breaking news
Government bill
-
త్రిశంకు స్వర్గంలో బిల్లులు
కర్నూలు(సిటీ): జిల్లాలో చిన్ననీటి పారుదల శాఖ పరిధిలోని చెరువుల అభివృద్ధి పనులు చేసినా కాంట్రాక్టర్లకు పది నెలలు గడిచినా ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. ఉన్నతాధికారులు జాప్యం చేస్తుండటంతో కాంట్రాక్టర్లు అప్పుల ఊబిలో కూరుకపోతున్నారు. చెరువులకు శాశ్వత మరమ్మతులు చేసి భూగర్భ జలాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2008 సంవత్సరంలో మరమ్మతులు, పరిరక్షణ, పునరుద్ధరణ(త్రిబుల్ ఆర్) పథకాన్ని చేపట్టింది. రాష్ట్రంలో ఈ పథకాన్ని 2011-12 సంవత్సరం నుంచి అమలవుతుంది. ఫేజ్-2 కింద 78 వర్కులు చేపట్టేందుకు రూ.20 కోట్లతో మంజూరు చేసింది. ఫేజ్-2 కింద మంజూరైన నిధులలో సుమారు 10 కోట్ల బిల్లుల దాకా చెల్లింపులు చేశారు. పది నెలల క్రితం పూర్తి అయిన 8 వర్కర్లకు సంబంధించిన రూ.90,45,500 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ బిల్లుల చెల్లింపుకు సంబంధిత శాఖ ఇంజనీర్లు జిల్లా కలెక్టర్కు ప్రతిపాదించారు. అదిగో... ఇదిగో... అంటూ సుమారు 7 నెలల తర్వాత చెరువుల పనుల్లో నాణ్యత లేదంటూ మరోసారి నాణ్యతపై విచారణ చేయించేందుకు త్రిసభ్య కమిటీని ఈ ఏడాది ఫిబ్రవరిలో నియమించారు. బిల్లుల చెల్లింపునకు కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ రెండు నెలలు అయినా రెండు వర్కులను కూడా పరిశీలించలేదని తెలిసింది. వీరి నివేదిక ఆధారంగానే బిల్లుల చెల్లింపులు చేస్తామని కలెక్టర్ చెప్పడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ధోరణిలో ఉన్నతాధికారులు ఉంటే అభివృద్ధి పనులు ఏ మేరకు పూర్తి అవుతాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు చెల్లించకుంటే ఆత్మహత్యలే శరణ్యం ఫేజ్-2 కింద పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించకుంటే ఆత్మహత్యలు చేసుకోవడమే శరణ్యం అంటూ కొందరు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో నాణ్యత పరిశీలనకు క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను కాదని జిల్లాకలెక్టర్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడంపై పలువురు తప్పుబడుతున్నారు. చెరువుల పనులు పూర్తి చేసేందుకు కొంతమంది కాంట్రాక్టర్లు పొలాలు, బంగారు నగలు తాకట్టు పెట్టి, అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి పనులు చేయించినా... నాణ్యత సాకుతో బిల్లులు మంజూరు చేయడంలో జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కాంట్రాక్టర్లు తెలుగు గంగా అతిథి గృహంలో సమావేశమై పెండింగ్ బిల్లులు చెల్లించేంత వరకు ఏ ఒక్కరూ పనులు చేయకూడదంటూ తీర్మానించుకున్నట్లు తెలిసింది. దీంతో పలుచోట్ల చెరువుల పనులు నిలిచిపోయాయి. ఫేజ్-3 పనులు చేసేందుకు ఏ ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదని జలవనరుల శాఖ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్రిసభ్య కమిటీ నివేదిక అందలేదు త్రిబుల్ ఆర్ కింద చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుపై కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక అందలేదు. ఆ నివేదిక ప్రకారం బిల్లులు చెల్లించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. కాంట్రాక్టర్ల ఇబ్బందుల గురించి మాకెలా తెలుస్తుంది. - శ్రీనివాసులు, ఈఈ, మైనర్ ఇరిగేషన్, కర్నూలు కాంట్రాక్టర్లు పూర్తిస్థాయి సమాచారం ఇవ్వడం లేదు త్రిబుల్ ఆర్ కింద చేపట్టిన పనులకు సంబంధించిన వాటిని విచారించాలని కలెక్టర్ త్రిసభ్య కమిటీ నియమించారు. నివేదిక ఇచ్చేందుకు కొంతమంది కాంట్రాక్టర్లు పూర్తిస్థాయి సమాచారం ఇవ్వడం లేదు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకుపోయాం. - పాండురంగయ్య, త్రిసభ్య కమిటీ సభ్యులు -
