breaking news
Gram Panchayat Sarpanch
-
నేడు ఎస్ఈసీకి ‘పంచాయతీ’ జాబితా!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్ల జాబితాను శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) పంచాయతీరాజ్ శాఖ సమర్పించనున్నట్లు తెలిసింది. శుక్రవారం రాత్రికి రాష్ట్రవ్యాప్తంగా రిజర్వేషన్లు ఖరారై, శనివారం జిల్లాల వారీగా కలెక్టర్లు ప్రచురించే గెజిట్లు అందుబాటులోకి రాగానే ఎస్ఈసీ కార్యాలయానికి వీటిని చేరవేయనున్నట్లు సమాచారం. కొన్ని మండలాల్లో ఇంకా సర్పంచ్, వార్డు స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు కొలిక్కి రాలేదన్న వార్తలొస్తున్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సమాచారం అందుబాటులో ఉన్నందున వీటి ఖరారు పెద్దగా కష్టం కాదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. శనివారంలోగా రిజర్వేషన్ల కసరత్తు పూర్తి చేసి తుది జాబితాను అందించాలని గతంలోనే జిల్లా అధికారులను పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించిన నేపథ్యంలో ఒకట్రెండు జిల్లాల్లో మినహా రిజర్వేషన్ల కసరత్తు పూర్తయినట్లు సమాచారం. సర్పంచ్ రిజర్వేషన్ల గెజిట్ ఎస్ఈసీకి అందగానే ఒకట్రెండు రోజుల వ్యవధిలోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయని సమాచారం. పీఆర్ శాఖ నుంచి వచ్చిన రిజర్వేషన్ల ఖరారు సమాచారాన్ని అన్ని కోణాల్లో సమగ్రంగా విశ్లేషించి, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కేటాయించిన సర్పంచ్ స్థానాలపై న్యాయసలహా తీసుకునేందుకు ఎస్ఈసీకి కొంత సమయం పట్టొచ్చని భావిస్తున్నారు. -
‘సర్పంచ్’లుగాఏడాది
ఆదిలాబాద్ అర్బన్ : గ్రామ పంచాయతీ సర్పంచ్లు పదవీ చేపట్టి శనివారంతో ఏడాది పూర్తి అయ్యింది. జిల్లాలోని 866 గ్రామ పంచాయతీలకు గతేడాది జూన్, జూలై నెలల్లో ఆరు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆగస్టు 2, 2013న కొత్తగా గెలుపొందిన వారు సర్పంచ్లుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మున్సిపల్, సార్వత్రిక, స్థానిక ఎన్నికలు జరిగాయి. ఇంతలోనే ఏడాది గడిచింది. కొత్త ప్రభుత్వం జూన్ 2న కొలువుదీరింది. కానీ, ఏడాది గడుస్తున్నా సర్పంచ్లకు రావాల్సిన గౌరవ వేతనాలు రాలేదు. వస్తాయో.. రావో కూడా తెలియని పరిస్థితి. వేతనాలు చెల్లించాలని, పంచాయతీ అభివృద్ధికి రావాల్సిన నిధులు ప్రభుత్వం విడుదల చేస్తే అభివృద్ధికి దోహదపడుతుందని సర్పంచ్లు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వం పంచాయతీలను పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. హామీల అమలులో విఫలం పంచాయతీలను అభివృద్ధి చెందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని పలువురు సర్పంచ్లు పేర్కొంటున్నారు. సాధారణ ఎన్నికలకు పది నెలల ముందే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. కొత్త సర్పంచ్లు పదవీ చేపట్టినా నిధుల విడుదల జాప్యం జరిగింది. దీంతో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సర్పంచ్లు విఫలమయ్యారు. దీనికి కారణం.. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేయకపోవడమే. అయితే కొందరు సర్పంచ్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం తమ సొంత ఖర్చులతో గ్రామాల్లో బోర్వెల్లకు మరమ్మతులు, డ్రెయినేజీల పూడికతీత లాంటి చిన్న చిన్న పనులు చేయించుకుంటూ వచ్చారు. మొదటి సారిగా మే 17, 2014న జిల్లాకు రూ.19.36 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు సర్పంచ్లకు పూర్తిగా వినియోగంలోకి వచ్చాయి. వీటిని ఆయా గ్రామ పంచాయతీ జనాభా ప్రతిపాదికన విడుదల చేసేందుకు మరో నెల సమయం పట్టింది. ప్రస్తుతం గ్రామాలకు అభివృద్ధి నిధులు వచ్చి నెల రోజులు అవుతుందన్న మాట. అంటే ఏడాదిలో ప్రభుత్వం ఒక్కసారే అభివృద్ధి నిధులు విడుదల చేసింది. ఫలితంగా పల్లెల్లో పారిశుధ్య లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వీధిదీపాలు లేక అంధకారంలో మగ్గుతున్నాయి. డ్రెయినేజీలు కంపుకొడుతున్నాయి. అభివృద్ధి పనులు మాత్రం జరగడం లేదు. రావాల్సిన వేతనాలు రూ.48.29 లక్షలు జిల్లాలోని 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ సర్పంచ్గా పదవీ చేపట్టి ఏడాది గడుస్తున్నా సర్పంచ్లకు రావాల్సిన గౌరవ వేతనం రాలేదు. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్కు రూ.1,500, మైనర్ జీపీ సర్పంచ్లకు రూ.1000 ప్రతి నెల వేతనంగా ప్రభుత్వం ఇస్తుంది. ఇందులో సగం ప్రభుత్వం చెల్లిస్తే మిగతా సగం జీపీ నుంచి పొందాల్సి ఉంటుంది. ఏడాదిలో 11 నెలలకు సంబంధించిన వేతనాలు రూ.48.29 లక్షలు ప్రభుత్వం నుంచి సర్పంచ్లకు రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఏడాదిలో ఒక్కసారే పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తే.. సర్పంచ్లకు ఒకే నెలకు సంబంధించిన వేతనం ఇవ్వడం శోచనీయం. కేంద్రంలో బీజేపీ, రాష్ర్టంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సర్పంచ్లు కోరుతున్నారు. -
రాజకీయ హత్య
బెల్లంపల్లి మండలం కన్నాల సర్పంచ్ దారుణ హత్య ప్రజా సేవ చేయాలనే ఆశతో ఏడాది క్రితమే సర్పంచ్గా ఎన్నికయ్యాడు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం.. రాష్ట్రీయ రహదారి పక్కన రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణను అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. కానీ.. ఆ నీతి రాజకీయాలే ఆయన ప్రాణాలు బలిగొన్నాయి. ఒక్కరుకాదు.. ఇద్దరు కాదు.. నలుగురైదుగురు మూకుమ్మడిగా దాడి చేసి ఆయనను హతమార్చారు. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ సర్పంచ్ మంద రవి హత్య ఉదంతమిది. పార్టీలో చురుకైన కార్యకర్తగా కొనసాగడం.. భూకబ్జాలను అడ్డుకున్నందుకే దుండగులు ఆయనను అంతమొందించారనే ప్రచారం స్థానికంగా సాగుతోంది. బెల్లంపల్లి/బెల్లంపల్లి రూరల్ : బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ సర్పంచ్ మంద రవి హత్య స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. పట్టపగలు గొడ్డలి, ఇనుప రాడ్, బండరాళ్లతో అతి కిరాతకంగా సర్పంచ్ను చంపివేశారు. రవి హత్య వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం ఆయన సర్పంచ్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్లో చురుకైన కార్యకర్తగా పేరు తెచ్చుకున్న రవికి ఆ గ్రామంలో కొంత మందితో తగాదాలు కూడా ఉన్నాయి. పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తుండడంతో అది పలువురికి గిట్టలేదు. దీంతో ఆ తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ క్రమంలోనే దుండగులు గతంలో రెండుసార్లు రవిపై హత్యాయత్నం కూడా చేశారు. త్రు టిలో ప్రత్యర్థుల దాడుల నుంచి రెండుసార్లు తప్పించుకున్నారు. అప్పటి నుంచి అప్రమత్తంగా ఉంటున్న రవి శనివారం పట్టపగలు గ్రామపంచాయతీ కార్యాలయం లో హత్యకు గురికావడం కలకలం రేపింది. సర్పంచ్గా ఎన్నికైనప్పటి నుంచి రవి, ప్రత్యర్థుల మధ్య వైషమ్యాలు మరింత పెరిగాయి. కన్నాల శివారులో రాష్ట్రీయ రహదారి పక్కన రూ. కోట్లు విలువ చేసే సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయనతో విభేదాలున్న వారే ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ భూ మిని ప్లాట్లుగా చేసి విక్రయించేందుకు పన్నాగం ప న్నారు. దీంతో సర్పంచ్గా రవి వారి దుశ్చర్యలను అడ్డుకున్నారు.