breaking news
Jayalalithaa assets
-
జయ ఆస్తుల తనిఖీ బాధ్యత దీప, దీపక్లకు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈసీ, న్యాయస్థానంలో దాఖలు చేసిన జాబితా ప్రకారం దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను సరిచూసే బాధ్యతను ఆమె అన్న కుమారుడు దీపక్, కుమార్తె దీపలకు మద్రాసు హైకోర్టు మంగళవారం అప్పగించింది. దక్షిణ చెన్నై జిల్లా జయలలిత పేరవై సహాయ కార్యదర్శి పుహళేంది, జానకిరామన్ కోర్టులో దాఖలు చేసిన అప్పీలు పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి. జయలలితకు రూ.55 కోట్ల ఆస్తులున్నట్లు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ సమయంలో బెంగళూరు కోర్టు తీర్పులో పేర్కొంది. సుప్రీంకోర్టు సైతం నిర్ధారించింది. అయితే జయ ఆస్తుల ప్రస్తుత విలువ రూ.913.41 కోట్లు. అవన్నీ చట్టవిరుద్ధంగా థర్డ్పార్టీ స్వాధీనంలో ఉన్నాయి. వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని భద్రం చేయాలి, ఒక పద్ధతిలో వాటిని నిర్వహించాలని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ను విచారించేందుకు నిరాకరిస్తూ మద్రాసు హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని అదే కోర్టులో వారు అప్పీలు చేశారు. ఈ అప్పీలు పిటిషన్ను న్యాయమూర్తులు కృపాకరన్, అబ్దుల్ఖద్దూస్లతో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. జయలలిత రెండోతరం వ్యక్తులైన దీపక్, దీపలను ఈ పిటిషన్పై బదులివ్వాల్సిందిగా ఆదేశించింది. ఈకేసు మంగళవారం విచారణకు వచ్చింది. ఎన్నికల కమిషన్ ముందు జయలలిత దాఖలు చేసిన వివరాలు, ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పులో చూపిన ఆస్తుల వివరాలు సరిచూడాల్సిందిగా దీపక్, దీపలను కోర్టు ఆదేశించింది. కోర్టులో దాఖలు చేసిన ఆస్తుల వివరాల్లో ఏదైనా విస్మరించారా? అనేది గమనించాల్సిందిగా సూచించింది. ఈసీ లేదా కోర్టు దృష్టికి రాని ఆస్తులు ఏవైనా ఉంటే వాటి వివరాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించాల్సిందిగా ఆదేశిస్తూ వచ్చే ఏడాది జనవరి 2వ తేదీకి కేసును వాయిదా వేసింది. -
టార్గెట్ ఎనిమిది మంది, ‘వివేక్’ మెడకు ఉచ్చు
సాక్షి, చెన్నై: ఆదాయ పన్ను శాఖ విచారణ వలయంలోకి చిన్నమ్మ శశికళ కుటుంబం, సన్నిహితులు, సహాయకులు మూడు వందల మందిని తీసుకొచ్చారు. వీరిలో ఎనిమిది మంది టాప్ లిస్టులో ఉన్నారు. వీరందరికీ సమన్లు సిద్ధం చేస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. ఇక, ఇళవరసి కుమారుడు వివేక్ మెడకు మాత్రం ఉచ్చు బిగిసే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. 27 ఏళ్ల వయసు కల్గిన వివేక్ వెయ్యి కోట్ల మేరకు ఆస్తులు, పెట్టుబడుల్ని కల్గి ఉన్నట్టు ఐటీ దాడుల్లో వెలుగు చూసి ఉండడంతో చిన్నమ్మ కుటుంబంలో ఉత్కంఠ తప్పడం లేదు. అన్నాడీఎంకే అమ్మ జయలలిత నెచ్చెలి శశికళ కుటుంబాన్ని, సన్నిహితుల్ని గురి పెట్టి ఐటీ దాడులు గురువారం నుంచి సాగుతున్న విషయం తెలిసిందే. తొలిరోజు 187 చోట్ల, రెండోరోజు 147 చోట్ల, మూడో రోజు 40 చోట్ల తనిఖీలు జరిగాయి. ఇక, నాలుగో రోజుగా 20 చోట్ల తనిఖీల్లో ఐటీ వర్గాలు నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఐటీ విభాగంలో ఉన్నతాధికారులుగా ఉన్న వాళ్లు నాలుగో రోజు రంగంలోకి దిగడంతో తదుపరి అడుగులు ఎలా ఉంటాయోనన్న చర్చ బయలు దేరింది. టార్గెట్ 8 మంది: ఐటీ చరిత్రలో తమిళనాడులో కనీవిని ఎరుగని రీతిలో ఏకకాలంలో, రోజుల తరబడి సాగుతున్న ఈ దాడులపై సర్వత్రా దృష్టి పెట్టారు. రాజకీయ పక్షాలు కొన్ని విమర్శలు గుప్పిస్తుంటే, మరికొన్ని ఐటీ దాడుల్ని ఆహ్వానిస్తున్నాయి. ఈ చర్చ ఓ వైపు సాగుతుంటే, మరో వైపు నాలుగు రోజులుగా చిన్నమ్మ ఫ్యామిలీ, సన్నిహితులకు కంటి మీద కునుకు కరువైందని చెప్పవచ్చు. పట్టువదలని విక్రమార్కుడిలా తిష్ట వేసిన ఐటీ వర్గాలు అణువణువు సోదాలు చేస్తూ, లభించిన ఆధారాలను, వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందిస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలు, లభించిన ఆధారాలు, రికార్డులు, పెట్టుబడులు, ఆస్తులు, నగలు, నగదులకు సంబంధించి విచారణను ముమ్మరం చేయడానికి సిద్ధం అయ్యారు. ఇందు కోసం ఓ జాబితాను సిద్ధం చేస్తున్నారు. మూడు వందల మందిని విచారణ వలయంలోకి చేర్చి, ఒక్కొక్కర్ని తమ కార్యాలయం మెట్లు ఎక్కించేందుకు ఐటీ వర్గాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ జాబితాలో టాప్ 8 మందిని తొలుత టార్గెట్ చేశారు. ఇందులో శశికళ భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, అక్కకుమారులు దినకరన్, భాస్కరన్, అన్న కుమారుడు వివేక్, కుమార్తె కృష్ణ ప్రియ, న్యాయవాది సెంథిల్, జ్యోతిష్కుడు చంద్రశేఖర్ ఉన్నట్టు సమాచారం. వివేక్ మెడకు ఉచ్చు: టాప్ 8 మందిలో తొలి పేరుగా వివేక్ను చేర్చినట్టు సమాచారం. ఇందుకు కారణం, 27 ఏళ్ల వయస్సు కల్గిన వివేక్ వెయ్యి కోట్ల మేరకు ఆస్తుల్ని, పెట్టుబడుల్ని తన గుప్పెట్లో ఉంచుకున్నట్టుగా ఐటీ దాడుల్లో వెలుగు చూడడమే. జయ టీవీ, నమదు ఎంజీయార్, జాస్ సినిమాస్ ఇలా మరికొన్ని సంస్థలకే ఆయనే అధిపతి అన్నట్టుగా ఆధారాలు చిక్కడంతోనే వివేక్ను తొలి జాబితాలో చేర్చినట్టు తెలిసింది. తదుపరి చిన్నమ్మ సోదరుడు దివాకరన్ను గురి పెట్టి ఉండడంతో, మున్ముందు ఐటీ వర్గాల విచారణలు ఎలాంటి మలుపులు తిరుగుతాయోనన్న ఉత్కంఠ తప్పడం లేదు. అదే సమయంలో వివేక్ను అరెస్టు కూడా చేయవచ్చనట్టు ప్రచారం ఊపందుకుంది. శశికళ భర్త నటరాజన్ను టార్గెట్ చేసినా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి విచారణకు పిలిచేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం లభించిన ఆధారాల మేరకు మొత్తం ఆస్తుల వివరాల్ని, పట్టుబడ్డ వాటి గురించిన వివరాల్ని లెక్కించే పనిలో ఐటీ వర్గాలు బిజీగా ఉన్నాయి. వీరు తమకు ఇచ్చే నివేదిక ఆధారంగా రంగంలోకి దిగేందుకు సీబీఐ, ఈడీ వర్గాలు సిద్ధం అవుతుండం గమనార్హం.