breaking news
Kamala Hasan
-
అద్వైతసిద్ధికి అమరత్వ లబ్ధికి గానమె సోపానము
ఆ పాట ఒక కుర్రవాడి నూగుమీసాలకు మెరుపు తెచ్చింది. ఆ పాట ఒక పెళ్లి కాని అమ్మాయి కాలేజీ నడకకు తోడు అయ్యింది. ఆ పాట ఒక పండితుని చేతి కాఫీతో పాటు పొగలు గక్కింది. ఆ పాట ఒక రిక్షావాడి పెడల్ మీద కాలి బలాన్ని పెంచింది. ఆ పాట వెన్నెలను చిన్నబుచ్చి తానే వెలిగింది. ఆ పాట ప్రమిద కంటే పవిత్రంగా దేవుని గుడిలో మంత్రధ్వని అయ్యింది. ఆ పాట ఒక్కసారి వచ్చి వేయి వసంతాలను తెచ్చింది. ఆ పాట ప్రతి గొంతులోనూ పల్లవిగా మారింది. తెలుగు వారికి కృష్ణ, గోదావరులతోపాటు బాలు పాట కూడా ఉంది. రామప్ప శిల్పం, మక్కా మసీదు గుమ్మటంతో పాటు బాలు గళసీమ కూడా ఉంది. ఆస్తిపరులైన తెలుగువారిని నేడు ఆ సంపద విడిపోయింది. ప్రాప్తమున్న తీరానికి పాట సాగిపోయింది. చూస్తూ నిలుచున్న లక్షలాది శ్రోతల రేవు.. అదిగో... బావురుమంటోంది. ఖదీర్ – సాక్షి ప్రతినిధి: ‘గువ్వలా ఎగిరి పోవాలి... ఆ తల్లి గూటికే చేరుకోవాలి’.... అని పాడిన, పాడుకున్న శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (1946–2020) అను అభిమానుల అతి ఇష్ట ఎస్.పి.బాలు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ పాటే తన నీడా గూడూ అనుకున్నారు. పాట కోసమే జీవించారు. పాటనే శ్వాసించారు. ఆ గళాన్ని కన్యాకుమారి నుంచి కాశ్మీరు మంచు సానువుల వరకూ వినిపించారు. ఆలిండియా రేడియో ఆయన పాటల వల్ల ‘బాలిండియా’ అయ్యింది. కట్టే ఏ పాటకైనా బాలు అనే పేరే అడ్రస్ అయ్యింది. ఘంటసాల ఘన పరంపరకు అసలైన వారసుడు బాలు అనిపించుకున్నారు. సరస, విరస, ధిక్కార, సాహస, విప్లవ, విషాద, విలాప గీతం ఏదైనా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. 1980–2000 అనే రెండు దశాబ్దాలు సినీసంగీతంలో బాలు దక్షిణాది రాష్ట్రాలను ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. దక్షిణాది వారికి మోకాలడ్డే ఉత్తర భారతదేశంలోనూ గాన పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి తన సత్తాని, తెలుగువారి సత్తాని చాటారు. బాలు ఎన్ని పాటలు పాడారన్నది కచ్చితమైన గణాంకాలు లేకపోయినా 16 వేల నుంచి 35 వేల లోపు ఉండొచ్చని ఒక అంచనా. పల్లవించవా నా గొంతులో... తెలుగు సాంస్కృతిక ఔన్నత్యానికి తార్కాణాలుగా నిలిచిన తిక్కన, దువ్వూరి రామిరెడ్డి వంటి వారిని ఇచ్చిన సింహపూరి సీమ (నెల్లూరు) గాలిని పీల్చి పాటను నేర్చిన బాలు బతుకుతెరువుకు చదువుకొని ఏ ఇంజనీరో అవుదామనుకున్నారు. తిరుపతిలో పి.యు.సి చేశాక అనంతపురంలో బి.ఇ చేరి అక్కడి భోజనం సరిపడక మద్రాసు (చెన్నై) చేరుకున్నారు. అక్కడ కూడా ఏ.ఐ.ఎం.