breaking news
kodipandala
-
గతం కాదు.. ఇప్పుడు చూడండి
►కోడిపందాలపై జిల్లా ఎస్పీ శపథం ► ఆదేశాలు లెక్క చేయకపోతే రౌడీషీట్లు తెరుస్తాం ఉండి : గతంలో కోడిపందాలపై ఎవరు ఎలా వ్యవహరించారో నాకు తెలియదు కాని నేను మాత్రం కచ్చితంగా ఆపి తీరుతా అని శపథం చేశారు జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్. సోమవారం ఉండి పోలీస్స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోడిపందాలు, పేకాట తదితర దురలవాట్ల వల్ల చాలా కుటుంబాలు వీధిన పనడుతున్నాయన్నారు. అందుకే సంక్రాంతి పండగకు ముందుగానే జిల్లావ్యాప్తంగా సుమారు 600 బైండోవర్ కేసులు నమోదు చేశామని అన్నారు. కోడిపందాలపై ఉక్కుపాదం మోపేందుకు జిల్లాలో ఆరు ప్రత్యేక టీంలు పనిచేస్తున్నాయని చెప్పారు. పందాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినా రౌడీషీట్లు తెరుస్తామని అన్నారు. పందాల నిర్వహణపై పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. వీటిపై ప్రతిరోజూ కేసులూ నమోదు చేస్తున్నామని తెలిపారు. కోడిపందాలపై రెండు నిమిషాల నిడివితో డాక్యుమెంటరీ విడుదల చేస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా 167 సీసీ కెమెరాలు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసామన్నారు. హెల్మెట్ ధారణను భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. పోలీసుల బాధ పడలేకపోతున్నాం అని అనుకోకుండా కుటుంబాలను, జీవితాలను కాపాడుకుంటున్నాం అనే మంచి ఆలోచనతో హెల్మెట్ ధరించాలన్నారు. జిల్లాల్లో 2014లో రూ.2.80 కోట్లు, 2015లో రూ.3.70 కోట్ల సొత్తును రికవరీ చేశామని తెలిపారు. రాష్ట్రాన్ని వణికించిన సైకో సూదిగాడి కోసం ఇంకా గాలింపు జరుపుతున్నామన్నారు. సీసీ కెమెరాలలో క్వాలిటీ సరిగ్గా లేకపోవడంతో నిందితుడిని పట్టుకోలేకపోయామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అమర్నాథ్నాయుడు, సీఐ ఆర్జే జయసూర్య, ఎస్సై ఎం.రవివర్మ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పందెం.. పరుగు
పక్క జిల్లాకు వెళ్తున్న కోడిపందేల రాయుళ్లు సత్తుపల్లి బిర్రు శీతానగరంలో... మరోవైపు లక్షల్లో పేకాట పల్లెల్లో సందడే సందడి సత్తుపల్లి : సంక్రాంతి వచ్చేసింది. పండుగ సరదాలు తీర్చుకునేందుకు పందెం రాయుళ్లు పక్క జిల్లాలకు తరలివెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. సత్తుపల్లి నియోజకవర్గం ఆంధ్ర సరిహద్దులో ఉండటంతో కోడిపందాల సంస్కృతి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈసారి పందాలు జరుగుతాయో.. లేదో అంటూ పందెం రాయుళ్లు తెగ హైరానా పడ్డారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఈసారి కోడిపందాలకు అనుమతి వస్తుందని పందెం రాయుళ్లు ఆశించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. తెలంగాణ డబ్బులతో ఆంధ్రలో పందాలు కాయాల్సి వస్తోందని సరదా ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా శీతానగరంలో సత్తుపల్లికి చెందిన కొందరు పందెం రాయుళ్లు బిర్రు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పోతునూరు, ఉండీ భీమవరం, నాగిరెడ్డిగూడెం, కళ్లచెరువు, చింతంపల్లి, ముల్కలంపాడు, ధర్మాజీగూడెం, కలరాయిగూడెం, కృష్ణాజిల్లా చాట్రాయి మండలం జనార్దనవరం గ్రామాల్లో కోడిపందాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్సాహంగా.. ఉల్లాసంగా సంక్రాంతి సందర్భంగా మూడురోజులు పందాలు కాసేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఎక్కడ చూసినా చంకలో కోడిపుంజు పట్టుకొని పందాలకు వెళ్లేవాళ్లే ఈ ప్రాంతంలో కనిస్తున్నారు. కోడి పందాలను వేసేందుకు.. తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివెళ్తుండటంతో పల్లె ల్లో సందడి వాతావరణం నెలకొంది. ఉద యం నుంచే పందాలు ఎక్కడ జరుగుతున్నాయో ఆరా తీసే పనిలో పందెం రాయు ళ్లు నిమగ్నమయ్యారు. పట్టణాల నుంచి పండగలకు వచ్చిన అతిథులు, బంధువులు పందాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పల్లెల్లో ఖరీదైన కార్లలో పందెం రాయుళ్లు హల్చల్ చేస్తున్నారు. లక్షల్లో కోడి కోసాట ఉదయం పూట కోడి పందాలు అయిపోగానే రాత్రి వేళ్లల్లో ప్లడ్లైట్ల వెలుగులో లక్షల రూపాయల కోసాట(లోన, బయట) జరుగుతోందని సమాచారం. పందెం రాయుళ్లు ఉదయం నుంచి మద్యం మత్తులో ఉండటంతో లోన, బయట పేకాటలో సర్వం పోగొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. పందెం జరిగే తోటల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కోడిపందాలు ఓవైపు జరుగుతుండగానే కోసాట, గుండుపట్టాలు, పులిమేక జూదం నడుస్తున్నట్లు సమాచారం. జూదరులకు అందుబాటులో మద్యం, మాంసాహారం, బిర్యానీ ప్యాకెట్లు లభిస్తున్నాయి. రాత్రి వేళ్లల్లో జనరేటర్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీస్ నిఘా ఉన్నా.. కోడి పందాలు నియంత్రించేందుకు పోలీసులు నిఘా ముమ్మరం చేసి హెచ్చరికలు జారీచేసినా పందెం రాయుళ్లు ఖాతరు చేయటం లేదు. గురు, శుక్రవారాల్లో సత్తుపల్లి డివిజన్లో చిన్నచిన్న పందాలు ఎక్కడపడితే అక్కడ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది పండుగ మూడురోజులు పోలీసులు పందాలను నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. పోలీసులు సరిహద్దుల్లో గస్తీ చేస్తున్నా పందెం రాయుళ్లు కోడిపుంజులను వేరే దారిన పంపించి పందాల స్థావరాలను చేరుకుంటున్నారు. ఒక్కోసారి పోలీసులకు పందాలు ఓచోట నడుస్తున్నాయని సమాచారం అందించి అటు పోలీసులను పంపించి వేరేచోట దర్జాగా పందాలు వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పండగ మూడురోజులు కోడిపందాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ పందెం రాయుళ్లు డిమాండ్ చేయడం గమనార్హం.