-
Viral Video: ప్రమాద ఘంటికలు.. అంటార్కిటికాలో విరిగిపడ్డ హిమానీనదం
గ్లోబల్ వార్మింగ్ తాలూకు ప్రమాద ఘంటికలు నానాటికీ తీవ్రస్థాయికి పెరుగుతున్నాయి. మంచు ఖండం అంటార్కిటికాలో వేడి దెబ్బకు విలియం అనే భారీ హిమానీ నదం వేలాది ముక్కలుగా విడిపోయింది. దాంతో మొత్తంగా 10 ఫుట్బాల్ మైదానాలంత పరిమాణంలో మంచు పలకలు విరిగిపడ్డాయి. ఆ ధాటికి సముద్రపు లోతుల్లో ఏకంగా సునామీ చెలరేగిందట! ఆ సమయంలో యాదృచ్ఛికంగా అక్కడున్న బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే నౌక ఆర్ఆర్ఎస్ జేమ్స్ క్లార్క్ రాస్కు చెందిన పరిశోధకులు దీన్ని కళ్లారా చూసి వీడియో తీశారు. అదిప్పుడు వైరల్గా మారింది. ఈ హిమానీ నదం ముందుభాగం సముద్ర మట్టానికి ఏకంగా 40 మీటర్ల ఎత్తుంటుంది. అది విసురుగా విడిపోవడంతో 78 వేల చదరపు మీటర్ల పరిమాణంలో మంచు సముద్రంలోకి చెల్లాచెదురుగా కొట్టుకుపోయింది. ఆ దెబ్బకు సముద్రంలో లోలోతుల దాకా నీరు గోరువెచ్చగా మారిపోయిందట. అప్పటిదాకా 50 నుంచి 100 మీటర్ల లోతు దాకా చల్లని నీరు, ఆ దిగువన గోరువెచ్చని నీటి పొర ఉండేదట. ‘‘హిమానీ నదాలు ఇలా విరిగిపడటం వల్ల సముద్రపు ఉపరితలాల్లో పెను అలలు రావడం పరిపాటి. కానీ అవి అంతర్గత సునామీకీ దారి తీయడం ఆసక్తికరం. ఇలాంటి సునామీలు సముద్ర ఉష్ణోగ్రతలు, అందులోని జీవ వ్యవస్థ తదితరాలపై పెను ప్రభావం చూపుతాయి. లోతుగా పరిశోధన జరగాల్సిన అంశమిది’’ అని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. ఈ పరిశోధన ఫలితాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్లో ప్రచురించారు. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా చిక్కిపోతున్న వైనం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. -
మంచు ఖండం అంటార్కిటికాలో పాగా వేసేందుకు అర్జెంటీనా, చిలీ మాస్టర్ ప్లాన్..!
అంటార్కిటికా అంటేనే మంచు ఖండం.. మైనస్ ఉష్ణోగ్రతలు.. కాసేపు బయట ఉంటే మనుషులూ గడ్డకట్టుకుపోయేంత దుర్భర వాతావరణం. అలాంటి అంటార్కిటికాలో ఇప్పటివరకు 11 మంది పిల్లలు పుట్టారు. భేషుగ్గా బతికేస్తున్నారు. ఇదేం చిత్రం అనిపిస్తోందా.. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సంగతులు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఉన్నవి పరిశోధనా కేంద్రాలే.. భూమ్మీద అన్ని ఖండాలు మనుషులతో నిండి ఉన్నా.. ఒక్క అంటార్కిటికాలో ఎలాంటి శాశ్వత నివాసాల్లేవు. కొన్నిదేశాలు వివిధ పరిశోధనలు, వనరుల అన్వేషణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. క్లిష్టమైన వాతావరణం కారణంగా.. ఈ కేంద్రాల్లో ఉండే శాస్త్రవేత్తలు, సిబ్బంది కూడా కొంతకాలానికే తిరిగి వచ్చేస్తుంటారు. వేరే వాళ్లు వెళ్తుంటారు. అంతేతప్ప అంటార్కిటికాలో మానవ శాశ్వత నివాసాలేమీ లేవు. అంటార్కిటికా తమదేనంటూ.. నిజానికి అంటార్కిటికా ఖండం ఏ దేశానికీ చెందినది కాదు. కానీ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్, నార్వే, యూకే వంటి పలు దేశాలు అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలను తమవేనంటూ వాటికవే ప్రకటించుకున్నాయి. దీనికి అంతర్జాతీయ గుర్తింపు ఏమీ లేదు. మంచు ఖండంలోని ఏ ప్రాంతంలోకి ఏ దేశమైనా వెళ్లి పరిశోధనా కేంద్రాలు పెట్టుకోవచ్చు. శాస్త్రవేత్తలు, సిబ్బంది వెళ్లవచ్చు. అయినా కొన్ని దేశాలు వెనక్కి తగ్గలేదు. మిగతా దేశాలతో పోలిస్తే మంచు ఖండానికి దగ్గరగా ఉన్న చిలీ, అర్జెంటీనా, యూకేలు (ఫాక్లాండ్ దీవులు) అంటార్కిటికాపై ఎక్కువ దృష్టిపెట్టాయి. ఈ మూడు దేశాలు తమదిగా ప్రకటించుకున్న ప్రాంతం చాలావరకు ఒకటే కావడంతో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు జరిగాయి. ఇద్దరి ‘పోరు’తో.. 1970వ దశకంలో అర్జెంటీనా పాలకుడు జార్జ్ రఫీల్ విడెలా, చిలీ అధినేత అగస్టో పినోచెట్ ఇద్దరూ అంటార్కిటికాలోని ప్రాంతాలపై ఆధిపత్యం కోసం పోటాపోటీగా ప్రయత్నించారు. అంటార్కిటికాలో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుని, జీవించడం చాలా కష్టం. అందుకే తెలివిగా చిత్రమైన ప్లాన్ వేశారు. తమ పౌరులు జన్మించిన ప్రాంతం తమదేనని చెప్పుకొనేందుకు వీలవుతుందని భావించారు. ఇందుకోసం అంటార్కిటికాలో తమ దేశవాసులు పిల్లల్ని కనే ఏర్పాట్లు చేశారు. క్లిష్టమైనా.. అంతా సేఫ్.. అంటార్కిటికాలో అసలే అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు. రాకపోకలు చాలా కష్టం.. డెలివరీ సమయంలో ఏదైనా తేడా వస్తే అవసరమైన వైద్య సదుపాయాలూ ఉండవు. అయినా ఆ ఖండంపై ప్రసవాలన్నీ సురక్షితంగా జరగడం, పుట్టిన 11 మంది శిశువులు ఆరోగ్యంగా తమ ప్రాంతాలకు వెళ్లిపోవడం గమనార్హం. 1978 జనవరిలో ‘తొలి’ జననం! 1977 మొదట్లో చిలీ అధినేత పినోచెట్ అంటార్కిటికాలో ఏర్పాటు చేసిన తమ దేశ పరిశోధన కేంద్రానికి అధికారిక పర్యటన నిర్వహించి.. ఆయా ప్రాంతాలు తమవేనని ప్రకటించారు. ►మరోవైపు అర్జెంటీనా అదే ఏడాది చివరిలో సిల్వియా మొరెల్లో డి పాల్మా అనే ఏడు నెలల గర్భిణిని అంటార్కిటికాలోని తమ ఎస్పరాంజా బేస్కు పంపింది. ఆమె 1978 జనవరి 7న ప్రసవించింది. ఇదే అంటార్కిటికా ఖండంలో తొలి శిశువు జననం. ►చిలీ అయితే మరో అడుగు ముందుకేసి కొత్తగా పెళ్లయిన జంటను అంటార్కిటికాలోని తమ బేస్కు పంపింది. వారు అక్కడే కాపురం చేసి, పిల్లలను కన్నారు. ►తర్వాత కూడా ఇది కొనసాగింది. ఇరుదేశాలు పెళ్లయిన జంటలు, గర్భిణులను అంటార్కిటికాలోని తమ బేస్లకు తరలించాయి. ఇలా కొన్నేళ్లలో మొత్తంగా 11 మంది అంటార్కిటికాలో పుట్టారు. ►అయితే అర్జెంటీనా, చిలీల ప్రయత్నాలను ప్రపంచ దేశాలు తప్పుపట్టడం, మంచు ఖండంపై ఏ దేశానికీ హక్కులు ఉండవని స్పష్టం చేయడంతో ఇది ఆగిపోయింది. ఆ తర్వాత ఏ దేశం కూడా అంటార్కిటికాలో ఇలా పిల్లలను కనేలా చేయడం వంటి ప్రయత్నాలు చేయలేదు. -
కడలి కబళిస్తోంది!
- ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు - 1901–2010 మధ్య 19 సెంటీమీటర్లు పెరుగుదల - 2100 నాటికి మీటరు నుంచి 7 మీటర్లకు పెరిగే అవకాశం - భారత్ సహా చాలా దేశాల్లో తీర ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం అలలు అలలుగా ఎగసిపడే సాగర కెరటాలు నెమ్మదిగా భూమిని కబళిస్తున్నాయి. భూవాతావణం వేడెక్కేకొద్దీ ఏటికేడు సముద్ర మట్టం పెరిగిపోతూ తీర ప్రాంతాలకు ముప్పు ముంచుకొస్తోంది. 1901 నుండి ఇప్పటివరకూ దాదాపు 20 సెంటీమీటర్ల మేర సముద్ర మట్టం పెరిగినట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఇటీవల ఈ పెరుగుదల వేగం బాగా పెరిగిందని చెబుతున్నారు. 2100 సంవత్సరం నాటికి సముద్ర మట్టం ఒక అడుగు నుంచి ఒక మీటరు వరకూ పెరగవచ్చని.. అదే ధ్రువప్రాంతాల్లోని మంచుదుప్పటి కరిగితే ఏడు మీటర్ల వరకూ కూడా పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే చాలా దేశాల్లో తీర ప్రాంతాలన్నీ సముద్రంలో మునిగిపోతాయని చెబుతున్నారు. సుదీర్ఘ తీరం ఉన్న భారతదేశానికి, ఇందులోనూ లోతట్టు ప్రాంతమైన తూర్పు తీర ప్రాంతానికి ఎక్కువ ముప్పు పొంచి ఉందని స్పష్టం చేస్తున్నారు. 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ఎలా ఉంటాయి, ఎంత మేర పెరుగుతాయి, దాని పర్యవసానాలేమిటనే అంశాలపై ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఆ అధ్యయనాలు, పరిశోధనలపై ఈ వారం సాక్షి ‘ఫోకస్’.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ సాధారణంగా సముద్ర మట్టాలు స్థిరంగా ఉంటాయని భావిస్తుంటాం. కానీ భూమి చరిత్రను చూస్తే సముద్ర మట్టాల్లో పెనుమార్పులు సంభవించిన విషయం స్పష్టమవుతోంది. భూగోళం దాదాపు లక్ష సంవత్సరాల విరామాలతో మంచు యుగం నుంచి మంచు యుగానికి పయనిస్తూ ఉంది. మధ్యలో ఉష్ణకాలం వస్తూంటుంది. అయితే చివరి మంచు యుగం పతాకస్థాయిలో ఉన్నపుడు ఉత్తర అమెరికా ఖండంలో అత్యధిక భాగం మంచుతోనే నిండి ఉండేది. అప్పుడు సముద్ర మట్టం ఇప్పటికన్నా 400 అడుగులు తక్కువగా ఉండేది. ప్రస్తుతం మనం మంచు యుగాల మధ్య ఉష్ణకాలంలో ఉన్నాం. అంటే.. ఇప్పుడు సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతూపోతాయి. ఆ తర్వాత మళ్లీ తగ్గడం మొదలవుతాయి. కానీ మానవ కల్పిత వాతావరణ మార్పులు ఈ చక్రాన్ని మారుస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో సముద్ర మట్టాల్లో మార్పులు చాలా నెమ్మదిగా సంభవించేవని, కొన్ని వేల ఏళ్లు పట్టేవని.. కానీ ఇప్పుడు భూతాపం పెరుగుతుండటం సముద్ర మట్టాలు వేగంగా పెరగడానికి కారణమవుతోందని అంటున్నారు. శరవేగంగా పెరుగుతున్న మట్టాలు భూతాపం పెరిగి ధ్రువాల్లో మంచు దుప్పటి కరిగిపోతుండడం, వాతావరణం వేడెక్కడం వల్ల సముద్ర జలాలు కూడా వేడెక్కి వ్యాకోచించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లేసియర్లు కరుగుతుండటం వంటి పరిణామాల వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. 