రాజధానిలో నాలుగు మెట్రో లైన్లు
⇒ మొదటి లైనుతో విజయవాడ, నాలుగో లైనుతో గుంటూరుకు..
⇒ 108.17 కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రణాళిక
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నగరంలో నాలుగు మెట్రో రైలు కారిడార్లు (లైన్లు) నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 108.17 కిలోమీటర్ల మీటర్ల మేర ఈ కారిడార్లు నిర్మించాలని మాస్టర్ప్లాన్లో పొందుపరిచారు. మొదటి కారిడార్తో విజయవాడకు, నాలుగో కారిడార్తో గుంటూరుకు రాజధానిని అనుసంధానించాలని మెట్రో ప్రాజెక్టుకు వ్యూహరచన చేశారు. భవిష్యత్తులో రాజధాని జనాభా అనూహ్యంగా పెరుగుతుందనే అంచనాతో అందుకనుగుణంగా రవాణా అవసరాలను తీర్చడం కోసం ఈ కారిడార్లను ప్రతిపాదించారు. రాజధాని నగరంలోని ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రహదారులపై ఎలివేటెడ్ పద్ధతిలో ఈ కారిడార్లను నిర్మిస్తారు. రెండు దశల్లో ఈ మెట్రో ప్రాజెక్టును రాజధానిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఒక కారిడార్కే ప్రాధాన్యం..: తొలిదశలో రెండు కారిడార్లను ప్రతిపాదించినా ఒక కారిడార్కే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం విజయవాడ నగరంలో ప్రతిపాదించిన మెట్రో ప్రాజెక్టుకు అనుసంధానించేలా రాజధాని నిర్మించబోయే ఒకటో కారిడార్కు రూపకల్పన చేయాలని ప్రభుత్వం డీఎంఆర్సీను కోరింది. 15 నుంచి 20 కిలోమీటర్ల మేర కారిడార్ను రూపొందించాలని సూచించగా డీఎంఆర్సీ అధికారులు అదేపనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు విజయవాడ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులపై ఇంకా స్పష్టత లేని పరిస్థితుల్లో రాజధానిలో నాలుగు కారిడార్ల నిర్మాణం ఆచరణలో ఎంతవరకూ సాధ్యమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి అంచనాల ప్రకారం ఈ నాలుగు కారిడార్ల నిర్మాణానికి రూ.24 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
రాజధాని నుంచి విజయవాడ వరకూ - 26.22 కిలోమీటర్లు. ఈ కారిడార్ను భవిష్యత్తులో నేరుగా గన్నవరం ఎయిర్పోర్టుకు అనుసంధానించాలనేది ప్రణాళిక. రాజధాని నగరంలోని తూర్పు ప్రాంతం నుంచి పడమర వైపునకు ఈ కారిడార్ను విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు కలపాల్సివుంది. అవసరమైతే భవిష్యత్తులో దీన్ని రాజధానిలో దక్షిణం వైపునకు విస్తరించేలా అవకాశం ఉంది.
రాజధాని నుంచి మంగళగరి రైల్వే స్టేషన్ వరకూ - 31.06 కిలోమీటర్లు. ఈ కారిడార్ ఒకటో కారిడార్ పైనుంచి క్రాస్ చేసేలా ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ కారిడార్ నుంచి కూడా విజయవాడ నగరానికి వెళ్లే మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తారు.
రాజధాని నగరంలోని ప్రధాన నగరాలు - 25.32 కిలోమీటర్లు. రెండో దశలో నిర్మించే మూడో కారిడార్ రాజధాని తూర్పు, పశ్చిమ ప్రాంతాల మీదుగా ఒకటి, రెండు కారిడార్ల పైనుంచి వెళుతుంది.
రాజధాని నగరం నుంచి గుంటూరు వరకూ - 25.57 కిలోమీటర్లు. నాలుగో లైనును నగర శివారులోని దక్షిణం వైపు నుంచి గుంటూరుకు కలిపేలా ప్రణాళిక రూపొందించారు.