breaking news
Gokarna
-
కె పాప్ పోటీలో.. సిటీ విజేతలు వీరే..!
సాక్షి, సిటీబ్యూరో: కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా (కేసీసీ) సహకారంతో ప్రముఖ గృహోపకరణ ఉత్పత్తుల బ్రాండ్ ఎల్జి ఎల్రక్టానిక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా కె పాప్ పోటీల్లో స్థానిక విజేతలను ప్రకటించారు. ఈ ప్రాంతీయ పోటీల్లో ఆన్లైన్ ఆడిషన్స్ ద్వారా గానంలో నగరానికి చెందిన షైలీ ప్రీతమ్, నృత్యంలో సెజల్ దుబేలు గెలుపొందారని నిర్వాహక సంస్థ ప్రతినిధులు తెలిపారు.కొరియన్ పాప్ సంస్క్రతికి పట్టం గట్టే అభిమానుల కోసం నిర్వహిస్తున్న జాతీయ పోటీలో భాగంగా ఈ ప్రాంతీయ పోటీలు జులై 27న ప్రారంభమయ్యాయి. బెంగళూరు, కొహీమా, కొల్కతా, ముంబై, ఇటానగర్, చెన్నై, ఢిల్లీల తర్వాత నగరంలో ప్రాంతీయ రౌండ్ జరిగింది. ఇవి సెపె్టంబర్ 1 వరకు 11 ప్రాంతాల్లో జరుగుతాయని, వీటి ద్వారా ఎంపికైన విజేతలు ఢిల్లీలో జరిగే సెమీ ఫైనల్స్లో పాల్గొంటారని నిర్వాహకులు వివరించారు.స్టార్టప్స్ కోసం మీట్.. 24న..సాక్షి, సిటీబ్యూరో: ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసం ది ఫౌండర్స్ కాంక్లేవ్ స్టార్టప్ మీటప్ నగరంలో జరుగుతోంది. కొండాపూర్లోని గోకర్ణ కో వర్కింగ్ స్పేస్లో ఈ నెల 24న జరగనున్న ఈ కార్యక్రమంలో భిన్న రంగాల ప్రముఖులు వైశాలి నియోటియా, నీతా సచన్, రత్నాకర్ సామవేదం హాజరై ప్రసంగిస్తారు. కార్యక్రమం సాయంత్రం 4గంటలకు ప్రారంభమై రాత్రి 7గంటల వరకూ కొనసాగుతుంది.ఆర్టిస్టిక్ లైసెన్స్.. 25న..సాక్షి, సిటీబ్యూరో: కవితలు, కథలు, సంగీతం, హాస్యం.. ఇలా ఏదైనా సరే మనకు నచి్చన/ వచ్చిన అంశంపై కొన్ని నిమిషాల పాటు మన ఇష్టాన్ని, ప్రతిభను ప్రదర్శించేందుకు వీలుగా ఆర్టిస్టిక్ లైసెన్స్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. మనకు పట్టున్న ఏ భాషలోనైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ నెల 25న జూబ్లీహిల్స్లోని ఫిల్మ్నగర్లో ఉన్న అలైన్ హబ్లో నిర్వహిస్తున్న ఈ ఓపెన్ మైక్ కార్యక్రమం సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమవుతుంది.మె‘న్యూ’ ఇటాలియన్ రుచుల టొస్కానో..సాక్షి, సిటీబ్యూరో: సిటీకి ఎన్ని రుచులు పరిచయం అవుతున్నా.. ఎప్పటికీ వన్నెతరగని విదేశీ టేస్ట్గా ఇటాలియన్ రుచుల్ని చెప్పొచ్చు. సిటిజనుల్లో ఇటాలియన్ రుచుల ప్రియత్వానికి అనుగుణంగా టొస్కానో పేరిట మరో రెస్టారెంట్ ఏర్పాటైంది. సైబరాబాద్లోని నాలెడ్జ్ సిటీ రోడ్లో నెలకొల్పిన ఈ రెస్టారెంట్ను ఇటలీ రుచులకు ప్రసిద్ధి చెందిన చెఫ్ గౌతమ్ మంగళవారం ప్రారంభించారు.నగరవాసులు గతంలో రుచి చూడని, ఇటలీలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వంటకాల్ని తాము అందిస్తున్నామని, నేరుగా ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్న అత్యుత్తమ ముడి పదార్థాలు, చీజ్లను ఉపయోగించి ప్రత్యేక మెనూ తయారు చేశామన్నారు. క్లాసిక్ మార్గెరిటా పిజ్జా, చికెన్ డి టోస్కానో తదితర ఇటలీ వంటకాలు నగరవాసుల్ని ఆకట్టుకుంటాయన్నారు. -
జీన్స్, టీషర్ట్లతో ఈ ఆలయంలోకి నో ఎంట్రీ
సాక్షి, బెంగళూర్ : కర్నాటకలోని గోకర్ణలో మహాబలేశ్వర్ ఆలయంలోకి జీన్స్ ప్యాంట్, ట్రౌజర్లు, బెర్ముడా షార్ట్స్తో భక్తులను అనుమతించడంపై నిషేధం విధించారు. ఆలయంలో ఇప్పటికే తాము డ్రెస్కోడ్ను అమలు చేస్తున్నామని గోకర్ణ మహాబలేశ్వర్ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హాలప్ప గురువారం వెల్లడించారు. షర్ట్, ప్యాంట్, టోపీ, కోటు ధరించిన భక్తులను కూడా అనుమతించమని స్పష్టం చేశారు. పురుషులు కేవలం ధోవతితోనే ఆలయంలోకి రావాలని, వారిని షర్టులు, టీషర్టులతో లోపలకి అనుమతించమన్నారు. ఇక మహిళలు జీన్స్ ప్యాంట్ ధరించి ఆలయానికి రాకూడదని వారు కేవలం చీరలోనే ఆలయంలోకి ప్రవేశించాలని హాలప్ప వెల్లడించారు. గోకర్ణలోని మహాబలేశ్వర ఆలయాన్ని కాదంబ వంశానికి చెందిన మయూర్ శర్మ 4వ శతాబ్ధంలో నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. మరోవైపు గోకర్ణ ప్రముఖ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందిన క్రమంలో ఇలాంటి నియమాలు సందర్శకులకు ఇబ్బంది కలిగిస్తాయని గోకర్ణ ఆలయానికి సమీపంలోని రామచంద్రపుర మఠం అడ్మినిస్ట్రేటర్ జీకే హెగ్డే అన్నారు. పురుషులకు మాత్రమే షర్ట్లు వేసుకుని ఆలయానికి రాకూడదనే నిబంధన విధించవచ్చని, మహిళలపై ఎలాంటి నియంత్రణలు ఉండరాదని ఆయన అభిప్రాయపడ్డారు. భక్తులు, ఆలయ పూజారులతో చర్చించిన తర్వాతే డ్రెస్ కోడ్ను ప్రవేశపెట్టాలని కోరారు. కాగా హంపిలోని విరూపాక్ష ఆలయంలోనూ ఇదే తరహా నిబంధనలు తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. -
ఆత్మలింగం భూకైలాసం గోకర్ణం
మన దేశంలోని శైవక్షేత్రాలైన వారణాశి, రామేశ్వరం ఆలయాల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో ఆ కోవలోకి చెందినదే మహాబలేశ్వర ఆలయం. కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లాలో గోకర్ణ పట్టణంలో కొలువుదీరి ఉన్న ఈ ఆలయాన్ని గోకర్ణం అని కూడా అంటారు. అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో గోకర్ణం ఒకటి. గోకర్ణ క్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఓ వైపు అపారమైన ఆధ్యాత్మికత, మరో వైపు ప్రకృతి రమణీయకతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్టితమైంది. గోకర్ణ క్షేత్రం గురించి రామాయణ, మహాభారత గ్రంథాలలో వివరించబడింది. ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది. పూర్వం రావణాసురుడు శివుని గురించి కఠోర తపస్సు చేయగా, అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధన విధించిన శివుడు, రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ నింబంధన ఏమిటంటే.. రావణాసురుడు లంకకు వెళ్లేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు. అలా దించితే ఆ లింగం అక్కడే ప్రతిష్టితమైపోతుంది. అలా ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు తన లంక రాజ్యం వైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని భయపడిన దేవతలు, తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ... తదితర దేవుళ్లను వేడుకున్నారు. అప్పుడు గణపతి చిన్నపిల్లవాని రూపంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది. అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకొమ్మని, తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాలవినాయకుడు తాను మూడుసార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కిందపెట్టేస్తానని చెబుతాడు. వేరే దారిలేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోవడానికి వెళతాడు. అయితే రావణాసురునికి ఏ మాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు గబగబా మూడుసార్లు రావణాసురుని పిలిచి, ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కును ఇప్పటికీ, ఇక్కడున్న మహాగణపతి ఆలయంలో గణపతి విగ్రహానికి చూడవచ్చు. ఆత్మలింగం చుట్టూ పంచక్షేత్రాలు ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరంవైపు నుంచి లాగుతాడు. ఆ పెట్టె అతి విసురుగా వెళ్లి దూరంగా పడిపోయింది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలిసింది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవించింది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురడేశ్వరం లింగం వెలిసింది. పెట్టెను కట్టిన తాళ్లు పడిన చోట ధారేశ్వరలింగం ఉద్భవించింది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం ‘మహాబలేశ్వర లింగం’ గా గోకర్ణంలో వెలిసింది. ఆత్మలింగంతో ముడిపడిన ఈ ఐదు క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటారు. గో రూపం దాల్చిన భూమాత... మరొక కథనం ప్రకారం పాతాళలోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించిందట. ఆ గోవుచెవి నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రానికి గో (అవు) కర్ణం (చెవి) = గోకర్ణం అనే పేరు ఏర్పడిందంట. రాజుల కాలంలో గోకర్ణం దక్షిణ కాశి, భూ కైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ క్షేత్ర చరిత్ర ఎంతో పురాతనమైంది. కాళిదాసు తన ‘రఘువంశం’ కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేశాడు. క్రీ.