breaking news
hindu darmam
-
పవన్కు ఇది తగునా?
పవన్ కల్యాణ్కు ‘మెకాలే’ తెలుసు. పద్దెనిమిదవ శతా బ్దంలో మెకాలే ఏమి చెప్పాడో కూడా తనకి తెలుసు. ఇన్ని తెలిసిన పవన్ కల్యాణ్కు ఇరవయ్యొకటో శతాబ్దంలో తాను ఏమి చెప్ప కూడదో తెలియకపోవడం మాత్రం విచారకరం!నిజానికి పవన్కి తెలుసో లేదో గానీ, లేదా అతను ఏ అర్థంలో వాడాడో గానీ – ‘సాంస్కృతిక సామ్రాజ్య వాదం’ అనే పద ప్రయోగం మెకాలే నాటికి లేదు. 1960ల నాటిది. హెర్బర్ట్ షిల్లెర్ దాన్ని (మొదటిగా కాకపోయినా) వివరించాడు.ఒకవేళ విదేశీ పాలకులు తమ పరిపాలనను స్థిరపరచుకోడానికి తమ భాషను, ఆచారాల్ని, సంప్ర దాయాల్ని తెచ్చి బలవంతంగా మన మీద రుద్దే ప్రయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడాడు అనుకున్నా అది పూర్తిగా మెకాలేకి వర్తించక పోవచ్చు. సరే మన చర్చ మెకాలేది కాదు. వదిలేద్దాం. మెకాలేది గతం. పవన్ది వర్తమానం. అతనొక బ్రిటిష్ హిస్టోరియన్. బ్రిటిష్ భాష, బ్రిటిష్ సంస్కృతి, శిక్షా స్మృతి – ఇంకా అనేక బ్రిటిష్ పరంపరల బానిస మెకాలే. బ్రిటిష్ ఉద్యోగి. బ్రిటిష్ పౌరుడు మెకాలే. కాబట్టి ఆ యూరోపియన్ సంస్కృతి గొప్పదనాన్ని మన మీద రుద్దాలని చూశాడనుకుందాము. పవన్ చెప్పినట్లు అతనిది ‘సాంస్కృతిక సామ్రాజ్యవాదమే’ అనుకొందాము. మరి ఇప్పుడు పవన్ మాట్లాడుతున్నది ఏమిటి? దీన్ని ఏమంటారు?అన్ని మతాల, అన్ని కులాల ఓట్లతో గెలిచి,అందరి ప్రతినిధిగా ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడతానని ప్రమాణం చేసి, ఇప్పుడు ‘వారాహి’ సభలో ‘సనాతన ధర్మాన్ని కాపాడతానని, నేను ముమ్మాటికీ హిందువునేనని, దాని కోసం ప్రాణాలైనా అర్పిస్తానని’ చెప్పడం చూస్తుంటే పవన్ ఒక ‘హిందూ సాంస్కృతిక సామ్రాజ్యవాది’గా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ‘అల్లాను, మహమ్మద్ ప్రవక్తను, క్రీస్తును విమర్శిస్తే ఒప్పుకుంటారా’ అంటూ ఒక హిందూ ఉగ్రవాదిగా కూడా మాట్లాడుతున్నారు. గెలవకముందు ‘నాకు కులం లేదు, మతం లేదు; నేను దేశాన్నీ, జాతినీ ప్రేమిస్తాను’ అని చెప్పి, గెలిచాక ‘నేను హిందువుని, సనాతన ధర్మాన్ని ఆరాధి స్తాను’ అని చెప్పడం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండు నాల్కల ధోరణిని బయట పెడుతుంది.‘నేను హిందువు’ని అని స్కూల్ సర్టిఫికెట్లో చెప్పినట్లుగా, ‘వారాహి సభ’లో కూడా చెప్పడమేనా? చేగువేరా, భగత్ సింగ్ పుస్తకాలు చదివి నేర్చుకున్నది ఇదేనా? మనం ఏదైనా చెబితే ఒక వంద మంది వింటారు. కానీ అదే పవన్ చెబితే లక్ష మంది వింటారు. అలాంటి పాపులారిటీ వున్న పవన్ ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవచ్చునా? విశ్వనాథ సత్యనారాయణకు రామాయణం అనేది ఒక ‘కల్పవృక్షం’గా కనిపించింది. అదే రామా యణం రంగనాయకమ్మకు ‘విషవృక్షం’గా అనిపించింది. అయ్యప్పను గద్దర్ విమర్శించాడు. అయ్యప్ప పుట్టుక మీద, అతని భక్తుల దీక్ష మీద గద్దర్కి వున్న విమర్శ అది.