breaking news
kamayani express
-
మధ్యప్రదేశ్లో నదిలో పడ్డ రెండు రైళ్లు
-
10 నిమిషాల ఆలస్యమే ప్రాణాలను బలి తీసుకుందా!
భోపాల్: అప్పుడే భోజనం ముగించుకుని నిద్రకు ఉపక్రమిస్తున్న ప్రయాణికులు తాము శాశ్వత నిద్రలోకి జారుకోబోతున్నట్లు కలలోనూ ఊహించి ఉండరు! క్షణాల్లో మనిషి ప్రాణాన్ని హరించే మృత్యువుకు.. 10 నిమిషాల సమయం దొరికితే విలయతాండవం చేయకుండా ఉంటుందా! మధ్యప్రదేశ్ ఘోర రైలు ప్రమాదం జరిగిన తీరుపై ఇలాంటి భావన అనేకం వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ప్రమాదానికి 10 నిమిషాల ముందు కూడా మాచక్ నదిపై ఉన్న ఆ వంతెన పటిష్టంగానే ఉంది. ఆ మార్గంలో పలు రైళ్లు ప్రయాణించాయి కూడా. మంబైలోని లోకమాన్య తిలక్ టెర్మిన్ నుంచి మద్యాహ్నం 12:40 గంటలకు బయలుదేరాల్సిన కామయాని ఎక్స్ ప్రెస్ (ట్రైన నంబర్ 11072) మంగళవారం షెడ్యూల్ కంటే 6 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. మొత్తం 42 స్టేషన్లలో ఆగే ఈ రైలు 18వ స్టేషనైన ఖిర్కియాకు చేరుకునే సరికి ఆ ఆలస్యం 10 నిమిషాలకు పెరిగింది. అక్కడినుంచి 19వ స్టాప్ హర్దాకు బయలుదేరిన కొద్దిసేపటికే మాచక్ నదిపై ఉన్న వంతెన వద్ద ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో రైలు గంటకు 52 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నది. 'కామయాని ఎక్స్ ప్రెస్ తరువాత మరో అరగంటకుగానీ ఆ వంతెన గుండా మరో రైలు వెళ్లదు. ఈ లోగా ట్రాక్ కొట్టుకుపోయిన సమాచారం రైల్వే అధికారులకు అంది రైళ్ల రాకపోకలు నిలిచిపోయేవేమో!' అని అధికార వర్గాలు చర్చించుకోవడం గమనార్హం. ఇండియన్ రైల్వేస్ చైర్మన్ ఏకే మిట్టల్ ప్రమాదంపై స్పందిస్తూ.. 'కామయాని ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికావడానికి 10 నిమిషాల వరకు అక్కడి వంతెన బాగానే ఉంది. భారీ వర్షాలు కరుస్తుండటంతో వరద ఒక్కసారిగా దూసుకొచ్చి వంతెన కిందున్న మట్టి, కంకరను కొట్టుకుపోయేలా చేసింది. సమాచారం లేకపోవడంతో డ్రైవర్ రైలును యథావిధిగా నడిపాడు. కామయాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన కొద్ది సేపటికే జబల్ పూర్ నుంచి ముంబై వెళుతోన్న జనతా ఎక్స్ ప్రెస్ అదే ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. మొత్తం 16 బోగీలు వంతెనపై నుంచి కిందకి పడిపోయాయి. ఇప్పటివరకు 27 మృతదేహాలు వెలికితీశాం. వందల మంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించాం' అని వివరించారు. -
మధ్యప్రదేశ్లో నదిలో పడ్డ రెండు రైళ్లు
-
మధ్యప్రదేశ్లో నదిలో పడ్డ రెండు రైళ్లు
