breaking news
Kartik Poornima
-
దేవ దీపావళి... జ్వాలాతోరణం
కార్తీకమాసమంతా పర్వదినాల పరంపరే అయినప్పటికీ ఈ మాసంలో కొన్ని పర్వాలు కన్నుల పండువగా జరుగుతాయి. అలాంటి వాటిలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్బంగా జ్వాలాతోరణ విశిష్టత ఏమిటి, ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం.కార్తీక పౌర్ణమినాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అలా అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు. ఈ నిర్మాణంపై ఆవునెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పార్వతీ పరమేశ్వరులని పల్లకిలో అటూ ఇటూ మూడుసార్లు ఊరేగిస్తారు. అలా వారి ఊరేగింపు అనంతరం భక్తులు కూడా ఆ మంటల కింది నుంచి దూరి వెళ్తారు.మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణముంది. యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం, యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే శ్రీమన్నారాయణుని ప్రార్థించటం ఒకటే మార్గం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి సర్వదేవతా కటాక్షం లభిస్తుందనీ, వారికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదనీ కార్తీక పురాణం చెబుతోంది. అందుకే భక్తులు తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు.దీనివెనక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలాతోరణం కింద స్వామివారి పల్లకి పక్కనే నడుస్తూ...‘‘నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా..’’ అని సంకల్పం చెప్పుకోవాలి. అనంతరం ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి – ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని.. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం...లక్ష్మీనారాయణులను కూడా...కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శివుడితో పాటుగా లక్ష్మీనారాయణులను కూడా ఆరాధిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు వ్రతమాచరించి సత్యనారాయణ స్వామి వ్రత కథను వినాలి. సాయంకాలం ఆలయాల్లో లేదా రావిచెట్టు, తులసిచెట్టు ఈ మూడింట్లో ఎక్కడో ఒక చోట దీపం వెలిగించాలి.కాశీలో దేవ దీపావళికాశీలో ఈ కార్తీక పున్నమినాడు దేవదీపావళీ రూపంలో వేడుకలు జరుగుతుంటాయి. ఆ రోజున కాశీలోని గంగా ఘాట్లలో లక్షలాది దీపాలు వెలిగిస్తారు. ఒకేసారి ఘాట్లలో దీపాల వరుసలు వెలిగినప్పుడు, మొత్తం నగరం దీపతోరణంలా కనిపిస్తుంది. ఈ కమనీయ దృశ్యాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి భక్తులు అసంఖ్యాకంగా వారణాసికి చేరుకుంటారు.ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని వధించాడనీ, ఆ విజయాన్ని పురస్కరించుకుని దేవతలు కాశీలో దీపాలు వెలిగించి వేడుక చేసుకున్నార నీ, అప్పటినుండి ఈ పండుగ దేవ దీపావళిగా ప్రసిద్ధి చెందిందనీ స్థలపురాణం చెబుతోంది. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం గంగా హారతి చూడడం ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ఈ దివ్య వీక్షణం కోసం గంటల తరబడి భక్తులు ఘాట్లలో ఓపిగ్గా ఎదురు చూస్తారు. కార్తీక పౌర్ణమిని సిక్కులు గురునానక్ జయంతిగా జరుపుకుంటారు. – డి.వి.ఆర్. -
నల్గొండలో భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
-
ఈ పున్నమి ‘గౌతమి’కి మరింత విలక్షణం