ఇ లో చేరారు కాని మెల్లగా జీవిత లక్ష్యమే పాటవైపు మళ్లింది. అలాగని ఆయన ఇంటిలో శాస్త్రీయ సంగీతం అంటూ ఏమీ లేదు. తండ్రి శ్రీపతి పండిరాధ్యుల సాంబమూర్తి హరికథా గానం చేసేవారు. ఆయన తన కుమారుడిలో గాత్ర ప్రతిభ గమనించినా చదువుకుని బాగుపడాలని కోరుకున్నారు తప్ప ఆ రంగంలో ప్రత్యేకించి ప్రోత్సహించి శాస్త్రీయ సంగీతం నేర్పించాలని అనుకోలేదు. ఆ వెలితి బాల సుబ్రహ్మణ్యానికి చివరివరకూ ఉండింది. కాని కోకిల ఏ గురువును ఆశ్రయించిందని? ఈలలు వేసే పైరగాలి ఏ సంగీతాన్ని అభ్యసించిందని? బాలూకూ ప్రకృతే పాట నేర్పింది. పి.సుశీల, రఫీ పాడిన పాటలను వేదికల మీద పోటీలలో పాడి సెబాష్ అనిపించుకున్నారు. గూడూరులో ఒక పోటీకి జడ్జిగా వచ్చిన ఎస్.జానకి ఆ పోటీలో బాలు ప్రతిభను గమనించి ‘సినిమాల్లో ట్రై చెయ్’ అని ఆశీర్వదించారు. ఆ వాక్కుఫలితమో, ఫలమో అందుకు తొలి మెట్టుగా చెన్నై చేరారు. సాధారణంగా శిష్యులు మార్గదర్శిని కనుగొంటుంటారు. కాని బాలు విషయంలో మార్గదర్శే శిష్యుణ్ణి కనుగొన్నారు. ఆయనే ఎస్.పి.కోదండపాణి. ఇది తొలిపాట 1963లో చెన్నైలో జరిగిన మద్రాసు కల్చరల్ అకాడమీ పాటల పోటీకి ఘంటసాల, పెండ్యాల జడ్జీలు. వారు బాలు పాటను మెచ్చి బహుమతి ఇచ్చి వెళ్లిపోయారు కాని ఆ తర్వాత ఆడియన్స్లో నుంచి మెల్లగా వచ్చి తెల్ల పంచె, చొక్కాలో కలిసిన సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి ‘నీకు మంచి భవిష్యత్తు ఉంది బాబూ. క్రమశిక్షణతో నిలబడితే నలభై ఏళ్లు పాడతావు’ అని ఆశీర్వదించారు. ఆయన అన్నట్టుగానే బాలు నలభై ఏళ్లు పాడారు. కాని అందుకు మొదట కోదండపాణే తన భుజాన్ని ఇచ్చి మోశారు. అనేకమంది సంగీత దర్శకుల దగ్గరకు తీసుకువెళ్లారు. తన సంగీత దర్శకత్వంలోనే ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ (1967)లో మొదటి పాట పాడించారు. ఆ తర్వాత ‘సుఖదుఃఖాలు’ (1968) చిత్రంలో ‘మేడంటే మేడా కాదు’ పాడించి బాలూను అందరి దృష్టిలోకి తెచ్చారు. సంగీత దర్శకుడు సత్యం ‘కన్నెవయసు’ (1973)లో ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాడించి బాలూకు అభిమానులను కల్పించారు. పాడాలనే ఉన్నదీ... ఘంటసాల 1974 ఫిబ్రవరిలో మరణించారు. దానికి రెండేళ్ల ముందు నుంచే ఆయన పాడటం తగ్గింది. పరిశ్రమ కొత్త గాయకులను వెతుకుతోంది. బాలు ఒక ప్రత్యామ్నాయం అయితే ‘విచిత్ర బంధం’ (1972) సినిమాతో హఠాత్తుగా దూసుకొచ్చిన గాయకుడు వి.రామకృష్ణ మరో ప్రత్యామ్నాయం. ఈ సమయంలో బాలు కమెడియన్లకు, హీరో కృష్ణకు ఎక్కువ పాటలు పాడుతూ ఉండిపోయారు. ఎన్.టి.