సనాతన ధర్మం మీద, రాముని మీద ఈ రోజున పవన్ కల్యాణ్ చాలా ప్రేమను కురిపిస్తున్నాడు. అది అతని హక్కు. తమిళులకు ఏ రోజునా రాముడి మీద గౌరవం లేదు. సనాతన ధర్మం మీద ప్రేమ అంత కన్నా లేదు. అలా లేకపోవడానికి వారి కారణాలు వాళ్లకి ఉన్నాయి. ద్రవిడ సంస్కృతిలో రావణాసురు డికి వున్న చోటు రాముడికి లేదు. ఆ కోణంలో సనా తన ధర్మం అనేది ఉదయనిధి స్టాలిన్కి ఒక వైరస్ లాగా అనిపించి వుండవచ్చు.హిందూ దేవుళ్ళ మీద ఎలాగైతే విమర్శలు ఉన్నాయో, అలాగే క్రీస్తుని, అల్లాని, మహమ్మద్ ప్రవక్తని విమర్శించిన వాళ్ళూ ఉన్నారు. బైబిల్, ఖురాన్ల మీద రాసిన విమర్శలూ ఉన్నాయి. ఇదంతా ఏమీ చూడని పవన్ కల్యాణ్ అందర్నీ పట్టుకొని ‘సూడో సెక్యులరిస్టులు’ అని అంటున్నాడు.‘సనాతన ధర్మంలో అంటరానితనం వుంది.లింగ వివక్ష వుంది. అన్యాయం వుంది. అధర్మం వుంది’ అనుకున్న వాళ్ళు హిందూ మతం నుంచి వెళ్లిపోయారు. వేరే మతాల్లో చేరిపోయారు. దానికి కొన్ని వందల ఏళ్ళ చారిత్రక సందర్భం ఉంది. పవన్ ఇలా మాట్లాడటం వెనుక కూడా ఒక చారిత్రక సందర్భం ఉంది. జగన్ని ఒక సీటుకు పరి మితం చేయాలనుకోవడం ఆ సందర్భం కావచ్చు. లేదా తాను సీఎం కావడం భవిష్యత్తు సందర్భం కావచ్చు.జీవ శాస్త్రం ప్రకారం మనందరికీ ప్రాణం ఒక్కటే ఉంటుంది. ఆ ప్రాణాన్ని నిలుపుకోవడానికి చాలా అవసరాలూ, సందర్భాలూ ఉంటాయి. ప్రాణం పోవ డానికి, లేదా ఇచ్చేయడానికి మాత్రం ఒకే సందర్భం ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్కు మాత్రం చాలా ప్రాణాలు ఉంటాయి. అవి ఇచ్చేయడానికి కూడా చాలా సందర్భాలు ఉంటాయి.దేశం కోసం ఒకసారి ఇచ్చేస్తారు. భారత జాతి కోసం ఇంకోసారి ఇచ్చేస్తారు. చేగువేరా కోసం, భగత్ సింగ్ కోసం లేదా వారి ఆదర్శాల కోసం మరొకసారి ఇచ్చేస్తారు. జగన్ని ఓడించడానికో, లేదా కూటమిని గెలిపించడానికో కూడా ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు చివరగా సనాతన ధర్మాన్ని గెలిపించడానికి ఒక హిందువుగా ప్రాణాల్ని ఇచ్చేస్తానని చెబుతున్నారు.పవన్ కల్యాణ్ను ఒక హిందువుగా ఎంచి ఎవ్వరూ ఓట్లు వేయలేదు. సినిమా నటుడిగా, కాపు కులానికి చెందిన వాడిగా, కూటమిలో భాగస్థునిగా గెలిపించుకున్నారు. ఆ గెలిపించుకున్న వారంతా పవన్ గురించి ఇప్పుడు ఏమనుకోవాలి? తమను తాము హిందువుగా అనుకోని సమూహాలు ఈ దేశంలో చాలానే ఉన్నాయి. వారంతా ఇప్పుడు పవన్ గురించి ఏమనుకోవాలి?‘పవనిజం’ అంటే ఇదేనా? అలాంటప్పుడు దీన్ని ‘హిందూయిజం’ అని కదా అనాలి? దక్షిణ భారత మద్దతు కోసం ఉత్తర భారతాన్ని విమర్శించడం,ఆంధ్రా వారి మద్దతు కోసం తెలంగాణాను విమర్శించడం, తెలంగాణా వారి మద్దతు కోసం తెలంగాణను కీర్తించడం, ఇప్పుడు మళ్ళీ ఆర్యుల్ని కీర్తించడం కోసం ద్రావిడుల్ని విమర్శించడం! ఇలాంటి అవకాశ వాద రాజకీయాల ద్వారా పవన్ సాధించగలిగింది ఏముంటుంది?పవన్లో ఇప్పుడు చేగువేరా లేడు. భగత్ సింగ్ లేడు. థెరిస్సా లేరు. గద్దర్ కూడా లేడు (వీళ్లంతా నిజంగా ఉన్నారని కాదు). మోడీ మాత్రమే ఉన్నాడు!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త మానవ హక్కుల కార్యకర్తమొబైల్: 98494 49012 -
హిందూధర్మానికి ఉనికి ఆదిశంకరాచార్యులే..
సింహాచలం: హిందూ ధర్మానికి ఉనికి జగద్గురు ఆదిశంకరాచార్యులే అని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. శ్రీశారదాపీఠంలో ఐదురోజులుగా జరిగిన వార్షికోత్సవాలు మంగళవారం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన శాస్త్ర, శ్రౌతసభల్లో స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడారు. ఆచార్యుల పేరుతో మధ్వాచార్యులు, రామానుజాచార్యులు ప్రచారం పొందినా ప్రపంచవ్యాప్తంగా ఆదిశంకరాచార్యులే తెలుసని చెప్పారు. శంకరాచార్య తత్వాన్ని కాపాడుతున్న శాస్త్ర పండితులతో ఏటా వార్షికోత్సవాల్లో శాస్త్ర, శ్రౌతసభలు నిర్వహిస్తున్నామని, బిరుదులిచ్చి స్వర్ణకంకణధారణ చేస్తున్నామని తెలిపారు. హిందూధర్మం అంటే ఆలయాలు, అర్చనలే అని సామాన్యులు భావిస్తారని, కానీ శాస్త్రం ఉంటేనే హిందూధర్మం నిలుస్తుందని తమ పీఠం నమ్ముతుందని చెప్పారు. రాజశ్యామల యాగం అంటే వ్యాపారం కాదన్నారు. అంగదేవతలతో కూడిన హోమాలు ఇందులో ఉంటాయన్నారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరకు రాజశ్యామల కృపను పొందారని చెప్పారు. ఈ సందర్భంగా శాస్త్రసభలో ప్రతిభకనబరిచిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రికి వ్యాకరణ భాస్కర బిరుదు ప్రదానం చేసి స్వర్ణకంకణధారణ చేశారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో జరిగిన ఈ సభలో షట్శాస్త్ర పండితులు విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, చిర్రావూరి శ్రీరామశర్మ, ఓరుగంటి రామ్లాల్, మణిద్రావిడ శాస్త్రి, ఆర్.కృష్ణమూర్తి శాస్త్రి, ప్రముఖ శ్రౌత పండితులు దెందుకూరి రాఘవ ఘనాపాఠి పాల్గొన్నారు. ఆశీస్సులందుకున్న గవర్నర్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ల్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. వైభవంగా మహాపూర్ణాహుతి వైభవంగా జరిగిన రాజశ్యామలయాగం, శ్రీనివాస చతుర్వేద హవనం మహాపూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అదీప్రాజ్, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్బాబు, విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున, సీపీ శ్రీకాంత్, తెలంగాణకు చెందిన కంపెనీస్ లా ట్రిబ్యునల్ చైర్మన్ బదరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖ శారదాపీఠం చేస్తున్న ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాలు ఎంతో గొప్పవని చెప్పారు. -
హిందూధర్మంపై దాడులు అరికట్టాలి
రాజమహేంద్రవరం కల్చరల్ : హిందూధర్మంపై బహుముఖ దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టకపోతే హిందువుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని సమరసత సేవా ఫౌండేష¯ŒS ప్రాంత కార్యదర్శి రాంకుమార్ అన్నారు. సమరసత ఫౌండేషన్ జిల్లాశాఖ, సామాజిక సమరసత వేదిక, వికాస తరంగిణి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరంలోని రామానుజ కూటమిలో జిల్లాస్థాయి సదస్సు జరిగింది. రాం కుమార్ మాట్లాడుతూ అన్ని మండలాలలో ’ధర్మరక్షక్’ కార్యకర్తలను నియమిస్తామని, దేవాలయాలు ధర్మప్రచార కేంద్రాలుగా పనిచేయడానికి కృషి చేస్తామన్నారు. ప్రతి పల్లెలో, దళిత, గిరిజన వాడల్లో ఆలయాలు, భజన మందిరాలు నిర్మించుకోవాలని, భజన సంకీర్తన గురువులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి హిందువు తన ఇంటిపై హనుమద్ధ్వజం ఎగురవేయాలన్నారు. సమరసత ఫౌండేష¯ŒS ద్వారా జరిగే ఈ మహోద్యమంలో ప్రతిహిందువు భాగస్వామి కావాలని, ఫౌండేష¯ŒS ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. వివరాలకు హిందూ హెల్ప్లై¯ŒS టోల్ఫ్రీ నంబరు 1800 599 2399ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ప్రాంత సంయోజక్ శ్యాం ప్రసాద్, జిల్లా ధర్మ ప్రచారక్ కర్?ర శ్రీనివాసరావు, బండ్ల శంకర్ పాల్గొన్నారు.