breaking news
gannavarm
-
ఆగి ఉన్న కారులో రూ. 16 లక్షలు మాయం
సాక్షి, కృష్ణా: జిల్లాలోని గన్నవరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఆగివున్న కార్లను లక్ష్యంగా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అల్లాపురంలోని రావ్ఫిన్ రియల్ ఎస్టేట్లో మేనేజర్గా పనిచేస్తున్న షేక్ సిలార్ యనమలకుదురు నుంచి రోజూ వచ్చి ఉద్యోగం చేస్తారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరుతున్న సమయంలో ఆఫీసు కాంపౌండ్లో ఉన్న గోశాల వద్ద కారు ఆపి గోశాలను సందర్శించుకునేందకు వెళ్లారు. ఈ సమయంలో కారు వెనుక డోర్ అద్దాలు పగులగొట్టి కారు సీటులో ఉంచిన రూ. 16 లక్షల నగదు, ఏటీఎం, పాస్ పోర్ట్, పాస్బుక్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. కారు పెట్టిన ప్రదేశం చీకటిగా ఉండడంతో గమనించలేకపోయిన సిలార్ అక్కడి నుంచి యనమలకుదురు బయలుదేరి వెలుతుండగా.. మార్గ మధ్యలో కేసరపల్లి వద్దకు వెళ్ళేసరికి కారు అద్దం పగిలిన ఆనవాలు కనబడింది. దీంతో సిలార్ ఒక్కసారిగా కారు ఆపి పరిశీలించగా.. కారు అద్దం ధ్వంసం చేసి కారులో ఉన్న రూ. 16 లక్షలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లుగా గుర్తించాడు. వెంటనే గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే గత నాలుగు రోజుల్లో అదే ప్రాంతంలో ఆగివున్న రెండు కార్ల అద్దాలు ధ్వసం చేయడం, తాజాగా ఆదివారం ఆగి ఉన్న కారులో 40 నిమిషాల్లో అద్దాలు పగులగొట్టి రూ.16 లక్షలు దోపిడీ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఏమైనా దొంగాల గ్యాంగ్ తిరుగుతుందా.. సిలార్ కారులో డబ్బు పెట్టినట్టు తెలిసినవారే ఎవరైనా అతన్ని అనుసరించి దోపిడీ పాల్పడ్డారా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిలార్ మాత్రం తనకు తెలిసినవారి మీద ఎటువంటి అనుమానం లేదని.. గుర్తు తెలియని వ్యక్తులే ఈ దొంగతనం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. -
మాటు వేసి మెరుపు దాడి
ఏలూరు అర్బన్ : ఏసీబీ అధికారులు శుక్రవారం ఓ అధికారి ఇళ్లపై దాడులు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో సబ్ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్న జిల్లాకు చెందిన గెడ్డం విజయ గణేష్బాబు ఇంటితో పాటు ఏకకాలంలో ఐదు చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.10 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గన్నవరంలో సబ్ ట్రెజరీ అధికారిగా పనిచేస్తూ ఏలూరు అమీనాపేటలో నివాసం ఉంటున్న గెడ్డం విజయ గణేష్బాబు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని నెలరోజుల కిందట ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దాంతో కొంతకాలంగా మాటు వేసిన అధికారులు గణేష్ బాబు ఆస్తులకు సంబంధించి వివరాలు సేకరించే పని ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితుడికి నగరంలోని అమీనాపేటలో నివాసం ఉంటున్న చిన్న ఇంటితో పాటు శనివారపుపేటలో మూడంతస్తుల భవంతి, తంగెళ్లమూడిలో నిర్మాణంలో ఉన్న మరో మూడు అంతస్తుల భవనం, శనివారపుపేటలో ఇంకో భవంతి కలిగి ఉన్నారని నిర్ధారించుకున్నారు. దీంతో ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ, సీఐ, యూజే విల్సన్లు సిబ్బందితో కలిసి శనివారం విజయగణేష్ నివాసం ఉంటున్న ఇంటితో పాటు శ్రీరామ్నగర్లో నిందితునికి చెందిన మూడంతస్తుల భవనం, జంగారెడ్డిగూడెంలో ఎస్టీవోగా పనిచేస్తూ టూటౌన్, సుబ్బమ్మాదేవి హైస్కూల్ వద్ద నివాసం ఉంటున్న నిందితుని స్నేహితుడు బసవరాజు ఇంటిపై, తాడేపల్లిగూడెంలో నిందితుని అత్త వారింటిపై ఏకకాలంలో దాడులు చేశారు. రూ.10 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు ఐదు చోట్ల జరిపిన దాడుల్లో అధికారులు రూ.10 కోట్లు విలువ చేసే పలు స్థిరాస్తులు, కీలక డాక్యుమెంట్లు, ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులతో పాటు విలువైన పలు విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ గోపాలకృష్ణ మాట్లాడుతూ నిందితుడిపై చాలాకాలంగా నిఘా పెట్టి అతని ఆస్తులకు సంబంధించి వివరాలు సేకరించిన అనంతరం పక్కా ప్రణాళికతో దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో స్థిరాస్థులతో పాటు నిందితుని ఇంటిలో, గన్నవరంలోని ఆయన కార్యాలయంలో పలు ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు, కీలక పత్రాలు స్వా«ధీనం చేసుకున్నామన్నారు. అదే క్రమంలో ఖాళీ బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ పత్రాలను నిందితుడు వడ్డీ వ్యాపారం చేస్తూ రుణదాతల నుంచి హామీగా స్టాంపు పేపర్లు, ఖాళీ బ్యాంక్ చెక్లు తీసుకుని ఉంటారని భావిస్తున్నామన్నారు. వీటి ఆధారంగా నిందితుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఏలూరులో నిందితుని పంజాబ్ నేషనల్ బ్యాంకు లాకర్లో దాచిన కేజీ వెండి వస్తువులు, సుమారు 400 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితుని ఏసీబీ కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. -
గన్నవరం నుంచి విశాఖకు ఎయిరిండియా విమానం
కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానయాన సంస్థ మరో నూతన సర్వీసుకు శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ నుంచి గన్నవరం మీదుగా విశాఖపట్నానికి సోమవారం నుంచి ఈ సర్వీసును ప్రారంభించ నుంది. హైదరాబాద్ నుంచి ఉదయం 7.30 గంటలకు గన్నవరం వచ్చే ఈ విమానం 8 గంటలకు విశాఖపట్నానికి బయలుదేరి వెళుతుంది. విశాఖపట్నం నుంచి తిరిగి బయలుదేరి 10.50కి గన్నవరం చేరుకుంటుంది. 11.20కి బయలుదేరి హైదరాబాద్ వెళ్తుంది.