breaking news
Irrigation advisory board
-
రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి
కాకినాడ: వచ్చే రబీ సీజన్ లో గోదావరి డెల్టా పరిధి కింద ఉన్న 8 లక్షల 96 వేల 533 ఎకరాలకు సాగునీరు అందించాలని ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు తీర్మానించింది. రబీకి గోదావరి ద్వారా 65 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని బోర్డు తెలిపింది. మరో 16 టీఎంసీల నీరు కొరత ఉన్న నేపథ్యంలో రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించింది. ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు రబీలో పూర్తిస్థాయిలో నీరు అందించాలని, విశాఖపట్నంకు తాగునీరు అందించేందుకు అధికారులు నిర్ణయించారు. -
రూ.50 కోట్లు నీళ్లపాలు!
సాక్షి, సిటీబ్యూరో : కంచే చేను మేయడమంటే ఏంటో జలమండలి ఎయిర్ వాల్వ్ల విషయంలో మరోసారి రుజువైంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదేళ్లుగా కృష్ణా మొదటి, రెండవ దశ పైప్లైన్లపై నాసిరకం వాల్వ్లు ఏర్పాటు చేయడం వల్ల రూ.50 కోట్లు నీళ్ల పాలయ్యాయి. ఈ నిర్వాకంలో కొందరు బోర్డు అధికారులే సూత్రధారులవడం సంచలనం సృష్టిస్తోంది. ఐదేళ్లపాటు నిర్విరామంగా పనిచేయాల్సిన వాల్వ్లు మూడేళ్లకే చిల్లులు పడి ముక్కలవుతున్నాయి. దీంతో వాటి స్థానే నాణ్యతగల వాల్వ్లు ఏర్పాటు చేయడం జలమండలికి అదనపు భారంగా పరిణమిస్తోంది. అయినప్పటికీ ఈ నాసిరకం సరుకు సరఫరా చేసిన ఓ బడా కంపెనీపై కొందరు జలమండలి అధికారులకు ప్రేమ తగ్గడం లేదు. తాజాగా కృష్ణా మూడోదశ పైప్లైన్లపై వాల్వ్లు ఏర్పాటు చేసేందుకు అదే సంస్థకు రూ.28 కోట్ల మేర ఆర్డరు ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే రూకల్లోతు కష్టాల్లో ఉన్న జలమండలికి నాసిరకం వాల్వులతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి నగర శివార్లలోని సాహెబ్నగర్ వరకు 110 కిలోమీటర్ల మేర కృష్ణా మొదటి, రెండవ దశల పైప్లైన్ ఉంది. మరోవైపు నగరం నలుమూలలా మంచినీటి సరఫరాకు మరో వంద కిలోమీటర్ల మేర పైప్లైన్లున్నాయి. వీటిపై 2010లో సుమారు 600 ఎం.ఎం. సామర్థ్యం గల బటర్ఫ్లై, నాన్ రిటర్న్ వాల్వ్లు 300, 2000 ఎం.ఎం. సామర్థ్యం గల వాల్వ్లు 35 వరకు ఏర్పాటు చేశారు. వీటి ధర సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్కటి రూ.7 నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ పుణేకు చెందిన ఓ బడా కంపెనీ సరఫరా చేసినవి కావడం గమనార్హం. వీటి ఏర్పాటుకు జలమండలి ఇప్పటివరకు రూ.50 కోట్లు వ్యయం చేసింది. ఇవి ఐదేళ్లపాటు నిర్విరామంగా పనిచేయాల్సి ఉంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తినపుడు పైప్లైన్లలో ఏర్పడే అత్యధిక పీడనం, గాలి ఒత్తిడిని బయటికి పంపి పైప్లైన్ను రక్షించి నీటిసరఫరాకు ఆటంకం లేకుండా చేయడం వీటి విధి. అయితే ఇపుడు వీటి పనితీరే ప్రశ్నార్థకంగా మారింది. వీటిలో సింహభాగం ఏర్పాటుచేసిన మూడేళ్లకే మొరాయిస్తున్నాయి. మరికొన్ని అలంకార ప్రాయంగా మారాయి. సాంకేతిక లోపాలు, నాసిరకం విడిభాగాలు వాడడం, తయారీ లోపాలతో అత్యధిక నీటి ఒత్తిడికి తట్టుకోలేక తరచూ వీటికి చిల్లులు పడుతున్నాయి. దీంతో కృష్ణా మొదటి, రెండో దశల ద్వారా సిటీకి సరఫరా అవుతున్న 180 మిలియన్ గ్యాలన్ల నీటిలో నిత్యం 40 శాతం నీరు వృథా అవుతున్నట్లు సమాచారం. మరోవైపు రూ.50 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన వాల్వ్ల స్థానే ప్రస్తుతం కొత్తవి ఏర్పాటు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. విజిలెన్స్ విచారణ జరపాలి ఈ నాసిరకం వాల్వ్లు సరఫరా చేసిన కంపెనీపై కొం దరు జలమండలి అధికారులకు