breaking news
Emissions Scandal
-
ఫోక్స్వాగన్కు షాకిచ్చిన దక్షిణ కొరియా
జర్మన్ కారు తయారీదారి ఫోక్స్ వాగన్కు దక్షిణ కొరియా ప్రభుత్వం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. 80 ఫోక్స్వాగన్ మోడల్స్ అమ్మకాలను నిషేధిస్తున్నట్టు ఆ దేశ పర్యావరణ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఉద్గారాల చీటింగ్ స్కాండల్కు పాల్పడినందుకు గాను నిషేధంతో పాటు 16.06 మిలియన్ డాలర్ల నష్టపరిహారం విధిస్తున్నట్టు తెలిపింది. మొత్తం 83వేల డీజిల్, పెట్రలో సామర్ధ్యంతో రూపొందిన ఫోక్స్ వాగన్ వెహికిల్స్కు, తన లగ్జరీ కారు బ్రాండ్లు ఆడీ,బెంట్లీలకు అమ్మక సర్టిఫికేషన్ రద్దు చేస్తున్నట్టు పర్యావరణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం 2,09,900 ఫోక్స్ వాగన్ అమ్మకాలు దక్షిణ కొరియాలో నిలిపివేయనున్నారు. ఈ అమ్మక నిషేధం ఫోక్స్ వాగన్ గ్రూపుకు చెందిన మొత్తం 32 రకాల వాహనాలపై ఎక్కువగా ప్రభావం చూపనుంది. 2007 నుంచి ఫోక్స్వాగన్ మొత్తం 68 శాతం వెహికిల్స్ ను ఆ దేశంలో విక్రయించినట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. నవంబర్ లోనే 1,26,000 ఫోక్స్ వాగన్ వాహనాలకు ప్రభుత్వం అమ్మక సర్టిఫికేషన్ రద్దు చేసింది. ఆ వాహనాలన్నింటినీ వెంటనే రీకాల్ చేసుకోమని ఆదేశించి, నష్టపరిహారం సైతం విధించింది. తాజాగా అమ్మకాల నిషేధంతో పాటు, 16.06 మిలియన్ డాలర్లను ఫైన్ గా విధిస్తున్నట్టు పేర్కొంది. అయితే ప్రభుత్వ నిర్ణయానికి ముందే ఈ కారు తయారీదారి వినియోగదారుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించడానికి స్కాంకు ప్రభావితమైన కార్ల అమ్మకాలను జూలై 25నుంచి నిషేధిస్తున్నట్టు తెలిపింది. డీజిల్ ఉద్గారాల టెస్టులో చీటింగ్కు పాల్పడినట్టు ఈ కారు తయారీదారు అమెరికాలో అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 110 లక్షల వాహనాల్లో ఈ అక్రమ సాప్ట్వేర్ను అమర్చినట్టు తన తప్పును ఒప్పుకుంది. ఈ తప్పును సరిదిద్దుకునే నేపథ్యంలో ఫోక్స్ వాగన్ అష్టకష్టాలు పడుతోంది. దక్షిణ కొరియాలో ఇప్పటికే అమ్మకాలు పతనమై తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఫోక్స్వాగన్కు నేడు వెలువరించిన నిర్ణయం మరింత కుంగదీయనున్నట్టు తెలుస్తోంది. ఈ స్కాండల్ బయటపడక ముందు దక్షిణ కొరియాలో టాప్ సెల్లింగ్ వెహికిల్స్ లో ఫోక్స్ వాగన్ ఒకటిగా నిలిచేది. -
1.9లక్షల ఫోక్స్ వాగన్ కార్లు రీకాల్
కర్బన ఉద్గారాల స్కాం ఎఫెక్ట్ భారత్ లో అమ్ముడుపోయిన ఫోక్స్ వాగన్ కార్లపైనా పడింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ, జర్మన్ ఆటోమేకర్ ఫోక్స్ వాగన్, భారత్ లో కూడా తన కార్లను రీకాల్ చేయనున్నట్టు ప్రకటించింది. 1.9లక్షల కార్లను ఈ ఏడాది జూలై నుంచి రీకాల్ చేస్తామని వెల్లడించింది. కర్బన ఉద్గారాల స్కామ్ ఆరోపణలు రుజువైన క్రమంలో ఫోక్స్ వాగన్ తన కార్లను రీకాల్ చేయడం ప్రారంభించింది. అయితే భారత్ లో స్వచ్ఛందంగానే తమ కార్లను రీకాల్ చేస్తున్నామని, అమెరికాలో లాగా భారత్ లో కర్బన ఉద్గారాల నిబంధనలను ఉల్లఘించినందుకు ఎలాంటి చర్యలను, ఫీజులను భరించలేదని పేర్కొంది. జూలై నుంచి రీకాల్ ప్రాసెస్ ప్రారంభించి, తర్వాత 10 నెలల వరకు కొనసాగిస్తామని ఫోక్స్ వాగన్ మార్కెటింగ్ అధినేత కమల్ బసు వెల్లడించారు. నిబంధనలు ఉల్లఘించి మోసపూరిత కర్బన ఉద్గారాల సాప్ట్ వేర్ ను ఫిక్స్ చేసినందుకు అమెరికాలో తన కార్లను ఫోక్స్ వాగన్ రీకాల్ చేసింది. భారత్ లో కూడా ఈ సాప్ట్ వేర్ ఫిక్స్ చేసిన వాహనాలను రీకాల్ చేయనున్నామని బసు ప్రకటించారు. రీకాల్ కోసం రెగ్యులేటరీ నుంచి ఫోక్స్ వాగన్ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ మోసపూరిత సాప్ట్ వేర్ ఉన్న దాదాపు 11 మిలియన్ డీజిల్ ఇంజన్ కార్లను యూఎస్, యూరప్, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మినట్టు ఫోక్స్ వాగన్ ప్రకటించింది. అమెరికాలో ఈ స్కామ్ బయటపడిన తర్వాత భారత్ లో ఫోక్స్ వాగన్ అమ్మకాలు పడిపోయాయి. అమెరికాలో మార్కెట్లో ఫోక్స్ వాగన్ జరిమానాలు, క్రిమినల్ ఇన్ వెస్టిగేషన్లతో రెట్టింపు చర్యలను ఎదుర్కొంటోంది.