breaking news
DVAC
-
మాజీ ఎమ్మెల్యే ఇంట్లో డీవీఏసీ సోదాలు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే నేత, టీనగర్ మాజీ ఎమ్మెల్యే సత్యను డీవీఏసీ బుధవారం టార్గెట్ చేసింది. చైన్నె, కోయంబత్తూరు తదితర 16కు పైగా ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఈ తనిఖీలకు వ్యతిరేకంగా పలు చోట్ల అన్నాడీఎంకే వర్గాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. వివారాలు.. డీఎంకే అధికారంలోకి వచ్చినానంతరం అన్నాడీఎంకే మాజీ మంత్రులను, పలువురు మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. తమకు గతంలో అందిన సమాచారం, ఆధారాలు, ఫిర్యాదుల మేరకు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్ (డీవీఏసీ – అవినీతి నిరోధక శాఖ) వర్గాలు దూకుడుగా ముందుకెళ్తున్నాయి. మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, తంగమణి, వీరమణి, విజయ భాస్కర్, ఎంఆర్ విజయ భాస్కర్ , కేపీ అన్భళగన్ల తదితరులతో పాటు మాజీ సీఎం పళని స్వామి సన్నిహితులు, కాంట్రాక్టర్లు తదితరుల ఇళ్లు, వారికి సంబంధించిన సంస్థలు, కార్యాలయాలు, సన్నిహితులను గురిపెట్టి ఇప్పటికే సోదాలు ముగిశాయి. ఈ కేసులన్నీ ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. అదే సమయంలో తాజాగా టీ నగర్ సత్యను ఏసీబీ టార్గెట్ చేసింది. కోర్టు ఆదేశాలతో దూకుడు.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆస్తుల వివరాలను సత్య దాచి పెట్టి తప్పుడు సమాచారం నామినేషన్లో పేర్కొన్నట్లు ఇప్పటికే ఫిర్యాదులు హోరెత్తాయి. అలాగే ఆదాయానికి మించి ఆయన ఆస్తులు గడించినట్లు వచ్చిన ఫిర్యాదులను డీవీఏసీ విచారించింది. అదే సమయంలో హైకోర్టులో న్యాయమూర్తి ఆనంద వెంకటేషన్ బెంచ్ సైతం ఈ ఫిర్యాదులపై దృష్టి పెట్టింది. రెండు నెలల్లో కేసును ముగించాలని, విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇదే అదనుగా అస్సలే అన్నాడీఎంకే వర్గాల మీద తీవ్ర ఆక్రోశంతో ఉన్న పాలకులు తాజాగా కోర్టు ఆదేశాలతో సత్యను టార్గెట్ చేసి దూకుడు పెంచారు. భారీగా అక్రమాస్తులు.. తమ విచారణలో వెలుగు చూసిన అంశాల మేరకు మాజీ ఎమ్మెల్యే సత్య అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఏసీబీ గుర్తించింది. 2016–21లో ఆయన ఆదాయానికి మించి రూ. 2.64 కోట్లు ఆస్తులు గడించినట్టు గుర్తించిన డీవీఏసీ కేసు నమోదు చేసింది. సత్యతో కలిసి పలు వ్యాపారాలు చేస్తున్నట్టుగా పేర్కొంటున్న, అన్నాడీఎంకే ఉత్తర చైన్నె తూర్పు జిల్లా కార్యదర్శి రాజేష్ను కూడా టార్గెట్ చేశారు. తండయార్ పేటలోని రాజేష్ నివాసంలో ఐదుగురు అధికారులతో కూడిన బృందం సోదాలు చేపట్టింది. వడపళణిలోని సత్య నివాసంతో పాటు చైన్నె, కోయంబత్తూరు, తిరువళ్లూరు తదితర 16 ప్రాంతాలలో పలు బృందాలుగా ఏసీబీ అధికారులు సోదాల్లో నిమగ్నమయ్యారు. గుమ్మిడి పూండి సమీపంలోని ఆరపాక్కంలోని సత్య మిత్రుడు దిలీప్కుమార్కు చెందిన కల్యాణ మండపం, రియల్ ఎస్టేట్ సంస్థలలోనూ సోదాలు చేపట్టారు. ఈ సోదాల సమాచారంతో సత్య మద్దతు అన్నాడీఎంకే వర్గాలు రంగంలోకి దిగాయి. అధికారపక్షం కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఏసీబీని ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి. ఆందోళన కారులను అడ్డుకున్నారు. ఆయా ప్రాంతాలలో తిష్ట వేసిన అన్నాడీఎంకే వర్గాలు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనంను సత్య మద్దతుదారులు సరఫరా చేయడం గమనార్హం. గట్టి భద్రత నడుమ అనేక చోట్ల పొద్దుపోయే వరకు సోదాలు జరిగాయి. ఇందులో పలు రికార్డులు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