ఆర్కు మొదటగా ‘కోడలు దిద్దిన కాపురం’ (1970) పాడినా, అక్కినేనికి ‘ఇద్దరు అమ్మాయిలు’ (1971– నా హృదయపు కోవెలలో) పాడినా ఆ గొంతు ఇంకా వారికి సరిపోలేదని ప్రేక్షకులు భావించారు. ఈలోపు కవి సినారె సిఫార్సుతో ‘చెల్లెలి కాపురం’ (1971)లో ‘చరణ కింకరణులు ఘల్లుఘల్లుమన’ పాడి మెరిశారు బాలు. కాని ఇంకా మేజిక్ జరగాల్సి ఉంది. కమల్హాసన్తో... కలకాలం ఇదే పాడనీ సంగీత దర్శకుడు చక్రవర్తి ‘శారద’ (1973) సినిమాతో సంగీత దర్శకుడిగా హిట్ కొట్టారు. తమిళంలో ఇళయరాజా ‘అన్నక్కిళి’ (1976)తో సంగీత దర్శకుడు అయ్యాడు. ఇలా జరగడం సినిమా సంగీతంలోనే కాదు బాలూ కెరీర్లో కూడా మలుపు. ఎందుకంటే వీళ్లిద్దరూ బాలూకు చాలా గాఢమైన స్నేహితులు. మరోవైపు దర్శకుడు కె.రాఘవేంద్రరావు ‘బాబు’ (1975) సినిమాతో దర్శకుడిగా మారి తన సినిమాలకు చక్రవర్తినే సంగీత దర్శకుడుగా ఎంచుకోవడం వల్ల చక్రవర్తి బలం పెరిగింది. బాలూకు ధైర్యంగా పాటలు ఇచ్చారు. ఇళయరాజా పాటలు బాలూకు తమిళంలో ఊతం ఇచ్చాయి. మొత్తం మీద 1977వ సంవత్సరం తెలుగులో బాల సుబ్రహ్మణ్యం దశ తిప్పింది. ఆ సంవత్సరమే ఎన్.టి.ఆర్ ‘దానవీరశూర కర్ణ’, ‘అడవిరాముడు’, ‘యమగోల’ సినిమాలకు బాలు పాడి ఇక ఆయనకు మరొకరి గొంతు అక్కర్లేదని శాసనం రాశారు. అక్కినేనికి ‘ఆలుమగలు’ (ఇరక్కపోయి వచ్చాను) ‘బంగారు బొమ్మలు’ (నేనీ దరిని నువ్వా దరిని) పాడి అక్కినేని పాడుతున్నట్టే అనిపించారు. బాలూ శకం మొదలయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీతో... శృతిలయలే జననీ జనకులు కాగా బంగారం బంగారం అంటే సరిపోదు... గీటురాయి మీద గీచి ద్రావకం పోసినప్పుడు చెక్కు చెదరకుండా నిలవాలి. అలాంటి పరీక్షా సమయాలను దాటినప్పుడే మెచ్చుకునే స్థాయి ప్రతిభ కీర్తించే స్థాయి ప్రతిభగా మారుతుంది. బాలూకి అలాంటి అవకాశం కె.విశ్వనాథ్ ‘శంకరాభరణం’ (1980) ఇచ్చింది. శాస్త్రీయ సంగీతాన్ని కథాంశంగా తీసుకున్న ఈ సినిమాకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి మహా సంగీతకారులు పాడాలి. కాని ప్రేక్షకుడికి సినిమాలో కావాల్సింది ‘సినిమా రాగం’ అనీ, వాడికి పండితుడి కంటే పల్స్ తెలిసినవాడే కావాలని నమ్మిన కె.వి.మహదేవన్ బాలూని పాడమన్నారు. కాని బాలు భయపడిపోయారు. సంగీత జ్ఞానం లేని తాను ఆ పాటలు పాడటమా? కాని చిత్తశుద్ధి ఉంటే శివపూజ ఫలించి శివుడే ప్రత్యక్షమవుతాడు. ఇక పాట ఎంత? పుహళేంది ప్రోత్సాహంతో బాలు శంకరాభరణం పాటలను సవాలుగా తీసుకున్నారు. కారులో, ఇంటిలో అనుక్షణం వింటూ తన ఒంటిలో వాటిని రక్త చాలనం గా మార్చుకున్నారు. అందుకే ‘శంకరా’ అని గొంతెత్తితే ఆకాశం నుంచి కుంభవృష్టి కురిసింది. ‘దొరకునా ఇటువంటి సేవ’ అంటే ప్రేక్షకుడి కంట గంగ పొంగింది. ‘రాగం తానం పల్లవి’ ఉన్నంత కాలం బాలు పేరును తెలుగువారు తలుచుకుంటారు అని ఈ సినిమా ఆయనను ఆశీర్వదించింది. ఇదే పాట ప్రతి నోటా బాలూను సంగీత దర్శకుడు సత్యం ‘కొడుకా’ అని పిలిచేవారు. కె.