janapahtam
-
బొబ్బిలి కోట సాక్షిగా జగన్ నినాదాలు
బొబ్బిలి : బొబ్బిలి కోట సాక్షిగా జగన్ నినాదాలు మారుమోగాయి. వేలాది మంది వైఎస్ఆర్ అభిమానులు జగన్ అడుగులో అడుగేయడానికి కదిలారు. ప్రజల కోసం పని చేసే నాయకుడి వెంటే ఉంటామంటూ నినదించారు. తల్లులు బిడ్డలను చంకన వేసుకుని వచ్చి జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నీకు మేమున్నాం అన్నా అని జగన్ను కలిసిన యువత చెప్పడం కనిపించింది. వైఎస్ఆర్ జనభేరి ప్రచారంలో భాగంగా తన కోసం వచ్చిన ప్రతి ఒక్కర్ని పలకరిస్తూ..ధైర్యం చెబుతూ జగన్ ముందుకు కదిలారు. కాసేపటి క్రితం గుల్లాసీతారామపురం, పారాదిలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాయంత్రం సాలూరులో వైఎస్ఆర్ జనభేరి జరగనుంది. ఈ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. -
విజయనగరం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
విజయనగరం : విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన మంగళవారం ప్రారంభమైంది. 'వైఎస్ఆర్ జనభేరి' యాత్రంలో భాగంగా ఆయన బొబ్బిలి, సాలూరు నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం బొబ్బిలి నుండి వైఎస్ జగన్ రోడ్ షో ప్రారంభమైంది. అక్కడ నుండి గ్రోత్ సెంటర్, మెట్టవలస క్రాస్ రోడ్డు, సీతారాంపురం క్రాస్ రోడ్డు, పారాది మీదగా రామభద్రపురం చేరుకుంటుంది. అక్కడ నుండి తారాపురం, కొట్టక్కి మీదుగా సాలూరు చేరుకోనుంది. సాలూరులో జరిగే వైఎస్ఆర్ జనభేరి సభలో ఆయన ప్రసంగించనున్నారు. -
జయహో జగన్
జయజయధ్వానాలు మిన్నంటుతున్నాయి...ఎక్కడికి వెళ్లినా, ఎవరిని పలకరించినా ఆ ధ్వానాలే ప్రతిధ్వనిస్తున్నాయి....పల్లె,పట్నం అన్న తారతమ్యం లేదు. నిరక్షరాస్యులు, విద్యార్థులు అన్న భేదం లేదు. స్త్రీ,పురుషులు అన్న తేడా అంతకన్నా లేదు. దేవుని గుడిలో హారతిలాంటి ఏ పాపమూ ఎరుగని ముత్యాల్లాంటి చిన్నారులు సైతం జయహో జగన్ అని నినదిస్తున్నారు. తమ ఆకాంక్షలు ఈ జయనామ సంవత్సరంలో మీ విజయానికి చిరునామా కావాలని ఆశిస్తున్నారు. ఆ అభిమాన జడిలో తడుస్తూ... పేరుపేరునా పలకరిస్తూ... సమస్యలను అడిగి తెలుసుకుంటూ... చెంపలపై జారుతున్న కన్నీటిని ఆప్యాయంగా తుడుస్తూ భావోద్వేగాల నడుమ వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జనభేరి యాత్ర జిల్లాలో సాగుతోంది. ప్రజలతో జగన్మోహన్ రెడ్డి మమేకమవుతున్న తీరు జిల్లా వాసులకు భవిష్యత్పై నమ్మకం పెరిగేలా చేస్తోంది. కష్టాలను అడిగి తెలుసుకుంటూ ‘నేనున్నాను..’ అంటూ ఆయన భరోసా ఇస్తున్న విధానం ఇన్నాళ్లకు సరైన నాయకుడు వచ్చాడన్న ఆనందం కలిగిస్తోంది. నిశీధిలో వెలుగు రేఖలా... వెన్నుపోటు నాయకుల మధ్యలో ఆశాకిరణంలా జనం కళ్లలో ఇంద్రధనుస్సులు పూయిస్తూ జగన్మోహన్ రెడ్డి ముందుకుసాగుతున్నారు. ఆదివారం ఆయన చీపురుపల్లి నుంచి బయలుదేరి గరివిడి, గుర్ల, మెరకముడిదాం, దత్తిరాజేరు మండలాల మీదుగా గజపతినగరం చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు.