breaking news
IP applies
-
పదేళ్లుగా పెస్టిసైడ్స్ వ్యాపారం.. దివాలాదారుగా ప్రకటించాలని..
సాక్షి, ఖమ్మం లీగల్ : ఖమ్మం జిల్లాకు చెందిన భార్యాభర్తలు వ్యాపారంలో నష్టం వచ్చిందని చెబుతూ రూ.69.15లక్షలకు మంగళవారం ఐపీ దాఖలు చేశారు. ఈ మేరకు ఖమ్మంకు చెందిన వడ్డే రవికుమార్ 10 మందిని ప్రతివాదులుగా చేరుస్త రూ.33.35లక్షలకు స్థానిక సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాలా పిటీషన్ దాఖలు చేశారు. గత పదేళ్లుగా సుజాతనగర్లో అన్నపూర్ణ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఫెస్టిసైడ్స్ వ్యాపారం నిర్వర్తిస్తున్న తాను వ్యాపారాభివృద్ధికి తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితికి చేరుకున్నట్లు తెలిపారు. అలాగే, ఆయన భార్య వడ్డే ఝాన్సీ సైతం 11మందిని ప్రతివాదులుగా చేరుస్త రూ.35.80లక్షలకు దివాలా పిటీషన్ దాఖలు చేశారు. పదేళ్లుగా ఆమె సుజాతనగర్లో సత్య ఎంటర్ప్రైజెస్ పేరిట వ్యాపారం నిర్వహిస్తుండగా, చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో తనను దివాలాదారుగా ప్రకటించాలని సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాది బిల్లా శ్రీనివాస్ ద్వారా దివాళ పిటిషన్ దాఖలు చేశారు. -
రూ.22 లక్షలకు ఐపీ దాఖలు చేసిన మహిళ
ఖమ్మం: ఖమ్మం జిల్లా కొత్తగూడేనికి చెందిన ఒక మహిళ వ్యాపారంలో నష్టం వచ్చిందంటూ రూ.22 లక్షలకు కోర్టులో దివాళా పిటిషన్ వేసింది. వివరాలు.. కొత్తగూడెం పట్టణం కొత్తబజార్కు చెందిన కుర్మా కల్యాణికి భర్త లేడు. దీంతో పిల్లల పోషణార్ధం అనేక వ్యాపారాలు చేపట్టింది. మొదట పాల వ్యాపారం చేసింది. ఇందుకోసం కొన్ని పశువులను ఎక్కువ ధరకు కొనుగోలు చేయటంతో నష్టం వచ్చింది. తర్వాత వస్త్రాలు, బియ్యం విక్రయాలు చేపట్టింది. కిరాణా దుకాణంతో పాటు చిట్టీల వ్యాపారం చేసింది. వ్యాపారాభివృద్ధి కోసం ప్రతివాదులైన 36 మంది వద్ద అధిక వడ్డీలకు రూ.22.26 లక్షల మేర అప్పు తెచ్చింది. వ్యాపారాల్లో నష్టాలు రావటంతో తీర్చలేకపోయింది. దీంతో తనను దివాళా తీసినట్లుగా ప్రకటించాలని మంగళవారం కోర్టును ఆశ్రయించింది.