breaking news
estarts
-
నేటి నుంచి టాయ్ట్రైన్ పునఃప్రారంభం
సాక్షి, ముంబై: వర్షాకాలం నేపథ్యంలో సుమారు నాలుగు నెలలుగా నిలిచిపోయిన మాథేరన్ టాయ్ట్రైన్ (మినీ రైలు) సేవలు పునఃప్రారంభం కానున్నాయి. నవంబరు 4వ తేదీ శనివారం నుంచి ఈ ట్రైన్ ప్రారంభించేందుకు సెంట్రల్ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నేరుల్–మాథేరాన్ల మధ్య అప్, డౌన్ రెండేసి చొప్పున.. మొత్తం నాలుగు సర్విసులు నడపనున్నారు. మరోవైపు మార్పులు చేసిన సమయాలనుసారం అమన్ లాడ్జీ–మాథేరాన్ల మధ్య అప్, డౌన్ మార్గాల్లో ఆరు చొప్పున మొత్తం 12 సర్విసులు, శని, ఆదివారాల్లో అదనంగా రెండేసి చొప్పున ప్రత్యేక టాయ్ రైళ్లను నడపనున్నారు. వర్షాకాలంలో నిలిపివేత.. సాధారణంగా ప్రతి సంవత్సరం వర్షా కాలం ప్రారంభం కాగానే టాయ్ ట్రైన్ సేవలు నిలిపివేస్తారు. ఆ తరువాత మళ్లీ అక్టోబరు 15వ తేదీ నుంచి సర్విసులు పునఃప్రారంభిస్తారు. కానీ ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా పునఃప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతంలో ఒకటైన మాథేరాన్ను సందర్శించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. రైలులో కొండల మధ్య నుంచి ప్రయాణిస్తూ.. జలపాతాలు, పచ్చదనాన్ని చూసేందుకు ఇష్టపడతారు. నేరుల్ నుంచి 21 కి.మీ. దూరంలో కొండపై ఉన్న మాథేరాన్ చేరుకోవాలంటే రోడ్డు మార్గం కంటే మినీ రైలులో వెళ్లే ఆనందమే బాగుంటుందని పర్యాటకులు ఈ రైలు మార్గాన్ని ఎంచుకుంటుంటారు. రెలు మార్గం దాదాపు 90 శాతం కొండ అంచుల మీదుగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో రైల్వే ట్రాక్ కిందున్న మట్టి కొట్టుకుపోవడం, కొండ చరియలు విరిగిపడడం, వంతెనలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యేంత వరకు రైలు సేవలు పూర్తిగా నిలిపివేస్తారు. ఈ సమయంలో పర్యాటకులు రోడ్డు మార్గం మీదుగా మాథేరాన్ చేరుకోవల్సిందే. ఇప్పుడు టాయ్ ట్రైన్ సేవలు ప్రారంభమవుతుండటంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
తమిళనాడుకు తిరిగి ప్రారంభమైన ఆర్టీసీ బస్సులు
చిత్తూరు: ఆర్టీసీ ఎట్టకేలకు ఆంధ్రా నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులని ప్రారంభించింది. తమిళనాడు ప్రభుత్వంతో ఏపీఎస్ఆర్టీసీ జరిపిన చర్చలు సఫలం కావడంతో బస్సు సర్వీసులని తిరిగి పునరుద్ధరించింది. శేషాచలం ఎన్కౌంటర్ ఫలితంగా ఏపీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గత కొంత కాలంగా ఎక్కువవుతూ వచ్చాయి. తమిళనాడులో ఏపీ బస్సులపై తరచు దాడులు జరుగుతుండటం, దాంతో ఏపీఎస్ ఆర్టీసీ తన సర్వీసులను నిలిపివేయడం తెలిసిందే. అయితే.. తమిళనాడు బస్సులు మాత్రం యథేచ్ఛగా తిరుగుతుండటంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట తమిళనాడు బస్సులను ఏపీ గ్రామాల్లోకి రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ అధికారులు కూడా గత కొన్ని రోజులుగా తమిళనాడు ప్రభుత్వంతో చర్చలకు ప్రయత్నించినా సానుకూల స్పందన కరువైంది. గ్రామస్తుల ఆగ్రహం, ఆర్టీసీ అధికారుల విన్నపాల నేపథ్యంలో శనివారం తమిళనాడు ప్రభుత్వంతో ఏపీఎస్ఆర్టీసీ జరిపిన చర్చలు సఫలం కావడంతో తిరుమల వచ్చి వెళ్లే భక్తులకు ఊరట కలిగినట్లయింది. ఆర్టీసీ చాలా రోజుల నుంచి తమిళనాడుకు వెళ్లే సర్వీసులను రద్దుచేసింది. దాంతో సంస్థకు ఇప్పటికే దాదాపు రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.