breaking news
Government focus
-
పీఎస్యూ బ్యాంకుల్లో వాటా విక్రయంపై దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, లిస్టెడ్ ఫైనాన్షియల్ సంస్థలలో వాటా విక్రయంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా పెట్టుబడులు, పబ్లిక్ ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్) మర్చంట్ బ్యాంకర్లు, న్యాయసలహా సంస్థలకు ఆహ్వానం పలికింది. రెండు రకాల ప్రతిపాదనల(రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్–ఆర్ఎఫ్పీ)కు తెరతీసింది. దీనిలో భాగంగా మర్చంట్ బ్యాంకర్లు, న్యాయసలహా సంస్థలను మూడేళ్ల కాలానికి దీపమ్ ఎంపిక చేయనుంది. గడువును మరో ఏడాది పొడిగించేందుకు వీలుంటుంది. ఎంపికైన సంస్థలు వాటాల విక్రయం విషయంలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించవలసి ఉంటుంది. ఎంపిక చేసిన బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలలో వాటాల విక్రయంలో ప్రభుత్వానికి తగిన విధంగా సహకారం అందించవలసి ఉంటుంది. ఇందుకుగాను మర్చంట్ బ్యాంకర్లు బిడ్స్ దాఖలు చేసేందుకు మార్చి 27వరకూ దీపమ్ గడువు ప్రకటించింది. అయితే రెండు కేటగిరీలలో మర్చంట్ బ్యాంకర్లు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఏప్లస్ విభాగంకింద రూ. 2,500 కోట్లు లేదా అంతకుమించిన పరిమాణంగల లావాదేవీల నిర్వహణ ఉంటుంది. ఏ కేటగిరీలో రూ. 2,500 కోట్ల విలువలోపు వాటాల విక్రయంలో ప్రభుత్వానికి మద్దతివ్వవలసి ఉంటుందని దీపమ్ తెలియజేసింది. ఆర్థిక శాఖ నిర్వహణలోని దీపమ్ ప్రభుత్వ రంగ సంస్థలలో వాటా విక్రయ వ్యవహారాలను పర్యవేక్షించే సంగతి తెలిసిందే. ప్రస్తుతం పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధనను పలు ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అమలు చేయవలసి ఉంది. ఇందుకు ప్రభుత్వం 2026 ఆగస్ట్ 1వరకూ గడువునిచ్చింది. తద్వారా ప్రభుత్వ వాటాను తగ్గించడంతోపాటు.. పబ్లిక్ వాటా పెంచవలసి ఉంది. ఐదు బ్యాంకులు ప్రధానంగా ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు పబ్లిక్కు కనీసం 25 శాతం వాటాను అమలు చేయవలసి ఉంది. ప్రస్తుతం పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్లో ప్రభుత్వ వాటా 98.3 శాతంకాగా.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 96.4 శాతం, యుకో బ్యాంక్లో 95.4 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 93.1 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 86.5 శాతం చొప్పున వాటా కలిగి ఉంది. ఇదే విధంగా ఐఆర్ఎఫ్సీలో 86.36 శాతం, న్యూ ఇండియా ఎస్యూరెన్స్లో 85.44 శాతం, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో 82.4 శాతం చొప్పున ప్రభుత్వానికి వాటా ఉంది. వెరసి ఈ సంస్థలలో పబ్లిక్కు కనీస వాటా నిబంధనను అమలు చేయవలసి ఉంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం విదితమే. -
ఇక డెయిరీపై సర్కారు దృష్టి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెయిరీ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. సహకార రంగంలో పాల ఉత్పత్తిని మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ పాల అభివృద్ధి మండలి (ఎన్డీడీబీ)తో చర్చలు జరిపింది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్డీడీబీ ప్రతినిధులు సయీద్, లతతో కూడిన బృందంతో సోమవారం పశు సంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ చర్చలు జరిపారు. డెయిరీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సహకార డెయిరీని అభివృద్ధి చేయాల్సిన అవసరంపై చర్చించారు. రెండు నెలల్లోగా ‘తెలంగాణ డెయిరీ పాలసీ’ తీసుకురావాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అవకాశాలపై అధ్యయనం... వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా గ్రామాల్లో పాడిరంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సర్కారు ఈ రంగంపై దృష్టి సారించింది. అందులో భాగంగా విజయ డెయిరీకి పాలు పంపిణీ చేసే రైతులకు సేకరణ ధరను లీటరుకు అదనంగా రూ.4 పెంచింది. విజయ పాలు రోజుకు 5.26 లక్షల లీటర్లు విక్రయిస్తున్నా ప్రైవేటు వాటా 75 శాతంగా ఉంది. దీంతో ప్రైవేటు రంగం నుంచి పోటీ తట్టుకుని విజయ డెయిరీని గట్టెక్కించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని సర్కారు నిర్ణయించింది. అలాగే లాలాపేటలోని విజయ డెయిరీ పాల ఉత్పత్తి కర్మాగారాన్ని ఆధునీకరించాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ రోజుకు 5 లక్షల లీటర్ల వరకు పాల ప్రక్రియ చేపట్టే సామర్థ్యం మాత్రమే ఉంది. దాన్ని 10 లక్షల లీటర్ల సామర్థ్యానికి పెంచాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలో పాడి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేయాలని ఎన్డీడీబీని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎన్డీడీబీ బృందం 45 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఆ తర్వాత డెయిరీ పాలసీలో ఉండాల్సిన అంశాల ముసాయిదాను ఎన్డీడీబీ ఇవ్వనుంది. అయితే గుజరాత్ నుంచి వస్తున్న అమూల్, కర్ణాటకకు చెందిన నందిని పాల విక్రయాలను నిరోధించాల్సిన అవసరం లేదని దేశమంతా ఎక్కడైనా పాలు విక్ర యించుకునే స్వేచ్ఛ ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, నెయ్యి, వెన్న, పన్నీరు, పాల పొడి తదితర పాల పదార్థాలపై 14.5 శాతం ఉన్న వ్యాట్ను 5 శాతానికి తగ్గించాల్సిన అవసరముందని చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు సహకార, ప్రైవేటు డెయిరీలు ప్రభుత్వానికి కూడా విన్నవించాయి. అయితే దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.