breaking news
highway patrol staff
-
హైవే పెట్రోలింగ్పై అవగాహన లేక ప్రాణాలు పోతున్నాయ్!
గత శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడకు రాజధాని ఏసీ బస్సు బయలు దేరింది. రాత్రి 2.20కి నార్కెట్ పల్లి సమీపంలోని ఏపీ లింగోటం వద్ద ఫ్లైఓవర్ పైకి చేరింది. అంతకు 40 నిమిషాల ముందు ఆ వంతెన దిగే సమయంలో ఓ లారీ ఇంజిన్ ఫెయిల్ అయి సెంట్రల్ మీడియన్ పక్కన నిలిచిపోయింది. ఎలక్ట్రికల్ సిస్టం పనిచేయకపోవటంతో లారీ వెనక రెడ్, బ్లింకర్ లైట్లు వెలగలేదు.. డ్రైవర్ దిగిపోయి విషయాన్ని యాజమానికి చెప్పి పక్కన కూర్చుండిపోయాడు.. ఆ సమయంలో వంతెనపై లైట్లు కూడా వెలగటం లేదు. 80 కి.మీ.వేగంతో వచ్చిన రాజధాని బస్సు ఆ లారీని బలంగా ఢీకొంది. బస్సు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా, 8 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై వాహనదారులకు అవగాహన లేకపోవటంతో భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దానికి ఈ బస్సు ప్రమాదమే తాజా ఉదాహరణ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను విస్తరిస్తుండటంతో రోడ్లు విశాలంగా మారుతున్నాయి. ఊళ్లుండే చోట ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా వంతెనలు నిర్మిస్తున్నారు.. పట్టణాలుంటే బైపాస్ రూట్లు ఏర్పాటు చేస్తున్నారు.. దీంతో వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. ఏదైనా పెద్ద వాహనం హైవే మీద చెడిపోయి నిలిచిపోయిన సందర్భాల్లో మాత్రం పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళ, మలుపుల వద్ద వాహనాలు నిలిచిపోయి ఉంటే, వెనక వచ్చే వాహనాలు వాటిని ఢీకొంటున్నాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు హైవే పెట్రోలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసినా, దానిపై అవగాహన లేకపోవటమే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. జాతీయ రహదారి హెల్ప్లైన్ నెంబరుకు ఫోన్ చేసి ఉంటే, సిబ్బంది వచ్చి లారీని తొలగించి ఉండేవారు. కనీసం, అక్కడ లారీ నిలిచిపోయి ఉందని తెలిసే ఏర్పాటయినా చేసి ఉండేవారు. అదే జరిగితే ఈ ప్రమాదం తప్పి ఉండేది. ఏంటా హెల్ప్లైన్ వ్యవస్థ? 1033.. ఇది జాతీయ రహదారులపై కేంద్రం కేటాయించిన హెల్ప్లైన్ నెంబర్. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదం జరిగినా, ఏదైనా భారీ వాహనం నిలిచిపోయినా.. ఈ నెంబరుకు ఫోన్ చేసి సహాయాన్ని పొందొచ్చు. కానీ, దీనిపై ప్రజల్లో అవగాహనే లేకుండా పోయింది. ఏం సాయం అందుతుందంటే.. ప్రతి 50–60 కి.మీ.కు ఓ సహాయక బృందం అందుబాటులో ఉంటుంది. స్థానిక టోల్ బూత్ కు అనుబంధంగా ఇది వ్యవహరిస్తుంది. ఈ బృందంలో మూడు వాహనాలుంటాయి. అంబులె న్సు, పెట్రోలింగ్ వాహనం, క్రేన్ ఉండే టోయింగ్ వెహికిల్. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్ప్లైన్కు ఫోన్ చేయగానే ఘటనా స్థలికి హైవే అంబులెన్సు, పెట్రోలింగ్ వాహనాలు చేరుకుంటాయి. గ్రాయపడ్డవారికి ప్రాథమిక చికిత్స అందించి, అంబులెన్సులో స్థానిక ఆసుపత్రికి వెంటనే తరలిస్తారు. ఆసుపత్రికి వెళ్లేలోపు కావాల్సిన సాధారణ వైద్యాన్ని అందించే ఏర్పాటు అంబులెన్సులో ఉంటుంది. ప్రమాద స్థలిలో వాహనాల చుట్టూ బారికేడింగ్ చేస్తారు. ఏదైనా భారీ వాహనం ఫెయిలై రోడ్డుమీద ఆగిపోతే టోయింగ్ వాహనాన్ని తెచ్చి వెంటనే ఆ వాహనాన్ని రోడ్డు పక్కకు తరలిస్తారు. దీనివల్ల వేరే వాహనాలు ఆ చెడిపోయిన వాహనాన్ని ఢీకొనే ప్రమాదం తప్పుతుంది. హెల్ప్లైన్ ఎలా పనిచేస్తుంది..: అవసరమైన వారు 1033 హెల్ప్లైన్కు (ఉచితం) ఫోన్ చేయాలి. ఢిల్లీలో ఉండే సెంటర్ సిబ్బంది వెంటనే స్పందిస్తారు. అవసరమైన భాషల్లో మాట్లాడే సిబ్బంది అక్కడ అందుబాటులో ఉంటారు. ఆ వెంటనే ఫిర్యాదు దారు మొబైల్ ఫోన్కు ఓ లింక్ అందుతుంది. దానిపై క్లిక్ చేయగానే, అక్షాంశరేఖాంశాలతో సహా లొకేషన్ వివరాలు ఢిల్లీ కేంద్రానికి అందుతాయి. వాటి ఆధారంగా ఆ ప్రాంతానికి చెందిన సిబ్బందిని వారు వెంటనే అప్రమత్తం చేస్తారు. ఇవన్నీ నిమిషాల వ్యవధిలో జరుగుతాయి. సమాచారం అందిన వెంటనే అవసరమైన సిబ్బంది ఘటనా స్థలికి బయలుదేరి సహాయ చర్యల్లో పాల్గొంటారు. అవగాహనే లేదు.. జాతీయ రహదారులపై నిర్ధారిత ప్రాంతాల్లో ఈ హెల్ప్లైన్ నెంబరును జనం గుర్తించేలా పెద్ద అంకెలను రాసిన బోర్డులను ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతావారోత్సవాలప్పుడు రవాణాశాఖ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కానీ, ఇప్పటికీ ఎక్కువ మందిలో దానిపై అవగాహనే లేకుండా పోయింది. జాతీయ రహదారులపై ఏదైనా అవసరం ఏర్పడితే 1033కి ఫోన్ చేయాలన్న సమాచారం ప్రజల్లో ఉండటం లేదు. ఎక్కు వ మంది పోలీసు ఎమర్జెన్సీ (100)కే ఫోన్ చేస్తు న్నారు. 1033కి ఫోన్ చేస్తే, సమాచారం స్థానిక హైవే పెట్రోలింగ్ సిబ్బందితోపాటు లోకల్ పోలీసు స్టేషన్కు కూడా చేరుతుంది. మొక్కుబడి అవగాహన కార్యక్రమాలు కాకుండా, జనానికి బోధపడేలా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. -
పోలీసు బాస్ ప్రక్షాళన తంత్రం
- తొలుత వీఆర్కు పాల్తూరు ఎస్ఐ - మళ్లీ ముగ్గురు హైవే సిబ్బంది రిమాండ్కు.. అనంతపురం క్రైం : పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాలన్నదే ఎస్పీ సూరపరాజు వెంకట రాజశేఖర్బాబు ప్రధాన ధ్యేయం. వివిధ సమస్యలు, ఇబ్బందులపై ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా, నమ్మికతో స్టేషన్ మెట్లెక్కినపుడే పోలీసులపై పూర్తి విశ్వాసం ఉంటుందనేది ఆయన భావన. దీంతో నేరస్తులపై ఉక్కు పాదం మోపుతున్నారు. అదే సమయంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడుతున్న పోలీసులపైనా కఠినంగా వ్యవహరిస్తున్నారు. పాల్తూరు ఎస్ఐ రాజశేఖర్ను వీఆర్(వేకెన్సీ రిజర్వ్డ్)కు పంపడమే ఇందుకు ఉదాహరణ. పాల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కరకముక్కల గ్రామానికి చెందిన వెంకటేష్ తనకు చెందిన 12 గొర్రెలు చోరీ అయ్యాయని సాధారణ ఎన్నికలకు మునుపు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి దాకా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. మంగళవారం గుంతకల్లులో నిర్వహించిన ‘పోలీసు ప్రజా బాట’ సందర్భంగా బాధితుడు నేరుగా ఎస్పీకి తన గోడు వినిపించడంతో ఎస్పీ వెంటనే ఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. తర్వాత వంతు హైవే పెట్రోలింగ్ సిబ్బందిదే.. జాతీయ రహదారిలో ప్రమాదాలు, దోపిడీల నివారణ, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు నిత్యం గస్తీ నిర్వహించాల్సిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది కొందరు ఇటీవల అక్రమాలకు పాల్పడుతున్నారు. వారి అక్రమార్జనకు అంతుపొంతూ ఉండడం లేదు. మంగళవారం రాత్రి అలా జాతీయ రహదారిపైకి వెళ్లిన ఓ కుటుంబ సభ్యుల పట్ల హైవే పెట్రోలింగ్ కానిస్టేబుల్ మల్లికార్జున, హోంగార్డులు మురళీమోహన్, చంద్రశేఖర్ దురుసుగా ప్రవర్తించి, లంచం వసూలు చేయడమే ఇందుకు నిదర్శనం. వారి తీరుపై బాధితులు నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెంటనే టూ టౌన్ పోలీసుల ద్వారా విచారణ జరిపించి వారిని సస్పెండ్ చేశారు. అంతటితో ఆగక కేసు నమోదుకు ఆదేశించారు. తర్వాత ఆ ముగ్గురు నిందితుల్ని రిమాండ్కు పంపారు. పోలీసు శాఖలో కలకలం.. అక్రమార్కుల్లో వణుకు.. ‘బాస్’ చర్యలు పోలీసు శాఖలో కలకలం రేపుతున్నాయి. ఈ చర్యలపై ప్రజల నుంచి హర్హాతిరేకాలు వ్యక్తమవుతుండగా... పోలీసు అక్రమార్కుల గుండెల్లో వణుకు పుడుతోంది. విధుల పట్ల నిర్లక్ష్యం చేసినా, అవినీతి అక్రమాలకు పాల్పడినా ఎవరినీ ఉపేక్షించరని ఈ రెండు ఘటనల ద్వారా ఎస్పీ రుజువు చేశారు. పోలీసు శాఖకు ‘మచ్చ’ తె స్తున్న సిబ్బంది వివరాలను ఎస్పీ రహస్యంగా సేకరించారు. ఏమాత్రం అవకాశం వచ్చినా వేటు వేయడం ఖాయమని తెలుస్తోంది. కానిస్టేబుల్, ఇద్దరు హోంగార్డుల అరెస్ట్ అనంతపురం క్రైం : ఖాకీలమంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరించి డబ్బు వసూలు చేసిన ఘటనలో ఒక కానిస్టేబుల్, ఇద్దరు హోంగార్డులు కటకటాలపాలయ్యారు. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం నగరంలోని ఆశా కార్పొరేట్ ఆస్పత్రి ఎండీ సోమయాజులు కుమార్తె మాళవిక, అల్లుడు, కుమారుడు మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో కారులో వెళ్లి జాతీయ రహదారిలో ఉన్న కారు కంపెనీ సమీపంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో హైవే పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మల్లికార్జున, హోంగార్డులు మురళీమోహన్, చంద్రశేఖర్ వారి వద్దకు వెళ్లారు. ఎవరు మీరు? ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారు? అంటూ గద్దించారు. ఆపై డబ్బు డిమాండ్ చేశారు. చివరకు వెయ్యి రూపాయలు వసూలు చేసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటనతో మనోవేదనకు గురైన బాధితులు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన పోలీసులు బుధవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిని రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ రవిశంకర్రెడ్డి తెలిపారు.