1901–2010 సంవత్సరాల మధ్య ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం సగటున 19 సెంటీమీటర్ల మేర పెరిగినట్లు వాతావరణ మార్పులపై ప్రపంచ సంఘం (ఐపీసీసీ) ఐదో అంచనా నివేదిక ఇటీవల వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం 1901–2010 మధ్య ఏటా సగటున 1.7 మిల్లీమీటర్ల చొప్పున సముద్ర మట్టం పెరిగినట్లు అంచనా. అయితే 1971–1993 మధ్య ఈ పెరుగుదల సగటున ఏడాదికి 2.0 మిల్లీమీటర్లుగా ఉండగా.. 1993–2010 మధ్య ఏడాదికి 3.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఈ లెక్కన గత రెండు దశాబ్దాల్లో సముద్ర మట్టం వేగంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అలల కొలతల నివేదికలు, ఉపగ్రహాల ద్వారా పరిశీలనతో ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇక ఇతర సముద్రాలతో పోలిస్తే 2003 నుంచి ఉత్తర హిందూ మహాసముద్ర మట్టం రెండు రెట్లు ఎక్కువగా పెరిగిందని జర్నల్ ఆఫ్ జియోఫిజికల్ రీసెర్చ్ మేగజైన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. అంతకుముందు దశాబ్దకాలంలో ఇక్కడి సముద్ర మట్టం పెరుగుదల చాలా తక్కువగా ఉంది. ఉపగ్రహాల ద్వారా రెండున్నర దశాబ్దాల పాటు సేకరించిన సముద్ర ఉపరితల కొలతల సమాచారాన్ని విశ్లేషించి యూనివర్సిటీ ఆఫ్ హవాయి సీలెవల్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల ఇప్పటికే బంగ్లాదేశ్లో నాలుగో వంతు భూభాగం నీట మునిగింది. చైనా, ఫిలిప్పీన్స్ దేశాల్లో పలు తీరప్రాంతాలూ మునిగాయి. ఇక మన దేశంలోని పశ్చిమ బెంగాల్లో కోల్కతా వద్ద రివర్ డెల్టా సుందర్బన్ మడ అడవులు నీటి మునిగిపోయాయి. భూతాపం 2 డిగ్రీలు పెరిగినట్టయితే సముద్ర మట్టం 4.7 మీటర్లకు.. 4 డిగ్రీలు పెరిగితే 9 మీటర్ల వరకు పెరిగే అవకాశముంది. 2050 నాటికి 4 కోట్ల మందికి ముప్పు ఈ శతాబ్దం చివరి నాటికి.. అంటే 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం కనిష్టంగా 28 సెంటీమీటర్ల నుంచి గరిష్టంగా 98 సెంటీమీటర్ల వరకూ పెరగవచ్చని ఐపీసీసీ అంచనా. గ్రీన్ల్యాండ్ మంచు దుప్పటి పూర్తిగా కరిగినట్లయితే సముద్ర మట్టం ఏకంగా 7 మీటర్లు పెరుగుతుంది. అదే జరిగితే లండన్ నగరం సముద్రంలో మునిగిపోతుంది. సముద్ర మట్టం ఒక మీటరు పెరిగితే భారత తీరంలో 13,973 చదరపు కిలోమీటర్ల భూభాగం సముద్రంలో మునిగిపోతుందని అంచనా.. అదే నీటిమట్టం ఆరు మీటర్లు పెరిగితే 60,497 చదరపు కిలోమీటర్ల భూమి సముద్రం పాలవుతుందని ఇటీవల జర్నల్ ఆఫ్ త్రెటెన్డ్ టాక్సా మేగజైన్లో ప్రచురించిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఆ అధ్యయనం ప్రకారం.. సముద్ర