వి.మహదేవన్ ‘ఒరేయ్’ అని బిడ్డతో సమానంగా చూసేవారు. సాలూరి ‘నాయనా’ అని పలుకరించేవారు. అందరికీ బాలూ పాట కావాలి. అందుకే పోటీలు పడి బాలూకు హిట్స్ ఇచ్చారు. తాము హిట్స్ పొందారు. సంగీత దర్శకులందరికీ బాలు మంచి పాటలు పాడారు. ఘంటసాలకు ‘సెలయేటి గలగల’ (తులసి), పెండ్యాలకు ‘చిత్రం.. భళారే విచిత్రం’ (దానవీర శూర కర్ణ), ఆదినారాయణ రావుకు ‘గడసరి అమ్మాయి నడుమొక సన్నాయి’ (కన్నవారిల్లు), సాలూరి రాజేశ్వర రావుకు ‘ఈ రేయి తీయనిది’ (చిట్టి చెల్లెలు), టి.వి.రాజుకు ‘అడగాలని ఉంది ఒకటడగాలని ఉంది’ (చిన్ననాటి స్నేహితులు), ఎం.ఎస్.విశ్వనాథన్కు ‘తాళి కట్టు శుభవేళ’ (అంతులేని కథ), తాతినేని చలపతిరావుకు ‘అందానికి అందానివై’ (దత్తపుత్రుడు), బి. గోపాలంకు ‘కదిలింది కరుణరథం’ (కరుణామయుడు), రమేశ్ నాయుడుకు ‘శివరంజని నవరాగిణి’ (శివరంజని), రాజన్ నాగేంద్రకు ‘మల్లెలు పూసె వెన్నెల కాసే’ (ఇంటింటి రామాయణం), కె.వి.మహదేవన్కు ‘నీవుంటే వేరే కనులెందుకు’ (స్నేహం), ఎస్.పి.కోదండపాణికి ‘తనివి తీరలేదే నా మనసు నిండలేదే’ (గూడుపుఠాణి), జి.కె.వెంకటేశ్కు ‘రాశాను ప్రేమలేఖలెన్నో’ (శ్రీదేవి), సత్యంకు ‘ఓ బంగరు రంగుల చిలక’ (తోటరాముడు), జె.వి.రాఘవులుకు ‘కలహంస నడకదానా’ (సమాధి కడుతున్నాం చందాలివ్వం డి), చక్రవర్తికి ‘సిరిమల్లె పువ్వల్లే నవ్వు’ (జ్యోతి), ఇళయరాజాకు ‘మబ్బే మసకేసిందిలే’ (వయసు పిలిచింది), ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు ‘చుట్టూ చెంగావి చీర కట్టాలి చిలకమ్మ’ (తూర్పు వెళ్లే రైలు)... ఇవన్నీ చెప్పడం అంటే కేవలం విస్తట్లో ఒక్క పదార్థం వేసినట్టే. ఇంకా ఎన్నో పప్పులు, దప్పళాలు, పాల తాలికలు, మజ్జిగ మిరపకాయలు. తెలుగువారు నిద్ర మేల్కొంటూ బాలు పాట విన్నారు. నిద్రకు ఉపక్రమిస్తూ బాలు పాట విన్నారు. దివారాత్రాల గానం అది. రాగాల పల్లకిలో గండు కోయిల తొలితరం హీరోలకు బాలు పాడారు. మలితరంలో వచ్చిన కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజు, రామకృష్ణ, చంద్రమోహన్, మురళీ మోహన్లకు పాడరు. ఆ తర్వాత వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మోహన్ బాబు, సుమన్, నరేశ్, రాజేంద్రప్రసాద్, రాజశేఖర్లకు పాడారు. ఆ తర్వాత వచ్చిన మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్లకూ పాడారు. చక్రవర్తి హయాం తర్వాత వచ్చిన రాజ్కోటి, కీరవాణి, మణిశర్మ, వందేమాతరం శ్రీనివాస్, దేవిశ్రీ ప్రసాద్, చక్రి, రాధాకృష్ణన్, మిక్కీ జె.మేయర్, తమన్కు సహా అందరికీ పాడారు. ఆయన పాట ఆగలేదు. అది లేకుండా సినిమా పరిశ్రమ ముందుకు సాగలేదు. అయితే ‘రోజా’ (1992) సినిమాతో ఏ.