breaking news
Joint Collector KANNABABU
-
మనది ఒకటే మతం అదే భారతీయత
కర్నూలు(రాజ్విహార్): భారత దేశంలో నివశించే పౌరులంతా ఒక్కటే అని, మత సామరస్యంలోనే జాతీయ సమైక్యత సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబు అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లా మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘జాతీయ సమైక్యత- మతాల సామరస్యంపై సదస్సు, వర్క్షాపు, ముషాయిర కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో కవులను సన్మానించారు. ఈ నెల 24వ తేదీన కేవీఆర్ కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమెంటోలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ కన్నబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో అన్ని కుల, మతాలకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. హిందు, ముస్లిం, క్రైస్తవుల మతాలు, కులాలు వేరైనా అందరూ భారతీయులేనని వివరించారు. పండుగలు, సంస్కృతులు వేరైనా అందరూ కలిసి చేసుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం మైనారిటీ కార్పొరేషన్ అసిస్టెంట్ జనరల్ మేనేజరు ఎంఎ బారి మాట్లాడుతూ దేశ ప్రజలు జీవన విధానం వేరైనా సమైక్యతతో ఉండాలన్నారు. పరాయి మతాలను గౌరవించే మతమే అన్నింటికంటే గొప్పదని, మతాల సమరస్యాలు, జాతీయ సమైక్యత, దేశ భద్రత, ప్రజల ఐక్యత వంటి విషయాన్ని పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలన్నారు. మనుషులను సన్మార్గంలో నడిపించేందుకే మతాలు పుట్టుకొచ్చాయని, ఇవి ఉంటనే మంచి, చెడు మార్గాలు తెలుస్తాయన్నారు. అయితే అన్నిమతాలు సమానమే అనే విషయాన్ని గ్రహించాలని విద్యార్థులకు సూచించారు. సెక్యులర్ భావాలను పెంపొందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టరు షేక్ ఫజీలే ఇలాహి అధ్యక్షత వహించారు. మైనారిటీ సంక్షేమాధికారి షేక్ మస్తాన్ వలి, ముస్లిం పెద్దలు మౌలానా ముస్తఖీమ్ సాహెబ్, మౌలానా మహఫూజ్ ఖాన్ సాహెబ్, మౌలానా యూసుఫ్ సాహెబ్, మైరిటీ నాయకులు రోషన్ అలీ, షంషుద్దీన్, క్రైస్తవ మత పెద్దలు ఎస్టీబీసీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఆర్ఆర్డీ సంజీవ రాజు, ఫాదర్ లహస్త్రాయ, రెవరెండ్ రవిబాబు, విజయ్కుమార్, బాలన్న, హిందూ మత పెద్దలు అజయ్కుమార్, సత్యనారాయణ గుప్తా, నక్కలమిట్ట శ్రీనివాసులు, అడ్వకేట్ మనోహర్ శర్మ, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట
కర్నూలు(అగ్రికల్చర్): ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసి.. డ్వాక్రా సంఘాలకు కేటాయించిన రీచ్ల నుంచి నిబంధనల ప్రకారం తరలిస్తామని జాయింట్ కలెక్టర్ కన్నబాబు అన్నారు. గురువారం ఆయన తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు రెవెన్యూ, పోలీసు, మైనింగ్, రవాణా అధికారులతో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి నిరంతర గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో నాలుగు ఇసుక రీచ్లను గుర్తించినా.. నిడ్జూరులో మాత్రమే తవ్వకాలు కొనసాగుతున్నాయన్నారు. ఇసుక ధర, రవాణా చార్జీలను ఇప్పటికే ఖరారు చేశామన్నారు. ఇప్పటి వరకు వినియోగదారులు డీడీలు చెల్లించి ఇసుక తరలిస్తున్నారని.. ఇకపై మీసేవ కేంద్రాల్లో నగదు చెల్లించి రశీదులను ఇసుక రీచ్ల వద్ద డ్వాక్రా సంఘాల ప్రతినిధులకు అందిస్తేనే ఇసుక సరఫరా అవుతుందన్నారు. వాల్టా చట్టాన్ని వంద శాతం అమలు చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇందులో భాగంగానే రీచ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పత్తి కొనుగోలుకు చర్యలు పత్తి ధర పడిపోవడంతో కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాలలో సీసీఐ కొనుగోలు కేంద్రాలతో ఎంఎస్పీతో పత్తిని కొనుగోలు చేస్తామన్నారు. రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ, ఆముదం దిగుబడులను ఈ-టెండర్లతో కొనుగోలు చేస్తున్నారని.. త్వరలోనే పత్తిని కూడా అదేవిధంగా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.