breaking news
freedom celebrations
-
స్వతంత్ర భారత మార్గదర్శకులు
గతవారం అండమాన్, నికోబార్ దీవుల్లో పర్యటించినప్పుడు హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసే గౌరవం నాకు లభించింది. అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భాన్ని స్మరించుకొని, నివాళులు అర్పించాను. నేతాజీ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ 1943 డిసెంబర్ 30న భారత భూభాగంపై తొలిసారి మువ్వన్నెల జెండాను ఎగరవేసిన పవిత్ర భూమిపై నిలబడటం నా హృదయాన్ని కదిలించే అనుభవం. పసుంపోన్ ముత్తురామలింగ థేవార్ ఆహ్వానం మేరకు 1939 సెప్టెంబరులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మదురైని సందర్శించిన విషయాన్ని ఈ సందర్భం నాకు గుర్తు చేసింది. డూ ఆర్ డైజాతీయ స్మారకమైన సెల్యూలార్ జైలును సందర్శించడం కూడా నా పర్యటనలో మరో స్ఫూర్తిదాయకమైన సందర్భం. వీర్ సావర్కర్, యోగేంద్ర శుక్లా, బటుకేశ్వర్ దత్, సచ్ఛీంద్రనాథ్ సన్యాల్తో సహా ఎందరో భరతమాత వీరపుత్రులను వలసవాద శక్తులు ఇక్కడ బంధించాయి. స్వేచ్ఛగా, గౌరవంగా భారత్ మనుగడ సాగించాలనే లక్ష్యంతో ప్రాణాలర్పించిన వారి ధైర్యాన్నీ, వేదననూ, నేటికీ ఈ జాతీయ స్మారకం గోడలు ప్రతిధ్వనిస్తున్నాయి. క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ, ఆగస్టు 9న అండమాన్ దీవుల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. జాతిపిత మహాత్మాగాంధీ 1942లో ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించి ‘డూ ఆర్ డై’ అనే స్ఫూర్తిదాయక నినాదాన్ని ఇచ్చారు. ఈ పిలుపుతో దేశవ్యాప్తంగా స్వాతంత్య్రం సాధించాలనే ఆకాంక్ష తీవ్రమైంది. తమ కాలంలో వలసవాద శక్తులతో పోరాడిన తరానికి ధన్యవాదాలు. వారి కారణంగానే ఇప్పుడు మనం స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ హక్కులతో జీవించే అదృష్టాన్ని పొందాం.స్వాతంత్య్ర యోధుల ఘన చరిత్రఉత్తరాన కశ్మీర్, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన గుజరాత్, తూర్పున అస్సాం... ఇలా అన్ని ప్రాంతాలకూ, నేపథ్యాలకూ, వయసులకూ చెందిన సమరయోధులూ, ధీరవనితలూ ఒకే ఉమ్మడి లక్ష్యం కోసం ఏకమయ్యారు. మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాటానికి శాశ్వత ప్రతీకగా నిలిచిన ఝాన్సీరాణి లక్ష్మీబాయి శౌర్యం, మంగళ్ పాండే ధైర్యం, ‘స్వరాజ్యం నా జన్మహక్కు, నేను దానిని సాధిస్తాను’ అనే నినాదంతో దేశాన్ని జాగృతం చేసిన బాలగంగాధర తిలక్ నిర్భయ పిలుపు– ఇలా ప్రతిస్వరం స్వాతంత్య్రం దిశగా చేపట్టిన ప్రయా ణాన్ని బలోపేతం చేసింది.తొలి స్వదేశీ నౌకారవాణా సంస్థను ప్రారంభించి వలస పాలన ఆర్థిక ఆధిపత్యాన్ని వి.ఒ.చిదంబరం పిళ్లై సవాలు చేశారు. యుద్ధభూమిలో మాత్రమే కాకుండా, వాణిజ్యంలోనూ స్వాతంత్య్ర పోరాటం సాగిందని ఆయన నిరూపించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ విప్లవ కాంక్ష... స్వేచ్ఛా సాధనకు త్యాగం చేసేలా తరతరాలకూ స్ఫూర్తిగా నిలిచింది. ఈశాన్యంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటన జ్వాలను రాణి గైడిన్లియు రగిలించారు. అస్సాంలో అంచంచలమైన ధైర్యంతో జాతీయ పతాకాన్ని మోస్తూ, క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ కనకలతా బారువా ప్రాణాలను అర్పించారు. భగవాన్ బిర్సా ముండా, అనేక మంది ఇతర గిరిజన నాయకులు వలస పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన చారిత్రక పోరాటానికి నాయకత్వం వహించారు. మన చరిత్ర పుటల్లో పోరాట పటిమనూ, ధైర్యాన్నీ, పట్టుదలనూ ప్రదర్శించే అనేక గాథలున్నాయి. అసంఖ్యాకమైన వీరుల సమష్టి సంకల్పంతోనే భారతదేశ స్వాతంత్య్రం సాధ్యమైందని మనకు గుర్తు చేస్తాయి.