బ్రదర్స్తో చిక్కులు
- ఆస్తుల జప్తునకు కసరత్తు - డీవీఏసీ సన్నద్ధం - డీఎంకేలో కలవరం సాక్షి, చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు శిక్ష పడ్డ వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని రాజకీయ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలచుకోవాలనుకున్న డీఎంకే వర్గాలకు మారన్ బ్రదర్స్ రూపంలో చిక్కులు ఎదురుకానున్నాయి. ఎయిర్ సెల్, మ్యాక్సిస్ ఒప్పంద వ్యవహారం ఉచ్చు మారన్ బ్రదర్స్ మెడకు చుట్టుకుంటోంది. వారికి సంబంధించిన రూ. 742 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేయడమే లక్ష్యంగా డీవీఏసీ సన్నద్ధం అవుతోంది. దేశాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో డీఎంకే నేతల ప్రమే యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసుతో పాటుగా మనీలాండరింగ్ వ్యవహారం ఆ పార్టీ అధినేత కరుణానిధి గారాల పట్టి కనిమొళి, మాజీ మంత్రి ఎ.రాజాపై సీబీఐ అభియోగాలు మోపింది. అలాగే, కరుణానిధి మనవళ్లు మారన్ బ్రదర్స్ను బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ల దుర్వినియోగం, ఎయిర్ సెల్, మ్యాక్సిస్ ఒప్పందాలు చుట్టుముట్టా యి. ఈ అవినీతి ప్రభావంతో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో డీఎంకే డీలా పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తమపై పడిన మచ్చల్ని చెరుపుకోవడంతోపాటు ప్రజ ల్ని ఆకర్షించి కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో ఆ పార్టీ అధినేత కరుణానిధి ఉన్నారు. అదే సమయంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్ష పడడం, ఆ పార్టీ వర్గాల వీరంగం, శాంతి భద్రతల క్షీణింపు వ్యవహారాల్ని అస్త్రంగా చేసుకుని రాజకీయ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డారు. తమపై పడ్డ అవినీతి బురదను కడిగేసుకునేలా జయలలిత జైలు శిక్ష అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మార్కుల్ని కొట్టేయాలన్న కాంక్షతో ఉరకలు తీస్తున్న డీఎంకేకు మారన్ బ్రదర్స్ రూపంలో చిక్కులు ఎదురుకానున్నాయి. ఆస్తుల జప్తునకు సన్నద్ధం గతంలో చోటు చేసుకున్న ఎయిర్ సెల్, మ్యాక్సిస్ ఒప్పందాల్లో దయానిధి మారన్, కళానిధి మారన్ బ్రదర్స్పై సీబీఐ అభియోగాల్ని మోపిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించిన చార్జ్షీట్ సైతం కోర్టులో దాఖలైంది. ఈ ఒప్పందాల మేరకు రూ.742 కోట్ల మేరకు నగదు బదలాయింపులు జరిగినట్టు సీబీఐ స్పష్టం చేసింది. దీంతో డెరైక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగింది. ఇప్పటికే మారన్ బ్రదర్స్ను ఈ విభాగం అధికారులు విచారించారు. అందులో లభించిన ఆధారాలు, సీబీఐ చార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుని తమిళనాడులోని మారన్ బ్రదర్స్కు చెందిన రూ.742 కోట్లు విలువైన ఆస్తుల్ని జప్తు చేసేందుకు డీవీఏసీ వర్గాలు కసరత్తు చేస్తున్నారుు. ఈ కేసు వ్యవహారంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ప్రమేయంపై సైతం దృష్టి కేంద్రీకరించడంపై రాష్ట్రంలో చర్చ మొదలైంది. ఈ ఆస్తుల జప్తు పర్వం మరికొద్ది రోజుల్లో జరగొచ్చన్న సంకేతాలు వెలువడడడంతో డీఎంకే వర్గాల్లో కలవరం మొదలైంది. మారన్ బ్రదర్స్ రూపంలో మళ్లీ తమ అధినేతకు చిక్కులు తప్పవేమోనంటూ కరుణ సేన పెదవి విప్పుతుండడం గమనార్హం.