ప్రేమ తగ్గడం లేదు. గతంలో ఏర్పాటు చేసినవాటి పనితీరే ఇలా ఉంటే.. ప్రస్తుతం జరుగుతున్న కృష్ణా మూడోదశ పైప్లైన్లపై ఏర్పాటు చేసేందుకు రూ.28 కోట్ల మేర వాల్వ్లు సరఫరా చేయాలని సదరు కంపెనీకి ఆర్డరు ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నగర బహిరంగ మార్కెట్లో నాణ్యత, మన్నిక కలిగిన వాల్వ్లు సరసమైన ధరలకు లభిస్తున్నప్పటికీ సదరు కంపెనీపై అధికారులు వల్లమాలిన ప్రేమ చూపుతుండటం విస్మయం కలిగిస్తోంది. సదరు కంపెనీ తాయిలాలకు కక్కుర్తి పడి ఇంటి దొంగలే దానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించి గతంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరపాలని బోర్డు కార్మికసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నీళ్ల పాలు ఇలా వాల్వ్ల కోసం ఐదేళ్లుగా జలమండలి చేసిన వ్యయం : రూ.50 కోట్లు 600 ఎం.ఎం. సామర్థ్యం గల వాల్వ్లు : 300 2000 ఎం.ఎం. సామర్థ్యం గలవి : 35 ఒక్కో వాల్వ్ ధర : రూ.7 లక్షలు -రూ.20 లక్షలు వాల్వ్లు ఏర్పాటు చేసింది..: కృష్ణా మొదటి, రెండవ దశ పైప్లైన్లపై మూడోదశ పైప్లైన్పై వాల్వ్ల కోసం ఆర్డర్ ఇచ్చింది : గత కంపెనీకే తాజా ఆర్డర్ విలువ: రూ.28 కోట్లు -
జలం.. పుష్కలం
సాక్షి, కాకినాడ : రబీ సీజన్లో ఉభయ గోదావరి జిల్లాల్లోని 8.96 లక్షల ఎకరాల గోదావరి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరివ్వాలని సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్ణయించింది. రాష్ర్ట స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రి తోట నరసింహం అధ్యక్షతన కాకినాడ విధాన గౌతమి హాలులో శుక్రవారం జరిగిన ఐఏబీ సమావేశం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో రెండో పంటకు డిసెంబర్ ఒకటి నుంచి నీరు విడుదల చేయాలని, ఫిబ్రవరి 28న కాలువలు మూసివేయాలని నిర్ణయించారు. వచ్చే ఖరీఫ్కు జూన్ 15న నీరు విడుదల చేయాలని కూడా నిర్ణయించారు. ఇరిగేషన్ ఎస్ఈ కాశీ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, ఉభయ గోదావరి జిల్లాల్లో రబీలో 8,96,533 ఎకరాలు సాగవుతుండగా ఒక్క మన జిల్లాలోనే 4.85 లక్షల ఎకరాలు సాగవుతోందని చెప్పారు. గోదావరితో పాటు ఇతర జలాశయాల్లో ప్రస్తుతం 73.75 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, దీనితో 7,90,590 ఎకరాలకు సమృద్ధిగా నీరందించవచ్చని వివరించారు. ఇటీవలి భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరిగాయని, వీటితోపాటు ఇతర యాజమాన్య పద్ధతుల ద్వారా మిగిలిన 1,05,943 ఎకరాలకు కూడా పూర్తి స్థాయిలో నీరందించవచ్చని చెప్పారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి గత ఏడాది 2700 టీఎంసీల మిగులు జలాలు సముద్రంలోకి వదలగా, ఈ ఏడాది ఏకంగా 5700 టీఎంసీలు పైగా విడిచిపెట్టామన్నారు. గత ఏడాది 500 క్యూసెక్కుల నీటికోసం ఎంతో ఇబ్బంది పడ్డామని, ఈ ఏడాది ఏకంగా 22 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలైందని వివరించారు. గత నెలాఖరులో 1.75 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, ప్రస్తుతం 64 వేల క్యూసెక్కులు మాత్రమే ఉందని, రబీ సాగు పూర్తయ్యేనాటికి ఇది మరింత పడిపోయే అవకాశాలున్నాయని చెప్పారు. అయినప్పటికీ రబీకి ఢోకా లేకుండా నీరందిస్తామన్నారు. మొత్తం ఆయకట్టులో 10 శాతమైనా క్లోజర్కు ఇవ్వగలిగితే ఆధునికీకరణ పనులు చేపడతామని ఎస్ఈ చెప్పారు. ఏలేరు పశ్చిమ కాలువ, బిక్కవోలు కాలువల ఆధునికీకరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఏలేరుపై వాడీవేడి చర్చ ఏలేరు ఆధునికీకరణ టెండర్ల ఖరారుపై సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. వైఎస్సార్ హయాంలో రూ.138 కోట్లు మంజూరు చేసినప్పటికీ గత ఆరేళ్లలో పనులు ఎందుకు చేపట్టలేకపోయామని మంత్రి తోట నరసింహం తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. రూ.38 కోట్ల అంచనాలతో రూపొందించిన ఈ ప్రతిపాదనలు.. 