సాక్షి, రాజమండ్రి :మహారాష్ట్రలోని నాసిక్ నుంచి సుమారు 1465 కిలోమీటర్లు అవిశ్రాంతంగా ప్రయాణించి, కాటన్ బ్యారేజీ ముందు కొంత తడవు మజిలీ చేసి, ఆ వ్యవధిలోనే ఉభయగోదావరి జిల్లాలకు పెన్నిధులను ప్రసాదించే గోదావరికి ఏమిస్తే రుణం తీరుతుంది? ఆ తల్లి ఏమీ ఆశించకపోయినా.. బిడ్డలపై ఆ బాధ్యత ఉంది. అదిగో.. ఆ తలంపుతోనే బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ప్రతి పున్నమికీ గోదారమ్మకు హారతినిచ్చేందుకు సమకట్టింది. గురువారం నాటి కార్తిక పున్నమి రాత్రి అఖండ గౌతమికి ఇచ్చే హారతి ఈ రివాజులో 50వది. పున్నమి హారతికి శ్రీకారం చుట్టిన నాటి నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న ట్రస్ట్ 50వ హారతిని ఘనంగా నిర్వహించనుంది. ఈ పున్నమి హారతికి ఓ ప్రత్యేకత ఉంది. ఆధ్యాత్మిక చింతనతోపాటు గోదావరిని పరిరక్షించుకోవాలనే పిలుపునకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. ‘స్వచ్ఛ గోదావరి’ పేరుతో నదీ కాలుష్య నివారణకు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో నది వెంబడి ఉన్న పర్యాటక ప్రాంతాల్లో కాలుష్య నివారణను ఓ ఉద్యమంగా చేపట్టేందుకు నేడు చర్చావేదికను నిర్వహిస్తున్నారు. తొలి అడుగుగా పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని పాటించ్చ్ఛే ప్రజలను చైతన్యపరచనున్నారు. 50వ పున్నమి హారతి సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభా పాటవాలు కనపరిచిన గోదావరి పరీవాహక ప్రాంతపు ప్రముఖులకు విశేష పురస్కారాలను అందచేస్తున్నారు. ప్రముఖ కథా రచయిత, విమర్శకులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి రావులపాటి సీతారామారావుకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గోదావరి పురస్కారాన్ని, ప్రముఖ పాత్రికేయుడు, మానవహక్కుల పరిరక్షణకు కృషి చేసిన మల్లేపల్లి లక్ష్మయ్యకు ఎ.రవిశంకర్ ప్రసాద్ గోదావరి పురస్కారాన్ని, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బి.వి.ఎస్.రామారావుకు సర్ ఆర్థర్ కాటన్ గోదావరి పురస్కారాన్ని, ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత దాసరి నారాయణరావుకు ఎస్.వి.రంగారావు గోదావరి పురస్కారాన్ని, ప్రముఖ సంఘసేవకురాలు సునీతాకృష్ణన్కు జీఎంసీ బాలయోగి గోదావరి పురస్కారాన్ని అందచేయనున్నారు. హాజరు కానున్న ప్రముఖులు సీనియర్ సంపాదకులు, ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కె.శ్రీరామచంద్రమూర్తి చైర్మన్గా, ప్రముఖ సాహిత్య వేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమెస్కో పబ్లికేషన్స్ అధినేత డాక్టర్ డి.విజయకుమార్, సుప్రసిద్ధ రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు, సీనియర్ పాత్రికేయులు జి.వల్లీశ్వర్, మాజీ డీజీపీ కె.అరవిందరావులతో పాటు ట్రస్టు నుంచి ఒక ప్రతినిధితో కూడిన కమిటీ పురస్కారాలకు ప్రముఖులను ఎంపిక చేసిందనిట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు బి.ఎస్.ఎన్.కుమార్ తెలిపారు. పుష్కరాలరేవులో జరిగే ఈ కార్యక్రమాలకు కె.శ్రీరామచంద్రమూర్తి, డాక్టర్ డి.విజయకుమార్, శ్రీలంక పర్యావరణ పరిరక్షణ నిపుణుడు దయాదీన్ నాయకే, గంగా పరిరక్షణకు కృషి చేస్తున్న స్వామి విజ్ఞానానందజీ, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తదితరులు హాజరవుతున్నట్టు తెలిపారు. ఇదీ 50వ పున్నమి హారతి వేడుకల క్రమం.. ఉదయం : 9.00 గంటలకు : గోదావరి పరిరక్షణకు సామూహిక ప్రతిజ్ఞ 10.00 గంటలకు : గోదావరి అందాల ప్రాధాన్యత, చారిత్రక ప్రాశస్త్యం వివరించే ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం 10.30 గంటలకు : స్వచ్ఛ గోదావరిపై చర్చా గోష్టి సాయంత్రం : 6.00 గంటలకు : సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం 7.00 గంటలకు : ప్రముఖులకు గోదావరి పురస్కార ప్రదానం 8.00 గంటలకు- గోదావరి మాతకు హారతి కార్యక్రమం


