ఫైబర్ డక్ట్ వేయకుంటే బిల్లులు నిలిపేస్తాం
‘మిషన్ భగీరథ’పై సమీక్షలో వైస్చైర్మన్ ప్రశాంత్రెడ్డి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పైప్లైన్లతో పాటు ఫైబర్ డక్ట్ను ఖచ్చితంగా వేయాలని, లేనిపక్షంలో వర్క్ఏజెన్సీలకు బిల్లులను నిలిపివేయాలని‘మిషన్ భగీరథ’ కార్పొరేషన్ వైస్చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘మిషన్ భగీరథ’ పనుల పురోగతిపై గురువారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచి నీరందించడంతో పాటు ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్ట్కు సంబంధించి దశల వారీగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను, ప్రధాన పైప్లైన్ల ఏర్పాటును 2017 డిసెంబరులోగా పూర్తి చేయాలన్నారు.
2018 ఆఖరుకల్లా అన్ని గ్రామాల్లో అంతర్గత పైప్లైన్లను పూర్తి చేయాలని డెడ్లైన్ విధించారు. అంతర్గత పైప్లైన్ల్ల ఏర్పాటు విషయంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాప్యానికి కారణమయ్యే అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. పంచాయతీరాజ్ స్పెషల్ సీఎస్ ఎస్పీసింగ్ మాట్లాడుతూ..ఆర్డబ్ల్యుఎస్ అధికారులు, వర్క్ఏజెన్సీలు సమిష్టిగా పనిచేస్తేనే పనులు వేగంగా పూర్తవు తాయన్నారు. త్వరలోనే ‘మిషన్ భగీరథ’ ప్రాజెక్ట్ పనులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్వయంగా సమీక్షిస్తారని, అన్ని అంశాలకు సంబంధించి తాజా సమాచారంతో స్టేటస్ రిపోర్ట్, యాక్షన్ప్లాన్లను సిద్ధం చేయాలని సూచించారు.
సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆర్డబ్ల్యుఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్రెడ్డి, భగీరథ చీఫ్ ఇంజనీర్లు జగన్మోహన్రెడ్డి, కృపాకర్రెడ్డి, ఓఎస్డీ సత్యాపాల్రెడ్డి, అన్ని జిల్లాల ఎస్ఈలు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్లు, వర్క్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.