breaking news
Kuldeep Moran
-
40 రోజుల తర్వాత విడుదల
న్యూఢిల్లీ: అసోంలో గతనెలలో ఉల్ఫా తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన బీజేపీ నేత రత్నేశ్వర్ మోరన్ కొడుకు కుల్దీప్ మోరన్ (27) ఎట్టకేలకు విడుదలయ్యాడు. ఉల్ఫా తీవ్రవాదులు శుక్రవారం కుల్దీప్ను మయన్మార్-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వద్ద విడుదల చేశారు. ఆగస్టు 1న ఉల్ఫా ఉగ్రవాదులు అసోం-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో కుల్దీప్ను కిడ్నాప్ చేశారు. కోటి రూపాయలు ఇస్తే విడుదల చేస్తామని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో ఐదుగురు గన్మెన్ చుట్టూ నిలబడి ఉండగా, మధ్యలో ఉన్న కుల్దీప్ తనను విడిపించాల్సిందిగా కోరినట్టు ఉంది. కాగా ఉల్ఫా తీవ్రవాదులు డిమాండ్ చేసినట్టు కుల్దీప్ కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించారా లేదా అన్న విషయం తెలియరాలేదు. కుల్దీప్ సమీప బంధువు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. -
అసోం బీజేపీ నేత కొడుకు కిడ్నాప్
గువహాటి: అసోంలో ఉల్ఫా తీవ్రవాదులు బీజేపీ నేత కొడుకుని కిడ్నాప్ చేశారు. బందీని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని, లేకుంటే హతమారుస్తామని హెచ్చరించారు. టిన్సుకియా జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ రత్నేశ్వర్ మోరన్ కొడుకు, బీజేపీ ఎమ్మెల్యే బొలిన్ చెటియా సమీప బంధువు అయిన కుల్దీప్ మోరన్ను ఈ నెల 1న ఉల్ఫా తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే బొలిన్ నుంచి డబ్బులు తీసుకుని తమకు చేర్చాల్సందిగా తీవ్రవాదులు రత్నేశ్వర్ను డిమాండ్ చేశారు. కుల్దీప్ బంధువులు తొలుత ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నా, ఉల్ఫా తీవ్రవాదులు ఇటీవల పంపిన మరో వీడియో చూసి భయపడిపోయారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని తన ప్రాణాలను కాపాడాలని, తీవ్రవాదుల డిమాండ్ మేరకు డబ్బులు ఇచ్చి తనను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కుల్దీప్ కుటుంబ సభ్యులను, ముఖ్యమంత్రి సోనోవాల్ను కోరాడు. ఈ వీడియాలో ముఖాలకు ముసుగులు ధరించిన ఐదుగురు సాయుధులు కుల్దీప్ చట్టూ నిల్చున్నారు. తీవ్రవాదుల చెర నుంచి కుల్దీప్ను విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని బొలిన్ చెప్పారు. కాగా కుల్దీప్ను విడిపించేందుకు అసోం పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బొలిన్తో ఎక్కువ సన్నిహితంగా ఉండే కుల్దీప్ ఆయన దగ్గరే పనిచేస్తున్నాడు. ఇటీవల జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బొలిన్ సాదియా నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. గతంలో కాంగ్రెస్లో ఉన్న బొలిన్, రత్నేశ్వర్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.