breaking news
gajula ramaram
-
‘నిన్న గాజులరామారం.. రేపు బోరబండ బస్తీపైకి హైడ్రా బుల్డోజర్లు’
సాక్షి, హైదరాబాద్: సెలవు దినాల్లో కూల్చివేతలు చేయొద్దని హైడ్రాకు హైకోర్టు స్పష్టంగా చెప్పిందని.. అయినా హైడ్రా ఆ ఆదేశాలను ఉల్లంఘించి ప్రవర్తిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన తాజా పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పేదల ఇళ్లను రేవంత్ రెడ్డి ఆదివారం ఎందుకు కూల్చివేస్తున్నారు?. గతంలో హైకోర్టు సెలవు దినాల్లో కూల్చివేతలు చేయవద్దని స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ, గాజులరామారంలో కోర్టు సెలవు రోజు చూసుకొని మరీ పేదల ఇళ్లను కూల్చివేశారు. గాజులరామారంలో ఇళ్లు కూల్చివేశారు, రేపు జూబ్లీహిల్స్లోని బోరబండ బస్తీకి కూడా రేవంత్ రెడ్డి హైడ్రాతో వస్తారు... హైడ్రా బూల్డోజర్ పేదల ఇళ్లపైకే వెళ్తుంది.. పెద్దల ఇళ్లకు వెళ్లదు. ముఖ్యమంత్రి సోదరుడితో పాటు మంత్రులు పొంగులేటి, వివేక్ తదితరులు ప్రభుత్వ స్థలాల్లో, చెరువుల పైన ఇళ్లు కట్టినా వారిని కూల్చివేయలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. మన ఇళ్లు కూలగొట్టమని కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లే. మన పార్టీ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేశారు. కాంగ్రెస్ పార్టీ కూలగొట్టిన ఆ ఇంటిని మళ్లీ కట్టించి ఇచ్చే బాధ్యత నాది. ఈ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల్లో చేసిందేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది అని కేటీఆర్ అన్నారు. -
గాజుల రామారంలో అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారుల కొరడా
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ శివారులో చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కబ్జాదారులపై హైడ్రా అధికారులు కొరడా ఝులిపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం, దేవందర్నగర్లలో హైడ్రా ఆధ్వర్యంలో మంగళవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో అక్రమ కట్టడాల తొలగింపు చేపట్టారు.329, 342 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన సుమారు 51 అక్రమ నిర్మాణాలను తొలగించారు. బాలనగర్ ఏసీపీ హనుమంతరావు సమక్షంలో సూరారం, జగద్గిరిగుట్ట సీఐలు భరత్ కుమార్, క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో సుమారు వందమంది పోలీసుల భద్రతతో మూడు ప్రోక్లైన్లను ఉపయోగించి అక్రమంగా నిర్మించిన గదులను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు.అయితే కూల్చివేతలను ఆక్రమణదారులు అడ్డుకోగా.. వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే, చెరువు కబ్జాలకు పాల్పడితే ఊరుకోమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ఆక్రమణదారులపై చట్టపరంగా చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. -
టవరెక్కిన మయూరం
హైదరాబాద్: ప్రాణం తీసుకోవాలనుకున్న వాళ్లో.. బెదిరించాలనుకున్న వాళ్లో.. టవరెక్కడం ఈ మధ్య మనం చూస్తేనే ఉన్నాం.. కానీ అనుహ్యంగా తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం జాతీయపక్షి నెమలి టవరెక్కింది. ఈ అరుదైన సంఘటనకు నగరంలోని గాజులరామారం వేదికైంది. స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతం నుంచి జన సంచారంలోకి వచ్చిన నెమలిని కాకులు తరమడంతో.. ప్రాణరక్షణ కోసం మేస్త్రీ నగర్లోని హైటెన్షన్ టవరెక్కింది. ఈ దృశ్యాన్ని తమ సెల్ఫోన్లలో బంధించడానికి స్థానికులు ఎగబడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. హైటెన్షన్ వైర్లు కావడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. నాలుగు గంటల నుంచి ప్రాణాలకోసం పోరాడుతున్న మయూరం ప్రస్తుతం ఒక టవర్ నుంచి మరో టవర్ పైకి దూకూతోంది.