breaking news
indian students injured
-
బోండీ బీచ్ ఉగ్రదాడిలో ముగ్గురు భారత విద్యార్థులకు గాయాలు
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్లో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు భారత విద్యార్థులు గాయపడ్డారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, వీరిలో ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన విద్యార్థుల పేర్లు వెల్లడి కాలేదు. కాగా, డిసెంబర్ 14న (ఆదివారం) సిడ్నీలోని బోండీ బీచ్కు సమీపంలో గల ఓ చిన్న పార్కులో యూదులు "హనుక్కా బైదసీ" అనే పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు సాయుధులు వేడుకల్లో మునిగిపోయిన యూదులపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. ఈ దుర్ఘటనలో 10 ఏళ్ల బాలుడు సహా 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం 40 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, ఇద్దరు పోలీసు అధికారులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కాల్పులు జరిపిన ఆగంతకుల్లో ఒకరిని నవీద్ అక్రమ్గా గుర్తించగా.. మరో ఆగంతకుడు నవీద్ తండ్రి, 50 ఏళ్ల పండ్ల వ్యాపారి సాజిద్ అక్రమ్ అని న్యూ సౌత్వేల్స్ పోలీసులు వెల్లడించారు. వీరిద్దరు పాకిస్తాన్ జాతీయులు. నవీద్కు ఐఎస్ఐఎస్ ఉగ్రసంస్థతో సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. -
అమెరికాలో ఎన్నారై విద్యార్థులకు తీవ్రగాయాలు
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ ట్రక్కును కారు ఢీకొనడంతో ఐదుగురు ఎన్నారై విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. టెక్సాస్ ఏఅండ్ఎం యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు న్యూ ఆర్లియాన్స్లో థాంక్స్గివింగ్ బ్రేక్కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. తాను వెళ్తున్న లేన్లోనే భారీ ట్రక్కు ఉండటంతో దాన్ని తప్పించడానికి డ్రైవర్ చాలా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గాయపడిన వాళ్లలో ప్రాణన్ కన్నన్ (22), అక్షయ్ జైన్ (22), చిరంజీవి బోరే (23), షచిత్ అయ్యర్ (23), కిషన్ బజాజ్ (24) ఉన్నారు. వీరందరినీ వెంటనే ఆస్పత్రులకు తరలించారు. వీరిలో అక్షయ్ జైన్, కిషన్ బజాజ్ల పరిస్థితి విషమంగా ఉండటంతో.. వాళ్లను హెలికాప్టర్లలో మెమోరియల్ హెర్మన్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యచికిత్సలు అందించేందుకు అమెరికాలో ఉన్న భారతీయులు విరాళాలు సేకరిస్తున్నారు. ట్రక్కు డ్రైవర్ క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.