ఇది మింగుడు పడని ప్రత్యర్థులు సర్పంచ్ను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. అదును కోసం వేచి చూస్తున్న క్రమంలో పంచాయతీ కార్యాలయంలో పథకం ప్రకారం దాడికి దిగి దారుణంగా చంపేశారు. కేవలం పాత కక్షలు, భూ తగాదాల కారణంగానే రవి హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఊరి నుంచి వెళ్లొచ్చినా.. ఎప్పటికప్పుడు ప్రత్యర్థులు నీడలా వెంటాడుతుండటంతో రవి కన్నాల గ్రామ సర్పంచ్గా గెలుపొందినా బెల్లంపల్లికి మకాం మార్చారు. కన్నాలబస్తీలో ఉంటున్నారు. రోజూ కన్నాల గ్రామానికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని మళ్లీ బెల్లంపల్లికి రాస్తున్నారు. అయినా.. ప్రత్యర్థులు మాత్రం రవిని ఎప్పటికప్పుడు వెంబడిస్తూనే ఉన్నారు. సాధారణంగా సర్పంచ్ వెంట ఓ ఇద్దరు ముఖ్య అనుచరులు వెన్నంటి ఉంటారు. శనివారం మాత్రం సదరు వ్యక్తులు రవి వెంట కనిపించనట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులు సదరు వ్యక్తులను కోవర్టుగా మార్చుకున్నారా లేదా ఏదేని కారణంతో వెంట లేకుండా చేశారా అని అనుమానాలు వస్తున్నాయి. తనను ప్రత్యర్థులు హత్య చేస్తారనే భయం ఉందని సర్పంచ్ పోలీసుల దృష్టికి ఇదివరలో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తనకు తుపాకీ ఇప్పించాలని లెసైన్స్ కోసం దరఖాస్తు కూడా చేసినట్లు సమాచారం. అనుమానితులపై ఫిర్యాదు కూడా చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. గ్రామం విడిచి బెల్లంపల్లిలో ఉంటున్న రవిని ప్రత్యర్థులు చివరికి కన్నాల పంచాయతీలోనే హత్య చేసి పోలీసులకు సవాల్ విసిరారు. పట్టపగలు చుట్టు పక్కల ప్రజలు చూస్తుండగానే దుండగులు ఈ దారుణ హత్యకు ఒడిగట్టారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ఈశ్వర్రావు, టూటౌన్ ఎస్హెచ్వో మహేశ్బాబు, వన్టౌన్ ఎస్సై వేణుగోపాల్రావు హుటాహుటిన ఘటనాస్థలిని సందర్శించారు. హత్య జరిగిన స్థలాన్ని, హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను నిశితంగా పరిశీలించారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిన్నంటిన రోదనలు.. మంద లింగమ్మ-మల్లయ్యల చిన్న కుమారుడు రవి. పెద్ద కుమారుడు బానేష్ సింగరేణి ఉద్యోగరీత్యా గోదోవరిఖనిలో నివాసముంటున్నాడు. రవి చెల్లెళ్లు సునీత, నాగమణిలకు వివాహమయ్యాయి. తల్లిదండ్రుల వద్దనే ఉంటున్న రవికి భార్య అనిత, కూతురు మాళవిక, కుమారుడు హృదయవికాస్ ఉన్నారు. రవి ఇదివరకు కన్నాలలోని బుగ్గరాజరాజేశ్వర ఆలయ కమిటీ చైర్మన్గా పనిచేశారు. కాగా.. అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన రవి గంట వ్యవధిలోనే దారుణ హత్యకు గురికావడం కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురి చేసింది. హత్యకు గురైన సమాచారాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో మృతి చెంది ఉన్న రవి మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు తీవ్రంగా రోదించారు. రవి హత్యను నిరసిస్తూ స్థానిక కాంగ్రెస్ నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆ మేరకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కాగా హత్యకు పాల్పడిన వారిలోంచి ఒక నిందితుడిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు సమాచారం. సర్పంచ్ రవి హత్య కన్నాల పంచాయతీలో తీవ్ర విషాదం నింపింది.