వారికి బుద్ధి చెప్పేందుకే...సకల జన భేరి
సుబేదారి, న్యూస్లైన్ : తెలంగాణ ఇస్తామని ప్రకటించిన యూపీఏ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడంలో చేస్తున్న జాప్యానికి నిరసనగానే టీఎన్జీవోలు కదనరంగంలోకి దూకాల్సి వస్తోందని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఉద్యమం మళ్లీ ఉధృతరూపం దాల్చకముందే తెలంగాణ ఇవ్వాల్సిన అవసరముందన్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో టీఎన్జీఓల భేరి సభ గురువారం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా దేవీప్రసాద్ మాట్లాడారు. టీఎన్జీఓ అన్న నాలుగు అక్షరాల పోరాటానికి రూపమే సకల జన భేరి అని తెలిపారు. సచివాల యంలో మూడు వేల మంది సీమాంధ్ర అధికారులు ఉంటే తెలంగాణ ఉద్యోగులు, అధికారులు 800 మంది మాత్రమే ఉన్నారని, దీన్ని నిరసిస్తూ సచివాలయంపై తెలంగాణ జెండా ఎగురవేయడానికి సకలజన భేరి సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ప్రకటన చేసినప్పటికీ... ఏర్పాటు ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ, పాలకులు అనుసరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తున్నందున అన్ని వర్గాల వారు అప్రమత్తంగా ఉండాలని దేవీప్రసాద్ కోరారు. తెలంగాణకు వ్యతిరేకంగా కొన్ని పార్టీల నేతలు ఒక్కటి కావడమే కాకుండా కేంద్రం యూ టర్న్ తీసుకునేలా వివిధ యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరి కారణంగానే తెలంగాణలో మళ్లీ బలిదానాలు చోటుచేసుకుంటున్నాయని, బిడ్డలకే తల్లిదండ్రులు తలకొరివి పెట్టాల్సిన దుస్థితి సీమాంధ్ర నాయకుల వల్ల ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి దానికీ గడువే... ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబు ఉద్యోగుల సమస్యలే కాదు, ఏ విషయమూ స్పష్టం తెలియదని దేవీప్రసాద్ ఎద్దేవా చేశారు. పదో పీఆర్సీ చైర్మన్ కొన్ని అంశాలపై సమాధానం చెప్పాలని లేఖ పంపితే రెండు నెలల గడువు అడిగారని గుర్తు చేశారు. ఇక రాజ్యాంగ వ్యతిరేకంగా సమ్మె ఎందుకు చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నిస్తే రెండు వారాల అడిగారని.. ఇలా సమ్మె ఎందుకు చేస్తున్నారో చెప్పలేని వ్యక్తి నాయకుడెలా అవుతారని ఆయన ప్రశ్నించారు. విభజన వద్దంటూ మూర్ఖపు వాదనకు దిగుతున్న అశోక్బాబు వంటి వారికి బుద్ధి చెప్పడమే కాకుండా స్పష్టమైన సమాధానం చెప్పడానికి ఈనెల 29న తెలంగాణ సకల జనభేరి నిర్వహిస్తున్నామని దేవీప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణను ఇందు లో ప్రకటిస్తామని వివరించారు. టీఎన్జీఓల స్ఫూర్తితోనే ఉద్యమంలోకి... : కడియం తాను టీడీపీని వీడి టీఆర్ఎస్లోకి రావడానికి టీఎన్జీఓలే స్ఫూర్తి అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి తెలిపారు. టీడీపీలో ఉన్నప్పుడు తనకు టీఎన్జీవోల నేత పరిటాల సుబ్బారావు చేసిన విజ్ఞప్తితో పాటు.. స్టేషన్ ఘన్పూర్ ఉప ఎన్నికల సందర్భంగా అభివృద్ధి పనులను వివరించినా తెలంగాణ ఉద్యమంలో