breaking news
Frankfurt Airport
-
చక్రం ఊడి కుప్పకూలిన విమానం.. పలువురికి గాయాలు!
బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలు.. 2011 నుంచి ఈ విమానాలను అనేక అంతర్జాతీయ ఎయిర్లైన్స్ ఉపయోగిస్తున్నాయి. అయితే అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద సమయంలో ఈ విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. తాజాగా ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో జరిగిన ఘటనతో అసలు ఈ విమానాలు సేఫేనా అనే చర్చ మళ్లీ తెర మీదకు వచ్చింది. జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానానికి ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో ప్రమాదం తప్పింది. గేట్ వద్ద నిలిపి ఉంచిన సమయంలో విమానం ముందరి ల్యాండింగ్ గేర్ (నోస్ గేర్) ఒక్కసారిగా కుప్పకూలడంతో విమానం ముందు భాగం నేలపై పడిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్లో పలువురు గాయపడ్డారు. ఫ్రాంక్ఫర్ట్ నుంచి లాస్ ఏంజెల్స్కు వెళ్లాల్సిన LH450 విమానం అనూహ్యంగా ముందు చక్రం ఊడిపోవడం గమనార్హం. అయితే ఆ సమయంలో ప్రయాణికులు ఇంకా విమానంలోకి ఎక్కకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. A nearly five-month-old Lufthansa Boeing 787-9 Dreamliner at Frankfurt, preparing for a flight to Los Angeles, experienced a nose landing gear collapse at the gate. pic.twitter.com/72b6J4HyIr— Aviation (@xAviation) June 4, 2026ఈ ఘటనకు గల కారణాలపై సంబంధిత అధికారులు, లుఫ్తాన్సా సంస్థ దర్యాప్తు ప్రారంభించాయి. బోయింగ్ సంస్థ కూడా విచారణలో సహకరిస్తున్నట్లు తెలిపింది. కాగా ప్రమాదానికి గురైన ఈ బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానం 2026 జనవరిలోనే వాణిజ్య సేవల్లోకి వచ్చిన కొత్త మోడల్ కావడం గమనార్హం. -
సిబ్బంది సమ్మె.. ఫ్లైట్ సర్వీసులు రద్దు
ఫ్రాంక్ఫర్ట్ : ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనాల పెంపు డిమాండ్తో చేపట్టిన ఒక్కరోజు సమ్మె.. ప్రజా జీవనానికి తీవ్ర విఘాతం కలిగించింది. మంగళవారం సమ్మె జరగగా.. రవాణా వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపింది. ఈ క్రమంలో జర్మనీలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో వేల సంఖ్యలో విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్పోర్ట్లో పనిచేసే అగ్నిమాపక సిబ్బంది, కిందిస్థాయి ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావంతో దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్ధ లుఫ్తాన్సా 800 సర్వీసులను రద్దు చేసింది. అలాగే ఎయిర్ ఫ్రాన్స్ కూడా నాలుగోవంతు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రభావం యూరప్లోని ఇతర విమాన సర్వీసులపై కనిపిస్తోంది. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్తో పాటు మ్యూనిచ్, కొలోన్, బ్రెమెన్ విమానాశ్రయాల్లో సుమారు 90 వేల మంది ప్రయాణికులు పడిగాపులు పడ్డట్లు అధికారులు చెప్పారు. బుధవారం ఉదయం విమాన సర్వీసులన్నింటినీ పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. జర్మనీలోని వివిధ ప్రభుత్వ రంగాల్లో పనిచేసే 23లక్షల మంది ఉద్యోగలు.. తమ వేతనాలను 6 శాతం పెంచాలంటూ ఈ సమ్మెను చేపట్టారు. -