* బ్రిడ్జి దాటుతూ అర్ధరాత్రి మాచక్ నదిలో పడిపోయిన కామయాని, జనతా ఎక్స్ప్రెస్లు * రెండు ఇంజన్లతో పాటు దాదాపు 15 బోగీలు నదిలో పడ్డాయంటున్న రైల్వే అధికారులు * మృతులు భారీగా ఉండే అవకాశం.. * హుటాహుటిన ఘటనాస్థలికి సహాయ బృందాలు హర్దా (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లో మంగళవారం అర్ధరాత్రి ఘోరం జరిగింది. రాజధాని భోపాల్కు 160 కిలోమీటర్ల దూరంలోని ఖిర్కియా-హర్దా స్టేషన్ల మధ్య మాచక్ నదిపై బ్రిడ్జిని దాటుతూ రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు అర్ధరాత్రి 11.45 ప్రాంతంలో పట్టాలు తప్పాయి. రెండు రైళ్ల ఇంజన్లతో పాటు ఏకంగా పదికి పైగా బోగీలు నదిలోకి పడిపోయాయి. ప్రమాదాల తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం 30మంది మృతి చెందారు. ‘‘ముందుగా ముంబై నుంచి వారణాసి వెళ్తున్న కామయాని ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. వెనక భాగంలోని దాదాపు 10 బోగీలదాకా నదిలోకి పడిపోయాయి. అదే సమయంలో జబల్పూర్ నుంచి ముంబై వెళ్తున్న జనతా ఎక్స్ప్రెస్ కూడా సమాచార లోపంతో సరిగ్గా అదే ప్రదేశంలో పట్టాలు తప్పింది. ఆ రైలు ఇంజన్తో పాటు 5 బోగీలు కూడా నదిలోకి పడిపోయాయి’’ అని రైల్వే అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా తెలిపారు. అయితే, కామయానిలో ఎస్ 1 నుంచి ఎస్ 11 వరకు మొత్తం 11 బోగీలు, అలాగే జనతాలో ఎస్ 2 నుంచి ఎస్ 6 వరకు 5 బోగీలు కలిపి మొత్తం 16 బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు నది పొంగిపొర్లుతుండటం, బ్రిడ్జి పూర్తిగా వరద నీటిలో మునిగిపోయి ఉండటం ప్రమాదాలకు కారణం కావచ్చంటున్నారు. కడపటి సమాచారం అందేవరకూ కూడా రెండు రైళ్ల తాలూకు ఇంజన్లు, బోగీలు ఇంకా నదిలోనే ఉన్నాయని సక్సేనా తెలిపారు. సహాయక చర్యలను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 25 మంది డాక్టర్లతో కూడిన వైద్య బృందాన్ని హుటాహుటిన ఘటనా స్థలికి పంపినట్టు ఆయన ట్వీటర్లో వెల్లడించారు. ఘటనా స్థలి వద్ద భారీ వర్షం పడుతుండటం, చిమ్మచీకటిగా ఉండటంతో మృతుల సంఖ్యపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. బోగీలను వీలైనంత త్వరగా నదిలోంచి బయటికి తీసేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. హర్దా కలెక్టర్ రజనీశ్ శ్రీవాస్తవ, జిల్లా ఎస్పీ, పలువురు రైల్వే ఉన్నతాధికారులు సహాయక సిబ్బందితో కలిసి మూడు ప్రత్యేక రైల్లో ఘటనా స్థలికి వెళ్లారు. కాగా, నదిలో పడిపోయిన రెండు రైళ్లకు సంబంధించిన 15 బోగీలలో చిక్కుకున్న 300 మంది ప్రయాణికులను రక్షించినట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో మాచక్ నది ఉధృతంగా ప్రవహిస్తోందని, ఆ ప్రవాహంలో 50 నుంచి 60 మంది వరకు కొట్టుకపోయారంటూ చూసిన ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఘటనా స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లో రైళ్ల ప్రమాదాల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలను రైల్వే శాఖ చేపట్టింది. ముంబై, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ నుంచి బయలుదేరే పలు రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు రాజస్థాన్, కోట మీదుగా మళ్లించినట్టు రైల్వే శాఖ వెల్లడించింది.