మట్టం ఒక మీటరు మేర పెరిగితే అంధ్రప్రదేశ్లోని గోదావరి, కృష్ణా మడ అడవుల ప్రాంతం ముప్పావు భాగానికి పైగా మునిగిపోతుంది. పశ్చిమబెంగాల్లోని సుందర్బన్ వనాలు సగానికిపైగా మునిగిపోతాయి. సముద్ర మట్టం ఆరు మీటర్లకు పైగా పెరిగితే గోదావరి, కృష్ణా మడ అడవులు, సుందర్బన్ అడవులతో పాటు గుజరాత్లోని రాణ్ ఆఫ్ కచ్ చిత్తడి నేలలు సగానికి పైగా సముద్ర గర్భంలో చేరుతాయి. చిల్కా సరస్సు, పులికాట్ సరస్సు సహా ఏడు రక్షిత ప్రాంతాలు సగానికి పైగా నీట మునుగుతాయి. సముద్రమట్టం పెరుగుదల వల్ల 2050 నాటికి భారత దేశంలో 4 కోట్ల మంది జనాభాకు ముప్పుగా పరిణమిస్తుందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక గతేడాది హెచ్చరించింది కూడా. ముఖ్యంగా ముంబై, కోల్కతా నగరాల ప్రజలకు ముంపు ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది. తూర్పు తీరానికే ముప్పు ఎక్కువ భారతదేశంపై సముద్ర మట్టం పెరుగుదల ప్రభావంపై ఇటీవల రాజ్యసభలో ఒక సభ్యుడు ప్రశ్నించగా.. కేంద్ర భూగోళశాస్త్రాల శాఖ మంత్రి జవాబిచ్చారు. ఈ అంశంపై అనేక అధ్యయనాలు నిర్వహిస్తున్నామని.. సముద్ర మట్టం పెరుగుదల ప్రభావం పశ్చిమ తీరం కన్నా.. లోతట్టు ప్రాంతంలో ఉన్న తూర్పు తీరం మీద ఎక్కువగా ఉంటుందని చెప్పారు. తీర ప్రాంతాలు వరద ముంపునకు గురవడం పెరుగుతోందని పేర్కొన్నారు. గత పాతికేళ్ల అధ్యయనం ప్రకారం భారత తీర ప్రాంతం కోతకు గురయ్యే స్వభావం 38.5 శాతంగా ఉందని వెల్లడించారు. ఈ కోతను అరికట్టడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని, కేంద్రం సాంకేతిక సహకారం అందిస్తోందని వివరించారు. వందేళ్లలో విశాఖ సగం మునుగుతుంది! ఇక రాబోయే వందేళ్లలో మన దేశంలోని కోల్కతా, ముంబై, కొచ్చి, విశాఖపట్నం తదితర తీర ప్రాంత నగరాలు సముద్రంలో మునిగిపోయే అవకాశముందని వాతావరణ, సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భారత తీర ప్రాంతాల్లోని పెద్ద నగరాల్లో ఒకటైన కోల్కతా వద్ద సముద్ర మట్టం వేగంగా పెరుగుతోంది. అక్కడ ఏటా సగటు సముద్ర మట్టం పెరుగుదల 5.74 మిల్లీమీటర్లుగా నమోదైంది. దాని తర్వాతి స్థానంలో కొచ్చి ఉంది. ఇక్కడ సముద్ర మట్టం ఏటా 1.75 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతోంది. ఇక ముంబై వద్ద 1.25 మిల్లీమీటర్ల చొప్పున, ఆంధ్రప్రదేశ్లోని తీర నగరం విశాఖపట్నంలో 1.09 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతోంది. దేశంలో సముద్ర ముంపు ప్రమాదమున్న నాలుగో నగరం విశాఖ పట్నమే కావడం గమనార్హం. మొత్తంగా భారతదేశపు సముద్ర మట్టాలు ఏటా సగటున 1.30 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతున్నాయి. సముద్రమట్టం పెరగడానికి కారణాలేమిటి..? కరుగుతున్న మంచు ఖండాలు భూగోళం ఉష్ణోగ్రత పెరగడాన్ని భూతాపం (గ్లోబల్ వార్మింగ్)గా అభివర్ణిస్తున్నారు. భూగోళం ఉష్ణోగ్రత పారిశ్రామీకరణ ముందు నాటికన్నా ఇప్పడు ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగింది. దీనివల్ల ధ్రువ ప్రాంతాల్లోని మంచు ఖండాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న గ్లేసియర్లు కరుగుతూ ఆ నీరు సముద్రాల్లోకి వచ్చి చేరుతోంది. వాతావరణంలో కర్బన శాతం పెరగడం ఇదే రీతిలోనే కొనసాగితే.. ప్రస్తుతం 14.5 డిగ్రీల సెల్సియస్గా ఉన్న సగటు ఉష్ణోగ్రత కొన్నేళ్లలో 27 డిగ్రీల సెల్సియస్కు పెరిగే అవకాశం ఉంది. దానివల్ల భూమి మీద ఉన్న మంచు మొత్తం కరిగిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే భూమి మీదున్న మంచు అంతా కరిగిపోవడానికి మరో ఐదు వేల సంవత్సరాల సమయం పడుతుందని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేడెక్కుతున్న సముద్ర జలాలు ఇంట్లో పొయ్యి మీద కాచే నీళ్లు మరుగుతున్నప్పుడు అవి పైకి ఉబికిరావడం మనకు తెలుసు. అలాగే భూ వాతావరణం వేడెక్కడం వల్ల సముద్ర జలాలు కూడా వేడెక్కుతున్నాయి. వాతావరణ మార్పు వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలో 90 శాతాన్ని సముద్ర జలాలే స్వీకరిస్తున్నాయి. ఫలితంగా సముద్ర జలాలు వ్యాకోచించి.. నీటిమట్టం పెరుగుతోంది. సముద్ర మట్టాల పెరుగుదలలో మూడో వంతు కారణం ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనినే ‘థర్మల్ ఎక్స్పాన్షన్’అని వ్యవహరిస్తున్నారు. దేశాలకు దేశాలే మాయమవుతాయి భూమిపై ఉన్న మంచు మొత్తం కరిగితే చాలా దేశాల రూపురేఖలు మారిపోతాయి. కొన్ని దేశాలకు దేశాలే మునిగిపోతాయి. ఇక సముద్రాల మధ్య ఉండే ద్వీప దేశాలైతే పూర్తిగా నీటిపాలవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మంచు అంతా కరిగి సముద్ర మట్టం పెరిగితే వివిధ ఖండాల రూపురేఖలు ఎలా మారతాయో అంచనాలతో మ్యాపులు తయారు చేశారు. అందులో ఆసియా ఖండం మ్యాపు ఇది. దీని ప్రకారం.. చైనాలో అరవై కోట్ల మంది నివసించే ప్రాంతం నీట మునుగుతుంది. 16 కోట్ల మంది జనాభా గల బంగ్లాదేశ్ మొత్తం సముద్ర గర్భంగా మారుతుంది. భారత తీర ప్రాంతాన్ని చాలా వరకూ సముద్రం కబళిస్తుంది. గుజరాత్ సగమే మిగులుతుంది. అది కూడా ఒక దీవిగా మారిపోతుంది. పశ్చిమ తీరం కన్నా తూర్పు తీరం ఎక్కువగా మునిగిపోతుంది. కోల్కతా నుంచి కన్యాకుమారి వరకూ చాలా తీర ప్రాంతం అదృశ్యమవుతుంది. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు చాలా వరకూ నీటిపాలవుతాయి. భూమి కూడా నిస్సారమవుతుంది చివరి మంచు యుగం పది వేల ఏళ్ల కింద ముగిసింది. అప్పట్లో సముద్ర మట్టాలు పెరగడం మొదలైనపుడు భూమి మీద కేవలం 50 లక్షల మంది మనుషులు మాత్రమే ఉన్నారు. వాళ్లు సముద్ర తీరాల వెంట భారీ నగరాల్లో నివసించలేదు. కాబట్టి సముద్ర మట్టాల పెరుగుదల ఇంతవరకు మానవాళి మీద తీవ్ర ప్రతికూల ప్రభావమేమీ చూపలేదు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాల్లో భారీ నగరాలు నిర్మితమయ్యాయి. కోట్లాది మంది తీర ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. సముద్ర మట్టం నాలుగు అడుగులు పెరిగితే ఒక్క భారతదేశంలోనే 50 వేల మందికిపైగా జీవితాలు ముంపు బారిన పడతాయి. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల తీర ప్రాంతాలు మునగడమే కాదు.. తుఫానులు భూభాగంలోకి మరింత దూరం చొచ్చుకురావడం, తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న సారవంతమైన పంట భూముల కిందకు ఉప్పు నీరు చేరి అవి నిరుపయోగంగా మారడం వంటి పరిణామాలూ సంభవిస్తాయి. నివారించడానికి ఏం చేయాలి? ఇప్పటికే భారీ మొత్తంలో కర్బన వాయువులు వాతావరణంలో చేరిపోయాయి. వాటిని తగ్గించడం దాదాపు అసాధ్యం. ప్రస్తుత పారిశ్రామిక రంగం పరిస్థితులను బట్టి ఆ వాయువులు ఇంకా పెరగడం ఖాయం. అంటే మున్ముందు మంచు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం అనివార్యం. అయితే ఈ పెరుగుదల వేగాన్ని తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముఖ్యంగా భూతాపం పెరగకుండా చర్యలు చేపట్టాలి. వాతావరణంలో కర్బన వాయువుల విడుదలను తగ్గించాలి. అడవులు, చెట్లు విరివిగా పెంచాలి. పారిశ్రామిక వ్యర్థాల వల్ల సముద్రంలో సైటో ప్లాంగ్టన్ మొక్కలు చనిపోకుండా చూడాలి. ఉన్న మంచు అంతా కరిగిపోతే..? భూమి మీద ప్రస్తుతం దాదాపు యాభై లక్షల ఘనపు మైళ్ల మంచు ఉంది. అందులో అత్యధికంగా అంటార్కిటికా, గ్రీన్లాండ్లలోనే ఉంది. అది మొత్తం కరిగిపోతే సముద్ర మట్టాలు 230 అడుగుల మేర పెరుగుతాయని అంచనా. భారతదేశం కన్నా రెట్టింపు ఉన్న అంటార్కిటికా ఖండం మొత్తాన్ని ఒక మైలు మందం ఉన్న మంచు దుప్పటి కప్పి ఉంది. అది కరిగితే సముద్ర మట్టం ఏకంగా 200 అడుగులు పెరుగుతుంది. అయితే అంటార్కిటికా ఖండంలోని చాలా మంచు ప్రస్తుతానికి స్థిరంగానే ఉన్నప్పటికీ.. పశ్చిమ అంటార్కిటికా మంచు దుప్పటి కూలిపోయే దశకు చేరుకుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కరిగి సముద్రంలో కలిస్తే సముద్ర మట్టం 11 అడుగులు పెరుగుతుందని అంచనా. ఇక గ్రీన్లాండ్లో విస్తరించి ఉన్న మంచు అంతా కరిగితే 23 అడుగుల మేర సముద్ర మట్టం పెరుగుతుంది. ఇది వేగంగా కరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. అంటార్కిటికా, గ్రీన్లాండ్లలో కాకుండా మిగతా మంచు అంతా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గల గ్లేసియర్లు, మంచు కొండల్లో ఉంది. భూతాపం పెరుగుతున్న కొద్దీ ఆ మంచు కూడా వేగంగా కరుగుతోంది. దాంతో చాలా దేశాల సముద్ర తీర ప్రాంతాలు మునిగిపోతాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement