breaking news
Galeru-Nagari
-
గాలేరు–నగరి.. హంద్రీ–నీవా అనుసంధానం
సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంతో హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ అనుసంధానం, చిత్రావతి రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి పులివెందుల, లింగాల మండలాల్లోని చెరువులను నింపడంతోపాటు యూసీఐఎల్ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ప్రభావిత ఏడు గ్రామాల ప్రజలకు నీటిని అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వైఎస్సార్ జిల్లా రాయచోటిలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు పథకాల ద్వారా కృష్ణా వరద జలాలను ఒడిసిపట్టి వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 1.41లక్షల ఎకరాలు సస్యశ్యామలం వైఎస్సార్ కడప జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు వద్ద పాపాఘ్ని నదిపై 4.56 టీఎంసీల సామర్థ్యంతో వెలిగల్లు జలాశయాన్ని నిర్మించారు. కానీ, నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులవల్ల ఇది నిండటంలేదు. దీనివల్ల ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి నెలకొనడంతోపాటు చక్రాయిపేట మండలంలోని కాలేటివాగు జలాశయానికి కూడా నీరు చేరడంలేదు. అలాగే, హంద్రీ–నీవా సుజల స్రవంతి సామర్థ్యం తక్కువగా ఉండటంతో ఆ ప్రాజెక్టు రెండో దశలో భాగమైన శ్రీనివాసపురం రిజర్వాయర్, అడవిపల్లి రిజర్వాయర్లకు కూడా నీళ్లందించడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో.. కృష్ణా వరద జలాలను ఒడిసి పట్టి, ఆ జలాశయాలను నింపడం ద్వారా మెట్ట ప్రాంతాల్లోని 1.41 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. వెలిగల్లుకు కృష్ణా జలాలు కృష్ణా వరద నీటిని ఒడిసి పట్టడానికి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం సామర్థ్యాన్ని పెంచాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. గాలేరు–నగరి ప్రధాన కాలువ 56 కి.మీ. పాయింట్ నుంచి రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున కాలేటివాగు జలాశయంలోకి ఎత్తిపోసి ఆయకట్టుకు నీళ్లందిస్తారు. అలాగే, కాలేటివాగు జలాశయం నుంచి రోజుకు 450 క్యూసెక్కులను ఎత్తిపోసి.. చక్రాయిపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లోని చెరువులను నింపుతారు. ఇదే జలాశయం నుంచి రోజుకు 1,550 క్యూసెక్కుల చొప్పున లిఫ్ట్చేసి.. హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి 473 కి.మీ. వద్ద పోస్తారు. ఈ జలాలతో వెలిగల్లు, శ్రీనివాసపురం, అడవిపల్లి జలాశయాలను నింపి ఆయకట్టుకు నీళ్లందిస్తారు. కాగా, గాలేరు–నగరి ప్రధాన కాలువ నుంచి 48 రోజుల్లో 8.164 టీఎంసీలను తరలించేలా ఈ పథకం పనులు చేపట్టడానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ పనులను ఇప్పటికే సర్వే సంస్థకు అప్పగించారు. ఈ పథకం పనులు చేపట్టడానికి రూ.1,272 కోట్లు అవసరం అవుతాయని అంచనా. యురేనియం సమస్యకు విరుగుడు పులివెందుల, లింగాల మండలాల్లో వర్షాభావ పరిస్థితులవల్ల చెరువుల్లోకి నీరు చేరడంలేదు. యురేనియం పరిశ్రమవల్ల మబ్బుచింతలపల్లి, కనంపల్లి, తుమ్మలపల్లి, కొట్టాలు భూమయ్యగారిపల్లి, రాచకుంటపల్లి, వేల్పుల గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమవడంవల్ల ఆ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి చిత్రావతి రిజర్వాయర్ నుంచి రోజుకు 350 క్యూసెక్కుల చొప్పున రెండు టీఎంసీలను తరలించి.. పులివెందుల, లింగాల మండలాల్లో చెరువులను నింపి, యురేనియం ప్రభావిత గ్రామాలకు జలాలను సరఫరా చేసి 25వేల ఎకరాలను సస్యశ్యామలం చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ పథకం పనులు చేపట్టడానికి వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ బాధ్యతలను ఇప్పటికే సర్వే సంస్థకు అప్పగించారు. ఈ పథకం పనులు చేపట్టడానికి రూ.108 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. -
నవంబర్ లోపు గాలేరు–నగరి పనులు పూర్తి
– జీఎన్ఎస్ఎస్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష – పనులు వేగవంతం చేయాలని ఆదేశం తిరుపతి తుడా: గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్లోని మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్ పనులను నవంబర్ రెండో వారం లోపు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా ఆదేశించారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం జీఎన్ఎస్ఎస్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలేరు–నగరి ప్రాజెక్టు పనులను వేగవంతానికి ప్రణాళికలు అమలుచేయాలని ఆయన సూచించారు. మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్ నిర్మాణాల వల్ల ముంపునకు గురైన బాధితులకు అందాల్సిన నష్టపరిహారం, మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. సోమశిల, స్వర్ణముఖి అనుసంధానం ద్వారా జిల్లాలో 72 చెరువులకు కాలువ ద్వారా నీటిని ఇచ్చేలా కాలువల తవ్వకం, పూడిక తీసే పనులు వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం ఆయన సబ్కలెక్టర్ హిమాంశు శుక్లా, జీఎన్ఎస్ఎస్, డెప్యూటీ కలెక్టర్ పద్మావతి, ఇంజనీరింగ్ అధికారులతో కలసి మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జీఎన్ఎస్ఎస్ అధికారులు, తహశీల్దార్ రాజారావు పాల్గొన్నారు. -
గాలేరు-నగరి పనులు పూర్తి చేస్తేనే సస్యశ్యామలం
ఎమ్మెల్యే ఆది స్పష్టీకరణ జమ్మలమడుగు: రాయలసీమ ప్రాంతానికి చెందిన రైతులు సుఖంగా ఉండాలన్నా, వారి భూములు సస్యశ్యామలం కావాలన్నా గాలేరు-నగరి వరదకాలువ పనులను వెంటనే పూర్తిచేయాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆయన మండలంలోని ఎస్.ఉప్పలపాడు గ్రామంలో దెబ్బతిన్న శనగ పంటలను ఏడీఏ అనిత, వ్యవసాయాధికారి రాంమోహన్రెడ్డి, రైతులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రైతులు వేసిన శనగ పంట ఇటీవల కురిసిన వర్షానికి దెబ్బతినడంతో పూర్తిస్థాయిలో దిగుబడి తగ్గి రైతులకు నష్టాలు మాత్రమే మిగిలాయన్నారు. ప్రతి యేటా రాయలసీమ ప్రాంతంలో వర్షాధారంపై సాగుచేస్తున్న రైతులు నష్టపోవలసి వస్తున్నదన్నారు.రైతుల క ష్టాలు,రాయలసీమ ప్రాంతంలోని ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే కర్నూలు జిల్లాలో మిగిలిన పనులకు రూ. 1500 కోట్లు కేటాయించి పనులను పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా పొలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఆనీటిని నాగార్జున సాగర్కు మళ్లించి శ్రీశైలం నుంచి వచ్చే జలాలను రాయలసీమ వాసులు వాడుకునేందుకు చర్యలను చేపట్టాలన్నారు. కర్నూలుజిల్లా ఆవుకు నుంచి గండికోట ప్రాజెక్టు వరకు గాలేరు-నగరి వరదకాలువతో పాటు, టన్నెల్ కూడ పూర్తయిందన్నారు. అయితే దాదాపు 20కిలోమీటర్లమేర పూర్తికాకపోవడంతో మిగులు జలాలను పూర్తిస్థాయిలో వాడుకోలేకపోతున్నామన్నారు. ప్రతి ఏడాది కృష్ణ వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని ఈ నీటిని వాడుకుంటే రాయలసీమ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావడంతో పాటు ప్రజలకు తాగునీటి అవసరాలు కూడా తీరుతాయని సూచిం చారు. ఈ కార్యక్రమంలో మైలవరం జెడ్పీటీసీ సుబ్బిరామిరెడ్డి, నాయకులు కేవీ కొండారెడ్డి, రైతులు గురప్ప, శివారెడ్డి, రవీంధ్రనాథరెడ్డి పాల్గొన్నారు.