breaking news
Indian Test Cricket
-
భారత్ తరఫున తొలి సెంచరీ ఎవరిదో తెలుసా..
భారత క్రికెట్ జట్టు తన 500వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. గురువారం న్యూజిలాండ్తో జరగనున్న ఈ మ్యాచ్.. 1932లో ప్రారంభమైన భారత టెస్ట్ క్రికెట్ ప్రస్థానంలో ఎంతో ప్రత్యేకమైంది. ఈ సందర్భంగా భారత టెస్ట్ క్రికెట్లో మైలురాళ్లుగా చెప్పుకోదగ్గ కొన్ని విశేషాలు మీకోసం.. ► భారత్ తన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ను 1932లో క్రికెట్కు మక్కాగా పేరుగాంచిన ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానంలో ఆడింది. సీకే నాయుడు తొలి కెప్టెన్. ► భారత జట్టు తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ విజయాన్ని రుచి చూసింది 1952లో. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్పై ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ► మొదటి టెస్ట్ సిరీస్ విజయం మాత్రం భారత్కు 1971లో దక్కింది. ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన ఈ సిరీస్ను భారత్ 1-0తో గెలుపొందింది. ► భారత టెస్ట్ క్రికెట్లో మొట్టమొదటి సారి సెంచరీ సాధించిన బ్యాట్స్మెన్ లాలా అమర్నాథ్. చెన్నైలో 1933లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో లాలా 118 పరుగులు చేశాడు. ► ఇప్పటివరకు సాధించిన విజయాల్లో బంగ్లాదేశ్పై 2007లో సాధించిన విజయమే భారత విజయాల్లో పెద్దది. ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్, 219 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ► భారత్ అత్యంత చెత్తగా ఓడింది మాత్రం వెస్టిండీస్ చేతిలో. 1958లో కోల్కతాలో జరిగిన మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్, 336 పరుగుల తేడాతో ఓడింది. ► అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ రికార్డు సృష్టించాడు. సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులు సాధించాడు. ► భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అనిల్ కుంబ్లే. 132 టెస్టుల్లో 619 వికెట్లను కుంబ్లే తన ఖాతాలో వేసుకున్నాడు. -
కుర్రాళ్లు కొట్టారు...
సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, సెహ్వాగ్, కుంబ్లే...భారత టెస్టు క్రికెట్ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఒక తరం ఆటగాళ్లు. కానీ వీరెవ్వరూ ‘క్రికెట్ మక్కా’గా పేరొందిన లార్డ్స్ మైదానంలో విజయం రుచి చూడలేదు. కానీ రహానే, భువనేశ్వర్, జడేజాలాంటి ఈతరం కుర్రాళ్లు ఈ 200 ఏళ్ల చారిత్రక మైదానంలో తమ కోసం కొత్త చరిత్ర ‘లిఖించుకున్నారు’. లార్డ్స్లో ఆడిన తొలిసారే లార్డ్లా సత్తా చాటి భారత క్రికెట్ అభిమానులకు చాలా కాలం తర్వాత ఆనందాన్ని పంచారు. యువ ఆటగాళ్లంతా తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన చోట... నేనున్నానంటూ వెన్నుతట్టిన సారథి ధోని అండగా నిలవగా క్రికెట్ పుట్టింట్లో టీమిండియాకు చిరస్మరణీయ విజయం దక్కింది. అందరూ కలిసి... లార్డ్స్ విజయంలో దాదాపు అందరు ఆటగాళ్లూ కీలక పాత్ర పోషించారు. తొలి రోజు పచ్చని వికెట్పై బంతి స్వింగ్ అవుతున్న చోట పుజారా పట్టుదల కనబర్చాడు. చేసింది 28 పరుగులే అయినా వందకు పైగా బంతులు ఎదుర్కొని ఇన్నింగ్స్ కుప్పకూలకుండా కాపాడాడు. మరో వైపు తొలి ఇన్నింగ్స్లో గట్టిగా నిలబడ్డ ఓపెనర్ విజయ్, రెండో ఇన్నింగ్స్లో స్ఫూర్తిదాయక బ్యాటింగ్ ప్రదర్శించాడు. 18 ఏళ్లనాడు ద్రవిడ్ తరహాలో ఇక్కడే త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నా ఎంతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. లార్డ్స్లో సెంచరీతో దిగ్గజాల సరసన రహానే చోటు దక్కించుకుంటే...ఇందుగలడందు లేడంటూ భువనేశ్వర్ కుమార్ అన్నింటా తానై సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేసిన భువీ, రెండో ఇన్నింగ్స్లో తన బ్యాటింగ్ పదును చూపించి కీలక అర్ధ సెంచరీ సాధించాడు. ఈ వరుసలో రవీంద్ర జడేజా పాత్ర మరింత ప్రత్యేకం. తొలి టెస్టు వివాదం వెంటాడుతుండగా ఈ మ్యాచ్లో ఆటపై ఏకాగ్రత చెదరనివ్వలేదు. రెండో ఇన్నింగ్స్లో అతని దూకుడైన బ్యాటింగే భారత్ అవకాశాలు మెరుగు పర్చిందని చెప్పవచ్చు. అన్నింటికి మించి కొత్త శత్రువు అండర్సన్ను తొలి ఇన్నింగ్స్లో అవుట్ చేసిన జడేజా... రెండో ఇన్నింగ్స్లోనూ అతడిని డెరైక్ట్ త్రోతో రనౌట్ చేసి మ్యాచ్ను గొప్ప జ్ఞాపకంగా మలచుకున్నాడు. - సాక్షి క్రీడావిభాగం ఎన్నాళ్లకెన్నాళ్లకు... 1124 రోజులు... భారత జట్టు విదేశీ గడ్డపై టెస్టు మ్యాచ్ నెగ్గి గడిచిన కాలం. సరిగ్గా చెప్పాలంటే 2011 జూన్లో కింగ్స్టన్లో వెస్టిండీస్పై భారత్ 63 పరుగుల తేడాతో నెగ్గింది. అంతే...ఆ తర్వాత బయటికి అడుగు పెట్టిన చోటల్లా పరాభవమే వెక్కిరించింది. ఇంగ్లండ్లో 0-4, ఆస్ట్రేలియాలో 0-4, దక్షిణాఫ్రికాలో 0-1, న్యూజిలాండ్లో 0-1...ఈ వరుస 15 టెస్టుల పాటు గెలుపన్నదే లేకుండా సాగింది. ఈ క్రమంలో కెప్టెన్గా ధోని వైఫల్యంపై అనేక విమర్శలు వచ్చాయి. జొహన్నెస్బర్గ్లో, ఆ తర్వాత వెల్లింగ్టన్లో విజయానికి చేరువగా వచ్చినా...ఫలితం మాత్రం దక్కలేదు. సీనియర్లు పోయారు, జూనియర్లు వచ్చారు...కానీ పరిస్థితి మాత్రం మారలేదు. ఇలాంటి స్థితిలో ధోని, కుర్రాళ్లను నమ్ముకొని ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టాడు. ‘గత రెండు టూర్లలో విజయం వాకిట నిలిచాం. ఈ సారి అవకాశం వస్తే వదులుకోం’ అని చెప్పిన ధోని దానిని నిజం చేసి చూపించాడు. తొలి టెస్టులో భారత్ ఆధిక్యం కనబర్చినా...లార్డ్స్లో పూర్తిగా పట్టు నిలబెట్టుకుంది. ముఖ్యంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో బౌలర్లను మార్చడంలో, వ్యూహాల్లో ధోని ప్రత్యేకత కనిపించింది. అది చివరకు ఫలితాన్నిచ్చింది. ఇప్పటికే ఇంగ్లండ్ను చావు దెబ్బ కొట్టిన టీమిండియా ఇకపై అదే జోరును కొనసాగించి సిరీస్ను కూడా గెలుచుకోవాల్సి ఉంది.