించే ప్రెస్మీట్లకు సంబంధించి నేతలు ముందుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ లేదా మీడియా వ్యవహారాల ఇన్చార్జి మల్లురవికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరింది. అలాగే సీఎల్పీలో నిర్వహించే ప్రెస్మీట్లకు సంబంధించి అసెంబ్లీలో విపక్ష నేత కె.జానారెడ్డి లేదా మండలిలో విపక్ష నేత షబ్బీర్ ఆలీకి నాయకులు ముందుగా సమాచారం అందించాలని క్రమశిక్షణ సంఘం స్పష్టం చేసింది.