ఆర్. రహమాన్ రంగప్రవేశం తర్వాత కొత్త గాయకుల ఉధృతి పెరిగింది. పర భాషా గాయకులు తెలుగులో విస్తృతంగా పాడటం మొదలెట్టారు. అయితే ఏమిటి? ఎవరెస్ట్ ఎక్కి జెండా పాతినవాడు విజేత. బాలు ఆ విజేత. ఆయన శిఖరం దిగి వచ్చి కొత్తతరానికి దారి చూపిస్తూ ఉండిపోయారు. అధిరోహణకు స్ఫూర్తిగా మిగిలిపోయారు. ఓ పాపా లాలి.. జన్మకే లాలి... బాలు పాట లేకుండా ఉండలేరు. బాలు లేకుండా పాట ఉండలేదు. అందుకే టెలివిజన్ చానల్స్లో పదుల సంఖ్యలో ఆయన షోస్ చేశారు. యాంకర్గా ఉన్నారు. కొత్త జనరేషన్ను తయారు చేశారు. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకుండా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై తిరుగుతూ విదేశాలలో షోస్ చేస్తూ అనుక్షణం శ్రోతకు పాటను దగ్గరగా ఉంచారు. అది ఔషధంగా ఇస్తూ వచ్చారు. ప్రతి ఒక్క తెలుగువాడి జీవితంలో వేల గంటలు, వందల రోజులు ఆయన పాటతో గడిచిపోయి ఉంటాయి. వారి సంతోషంలో, దుఃఖంలో, వేడుకలో, ఉత్సవంలో ఆయన పాట అవిభాజ్యం అయ్యింది. ఆయన పాటల క్యాసెట్టు ఇచ్చి పుచ్చుకోవడమే ఒక పెద్ద బహుమతి. అలాంటిది... ఆయన గొంతు ఇక మీదట ప్రత్యక్షంగా వినపడదని, ఆయన రూపం ఎంత మాత్రమూ కనపడదని లక్షలాది మంది అభిమానులకు ఈ క్షణాన అనిపిస్తూ ఉంటే వారు విలపిస్తూ ఉంటే కంఠం రుద్ధం అవుతుంది. కళ్లు మసక గమ్ముతాయి. ఆయన పాటను ఆయనకు నివాళిగా అర్పించడానికి కూడా నోరు పెగలదు. ఒక గొప్ప ఎంటర్టైనర్, ఉల్లాసదాత, ఉత్సాహ దీపం, తోడుగా ఉంటూ వచ్చిన జతగాడు... ఇక లేడు అంటే వీడ్కోలు పలకడానికి తెలుగుభాష మాట కోసం తారాడుతోంది. పాట కోసం పారాడుతోంది. బాలూ సర్... బాలసుబ్రహ్మణ్యం సర్... కొమ్మకొమ్మకో సన్నాయిని నింపుకున్న వేల చెట్ల వనమా... కైమోడ్పులు. జోతలు. అశ్రుతర్పణాలు. అమలిన బాష్పహారాలు. ఇవాళ వెళ్లి రేపు పల్లవీ చరణాలుగా తిరిగి రా! కుటుంబ సభ్యులతో బాలు -
‘విశ్వరూపం 2’కు సెన్సార్ సమస్యలు
విశ్వరూపం 2 హిందీ వెర్షన్కు భారీగానే సెన్సార్ కత్తెరలు పడ్డట్టు తెలుస్తోంది. తమిళ, తెలుగు వెర్షన్లకు సెన్సార్ కార్యక్రమాలు గతంలోనే పూర్తయినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ రెండు భాషల్లో విశ్వరూపం 2కు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ హిందీ వర్షన్కు మాత్రం సెన్సార్సభ్యులు 17 కట్స్ సూచించినట్టుగా తెలుస్తోంది. విశ్వరూపం తొలి భాగం రిలీజ్ కూడా సమస్యలు తలెత్తడంతో కమల్ కన్నీరు పెట్టుకోవల్సి వచ్చింది.ఎన్నో అవాంతరాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వరూపం మంచి విజయం సాధించింది. తాజాగా విశ్వరూపం 2 విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికేట్ ఇవ్వాలని కొందరు, 17 కట్స్తో యు/ ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని మరికొందరు అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమా నిర్మాత ఆర్థిక సమస్యల కారణంగా తప్పుకోవటంతో దర్శకత్వ బాధ్యతలతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు కమల్ హసన్. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నా మనసుకు అనిపించిందే చేస్తా!