లేరు కదా అంటూ ప్రశ్నించిన ఉపాధి హమీ కూలీల సూచనలు ఆలోచనకు పురిగొల్పాయని వివరించారు. తాను టీఆర్ఎస్లోకి రాగానే, తెలంగాణ ప్రకటన రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రకటన రావడానికి కానీ ఉద్యమానికి జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందడానికి కానీ టీఎన్జీవోలే కారణమని కొనియాడారు. చరిత్ర తెలియన అజ్ఞాని, ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబు.. నిజాంకాలంలో తెలంగాణ ప్రజలు బానిసలని చెప్పడం గర్హనీయమని కడియం పేర్కొన్నారు. అయితే, నిజాం కాలంలో ఆ బానిసలే బందూకులు పట్టుకుని రాజులను తరిమినట్లుగా అశోక్బాబుకు జరగకుండా చూసుకోవాలని సూచించారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ తదితర పార్టీల నాయకులు పోరాడిన సమయంలో టీ టీడీపీ ఫోరం నేతలు ఎక్కడ ఉన్నారో చెప్పాలని శ్రీహరి ప్రశ్నించా రు. సీమాంధ్ర రాజకీయ పార్టీల వైఖరిని తెలియజేయడానికి, సీమాంధ్ర దుష్ర్పచారాన్ని తిప్పికొట్టడానికితెలంగాణ సకలజనుల భేరి సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు వరంగల్ నుంచి 20వేల మందిని హైదరాబాద్కు తరలించునున్నామని కడియం వివరించారు. మీడియా, పత్రికలు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎత్తిచూపుతున్నాయి - టీఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం రవీందర్రెడ్డి సీమాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎక్కువగా చేసి చూపిస్తున్నాయని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం రవీందర్రెడ్డి అన్నారు. ఈ వైఖరిని వారు మార్చుకోవాలని సూచించారు. అలాగే, తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్లో బిల్లు వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. టీఎన్జీఓల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు పరిటాల సుబ్బారావు మాట్లాడుతూ హైదరాబాద్ ఎప్పటికీ తెలంగాణ ప్రజలదే, దీన్ని చాటిచెప్పడానికే నిజాం కాలేజీలో తెలంగాణ సకల జనుల భేరి నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ లెక్చరర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వెనక్కితీసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులను ఆదుకోవడానికి సహకరించిన టీఎన్జీవోలకు టీఆర్ఎస్ ఎప్పటికీ రుణ పడి ఉంటుందన్నారు. పాట, మాటలతో ఉత్తేజపరిచిన సురేందర్ నంది అవార్డు గ్రహీత, జిల్లా వాసి, సినీ పాటల రచయిత మిట్టపల్లి సురేందర్ తన మాట, పాటలతో టీఎన్జీవోల భేరి సభను ఉత్తేజపరిచారు. తెలంగాణకు అడ్డుపడుతున్నాడని చంద్రబాబుపై, మౌనంగా ఉంటున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రశ్నిస్తూ పాట పడిన ఆయన.. ఇక్కడ పుట్టిన మహానుభావులను కీర్తిస్తూ కూడా పాట పాడారు. అనంతరం సకల జనుల భేరి సభ పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో టీఎన్జీఓల రాష్ట్ర నాయకురాలు రేచల్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ హుస్సేన్, ఇంజినీర్ల సంఘం నాయకుడు శివాజీ మాట్లాడగా, శ్రీనివాస్, అసనుద్దీన్, సాదుల ప్రసాద్, ఇబ్రహీం హుస్సేన్, సదానందం, రత్నాకర్రెడ్డి, రాజ్కుమార్, సంపత్రావు, స్వర్గం హరి, సాంబయ్య, అబ్దుల్లా, జహంగీర్, రాగి శ్రీనివాస్, దాస్యానాయక్, ఉపేందర్రెడ్డి, ఈగ వెంకటేశ్వర్లు, ప్రతాప్, జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.