నేలకొరిగిన సమర కిశోరాలుమనం స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న నేపథ్యంలో కోడి కాథ కుమరన్(పతాక రక్షకుడు కుమరన్)గా ప్రసిద్ధి చెందిన తిరుప్పూర్ కుమరన్కు నివాళి అర్పిస్తున్నారు. నా స్వస్థలమైన తిరుప్పూర్లో, స్వాతంత్య్ర పోరాట సమయంలో జాతీయ పతాకాన్ని కింద పడనీయకుండా పట్టుకొని మృత్యు ఒడిలోకి చేరారు. అందుకే ఆయనకు ఈ బిరుదు లభించింది. ‘స్వరాజ్యం మన జన్మహక్కు’ అనే పిలుపుతో ఆయన స్వాతంత్య్ర పోరాటంలో చేరారు. ‘దేశబంధు యూత్ అసోసియేషన్’ను ప్రారంభించారు. గాంధీజీ సామాజిక సంస్కరణలకు కట్టుబడి, మద్యపాన నిషేధాన్ని ప్రచారం చేశారు. ఆత్మనియంత్రణను అలవర్చుకోవాలని ప్రోత్సహిస్తూ, కల్లు దుకాణాల వద్ద పికెటింగ్లో పాల్గొన్నారు.1932 జనవరి 10న జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో కుమరన్ ఓ యాత్రకు నాయకత్వం వహించారు. ‘వందేమాతరం’ నినాదాలతో తిరుప్పూర్ వీధులు ప్రతిధ్వనించాయి. ఈ బృందంపై వలసవాద శక్తుల దాడిలో తలకు గాయమైన కుమరన్ వందే మాతరం అని నినదిస్తూనే జెండాను శరీరానికి హత్తుకొని ప్రాణాలర్పించారు. ఆయన వయసు కేవలం 27 ఏళ్లు. భగత్ సింగ్ (23), సుఖ్దేవ్ (23), రాజ్గురు (22), ఖుదీరామ్ బోస్ (18), కనకలతా బారువా (18), అనంత లక్ష్మణ్ కన్హేరే (19), వంచినాథన్ (25) లాంటి ఎందరో యువకులు స్వాతంత్య్ర ఉద్యమంలో అమరులయ్యారు.స్వాతంత్య్ర సంగ్రామంలో అజ్ఞాత వీరులను వెలుగులోకి తీసుకువచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవను ప్రశంసిస్తున్నాను. అజ్ఞాత స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తున్నాను. ఈ మహత్తర సందర్భంలో, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించడానికి మనల్ని మనం అంకితం చేసుకుందాం. అచంచలమైన ధైర్యంతో పోరాడి, మన స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులకు మనం అర్పించగల సముచితమైన నివాళి ఇదే. జై హింద్! భారత్ మాతాకీ జై!వ్యాసకర్త భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ -
గాంధీజీ అడిగితే... బంగారు గాజులు ఇచ్చారు
పిల్లలూ! ఇతరులకు మంచి చేయడం మనందరి బాధ్యత. సమాజానికి మన వంతు సహకారం అందించడం మన కర్తవ్యం. అయితే మేము చిన్నపిల్లలం మాకంత శక్తి లేదనో, మేము ఏమీ చేయలేమనో మీరు అనుకోవద్దు. మీరు తల్చుకుంటే ఎన్నో చేయగలరు. మీకున్న దాంట్లోనే అద్భుతాలు సాధించగలరు.మీకో విషయం చెప్తాను వినండి. మనదేశానికి స్వాతంత్య్రం రాకముందు మహాత్మాగాంధీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆయన రాకను పురస్కరించుకుని విరాళాలు సేకరించి, స్వాతంత్య్ర సంగ్రామ నిధికి అందించాలని అంతా అనుకున్నారు. ఆ సమయంలో 12 ఏళ్ల ఓపాప నేను వస్తానంటూ కదిలింది. జోలె పట్టి అందరి దగ్గరికీ వెళ్లి విరాళాలు సేకరించింది.అవన్నీ తీసుకుని వెళ్లి మహాత్మాగాంధీకి అందించింది. ‘మరి నీ విరాళం ఏదీ?‘ అని గాంధీ తాత ఆపాపను అడిగితే తన చేతులకున్న బంగారు గాజులు తీసి ఇచ్చేసింది. ఆ తర్వాత ఆపాప పెద్దయ్యాక భారత స్వాతంత్య్ర సమరంలోపాల్గొంది. ధైర్యం గల నాయకురాలిగా పేరు పొందింది. ఆమే దుర్గాబాయి దేశ్ముఖ్. చూశారా! చిన్న వయసులోనే ఎంత పట్టుదల, దీక్ష చూపిందో ఆమె. మీరూ అలా పట్టుదలతో, దీక్షతో ఉండాలి. ఇతరులకు చేతనైన సాయం చేయాలి. అందరిచేతా మెప్పు పొందాలి. -
లంకలో భారత క్రికెటర్ల స్వాతంత్య్ర సంబరాలు