నా మనసుకు ఏది అనిపిస్తే అదే చేస్తాను అంటున్నారు నటి శ్రుతీహాసన్.ప్రస్తుతం టాప్ మోస్ట్ కథానాయకిగా వెలుగొందుతున్న ఈ బోల్డ్ బ్యూటీ మొదట్లో గాయనిగా, ఆ తరువాత సంగీతదర్శకురాలిగా పరిచయం అయ్యారన్న సంగతి తెలిసిందే. ఆ తరువాతే కథానాయకిగా తెరపైకి వచ్చారు. ప్రముఖ నటుడు కమలహాసన్ కూతురు అనే ముద్రతో రంగప్రవేశం చేసిన శ్రుతీ ఇప్పుడు ఆమె తండ్రి కమల్ అనేంతగా ఎదిగిపోయారు. తమిళ అమ్మాయి అయినా ఆదిలో బాలీవుడ్లో నటిగా పరిచయం అయ్యి, ఆ తరువాత టాలీవుడ్లోకి రంగప్రవేశం చేసి, ఆపైనే కోలీవుడ్కు విచ్చేశారు.ఈ మూడు భాషల్లోనూ తొలి చిత్రాలు నిరాశపరచినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇటీవల సూర్యకు జంటగా నటించిన సీ–3 చిత్ర విజయంతో తన సక్సెస్ పయనాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్న శ్రుతీహాసన్ మాట్లాడుతూ తనను శక్తిమంతురాలిగా తయారు చేసింది సినిమానేనని పేర్కొన్నారు. నటిగా తానీ స్థాయికి చేరుకున్నా.. ఇప్పటికీ కమలహసన్, సారికల కూతురు అనే గుర్తింపునే కోరుకుంటున్నానన్నారు. కాగా ఇటీవల ఈ ముద్దుగుమ్మ గురించి చాలానే గాసిప్స్ ప్రచారం అవుతున్నాయి. హాలీవుడ్ నటుడితో చెట్టాపట్టాల్ అంటూ ప్రచారం జోరందుకుంది. అలాంటి వాటి గురించి స్పందిస్తూ తన గురించి ఎవరేమనుకున్నా, నా మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తాననీ చెప్పారీ అమ్మడు. నటిగా తన వయసు ఎనిమిదేళ్లు అనీ, ఈ కాలంలో తనకు సినిమా చాలానే నేర్పిందనీ చెప్పుకొచ్చారు. ఒక పరిణితి చెందిన నటిగా మంచి పాత్రలను ఎంచుకుని మరింత మంచి పేరు తెచ్చుకోవాలన్నదే తన ఆశ అని శ్రుతి పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రుతి తెలుగులో పవన్ కల్యాణ్ సరసన కాటమరాయుడు, తన తండ్రి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం శబాష్ నాయుడు చిత్రంతో పాటు మరో హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
సినీ వర్గాల్లోనూ చిన్నమ్మపై వ్యతిరేకత
తమిళసినిమా : చిన్నమ్మ (శశికళ) సీఎం కావడాన్ని రాజకీయాల్లో ఒక వర్గం స్వాగతిస్తున్నా, మరో వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రాజకీయ విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇక రాజకీయాలతో దగ్గర సంబంధాలున్న చిత్ర పరిశ్రమ నుంచి చిన్నమ్మకు సీఎం పీఠం కట్టబెట్టడంపై ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి. విశ్వనటుడు కమలహాసన్ వంటి వారు శశికళకు ముఖ్యమంత్రి బాధ్యతలు భారం అవుతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల జరుగుతున్న సంఘటనలకు ట్విట్టర్లో స్పందిస్తున్న కమలహాసన్ ఆ మధ్య జయలలిత మరణించినప్పుడు ఆమె పేరు ప్రస్తావించకుండా సంబంధించిన వారికి సంతాపాలు అంటూ క్లుప్తంగా పేర్కొన్నారు. తాజాగా శశికళను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మోయదగ్గ బరువు మించితే ఏ బండి అయినా కప్పకూలిపోతుందని తిరుక్కురల్లో పేర్కొన్నారు.. అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవి శశికళకు భారం అవుతుందనే భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక నటి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త కుష్బూ తీవ్రంగానే ఆరోపణలు చేశారు. తమిళనాడు నిస్సత్తువగా మారిపోయిందన్నారు. శశికళ ముఖ్యమంత్రి కావడం ద్వారా ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడిందని పేర్కొన్నారు. ఏదేమైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన వారే ముఖ్యమంత్రి కావాలని అన్నారు. జల్లికట్టు క్రీడ కోసం విద్యార్థులు, యువత పోరాడారని, అదే విధంగా ఇప్పుడు శశికళకు వ్యతిరేకంగా పోరాడాలని కుష్భూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన ఆ పార్టీ ప్రచార కర్త, నటుడు ఆనందరాజ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంలో పాలన ప్రశాంతంగా సాగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఒక పార్టీకి నాయకులను ఎన్నుకోవడానికి ఆ పార్టీ కార్యవర్గ సభ్యులకు హక్కు ఉంటుందని, అదే విధంగా ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకునే హక్కు శాసన సభ్యులకు ఉంటుదని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి రాష్ట్రానికే కాదు. తమిళ ప్రజలకు కూడా అని, తమ ఓట్లతో ముఖ్యమంత్రిని ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందని, అనవసర నిర్ణయాలు ఉండకూడదని ప్రకటనలో పేర్కొన్నారు. -
అజిత్తో నటించాలనుంది
రజనీకాంత్, కమలహాసన్ తరువాత కోలీవుడ్లో హీరోయిన్లు ఒక్కసారి అయినా కలిసి నటించాలని ఆశించే నటుడు అజిత్. అలాంటి నటుడితో జతకట్టాలన్న ఆకాంక్ష హన్సికకు ఉందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ బబ్లీగర్ల్ కోరిక నెరవేరబోతోందనే ప్రచారాన్ని ఇటీవల మీడియా ఊదర గొట్టింది. దీంతో నిజంగానే అలాంటి అవకాశం తనకు రానుందేమోనని హన్సిక ఆనందించిందట. వీరం చిత్రం తరువాత అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలోనే హన్సిక హీరోయిన్ అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ హన్సిక కాదు అని ఆ చిత్ర దర్శకుడు ఇటీవల కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇది హన్సికకు నిరాశపరచే విషయమే. ఈ వ్యవహారంపై ఈ ముద్దుగుమ్మ స్పందిస్తూ అజిత్ సరసన నటించే అవకాశం రావడం గొప్ప విషయమేనంది. ఆయనతో జత కట్టాలనే కోరిక తనకు ఉందని చెప్పింది. అయితే అజిత్ సరసన ఆ చిత్రంలో నటించమని తనను ఎవరూ అడగలేదని తెలిపింది. భవిష్యత్తులో అజిత్కు జంటగా నటించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానంది. అదే విధంగా ప్రస్తుతం తాను పలు చిత్రాలతో బిజీగానే వున్నానని చెప్పింది. సుందర్ సి దర్శకత్వంలో విశాల్ సరసన ఆంబళ చిత్రంలోను, జయం రవితో రోమియో జూలియట్ చిత్రంలోను నటిస్తున్నానని తెలిపింది. త్వరలో విజయ్ నటించే నూతన చిత్రంలో ఆయనకు జంటగా నటించనున్నట్టు చెప్పింది. -
మణిరత్నంతో మహేష్
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకశైలి ప్రత్యేకం అని చెప్పనక్కరలేదు. రోజా, మౌనరాగం, నాయకన్, దళపతి, ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఘనత మణిరత్నంది. సూపర్స్టార్ రజనీకాంత్, కమలహాసన్ నుంచి నేటి యువతరం గౌతమ్కార్తీక్ వరకు విభిన్న చిత్రాలు చేసిన ఈ దర్శక శిఖామణి కడల్ చిత్రం తరువాత తదుపరి చిత్రానికి చాలా సమయం తీసుకున్నారు. అయితే ఈసారి బాలీవుడ్లో చిత్రం చేయనున్నారని, మలయాళ చిత్రం చేయబోతున్నారని రకరకాల ప్రచారం జరిగింది. అరుుతే మణిరత్నం ఈ గ్యాప్ లో మూడు కథలను తయారు చేసుకున్నారట. వాటిలో ఒక కథనే లజ్జో. ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించాలని భావించారని సమాచారం. ఇక రెండో కథను పాహద్ హీరోగా తమిళం, మలయాళం భాషల్లో రూపొందించాలని తలచారట. అయితే ఇప్పుడు ఈ రెండింటినీ పక్క న పెట్టి మూడో కథను తమిళం, తెలుగు భాషలలో తెరకెక్కించడానికి సన్నద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు నటించనున్నట్లు తెలుస్తోంది. మహేష్బాబుకు మణిరత్నం దర్శకత్వంలో నటించాలనే కోరిక చాలా కాలంగా ఉంది. నిజానికి వీరి కాంబినేషన్లో ఇప్పటికే పొన్నియిన్ సెల్వన్ అనే చిత్రం రూపొందాల్సింది. మహేష్బాబు కూడా త్వరలో తన కల నెరవేరబోతుందని పేర్కొన్నారు. కొన్ని కారణాల వలన ఆ చిత్రం తెరకెక్కలేదు. ప్రస్తుతం మహేష్బాబు టాలీవుడ్లో టాప్హీరోగా ప్రకాశిస్తున్నారు. తాజాగా మణిరత్నం తెరకెక్కించనున్న కథ పక్కా కమర్షియల్ అంశాలతో ఈ హీరోకు ఖచ్చితంగా నప్పే లా ఉంటుందని సమాచారం. ఈ విషయాన్ని మహేష్బాబు వర్గం అంగీకరించింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఇంకా నిర్ణయం కాలేదని వారంటున్నారు.