లగ్జరీ కార్లు: ఆదివారం 20 చోట్ల దాడులు జరగ్గా, పట్టుబడ్డ రికార్డుల సమగ్ర పరిశీలన మేరకు లగ్జరీ కార్ల కొనుగోళ్లలోనూ పన్ను ఎగవేత వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. విదేశాల నుంచి పలు కార్లు అక్రమ మార్గంలో దిగుమతి చేసుకుని ఉండడాన్ని గుర్తించారు. దివాకరన్ వద్ద విచారణ: మన్నార్ కుడిలోని దివాకరన్, ఇళ్లు, కార్యాలయాలు, ఫామ్ హౌస్, కళాశాలల్లో ఐటీ వర్గాలు తనిఖీలు ముగించాయి. ఆయన కళాశాలలోని ఓ గదిని ఐటీ వర్గాలు తమ గుప్పెట్లోకి తీసుకుని సీల్ వేశాయి. మన్నార్కుడిలో లభించిన రికార్డులు, ఇతర వాటిని 14 కార్లో యాభై మంది అధికారులు చెన్నైకు తరలించడం గమనార్హం. అలాగే, మరి కొందరు అధికారులు దివాకరన్ను రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పుదుచ్చేరికి చంద్రశేఖర్: శశికళ జ్యోతిష్కుడు చంద్రశేఖర్ ఇంట్లో , న్యాయవాది సెంథిల్ ఇంట్లో విచారణ ముగిసింది. జ్యోతిష్కుడి ఇంట్లో చిన్నమ్మ ఫ్యామిలికీ సంబంధించిన అనేక దస్తావేజులు ఐటీ వర్గాలకు చిక్కినట్టు సమాచారం. అలాగే, రాష్ట్ర మంత్రి ఒకరు ఈ జ్యోతిష్కుడితో మరీ సన్నిహితంగా ఉండడంతో ఆయన ఎవరో అని ఆరా తీస్తున్నారు. దీంతో చంద్రశేఖర్ను విచారించేందుకు ఐటీ వర్గాలు పుదుచ్చేరికి తరలించారు. అక్కడి శ్రీలక్ష్మి జ్యువెలరీస్ అధినేత తెన్నరసును సైతం విచారించేందుకు చర్యలు చేపట్టారు. మోసం చేసి ఆస్తులు గడించారు: అమ్మ జయ లలితను మోసగించిన శశికళ కుటుంబం ఆస్తుల్ని గడించిందని అన్నాడీఎంకే సీనియర్ నేత కేపీ మునుస్వామి ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న దాడుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేనే లేదని స్పష్టం చేశారు. అమ్మకు తెలియకుండా ఏళ్ల తరబడి మోసాలకు, అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. రాజకీయం చేయొద్దు: ఐటీ దాడుల్ని రాజకీయం చేయవద్దు అని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐటీ పరిశీలనలో తేలిన అంశాలు, లభించిన ఆధారాల మేరకు దాడులు సాగుతున్నాయని తెలిపారు. బీజేపీ మీద నిందల్ని వేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. శశికళ కుటుంబాన్ని మాత్రమే ఐటీ టార్గెట్ చేయలేదని, ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి చెందిన వారిని సైతం గురి పెట్టి తనిఖీలు, సోదాలు సాగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అన్నాడీఎంకేను ముక్కలు చేయాల్సిన అవసరం గానీ, రాజకీయ కక్ష సాధింపులకు దిగాల్సినంత విరోధంగా ఇక్కడి వారితో బీజేపీ పెద్దలకు లేదని స్పష్టం చేశారు. ఇక, పీఎంకే అధినేత రాందాసు పేర్కొంటూ, శశికళ బంధువులు కూడబెట్టిన ఆస్తులను జప్తు చేయాలని, వాటన్నింటిని కేంద్రం స్వాధీనం చేసుకోవాలని కోరారు. మమ్మల్ని తరిమేయడానికి కుట్ర: తిరువణ్ణామలైలో దైవ దర్శనానికి వెళ్లిన దినకరన్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలు బట్టి చూస్తే, ఈ రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి తమ కుటుంబాన్ని తరిమి వేయడానికి కుట్ర జరుగుతున్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. అమ్మ జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె కోరిక మేరకు వీడియో తీశామని, అది తన వద్దే ఉందన్నారు. వైద్య చికిత్సలు, అమ్మకు సంబంధించిన వీడియో తన వద్దే ఉందని, దానిని ఐటీ వర్గాలు తీసుకెళ్ల లేదని స్పష్టం చేశారు. ఈ దాడులతో రాజకీయంగా తాను వెనుక బడ లేదని, ప్రజల మదిలో స్థానం సంపాదించుకున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని పేర్కొంటూ, పదవి చేతిలో ఉంది కదా అని మంత్రులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం శోచనీయమని విమర్శించారు. మంత్రి సీవీ షణ్ముగం లాంటి వాళ్లు ఎందరో ఎలా ఎమ్మెల్యే సీట్లు దక్కించుకున్నారో అన్న వివరాల్ని బయట పెడితే..