జర్మనీలో బెంగళూరు మహిళకు తీవ్ర అవమానం
బెంగళూరు: యూరోపియన్ దేశంలో శ్రుతి బసప్ప అనే భారతీయ మహిళకు అవమానం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి ఐస్లాండ్ వెళుతున్న ఆమెను జర్మనీలోని ఫ్రాంక్ ఫర్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీ సిబ్బంది అవమానించారు. తనిఖీల్లో భాగంగా ఆమెను స్కానింగ్ చేసినప్పటికీ దుస్తులు విప్పేయాలంటూ ఆమెకు అడ్డు చెప్పారు. సాధారణ తనిఖీకి బదులు తాము నమ్మలేమని అనుమానం వ్యక్తం చేస్తూ వస్త్రాలు విప్పేయాల్సిందేనని నలుగురిలో అవమాన పరిచారు. అయితే, ఆమె భర్త ఒక యూరోపియన్ కావడంతో ఆ గండం నుంచి బయటపడింది. దీనిపై శ్రుతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తాను ఒంటరిగా ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. తన భర్త ఒక యూరోపియన్ కాకుంటే ఎలాంటి అవమానం ఎదుర్కోవాల్సి వచ్చేదో అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఫేస్బుక్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య ముమ్మాటికి జాతి వివక్షే అని మండిపడింది. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా స్పందించి అక్కడి విదేశాంగ కార్యాలయ అధికారులు పూర్తి వివరాలు తనకు అందజేయాలని ఆదేశించారు. ఈ ఘటన వివరాలు శ్రుతి తెలియజేసింది. శ్రుతి తన భర్తతో కలిసి ఫ్రాంక్ఫర్డ్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టింది. అక్కడి విమానాశ్రయంలో తనిఖీల్లో భాగంగా బాడీ స్కానింగ్కు వెళ్లి రిపోర్ట్ తీసుకుంది. అయినా అధికారులు అనుమానం వ్యక్తం చేయడంతో బాడీని తడుముతూ చేసే తనిఖీలకు ఒప్పుకుంది. అయితే, తనకు ఇటీవలె కడుపునకు సంబంధించి శస్త్ర చికిత్స అయిందని, తనిఖీని కాస్తంత నెమ్మదిగా చేయాలని చెప్పింది. కానీ, అందుకు కూడా వాళ్లు నిరాకరించి ఆమెను వస్త్రాలు పూర్తిగా తీసేయాల్సిందేనంటూ ఆదేశించారు. అందుకు ఆమె నిరాకరించింది. అక్కడే ఉన్న యురోపియన్ భర్త జోక్యం చేసుకోవడంతో బయటపడింది. -
జర్మనీలో భారతీయురాలికి చేదు అనుభవం
బెంగళూరు: బెంగళూరు నుంచి ఐస్లాండ్కు వెళ్తున్న భారతీయ మహిళ శ్రుతి బసప్పకు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. తనిఖీ చేసేందుకు దుస్తులు విప్పాలంటూ విమానాశ్రయ భద్రతా అధికారులు ఇబ్బంది పెట్టారని ఫేస్బుక్ పోస్ట్లో ఆమె పేర్కొన్నారు. ‘మొత్తం బాడీ స్కాన్ చేశాకకూడా సిబ్బంది సందేహం వ్యక్తం చేశారు. ‘దుస్తులు మొత్తం విప్పాలన్నారు. చేతులతో తడిమి తనిఖీ చేసుకోమన్నాను. 2 వారాల క్రితం పొట్ట భాగంలో ఆపరేషన్ జరిగిందని, రికార్డుల్ని చూపించాను. దానికీ వారు ఒప్పుకోలేదు’ అని పోస్ట్లో పేర్కొన్నారు. ఐస్ల్యాండ్ జాతీయుడైన తన భర్త గదిలోకి రాగానే అధికారుల తీరు పూర్తిగా మారిపోయిందని, చేతులతో తడిమి వదిలేశారన్నారు. ఇది స్పష్టంగా జాతి వివక్షేనని ఆమె వ్యాఖ్యానించారు.


