breaking news
Indira jalaprabha Scheme
-
అక్రమాలపై ఉపేక్ష ఎందుకు?
అవినీతిపై సభ్యుల గరం గరం - జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో - ‘సాక్షి’ కథనం ప్రస్తావన కరీంనగర్ సిటీ : ‘ఇందిర జలప్రభ పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని గతంలోనే చెప్పాం.. విచారిస్తామని కలెక్టర్ సభాముఖంగా చెప్పారు.. ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు కాదు కదా.. కనీసం విచారణ కూడా చేపట్టలేదు.. అక్రమాలపై ఎందుకు ఉపేక్షిస్తున్నారు’ అంటూ జిల్లా ప్రజాపరిషత్ స్థాయూ సంఘం సమావేశంలో సభ్యులు మండిపడ్డారు. గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు, సాంఘిక సంక్షేమ స్థాయి సంఘాల సమావేశాలు గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగాయి. చైర్పర్సన్ తుల ఉమ, సీఈఓ సూరజ్కుమార్ హాజరయ్యారు. ముందుగా సభ్యులు చల్లనారాయణరెడ్డి, ఎండీ.జమీలుద్దిన్, మందల రాజిరెడ్డి ఇందిర జలప్రభ పథకంలో చేపట్టిన బోరుబావులు, విద్యుత్ కనెక్షన్లు, మోటార్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించగా విచారణ కమిటీ వేద్దామనుకున్నామంటూ డ్వామా పీడీ సమాధానం చెప్పడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ వేయడానికే ఏడాది సమయం తీసుకుంటే విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్య తీసుకోవడానికి ఎన్నేళ్లు తీసుకుంటారని ప్రశ్నించగా జెడ్పీ నుంచే కమిటీ వేద్దామని చైర్పర్సన్ తుల ఉమ హామీ ఇచ్చారు. డీఆర్డీఏ ఇచ్చే శిక్షణ క్యాలెండర్ వివరాలు సభ్యులకు చెప్పాలని, జిల్లాలో మిగిలిన ఏడు మండలాల్లో గోదాముల నిర్మాణానికి స్థలం సేకరించాలని, కరీంనగర్, కోరుట్ల నియోజకవర్గాల్లో గృహనిర్మాణం కోసం భూమిని గుర్తించాలన్నారు. జిల్లాలో భర్త వదిలి పెట్టిన ఒంటరి మహిళలు 11వేల మంది ఉన్నారని, వారికి పింఛన్లు ఇవ్వాలని, అభయ హస్తం లబ్ధిదారులకు మార్చి నుంచి పింఛన్ రావడం లేదని సభ్యులు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాల్లో రూ.500 ఇస్తేనే పేర్లు అప్లోడ్ చేస్తున్నారని, డాటా ఆపరేటర్లను రిక్రూట్ చేసుకోవాలన్నారు. 75 శాతం కిరోసిన్ నల్లబజారుకు తరలుతోందని, నీలి రంగును తెలుపు చేసి డీజిల్, పెట్రోల్లో కలిపి కల్తీ చేస్తున్నారని చెప్పారు. రాజీవ్ యువశక్తి కింద ఇస్తున్న రూ.1లక్ష రుణాన్ని రూ.5 లక్షలకు పెంచాలని తీర్మానించారు. -
కోట్ల రూపాయలు.. ఖాతాల్లో కన్‘ఫర్మ్’
ఇందిర జలప్రభ నిధులు.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి రిజిస్టర్డ్ ఫర్మ్ల పేరిట కోట్ల రూపాయలు ప్రైవేటు ఖాతాల్లోకి ఓపెన్వెల్స్ పేరిట రూ.1.75 కోట్లు.. బోర్వెల్స్లో దాదాపు రూ.కోటి మోటార్లిచ్చే ఏజెన్సీలకు మరో రూ.83లక్షలు పనిచేయకుండానే డబ్బులు డ్రా లబ్ధిదారులకు ఇవ్వాల్సిన నిధులూ ఎగనామంసంతకం పెడితే లంచమిస్తామని క్షేత్రస్థాయి సిబ్బందికి ఎర ఖాళీ బాండుపేపర్లు ఇచ్చి మరీ సంతకాలు పెట్టించుకున్న వైనం నల్లగొండ : ఇందిర జలప్రభ పథకం జిల్లాలో అస్తవ్యస్తంగా తయారైంది. పట్టించుకోవాల్సిన వారే పక్కదారి పట్టడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని ఇప్పటికే తేటతెల్లమైంది. అయితే, ఈ విషయంలో లోతుల్లోకి వెళ్లేకొద్దీ కళ్లు తిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. లక్ష కాదు.. రెండు లక్షలు కాదు... ఏకంగా కోట్ల రూపాయలు ప్రైవేటు వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. రిజిస్టర్డ్ ఫర్మ్ల పేరిట మెటీరియల్ సరఫరా చేస్తామని డ్వామాతో ఒప్పందం కుదుర్చుకున్న కొందరు కాసులకు కక్కుర్తి పడి, ఉన్నతాధికారులకు