అంటూ, ఓ మారు గుర్తుంచుకోండని మంత్రులకు హితవు పలికారు. కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటామని, చట్టపరంగా ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు. మహా అయితే, అరెస్టు చేస్తారేగానీ, కాల్చి చంపరుగా అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. -
జయలలిత వీలునామా కోసమే హత్యలు?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత.. వరుసపెట్టి గృహదహనాలు, హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయి. తాజాగా కొడనాడులోని ఆమె ఎస్టేట్లో ఓం బహదూర్ అనే వాచ్మన్ను చంపి, అక్కడ కీలకమైన కొన్ని పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు ఒకేసమయంలో ఒకరు తమిళనాడులోని సేలంలోను, మరొకరు కేరళలోను ప్రమాదాలకు గురయ్యారు. సేలంలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, కేరళలో వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పుకొన్నాడు గానీ, అతడి భార్య, కూతురు చనిపోయారు. ఇదంతా ఎందుకు జరుగుతోందని పోలీసులు ఆరా తీస్తే.. జయలలిత రాసిన వీలునామా కోసమేనని తేలింది. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారీగా ఆస్తులు ఉన్న విషయం తెలిసిందే. అయితే అవి ఎవరికి చెందుతాయనే విషయం ఆమె జీవించి ఉన్నంత కాలం ఎవరికీ తెలియలేదు. బహుశా ఆమె వీలునామా రాసి ఉంటారని, అది కొడనాడు ఎస్టేట్లోనే ఉండొచ్చన్న అనుమానంతోనే దానిమీద దాడిచేసి వాచ్మన్ను హతమార్చారని అనుకుంటున్నారు. గత నెల 23వ తేదీ అర్ధరాత్రి సమయంలో కొడనాడు ఎస్టేట్ వద్దకు మూడు వాహనాల్లో 11 మంది దుండగులు వచ్చారు. అక్కడున్న ఇద్దరు వాచ్మన్ల మీద దాడి చేశారు. వారిలో ఓం బహదూర్ థాపా అక్కడికక్కడే మరణించగా కృష్ణ బహదూర్ థాపా మాత్రం గాయాలతో బయటపడ్డాడు. జయలలిత, శశికళ ఉపయోగిస్తారని భావించిన మూడు గదుల్లో కిటికీ అద్దాలు పగలగొట్టి, లోపలకు వెళ్లి అక్కడున్న 'విలువైన' వస్తువులను తీసుకెళ్లారు. పోలీసుల లెక్కల ప్రకారం కేవలం ఐదు వాచీలు, ఒక క్రిస్టల్ షోపీస్ మాత్రమే పోయాయని అంటున్నారు. కానీ వాస్తవానికి అంతకంటే ఎన్నో రెట్ల విలువైన వీలునామా, ఇతర పత్రాలు పోయాయాని భావిస్తున్నారు. ఈ కేసులో రెండో ప్రధాన నిందితుడైన సాయన్.. కేరళలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడి భార్య, కుమార్తె మరణించారు. దాంతో ఇప్పుడు అతడిని ప్రశ్నించే పరిస్థితి లేదని పోలీసులు చెబుతున్నారు. జయలలిత గదిలో ఉన్న ఒక సూట్కేసులోనే వీలునామా ఉండొచ్చని ఆమె వద్ద చాలాకాలంగా పనిచేసిన వాళ్లు చెబుతున్నారు. అయితే ఆ సూట్ కేసు విషయం కేవలం జయలలిత, శశికళ, మరికొందరికి మాత్రమే తెలుసని.. అలాంటప్పుడు ఈ దాడులు ఎవరి ప్రోద్బలంతో జరుగుతున్నాయని కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో పలువురు పెద్దమనుషుల పేర్లు కూడా వినిపిస్తుండటం, వేరే రాష్ట్రాలకు కూడా సంబంధం ఉండటంతో ఈ మొత్తం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించే అవకాశాలు కూడా లేకపోలేవు.