కాండీ: భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని జాతీయ క్రికెట్ జట్టు సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. శ్రీలంకలోని కాండీలో జరిగిన ఈ వేడుకల్లో జట్టు ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులతో పాటు సహాయక సిబ్బంది కూడా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సంబరాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి జాతీయ జెండాను ఆవిష్కరించాడు. మూడు టెస్టుల సిరీస్లో చివరి మ్యాచ్ రెండు రోజుల ముందే సోమవారం ముగియడంతో టీమిండియా సభ్యులంతా మిగిలిన సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. ఆఫ్రిది శుభాకాంక్షలు... భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన దేశ ప్రజలకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది శుభాకాంక్షలు తెలిపాడు. ‘మన పొరుగున ఎవరు ఉండాలో నిర్ణయించుకునే అవకాశం మనకు లేదు. కాబట్టి ప్రేమాభిమానాలు, శాంతి దిశగా కలిసి పని చేద్దాం.మానవత్వం వర్ధిల్లుగాక’ అని ఆఫ్రిది ట్వీట్ చేశాడు. మరోవైపు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మ్యాథ్యూ హేడెన్ కూడా జనగణమన గీతంలోని కొన్ని వాక్యాలకు అనువాదం కూడా రాస్తూ భారతదేశానికి శుభాకాంక్షలు చెప్పాడు. టాప్–10లోకి రాహుల్ భారత జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టాప్–10లోకి ప్రవేశించాడు. రెండు స్థానాలు మెరుగుపర్చుకున్న అతను 9వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో పోరులో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన శిఖర్ ధావన్ పది స్థానాలు మెరుగుపర్చుకొని 28వ స్థానానికి చేరుకున్నాడు. సస్పెన్షన్తో మూడో టెస్టుకు దూర మైన జడేజా ఆల్రౌండర్ల జాబితాలో నంబర్వన్ నుంచి రెండో స్థానానికి పడిపోయాడు. -
కంచిలిలో ‘జెండా’ పండుగ
కంచిలి: కంచిలిలో అతి పెద్ద జెండా ఆవిష్కరించి జెండా పండుగను స్థానికులు పరిపూర్ణం చేసుకున్నారు. కంచిలికి చెందిన విజ్ఞాన్ పబ్లిక్ పాఠశాల యాజమాన్యం పంద్రాగస్టు వేడుకలను వినూత్నంగా నిర్వహించాలని భావించి, స్వాతంత్య్రం వచ్చి 828 నెలలు పూర్తయిన సందర్భంగా 828 అడుగుల జెండాను కాన్పూర్లో తయారు చేయించింది. ఈ జెండాను స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ చేత ఆవిష్కరింపజేశారు. దీన్ని తెలుసుకొన్న జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ చీఫ్ కో–ఆర్డినేటర్ బిఎం శివప్రసాద్ ఆద్యంతం ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. పాఠశాల యాజమాన్యం చెప్పిన విధంగా 272 మంది విద్యార్థులు, 28 మంది ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి 828 అడుగుల ఈ జెండాను స్థానిక మఠంకంచిలిలో ఆవిష్కరించారు. ఈ జెండాను మెయిన్రోడ్డు మీదుగా ఊరేగించి, మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గల మైదానంలో చుట్టూరా తిప్పి ప్రదర్శించారు. చివరిగా ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ చీఫ్ కో–ఆర్డినేటర్ బి.ఎం. శివప్రసాద్ విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ సీహెచ్ ఆదినారాయణను అభినందించి, ఇది ప్రపంచ రికార్డుగా ధ్రువీకరిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ర్యాలీతోపాటు కంచిలి ఆటో యూనియన్ వారు ఆటోలను కూడా ర్యాలీగా ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు స్థానిక సర్పంచ్ తిలోత్తమనాయక్, ఏఎంసీ అధ్యక్షుడు బంగారు కురయ్య, పీఏసీఎస్ అధ్యక్షుడు తమరాల శోభన్బాబు, ఎంపీటీసీ సభ్యుడు మురళీమోహన్ పట్నాయక్, మండల పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడు నవీన్కుమార్ అగర్వాలా, వైఎస్సార్ సీపీ నేత కొత్తకోట శేఖర్, మండల టీడీపీ ప్రచార కార్యదర్శి జగదీష్ పట్నాయక్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ అ«ధ్యక్షుడు బుడ్డెపు కామేష్రెడ్డి, విజ్ఞాన్ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, స్థానిక యువత, ఆటోయూనియన్ సభ్యులు పాల్గొన్నారు.