శ. 7వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్దనుడు ‘నాగానంద’ కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి మయూరశర్మ ఈ ఆలయంలో నిత్యపూజాదికాలను ఏర్పాటు చేశాడని, చెన్నమ్మాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు- కుందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాల, నందిమంటపాలను నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. క్రీ.శ 1665వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు చేసినట్టు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. సర్వపాప హరణం కోటి తీర్థంలో పుణ్యస్నానం గోకర్ణంలో ప్రధానాలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటితీర్థంలో స్నానాలు ఆచరిస్తారు. కోటితీర్థంలో స్నానం చేస్తే సమస్తరోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటి తీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి ప్రక్కనన్ను అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక, కోటితీర్థానికి దక్షిణం వైపు అగస్త్యులవారిచే ప్రతిష్టింపబడిన వరటేశ్వర లింగం ఉంది. ఈ ఆలయం భక్తుల సౌకర్యార్థం 24 గంటలూ తెరిచే ఉంటుంది. నయనానందకరం రథోత్సవం అతి ప్రాచీనమైన ఈ ఆలయం పెద్ద గాలిగోపురంతో భక్తులను ఆహ్వానిస్తుంది. ఈ లింగం కింది వైపు కాస్త వెడల్పుగా, పైన సన్నగా కనబడుతుంటుంది. రావణాసురుడు ఈ లింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నించడం వల్ల పై భాగాన సన్నగా ఉందంటారు. పైకి ఉండే ఒక రంధ్రంలో వేలును ఉంచినప్పుడు కిందనున్న లింగం వేలికి తగులుతుంది. భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు. అయితే, మహామంగళహారతుల సమయంలో గర్భగృహంలోకి భక్తులను అనుమతించరు. ఇక్కడ పన్నెండేళ్లకొకసారి జరిగే విశేష కార్యక్రమంలో శివలింగాన్ని బయటకు తీసి, నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలకు దేశవిదేశాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ముందుగా వినాయక దర్శనం... రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు, అతడిని అడ్డుకున్న గణపతి చాతుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వర క్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తరువాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. రావణుడు వేసి మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనపడుతుంటుంది. ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పు దిక్కున ఉంది. ఉత్తరాన రుద్రుని సతి తామ్రగౌరి మహాబలేశ్వర ఆలయప్రాంగణంలో ఉత్తరం వైపున తామ్రగౌరి ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని అర్ధాంగి. ఈమె బ్రహ్మదేవుని కుడి చేయి నుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రుని వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయత్రం 5 గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది. సిద్ధించిన అమృతం నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఇక్కడే ఆవిర్భవించిందట. అమృతమథనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగానికి పూజలు జరపడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి. గోకర్ణ క్షేత్రంలో ఆత్మలింగాన్ని దర్శించుకున్న వారికి జన్మజన్మల పాపకర్మలు తొలగిపోయి సర్వసుఖాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. సమీప పుణ్యక్షేత్రాలు ధారేశ్వర ఆలయం: ఈ ఆలయం గోకర్ణానికి దక్షిణ దిక్కున దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆత్మలింగానికి సంబంధించిన లింగం. ఈ ఆలయం చాళుక్య, హోయసలల శిల్పశైలిలో కనపడుతుంది. దీనిని 11వ శతాబ్దిలో పునర్నిర్మించినట్లు తెలుస్తోంది. గుణవంతేశ్వర: ఈ ఆలయం కూడా గోకర్ణ ఆత్మలింగానికి సంబంధించిన క్షేత్రంగా చెప్పబడుతుంది. గోకర్ణం నుంచి సుమారు 60 కిలోమీటర్లు. మురుడేశ్వర ఆలయం: పంచలింగాల క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ భారీ ఆలయం భక్తులను అమితంగా ఆకర్షిస్తుంటుంది. గోకర్ణక్షేత్రానికి 70 కిలోమీటర్ల దూరం.