breaking news
Indian Institutes of Management
-
విద్యార్థుల మరణాలు దురదృష్టకరం: సుప్రీం
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెట్(ఐఐఎంల)లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి ఘటనల నివారణకు బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని నొక్కిచెప్పింది. ఐఐటీలు, ఐఐఎంల్లో గడిచిన 14 నెలల్లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ తెలపడంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. ఈ అంశానికి న్యాయపరమైన ముగింపు ఇస్తామని పేర్కొంది. హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల 2017లో, మహారాష్ట్రలోని టీఎన్ టోపీవాలా మెడికల్ కాలేజీ విద్యార్థిని పాయల్ తాడ్వి 2019లో బలవన్మరణం చెందారు. తమ విద్యాసంస్థల్లో కులపరమైన వివక్షను భరించలేకే ప్రాణాలు తీసుకున్నారంటూ వీరి తల్లులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇటువంటి ఘటనల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, కోర్టు ఆదేశాలున్నా విద్యార్థుల ఆత్మహత్యల ఘటనల వివరాలను ఇచ్చేందుకు విద్యాసంస్థలు ససేమిరా అంటున్నాయని లాయర్ జైసింగ్ శుక్రవారం ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. -
రెండో విడత మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్
న్యూఢిల్లీ: యువతకు నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు, అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్ (ఎంజీఎన్ఎఫ్) రెండో విడతను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ఆవిష్కరించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్)లతో కలిసి ఈ రెండేళ్ల కోర్సును రూపొందించారు. దీనిలో భాగంగా విద్యార్థులు ఇటు తరగతి గదుల్లో విద్యాభ్యాసంతో పాటు క్షేత్ర స్థాయిలోనూ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు. సుశిక్షితులైన మానవ వనరులకు సంబంధించి నెలకొన్న డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం, జిల్లా స్థాయిలో ప్రొఫెషనల్స్ను తీర్చిదిద్దడం మొదలైనవి ఎంజీఎన్ఎఫ్ ప్రోగ్రాం లక్ష్యాలు. విద్య, వృత్తిపరమైన అనుభవం ఉన్న 21–30 మధ్య వయస్సు గల పురుషులు, మహిళలు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. -
క్యాట్ స్కోర్తోపాటు కావలసినవెన్నో
ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలో ప్రవేశానికి తొలి మెట్టుగా భావించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) ముగిసింది. దేశవ్యాప్తంగా ఈ నెల 16, 22 తేదీల్లో నాలుగు స్లాట్లలో నిర్వహించిన పరీక్షకు లక్షన్నర మందికిపైగా హాజరయ్యారు. ఈ ప్రతిష్టాత్మక బీస్కూల్స్ క్యాట్ స్కోర్తోపాటు మరెన్నో అంశాలను పరిగణనలోకి తీసుకొని వాటికి కూడా వెయిటేజీ కల్పిస్తున్నాయి. క్యాట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి.. మలి దశలో రిటెన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. వీటిలోనూ ముందంజలో నిలిస్తే ఐఐఎం కల నెరవేరినట్లే! క్యాట్ ముగిసిన నేపథ్యంలో ఐఐఎంల ప్రవేశ ప్రక్రియ తీరుతెన్నులు..