2008లో రూ.138 కోట్లకు చేరగా, ప్రస్తుతం అంచనా విలువ రూ.250 కోట్లకు చేరిందన్నారు. ప్రస్తుతం ఫైనాన్షియల్ బిడ్ దశలో ఉండగా ఇప్పుడు డిజైన్ మార్చాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడమేమిటని ఎమ్మెల్యే వంగా గీత ప్రశ్నించారు. పనులు చేపట్టే దశకు చేరుకున్న ఈ తరుణంలో ైహైదరాబాద్లో నిర్ణయాలు ఎందుకు మారుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డి, వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ రావు చిన్నారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎ.బాబి కూడా పలు సమస్యలు ప్రస్తావించారు. చివరగా మంత్రి తోట నరసింహం మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న దీర్ఘకాలిక ఇరిగేషన్ సమస్యలపై చర్చించేందుకు హైదరాబాద్లో ముఖ్యమంత్రి సమక్షంలో వారం రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. జేసీ ముత్యాలరాజు, ఏజేసీ కొండలరావు, డీఆర్ఓ బి.యాదగిరి, ట్రైనీ కలెక్టర్ కన్నన్, సబ్ కలెక్టర్ చంద్రుడు తదితరులు పాల్గొన్నారు. కాగా కీలకమైన ఈ సమావేశానికి జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు సహా ఎంపీలు, మెజార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం, రైతుల పట్ల వారికున్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసింది. ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల ఖరీఫ్ నష్టపోయినందున రబీలో క్లోజర్ అడగడం భావ్యం కాదన్నారు. క్లోజర్తో సంబంధం లేకుండా ఖరారైన ప్యాకేజీల పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. సామర్లకోట కెనాల్కు పలుచోట్ల అనధికారికంగా ఏర్పాటు చేసిన తూరలను తొలగించాలని ప్రతి సమావేశంలో చెబుతున్నా తన గోడు అరణ్య రోదనగానే మిగిలిపోయిందని పెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్ చెప్పారు. ఐదు తూములు వద్ద గట్లు కొట్టేయకుండా రైతులు కాపలా కాసే దుస్థితి ఏర్పడిందని, అక్కడి లాకులను ఎందుకు తీయలేకపోతున్నారని ప్రశ్నించారు. వాటిని మూడు రోజుల్లో తొలగిస్తామని ఎస్ఈ హామీ ఇచ్చారు. ఏలేరు స్పిల్వే గేటు వద్ద క్వారీ బ్లాస్టింగ్లు జరుపుతున్నారని, దీనివల్ల రిజర్వాయర్కు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని పంతం అన్నారు. క్వారీ యజమానులు తమ పరిధికి మించి బ్లాస్టింగ్లు జరుపుతూ కాలువ గట్లకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. ఏలేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను మణిహంస పవర్ ప్లాంట్ యాజమాన్యం నియంత్రిస్తోందని, ఈ ప్లాంట్ ప్రభుత్వానికి భారీగా బకాయి పడినందున వెంటనే నీటి విడుదలను అడ్డుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. పంపా ఆధునికీకరణకు రూ.23 కోట్లు మంజూరై మూడు నెలలైనా పనులు ఎందుకు చేపట్టడం లేదని తుని ఎమ్మెల్యే రాజా అశోక్బాబు ప్రశ్నించారు. వచ్చే నెల 15కల్లా టెండర్లు పిలుస్తామని ఎస్ఈ చెప్పారు. డెల్టా ఆధునికీకరణ ఒక మిథ్యగా తయారైందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. మన జిల్లా సమస్యలంటే హైదరాబాద్లో చిన్నచూపు చూస్తున్నారని, అందువల్లనే ఎక్కడికక్కడ ఆధునికీకరణ పనులు నిలిచిపోయాయని అన్నారు. రౌతులపూడి వద్ద గండిని పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు, ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి ఆరోపించారు.