breaking news
four options
-
గవర్నర్ ముందు నాలుగు దారులు!
ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. ముఖ్యమంత్రి పీఠంపై శశికళ ఆశలు ఆవిరయ్యాయి. ఆమె తక్షణమే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా ఇ.పళనిసామిని నియమించింది. మరోవైపు.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని ధీమాగా ఉన్నారు. దీంతో గవర్నర్ విద్యాసాగర్రావు మరోసారి రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుతం ఆయన ముందు నాలుగు మార్గాలు కనిపిస్తున్నాయి. అవేమిటంటే... 1. ముఖ్యమంత్రి పదవి కోసం మళ్లీ ఇద్దరు నాయకులు పోటీపడుతున్నపుడు.. వారిలో ఎవరో ఒకరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఎంపిక చేసే అధికారం గవర్నర్కు ఉంది. అంటే.. పన్నీర్సెల్వం, పళనిసామిల్లో ఎవరో ఒకరిని తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి.. ఆ తర్వాత సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా విద్యాసాగర్ నిర్దేశించవచ్చు. 2. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకుని, ఆ పేరును తనకు తెలియజేయాల్సిందిగా శాసనసభను గవర్నర్ కోరవచ్చు. 3. ఒకవేళ ఇరు వర్గాల వారూ.. సీఎం పదవి చేపట్టడానికి తమకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పినట్లయితే, గవర్నర్ అందుకు సంబంధించిన నిర్ణయాన్ని శాసనసభకు వదిలిపెట్టవచ్చు. 4. ఇక నాలుగోది, చాలా కీలకమైన మార్గం.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక కోసం రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించడం. ఏ వర్గానికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందనే దానిపై గందరగోళం తలెత్తినపుడు, దానిని పరిష్కరించలేనపుడు ఈ దారిని ఎంచుకోవచ్చు. రాజ్యాంగంలోని 175 (2) అధికరణ ప్రకారం.. శాసనసభ రహస్య బ్యాలెట్ ద్వారా తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిందిగా గవర్నర్ కోరవచ్చు. అదే బలపరీక్ష అవుతుంది. - 1998లో ఉత్తరప్రదేశ్లో జగదాంబికాపాల్ ఉదంతంలో ఈ రహస్య బ్యాలెట్ పద్ధతిని చివరిసారిగా ఉపయోగించారు. జగదాంబికాపాల్, కళ్యాణ్సింగ్లలో ఒకరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం కోసం శాసనసభలో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. అప్పుడు కళ్యాణ్సింగ్ 29 ఓట్ల ఆధిక్యంతో గెలిచి సీఎం పదవి చేపట్టారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
గవర్నర్ ముందు 4 ఆప్షన్స్!
-
గవర్నర్ ముందు 4 ఆప్షన్స్!
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అధికారం ఎవరికి దక్కుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ విద్యాసాగర్ రావు ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పవర్ కోసం పోటీ పడుతుండగా గవర్నర్ ఎవరివైపు మొగ్గు చూపుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ముందు నాలుగు మార్గాలున్నాయని నిపుణులు అంటున్నారు. 1. శశికళను వేచి ఉండమని చెప్పడం దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన రూ. 66.65 కోట్ల అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు త్వరలో తీర్పు వెలువరించనుంది. అప్పటివరకు శశికళను వేచివుండమని చెప్పే అవకాశముంది. 2. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని చెప్పుకుంటున్న శశికళ నటరాజన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించి తర్వాత అసెంబ్లీలో బలం నిరూపించుకోమనవచ్చు. 3. పన్నీర్ కు మరో అవకాశం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పన్నీర్ సెల్వంకు మరో అవకాశం ఇవ్వొచ్చు. రాజీనామా వెనక్కు తీసుకోవడానికి సిద్ధమని సెల్వం ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరో ఛాన్స్ ఇచ్చే అవకాశముంది. అయితే తర్వాత బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. 4. రాష్ట్రపతి పాలన అధికార అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం సమసిపోయే మార్గాలు కనిపించకుంటే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ ప్రతిపాదించే అవకాశముంది. అయితే పన్నీరు సెల్వం, శశికళ వాదనలు విన్న తర్వాతే దీనిపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఈ నాలుగు మార్గాల్లో గవర్నర్ దీన్ని ఎంచుకుంటారనే దానిపై ఉత్కంత నెలకొంది.