ఆమ్యామ్యాలిచ్చి దళిత, గిరిజనులకు చెందాల్సిన కోట్ల రూపాయలను తమ ఖాతాల్లో వేసుకున్నట్టు తెలుస్తోంది. ఓపెన్వెల్స్, బోర్వెల్స్, రీచార్జ్డ్ స్ట్రక్చర్స్ పేరిట దాదాపు 2.75 కోట్ల రూపాయలు ఈ ఫర్మ్ల ఖాతాల్లోకి వెళ్లాయి. అయితే, ఈ నిధులను నేరుగా లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉన్నా వారికి చెల్లించకుండానే పక్కదారి పట్టించారు. పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారు. ఇందుకు అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బంది సంతకాలను కూడా ఎరలు వేసి పెట్టించుకున్నారు. మీరు సంతకాలు పెడితే డబ్బులిస్తామని, నమ్మకం లేకపోతే ఖాళీ బాండ్లు తీసుకోవాలని చెప్పి, ఆ బాండ్లు ఇచ్చి మరీ సంతకాలు పెట్టించుకున్నారు... ఇంత జరుగుతున్నా పర్యవేక్షించాల్సిన వారు మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఫర్మ్ల నిర్వాహకులిచ్చిన పైసలు జేబులో వేసుకుని గమ్మున ఉండిపోయారు. ఒక్క ఫర్మ్ ఖాతాలోనే రూ.87లక్షలు.. ఉపాధి హామీ వెబ్సైట్లో పెట్టిన వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే అసలు ఈ పథకం అమల్లో గతంలో పనిచేసిన అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతోంది. వాస్తవానికి ఈ పథకంలో ఫ్రభుత్వంనుంచి నేరుగా నిధులు లబ్ధిదారుడికి వెళ్లాలి. కానీ మధ్యలో ఫర్మ్ల పేరిట కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ పథకంలో చొరబడ్డారు. లబ్ధిదారులకు అవసరం అయిన మెటీరియల్ను తాను పంపిణీ చేస్తామని, ఇందుకు తమ ఫర్మ్లను అనుమతించాలని డ్వామా వద్ద దరఖాస్తు చేసుకున్నారు. నిధులు బొక్కేయవచ్చనుకున్నారో లేక ఫర్మ్ల ద్వారా పని సులువవుతుందనుకున్నారో కానీ గతంలో పనిచేసిన అధికారులు ఈ ఫర్మ్లను రిజిస్టర్ చేసుకున్నారు. వీటి ద్వారా మెటీరియల్ ఇప్పించినందుకు కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ జమ వివరాలను పరిశీలిస్తే ఓపెన్వెల్స్ పనులకు గాను మొత్తం రూ.1.75 కోట్లు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లో జమ అయ్యాయి. అందులో ఒక్క ఫర్మ్కే రూ.87.77 లక్షలకు పైగా జమ చేశారు. మరో ఫర్మ్కు రూ.30.55 లక్షలు, ఇంకో ఫర్మ్కు రూ.38.10 లక్షలు, ఇంకో దానికి రూ.13.8లక్షలు, మరోదానికి రూ.9.57 లక్షలు జమచేశారు. ఇక, బోర్వెల్స్, రీచార్జ్డ్ స్ట్రక్చర్ల నిర్మాణం కోసం ఏకంగా డ్వామా వద్ద జిల్లాలో 25 ఫర్మ్లు రిజిస్టర్ అయ్యాయి. ఈ ఫర్మ్లకు మొత్తం మీద కోటి రూపాయల దాకా జమయ్యాయి. ఇందులో అత్యధికంగా రూ.16.38 లక్షల నుంచి అత్యల్పంగా రూ.92 వేల వరకు జమ చేశారు. రూ.11.74 లక్షలు, రూ. 11.75 లక్షలు, రూ. 7.25 లక్షలు, రూ. 6.46 లక్షలు... ఇలా ఫర్మ్ల ఖాతాల్లో జమచేశారు. ఇక, ఎలక్ట్రిఫికేషన్ కోసం జిల్లాలో ఎంపిక చేసిన నాలుగు ఏజెన్సీలకు కూడా రూ.80లక్షలకు పైగానే మంజూరయ్యాయి. అందులో అత్యధికంగా ఒక ఏజెన్సీకి రూ. 48.68లక్షలు, మరో ఏజెన్సీకి రూ. 27.81లక్షలు, ఇంకో ఏజెన్సీకి రూ.7.88 లక్షలు, మరో ఏజెన్సీకి రూ. 1.46 లక్షలు జమ చేశారు. ఈ ఫర్మ్లు, ఏజెన్సీలకు జమ చేసిన నిధులన్నీ పక్కదారి పట్టాయని కాదు కానీ... చాలా వరకు దుర్వినియోగం అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. కొందరు మాత్రం నిబంధనల ప్రకారం పనులు చేయగా, కొన్ని ఫర్మ్ల నిర్వాహకులు మాత్రం తమ ఇష్టానుసారంగా వ్యవహరించారు. ప్రైవేటు వ్యక్తులను నమ్మి ఇన్ని లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును వారి వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేయడం ఎందుకో అర్థం కాని పరిస్థితి. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు వ్యక్తులు గతంలో పని చేసిన ఉన్నతాధికారులకు ఆమ్యామ్యాలిచ్చి ప్రజల సొమ్మును లాగించేశారు. ఇప్పుడు ఈ ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లిన నిధుల్లో దుర్వినియోగం అయిన నిధులన్నింటినీ రాబట్టలేని పక్షంలో పక్కదారి పెట్టిన ప్రజాధనం గురించి మర్చిపోవాల్సిందే. బాండ్లు ఎందుకు ఇచ్చారు బాబూ...! ఈ నిధుల మంజూరుకు ప్రక్రియ చాలా పెద్దగానే ఉంది. అయితే, అది కేవలం కాగితాలకే పరిమితమైంది. ఉన్నతాధికారులు, ప్రైవేటు వ్యక్తులు కుమ్మక్కు కావడంతో నిబంధనలు, నియమాలు ఏవీ లేకుండానే కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి. క్షేత్రస్థాయి సిబ్బంది సహకరిస్తేనే తమ పబ్బం గడుస్తుందన్న కారణంతో అక్రమార్కులు ఏకంగా ఖాళీ బాండ్లను ఎరగా వేశారు. తాము చెప్పినట్టు సంతకాలు చేస్తే డబ్బులిస్తామని చెప్పిన వారు. నమ్మకం లేని ఖాళీ బాండ్లు కూడా ఇవ్వడం గమనార్హం. అయితే, కొందరికి చెక్కులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రైవేటు వ్యక్తులు అక్రమాలకు పాల్పడ్డారని, ఈ పథకంలో ఒక్క మిర్యాలగూడ క్లస్టర్ పరిధిలోనే రూ.2.4కోట్లు దుర్వినియోగం అయిందని చెప్పడానికి ఈ ఖాళీ బాండ్లు, చెక్కులు సరిపోవా బాసూ...! -
ఇందిర జలప్రభకు రూ.100 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఇందిర జలప్రభ పథకం అమలు కోసం రూ. 100 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్సీ, ఎస్టీ రైతుల భూములను సాగుకు పనికొచ్చేలా చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. -
జలప్రభకు కరెంటూ కరువే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బంజరు భూములను అభివృద్ధి చేసేందుకు సర్కారు ప్రారంభించిన ఇందిర జలప్రభ పథకం కరెంట్ షాక్తో అల్లాడుతోంది. ఈ పథకం కింద అభివృద్ధి చేసిన భూముల్లో బోర్లు వేసినా.. వాటికి విద్యుత్ కనెక్షన్లు కరువయ్యాయి. కనెక్షన్ల కోసం రూ. 70 కోట్ల మేరకు నిధులు చెల్లించి నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు వారు ఇచ్చిన కనెక్షన్లు మూడు వేలు కూడా దాటకపోవడం గమనార్హం. దాంతో బోర్లు వేసినా.. మోటార్లు బిగించడానికి సిద్ధంగా ఉన్నా.. కరెంటు లేకపోతే ఏం చేయగలమని అధికారులు, రైతులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. బోర్లు వేసిన ప్రాంతాలు చాలా దూరంగా ఉంటున్నాయని, అక్కడివరకు విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని డిస్కమ్లకు చెందిన క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. మెటీరియల్ సమకూర్చుకోవాల్సిన బాధ్యత విద్యుత్ అధికారులపై ఉన్నా.. వారు పట్టించుకోవడం లేదని గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు చెబుతున్నారు. ఇలా చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి చాలా ఏళ్లు పడుతుందని ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ అంశాన్ని తాము తరచూ విద్యుత్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తున్నా.. ఫలితం ఉండడం లేదని చెప్పారు. మోటార్ల కోసం మళ్లీ టెండర్లు.. జలప్రభ కింద అందించే మోటార్ల కోసం రెండు సార్లు టెండర్లు పిలిచినా ఏ సంస్థ కూడా ముందుకు రాకపోవడంతో.. మూడోసారి మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి మాణిక్యవరప్రసాద్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శశిభూషణ్కుమార్ను ఆదేశించినట్లు సమాచారం. అయితే, మోటార్లకు నాలుగేళ్ల గ్యారంటీ ఇవ్వాలనే నిబంధన కారణంగా తయారీ సంస్థలు రింగ్ అయి టెండర్లు దాఖలు చేయలేదని తేలడంతో.. ఆ పరిమితిని రెండేళ్లకు కుదించాలని నిర్ణయించారు.