breaking news
fake bank accounts
-
కొలిక్కిరాని ఐకేపీ కుంభకోణం
తణుకు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవినీతి బట్టబయలైనా కనీసం విచారణ చేపట్టేందుకు అధికారులు ముందుకు రావడంలేదు. ఐకేపీ కుంభకోణం వ్యవహారంలో డ్వాక్రా మహిళల అనుమానాలను నివృత్తి చేయలేకపోతున్నారు. ఇరగవరం మండలం కత్తవపాడు గ్రామంలో ఇటీవల వెలుగు చూసిన ఐకేపీ కుంభకోణంలో ఇప్పటి వరకు బా«ధ్యులపై చర్యలు తీసుకోకపోగా కనీసం విచారణ కూడా చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు బహిరంగమే అయినా సంబంధిత అధికారులు మాత్రం నోరు మెదపడంలేదు. మరోవైపు గతంలో ఇదే మండలంలో వెలుగు చూసిన ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన మండలస్థాయి మాజీ నాయకుడి పాత్రపైనా డ్వాక్రా మహిళలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పాత్రపైనా అనుమానాలు గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళల పేరుతో పాలకొల్లు ఇండియన్ బ్యాంకులో నకిలీ ఖాతాలు సృష్టించిన వైనంపైనా అధికారులు ఇప్పటివరకు విచారణ చేపట్టకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ధాన్యం కొనుగోలులో దళారీగా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుడితోపాటు మరికొందరి తీరుపైనా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.10 కోట్ల మేర ఇదే తరహాలో నగదు లావాదేవీలు నిర్వహించినప్పటికీ దీనిపై విచారణ చేపట్టాల్సిన అధికారులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత ఖాతాదారులు లేకుండానే ఖాతాలు ప్రారంభించడంతో పాటు డ్రా చేసిన సమయంలో సైతం వారు లేకుండానే నగదు చెల్లించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2015 ఖరీఫ్ నుంచి 2017 వరకు సుమారు 392 మంది ఖాతాల ద్వారా సుమారు రూ.10 కోట్ల మేర లావాదేవీలు జరిగాయి. ఒక్కో ఖాతాదారుడి ఖాతాలో రూ.లక్ష నుంచి రూ.12 లక్షల వరకు జమచేసి అనంతరం డ్రా చేసినట్లు తెలుస్తోంది. సొమ్ము బదిలీ వ్యవహారం ఎఫ్టీవో (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) సంఖ్య ద్వారా స్పష్టమవుతోంది. జిల్లావ్యాప్తంగా.. ఇరగవరం మండలం కత్తవపాడు గ్రామంలో వెలుగు చూసిన ఐకేపీ కుంభకోణం ఇప్పుడు జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన నేతలు తమ బంధువుల పేరుతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి తమకు అనుకూలంగా ఉండే డ్వాక్రా మహిళలను సభ్యులుగా చేర్చి వారిపేరుతో ఈ తరహా వ్యవహారం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలాల్లో సైతం ఇదే తరహాలో ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా రైతులు ధాన్యం అమ్మే సమయంలో రైతు పట్టాదారు పుస్తకం, రుణార్హత కార్డు లేదా స్వయంగా ధ్రువీకరణ పత్రం అందజేయాలి. అయితే వ్యవసాయంతో సంబంధంలేని వ్యక్తులను రైతులుగా గుర్తించి వారి పేరుతో ఖాతాలు ప్రారంభించిన వ్యవహారం ఇప్పుడు ధుమారం రేపుతోంది. సాధారణంగా బ్యాంకు ఖాతా తెరవడానికి బ్యాంకు అధికారులు ఎన్నో నిబంధనలు చెబుతారు. ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసుకునే సమయంలో సైతం ఖాతాదారుడు తప్పనిసరిగా ఉండాలనే షరతులు పెడతారు. అయితే ఇక్కడ మాత్రం సంబంధిత ఖాతాదారుడు లేకుండానే పెద్ద మొత్తంలో నగదు చెల్లించడం వెనుక బ్యాంకు అధికారుల ప్రమేయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత మహిళలతో కొందరు టీడీపీ పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. -
ఆపరేషన్ ఫ్రమ్.. హైదరాబాద్
► నైజీరియన్ల మోసాలకు నగరంలోనే ఖాతాలు! ► తమ అనుచరులను నగరానికి పంపిన ప్రధాన దళారి ► బోగస్ వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచిన ద్వయం ► బాధితుల నుంచి డబ్బు డిపాజిట్ చేయించేది వీటిలోనే ► ఇద్దరిని అరెస్టు చేసిన సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: నివసిస్తున్న ఇంటికి అద్దె చెల్లింపు... నెలకు రూ.20 వేల వేతనం... ‘వ్యాపారం’ రూ.5 లక్షలు దాటితే 5 శాతం కమీషన్... ఇదంతా ఏదైనా మార్కెటింగ్ జాబ్ వ్యవహారం అనుకుంటున్నారా..? కానే కాదు. వివిధ రకాలైన సైబర్ నేరాలకు పాల్పడే నైజీరియన్లకు బోగస్ బ్యాంకు ఖాతాలు అందించిన వారికి దక్కే ‘ప్రతిఫలం’. ఢిల్లీకి చెందిన ఓ ప్రధాన దళారి నేతృత్వంలో పనిచేస్తున్న ఇద్దరు బిహారీలను నగర సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి విచారణలోనే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా నైజీరియన్లు, వారి దళారులు ఉత్తరాది, లేదా ఈశాన్య రాష్ట్రాల వారిని ‘మనీమ్యూల్స్’గా వాడుకుంటారు. అయితే తొలిసారిగా ఇద్దరు బిహారీలను హైదరాబాద్కు పంపించి, మనీమ్యూల్స్గా మార్చిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మనీమ్యూల్స్కు మహా డిమాండ్... వివిధ వీసాలపై భారత్కు వస్తున్న నైజీరియన్లు అనేక మెట్రోల్లో నివసిస్తున్నారు. సైబర్ నేరగాళ్లుగా మారుతున్న వీరిలో కొందరు ఎస్సెమ్మెస్లు, ఫోన్కాల్స్, ఈ–మెయిల్స్ ద్వారా వివిధ రకాలైన లాటరీలు, ఉద్యోగాలు, బహుమతుల పేరుతో ఎర వేస్తున్నారు. నమ్మి వల్లో పడిన వారి నుంచి రకరకాల పేర్లు చెప్పి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలా బాధితుల నుంచి డబ్బు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించుకునేందుకు వీరికి బ్యాంకు ఖాతాలు అవసరం. నేరుగా తెలిస్తే పోలీసులకు చిక్కే, అనుమానం వచ్చే అవకాశం ఉండటంతో మనీమ్యూల్స్ను ఏర్పాటు చేసుకుంటున్నారు. నైజీరియన్లకు అవసరమైన బ్యాంకు ఖాతాలకు బోగస్ వివరాలతో తెరిచి అందించే వారిని మనీమ్యూల్స్గా పేర్కొంటారు. వీరికి కొంత ప్రతిఫలం అందజేస్తారు. ఢిల్లీకి చెందిన దళారి ద్వారా... ఢిల్లీ, ముంబైల్లో ఉంటున్న నైజీరియన్లు మనీమ్యూల్స్ ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిపించి, వాటిలో డిపాజిట్ అయిన డబ్బును తమకు అందించడానికి కొందరు దళారులను ఏర్పాటు చేసుకున్నారు. ప్రధాన దళారిగా పని చేస్తున్న ఢిల్లీకి చెందిన కబీర్ఖాన్ అనే వ్యక్తి బిహార్కు చెందిన టైర్ల పంక్చర్లు వేసుకునే ఆదిత్య కుమార్, నిరుద్యోగి పర్వేజ్ మహ్మద్లను బోగస్ ఖాతాలు తెరవడం కోసం హైదరాబాద్కు పంపారు. కొన్నాళ్ల పాటు నాగోల్లో ఉన్న వీరు ప్రస్తుతం మాదాపూర్లో నివసిస్తున్నారు. బోగస్ వివరాలతో ఓటర్ ఐడీ, పాన్కార్డ్ పొందిన ఈ ద్వయం వివిధ బ్యాంకుల్లో 50 బోగస్ ఖాతాలు తెరిచింది. డిపాజిట్ అయిన నగదు అందిస్తూ... వీటి వివరాలను ఇద్దరూ కబీర్ఖాన్ ద్వారా నైజీరియన్లకు అందించారు. సైబర్ నేరాలకు పాల్పడే నైజీరియన్ల డబ్బు డిపాజిట్ చేయడానికి బాధితులకు ఈ ఖాతాల వివరాలే ఇస్తున్నారు. గత ఏడాదిగా ఆయా ఖాతాల్లో దాదాపు రూ.2 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఈ సొమ్మును వీరు ఎప్పటికప్పుడు డ్రా చేసి నేరుగా వెళ్లి కబీర్ ఖాన్కు ఇవ్వడం లేదా అతడు పంపిన వ్యక్తికి అప్పగించడం చేసేవారు. దీనికి ప్రతిఫలంగా వీరికి నెలకు రూ.20 వేల జీతం ఇస్తున్న కబీర్ఖాన్ ఓ నెల్లో రూ.5 లక్షల కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయితే దానికి 5 శాతం కమీషన్ కూడా ఇస్తున్నాడు. చిక్కింది ఇలా.. ఓ నైజీరియన్ నగరంలోని రెహ్మత్నగర్కు చెందిన పరమేశ్వర్రెడ్డికి స్టీఫెన్ పౌల్ పేరుతో మెయిల్ ఇచ్చాడు. అందులో లండన్లోని ఎస్సే హోటల్లో ఉద్యోగం అంటూ ఎరవేశాడు. పరమేశ్వర్ ఆసక్తి చూపడంతో రుసుముల పేరు చెప్పి రూ.1.3 లక్షలు ఎస్బీఐ ఖాతాలో జమ చేయించుకున్నారు. మళ్లీ వీసా ప్రాసెసింగ్ తదితరాల పేర్లు చెప్పి రూ.2 లక్షలు డిపాజిట్ చేయమన్నారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ పి.రవికిరణ్ ఈ కేసు దర్యాప్తు చేశారు. బ్యాంకు వివరాలను బట్టి ఆదిత్య, పర్వేజ్లను గుర్తించి పట్టుకున్నారు. వీరి నుంచి బోగస్ ఓటర్ ఐడీ, పాన్కార్డ్తో పాటు బ్యాంకు పాస్పుస్తకాలు, చెక్కుబుక్స్, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కబీర్ఖాన్ చిక్కితేనే నైజీరియన్లు ఎవరన్నది తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.