సన్నద్ధతకు మార్గాలపై నిపుణుల విశ్లేషణ, సూచనలు.. క్యాట్ స్కోర్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలతోపాటు పదో తరగతి నుంచి ప్రొఫెషనల్ కోర్సు వరకూ.. అకడమిక్ ట్రాక్ రికార్డ్, వర్క్ ఎక్స్పీరియన్స్ వంటి వాటిని కూడా ఐఐఎంలు పరిశీలిస్తున్నాయి. కాబట్టి వీటికి కల్పించిన వెయిటేజీలోనూ ముందంజలో నిలవడం అవసరం. రిటెన్ ఎబిలిటీ టెస్ట్ ఐఐఎంల ఎంపిక ప్రక్రియలో రిటెన్ ఎబిలిటీ టెస్ట్ ఎంతో కీలకం. ఇందులో ఒక నిర్దిష్ట అంశాన్ని ఇచ్చి నిర్దేశించిన సమయంలోగా వ్యాసం రాయమంటున్నారు. ఇది సాధారణంగా వర్తమాన ఆర్థిక-సామాజిక పరిణామాలపై ఉంటుంది. 15 నుంచి 30 నిమిషాల సమయం ఇస్తారు. ఐఐఎంలో చేరే విద్యార్థికి మేనేజ్మెంట్ దృక్పథంతోపాటు సామాజిక అంశాలపైనా అవగాహన ఉందా? అని పరీక్షించడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం. కాబట్టి అభ్యర్థులు ఇటీవల కాలంలో సంభవించిన జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి. రిటెన్ ఎబిలిటీ టెస్ట్లో రాణించేందుకు భావ వ్యక్తీకరణ చాలా ముఖ్యం. నిర్దిష్ట అంశంపై తమ అభిప్రాయాలను సదరు అభ్యర్థి ఎంత సూటిగా, స్పష్టంగా, సరళంగా రాశాడు? అనే విషయాన్ని ఐఐఎం ఎంపిక కమిటీలు క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయి. సదరు వ్యాసంలో కంటెంట్ నాణ్యతకు, భాషకు ప్రత్యేకంగా వెయిటేజీ కేటాయిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు కేవలం ఆయా అంశాలపై అవగాహన, సమాచార సేకరణకే పరిమితం కాకుండా.. చక్కటి రాత నైపుణ్యాలు, ప్రజెంటేషన్ స్కిల్స్ సైతం పెంచుకోవాలి. నిర్దిష్ట అంశాన్ని విభిన్న కోణాల్లో విశ్లేషించడం.. తమదైన శైలిలో వివరణనివ్వడం.. చక్కటి ముగింపు వంటివి రిటెన్ ఎబిలిటీ టెస్ట్లో మంచి మార్కులు సాధించేందుకు దోహదపడతాయి. గ్రూప్ డిస్కషన్పై గురి ఐఐఎంల ప్రవేశ ప్రక్రియలో మరో ప్రధానమైన అంకం.. గ్రూప్ డిస్కషన్. ఇందులో.. నిర్దిష్ట సంఖ్యలో అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పాటు చేస్తారు. తర్వాత ఏదైనా అంశం ఇచ్చి దానిపై చర్చించమంటారు. గ్రూప్ డిస్కషన్ ప్రధాన ఉద్దేశం అభ్యర్థికి సదరు అంశంపై ఉన్న అవగాహనను తెలుసుకోవడం. దీంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, బృంద నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, విశ్లేషణ సామర్థ్యం పరీక్షిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా అభ్యర్థి భావోద్వేగ స్థితిని పరిశీలిస్తారు. కాబట్టి బృంద చ ర్చలో అభ్యర్థులు ఆవేశానికి, ఉద్రేకానికి లోనుకాకుండా జాగ్రత్త వహించాలి. ఇప్పటినుంచే గ్రూప్ డిస్కషన్లో అడిగేందుకు అవకాశమున్న ముఖ్యమైన అంశాలను గుర్తించి వాటిని కూలంకషంగా చర్చించడం అలవాటు చేసుకోవాలి. ఇందుకోసం న్యూస్ ఛానెళ్లలో నిర్వహించే చర్చా కార్యక్రమాలను వినడం; దినపత్రికల్లోని ఎడిటోరియల్స్ చదవడం- వాటి నుంచి కీలక అంశాలను గుర్తించి సొంతంగా నోట్స్ రాయడం వంటివి చేయాలి. మాక్ గ్రూప్ డిస్కషన్స్కు హాజరవడం, తోటి అభ్యర్థులతో చర్చలు సాగించడం కూడా మేలు చేస్తుంది. పర్సనల్ ఇంటర్వ్యూ క్యాట్ పర్సంటైల్, అకడమిక్ రికార్డ్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ల ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి వ్యక్తిగత ఆసక్తులు, లక్ష్యాలను తెలుసుకుంటారు. మేనేజ్మెంట్ కోర్సులో చేరడానికి కారణం ఏమిటి? భవిష్యత్ ప్రణాళికలు, వాటిని చేరుకునేందుకు అనుసరించబోయే మార్గాల గురించి ప్రశ్నలు సంధిస్తారు. కాబట్టి ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు తమ భవిష్యత్తు లక్ష్యాలపై పూర్తి స్పష్టత ఉండాలి. పని అనుభవం ఉన్న అభ్యర్థులను తమ వర్క్ ప్రొఫైల్కు సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశమెక్కువ. ప్రస్తుత విధులు, వృత్తిపరంగా సాధించిన విజయాలు, తద్వారా సంస్థకు, సమాజానికి కలిగిన ప్రయోజనాల గురించి అడుగుతారు. తాజా గ్రాడ్యుయేట్స్ విషయంలో ఎక్కువగా వారి ఆసక్తులు, అభిరుచులు, విద్యా నేపథ్యంపైనే ప్రశ్నలుంటాయి. ఇంటర్వ్యూలో విజయ సాధనకు మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం, ఇప్పటికే ఐఐఎంలలో చదువుతున్న అభ్యర్థుల సలహాలు స్వీకరించడం ఎంతో ఉపయుక్తం. ఇలా.. క్యాట్ ముగిసిన మరుసటి రోజు నుంచే పకడ్బందీగా, పటిష్ట ప్రణాళిక రూపొందించుకొని సిద్ధమవడం ద్వారా ఐఐఎంలలో ప్రవేశ అవకాశాలు మెరుగుపర్చుకోవచ్చు. డైవర్సిటీ వెయిటేజీ ఐఐఎంలలో ప్రవేశంకేవలం విద్యాధికులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఉన్నత వర్గాలకే సాధ్యం అనే అభిప్రాయాలను తొలగించే ప్రయత్నం జరుగుతోంది. ఐఐఎంలు అన్ని వర్గాలకు అనుకూలం అనే భావన కల్పించేందుకు ఈ ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు కృషి చేస్తున్నాయి. ఐఐఎం-అహ్మదాబాద్ మినహా ఇతర అన్ని ఐఐఎంలు అకడమిక్ డైవర్సిటీకి, జండర్ డైవర్సిటీకి కూడా ఎంపిక ప్రక్రియలో వెయిటేజీ కల్పిస్తున్నాయి. అకడమిక్ డైవర్సిటీ విధానం మేరకు.. అభ్యర్థులను టెక్నికల్, నాన్-టెక్నికల్గా వర్గీకరించి నాన్-టెక్నికల్ విద్యార్థులకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తున్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ(అగ్రికల్చర్) తదితర నాన్ టెక్నికల్ విద్యార్థులకు రెండు నుంచి మూడు శాతం మేర వెయిటేజీ అందిస్తున్నాయి. అదేవిధంగా మహిళల సంఖ్య పెంచేందుకు జండర్ డైవర్సిటీ పేరుతో ఒకటి నుంచి రెండు శాతం వెయిటేజీ ఇస్తున్నాయి. క్యాట్-2014 కటాఫ్ పర్సంటైల్.. ఐఐఎంలు.. క్యాట్ ముగిశాక మలిదశకు హాజరయ్యేందుకు క్యాట్లో నిర్దిష్ట కటాఫ్ పర్సంటైల్స్ను పేర్కొంటున్నాయి. ఆ పర్సంటైల్ సాధించిన అభ్యర్థులనే తదుపరి దశకు పిలుస్తారు. ఐఐఎంలు జనరల్ కేటగిరీకి నిర్దేశించిన క్యాట్-2014 కటాఫ్ల వివరాలు... గమనిక: ఈ కటాఫ్లను తదుపరి దశలో పాల్గొనేందుకు కనీస అర్హతగా ఐఐఎంలు పేర్కొన్నాయి. కానీ గత అడ్మిషన్ల తీరును పరిశీలిస్తే కనీస కటాఫ్ కంటే ఎంతో ఎక్కువ పర్సంటైల్ పొందిన విద్యార్థులు మాత్రమే ప్రవేశం పొందగలిగారు. ఓవరాల్ కటాఫ్ 95 శాతంపైన ఉంటేనే అడ్మిషన్ లభించే అవకాశాలున్నాయి. ఆయా అంశాలు.. వెయిటేజీ వివరాలు.. క్యాట్ స్కోర్తోపాటు ఐఐఎంలు.. ప్రవేశ ప్రక్రియలో రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలకు నిర్దిష్ట వెయిటేజీ ఇచ్చి వాటికి అనుగుణంగా తుది జాబితా రూపొందిస్తున్నాయి. ఆయా అంశాలకు ఇస్తున్న వెయిటేజీ వివరాలు శాతాల్లో.. వెయిటేజీ గణన ఇలా రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూల కంటే ముందుగా క్యాట్ పర్సంటైల్తోపాటు, ప్రొఫైల్ పేరిట పదో తరగతి నుంచి ప్రొఫెషనల్ కోర్సు వరకు సాధించిన అకడమిక్ రికార్డ్, వర్క్ ఎక్స్పీరియన్స్, జండర్ డైవర్సిటీ, అకడమిక్ డైవర్సిటీ అంశాలను నిర్దిష్ట శాతాల్లో గరిష్టంగా వంద శాతం వెయిటేజీకి గణిస్తున్నాయి. ఈ శాతాలు ఒక్కో ఐఐఎంకు ఒక్కో తీరుగా ఉంటాయి. ఈ విధానాన్నే ప్రీ-పర్సనల్ ఇంటర్వ్యూ క్రైటీరియాగా పేర్కొంటున్నాయి. టాప్ స్టోరీ ఫైనల్ సెలక్షన్ ఈ దశలో ప్రీ పర్సనల్ ఇంటర్వ్యూ క్రైటీరియాలో పేర్కొన్న అంశాలు, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ మూడింటినీ కలిపి వంద శాతం వెయిటేజీకి సంకలనం చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో ప్రతిభ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా రూపొందిస్తాయి. వర్క్ ఎక్స్పీరియన్స్కు అయిదు నుంచి పది శాతం మధ్యలో వెయిటేజీ కల్పిస్తున్నాయి. పదో తరగతి నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ వరకు ఒక్కో క్లాస్కు 10 నుంచి 15 శాతం చొప్పున వెయిటేజీ ఇస్తున్నాయి. ప్రొఫెషనల్ కోర్సుకు గరిష్టంగా అయిదు శాతం వెయిటేజీ కల్పిస్తున్నాయి. జనరల్ టిప్స్ * వర్తమాన రాజకీయ, సామాజిక, వ్యాపార పరిణామాలపై నిరంతర సమాచార సేకరణ. * వ్యాపార, వాణిజ్య సంబంధ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. * రైటింగ్ ప్రాక్టీస్ చేయడం. * ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడం. * నిరంతరం దినపత్రికలు, ఇతర మీడియా మార్గాల ద్వారా నిపుణుల చర్చా కార్యక్రమాలను వినడం. * జీడీ/ పీఐలో ఎదుటి వారిని మెప్పించేలా.. బాడీ లాంగ్వేజ్ను మార్చుకునేందుకు ప్రయత్నించడం. * మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం, సన్నిహితులతో కలిసి బృంద చర్చల్లో పాల్గొనడం. * డెసిషన్ మేకింగ్ స్కిల్స్ పెంచుకోవడం. ఇందుకోసం ఏదో ఒక వాస్తవ సమస్యను పరిగణనలోకి తీసుకుని తాము సొంతంగా పరిష్కారాలను కనుగొనడం. * విశ్లేషణ నైపుణ్యాలను పెంచుకోవడం. ఏదైనా ఒక అంశాన్ని చేపట్టి అందులోని ‘కీ’ పాయింట్లను గుర్తించడం, ఆ అంశం ప్రాధాన్యం, ప్రభావం, ప్రయోజనం, ఫలితం వంటి వాటిని విశ్లేషించగలగడం. * తులనాత్మక అధ్యయన నైపుణ్యాలు పెంచుకోవడం. ఒక అంశంలో అంతర్గతంగా ఇమిడి ఉన్న ఇతర కీలక, అనుబంధ అంశాలను కూడా బేరీజు వేయగలిగే విధంగా తులనాత్మక అధ్యయనం కొనసాగించడం. మరెన్నో ప్రముఖ బిజినెస్ స్కూల్స్ ఐఐఎంలే కాకుండా ఐఐఎస్సీ-బెంగళూరు, ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి వాటితోపాటు మరెన్నో ప్రముఖ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు కూడా క్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇవి వెయిటేజీ విషయంలో ఐఐఎంలకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. క్యాట్ స్కోర్కు అధిక వెయిటేజీ (సగటున 60 నుంచి 70 శాతం మేర) ఇస్తున్నాయి. ఇది ఒకరకంగా క్యాట్లో మంచి పర్సంటైల్ సాధించిన అభ్యర్థులకు చక్కటి అవకాశంగా నిపుణులు పేర్కొంటున్నారు. క్యాట్లో 98 శాతం పర్సంటైల్ సాధించినవారు కూడా తమకు నచ్చిన ఐఐఎంలో సీటు పొందలేని ఘటనలు కూడా ఎదురయ్యాయి. అలాంటి అభ్యర్థులకు ఐఐఎంలకు సమానంగా నాణ్యమైన విద్యను ఇతర బిజినెస్ స్కూల్స్ అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో మేనేజ్మెంట్ కోర్సులు ఆఫర్ చేస్తున్న ఐఐటీలు కూడా క్యాట్ స్కోర్నే పరిగణిస్తున్నాయి. ఔత్సాహిక అభ్యర్థులు కేవలం ఐఐఎంలకే పరిమితం కాకుండా మిగతా ఇన్స్టిట్యూట్లకు కూడా దరఖాస్తు చేసుకోవడం ద్వారా ప్రవేశ అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు. దేశంలోని ఐఐఎంయేతర ప్రముఖ బిజినెస్ స్కూల్స్.. -
క్యాట్ క్లిష్టం కాదు!
