కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి దెబ్బమీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే అధికారం కోల్పోయి.. పార్టీనేతల జంపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మమతాకి ఇప్పుడు మరో షాక్ తగిలింది. తాజాగా సిలిగిరి పోలీసు స్టేషన్లో హిందూ మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆమెపై కేసు నమోదైంది.
ప్రస్తుతం మమతా బెనర్టీ టైం బ్యాడ్ నడుస్తోంది.. అధికారం కోల్పోయిన రోజుల వ్యవధిలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వందలమంది కౌన్సిలర్లు టీఎంసీని వీడి బీజేపీలో చేరుతున్నట్లు సమచారం. ఇది చాలదన్నట్లు కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ కూడా గందరగోళంలో ఉంది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సంబంధించిన 17 ఆస్తులకు కూల్చివేత నోటీసులు జారీ కావడం, ఆయన రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరగడం ఇలా ఆమె చుట్టూ గందర గోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే మమతాకు మరో షాక్ తగిలింది.
గతేడాది కోల్కతాలో జరిగిన ఈద్ వేడుకల్లో మమతా బెనర్జీ సనాతన ధర్మాన్ని ఉద్దేశించి "గందా ధర్మ" (మురికి మతం) అని హిందూ ధర్మాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారని అడ్వకేట్ రింకీ ఛటర్జీ సింగ్ నిన్న (మంగళవారం) సిలిగురి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని పాటించే కోట్ల మంది ప్రజల మతపరమైన నమ్మకాలను తీవ్రంగా గాయపరిచాయని, సమాజంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మమతాపై (భారతీయ న్యాయ సంహిత - BNS) సెక్షన్ 351(1),సెక్షన్ 352: సెక్షన్ 353(2) లకింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రస్తుత బెంగాల్ సీఎం సువేందు అధికారి ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించారు. "మీరు ఏ మతాన్ని 'గందా ధర్మ' అన్నారు? సనాతన హిందూ ధర్మానా?" అని ఆయన ప్రశ్నించారు.