గెస్ట్ కాలమ్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్).. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 13 ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) లలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష. మేనేజ్మెంట్ విద్య ఔత్సాహికులైన ప్రతి ఒక్క విద్యార్థీ క్యాట్కు హాజరు కావాలని ఆశిస్తారనడంలో సందేహం లేదు. ఇక.. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) -2014కు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ఏడాది కూడా క్యాట్ నిర్వహణ బాధ్యతలను ఐఐఎం-ఇండోర్కే కేటాయించారు. ఆన్లైన్ టెస్టింగ్ ప్రక్రియను ప్రొమెట్రిక్ బదులుగా ఈ ఏడాది నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిర్వహించనుంది. ఈ మేరకు ఐఐఎం-టీసీఎస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో క్యాట్-2014 కన్వీనర్, ఐఐఎం-ఇండోర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రోహిత్ కపూర్తో ఇంటర్వ్యూ..... వరుసగా రెండో ఏడాది క్యాట్ నిర్వహణ బాధ్యతలు అందుకోవడంలో ఏమైనా ప్రత్యేకత ఉందా? క్యాట్-2014 నిర్వహణను ఐఐఎం-ఇండోర్కు కేటాయించడం, కన్వీనర్గా మళ్లీ నన్నే నియమించడం ఆనందాన్ని కలిగిస్తోంది. ఇది ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయం. గత ఏడాది క్యాట్ చరిత్రలో తొలిసారి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను ప్రవేశపెట్టాం. ఇది ఎందరో విద్యార్థులకు దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసింది. మొత్తం దరఖాస్తుల్లో సుమారు 55శాతం ఆన్లైన్లోనే వచ్చాయంటేనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విజయవంతమైందనడానికి నిదర్శనం. ఈ ఏడాది కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా నిర్దేశిత బ్యాంక్ బ్రాంచ్ల నుంచి కూడా దరఖాస్తులు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఆన్లైన్ టెస్టింగ్ విధానంలో అభ్యర్థులు ఎన్నో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు? ఇబ్బందులు వాస్తవమే. అయితే ప్రతి ఏటా అంతకుముందు సమస్యలను పరిష్కరించుకుంటూ ఆన్లైన్ టెస్టింగ్ను ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహిస్తున్నాం. ఫలితంగా గత ఏడాది విద్యార్థులకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. ఈసారి.. పూర్తిగా ఎలాంటి సమస్యలు లేకుండా టెస్టింగ్ ప్రక్రియను నిర్వహిస్తాం. ప్రొమెట్రిక్ నుంచి టీసీఎస్కు ఆన్లైన్ టెస్టింగ్ బాధ్యతలు అప్పగించడానికి కారణం? క్యాట్లో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్టింగ్ విధానానికి తొలుత ప్రొమెట్రిక్తో ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ ఒప్పందం గత ఏడాది ముగియడంతో కొత్తగా బిడ్లు స్వీకరించి.. వాటిలోంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ను ఎంపిక చేశాం. ఆన్లైన్ టెస్టింగ్ ప్రక్రియ ప్రారంభించాక ప్రతిఏటా అభ్యర్థుల సంఖ్యలో తగ్గుదల కనిపించడానికి కారణం? దీనికి ప్రత్యేక కారణాలను విశ్లేషించలేం. అయితే అభ్యర్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు కంప్యూటర్ లిటరసీ విషయంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దాంతో ఆన్లైన్ టెస్టింగ్ విషయంలో భయపడుతున్నారు. అదేవిధంగా గత కొన్నేళ్లుగా విద్యార్థుల దృక్పథంలో మార్పు వచ్చింది. మేనేజ్మెంట్తోపాటు తమ కోర్ సబ్జెక్ట్లలో ఉన్నత విద్యను ఆశించే వారి సంఖ్య పెరగడం కూడా కారణం కావొచ్చు. గతేడాది క్యాట్కు ఎలాంటి ఆదరణ లభించింది? ముఖ్యంగా మహిళా అభ్యర్థుల నుంచి ఆసక్తి ఎలా ఉంది? దరఖాస్తుల పరంగా దాదాపు రెండు లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ పరీక్షకు హాజరైంది మాత్రం 1.74 లక్షల మంది మాత్రమే. మహిళా అభ్యర్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. క్యాట్-2013లో యాభై వేలకు పైగా మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. క్యాట్-2012తో పోల్చితే ఇది 12 శాతం ఎక్కువ. టెక్నికల్ నేపథ్యం ఉన్నవారికే క్యాట్ అనుకూలమనే వాదనలపై మీ అభిప్రాయం? ఇది వాస్తవం కాదు. ఆన్లైన్ టెస్ట్లో ఎలాంటి స్లాట్లో అయినా ప్రశ్నల క్లిష్టత స్థాయి ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. రెండు సెక్షన్లుగా నిర్వహించే క్యాట్లో అన్ని నేపథ్యాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రశ్నల రూపకల్పన జరుగుతుంది. అయితే దరఖాస్తుల సంఖ్య.. హాజరైన వారి సంఖ్య పరంగా విజేతల్లో ఎక్కువ మంది టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న విద్యార్థులు కనిపిస్తున్నారు. క్యాట్-2013లో నాన్-టెక్నికల్ విద్యార్థుల శాతం 23కు పెరిగింది. 2012తో పోల్చితే అయిదు నుంచి ఆరు శాతం పెరుగుదల నమోదైంది. క్యాట్-2014లో మార్పులు, టెస్ట్ సెంటర్ల పెంపుపై తీసుకున్న నిర్ణయాలు? వీటి గురించి ఇంకా నిర్ణయించలేదు. టెస్ట్ ప్యాట్రన్ గత ఏడాది మాదిరిగానే ఉంటుంది. ఇక.. టెస్ట్ సెంటర్లు పెరిగే అవకాశాలున్నాయి. విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతిఏటా టెస్ట్ సెంటర్లను పెంచుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా అది పునరావృతం కావొచ్చు. క్యాట్-2014 పూర్తి క్యాలెండర్ను ఎప్పుడు ప్రకటిస్తారు? ఈ ఏడాది రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూలైలో ప్రారంభించాలని యోచిస్తున్నాం. జూన్ రెండో వారంలో పూర్తిగా స్పష్టమైన క్యాలెండర్ను ప్రకటిస్తాం. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆన్లైన్ టెస్ట్ ప్రక్రియ పూర్తి చేయాలని అనుకుంటున్నాం. క్యాట్ ఔత్సాహిక అభ్యర్థులకు మీరిచ్చే సలహా? క్యాట్ ప్యాట్రన్, ప్రశ్నల శైలి పరిశీలనలోకి తీసుకుని.. అభ్యర్థులు బేసిక్ ఫండమెంటల్స్పై పట్టు సాధించాలి. ప్రతి ఐఐఎం నిష్ణాతులైన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేసుకోవాలని ఆశిస్తుంది. అందుకే క్యాట్ స్కోర్కు అదనంగా ప్రతి ఐఐఎం ప్రత్యేకంగా మలి దశలో గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ/రిటెన్ ఎబిలిటీ టెస్ట్ వంటివి నిర్వహిస్తుంది. కాబట్టి అభ్యర్థులు క్యాట్లో మంచి స్కోర్తోపాటు వీటిలోనూ విజేతగా నిలవడానికి కృషి చేయాలి. వీటన్నిటికంటే ముఖ్యమైంది మానసిక సన్నద్ధత. క్యాట్ అంటే క్లిష్టం అనే అపోహను వీడి.. సాధించాలి అనే లక్ష్యంతో ఉండాలి.