breaking news
domination Fighting
-
మంత్రి ఆది X సీఎం రమేశ్
సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడిగా రెండో మారు ఎన్నిక కావడంతో అధికార పార్టీకి సంబంధించి జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి.ఎన్నికల ఏడాదిలో మళ్లీ పదవి దక్కించుకున్న సీఎం రమేశ్తో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి మంత్రి ఆదికి విభేదాలు ఉన్నాయి. తాను నివాసం ఉంటున్న పోట్లదుర్తి గ్రామం మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఉండటం గమనార్హం. సీఎం రమేశ్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని ప్రోత్సహిస్తుండటంతోపాటు తన క్యాడర్ను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవల జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రత్యేకించి ఎర్రగుంట్ల మండలంలో అనేక సందర్భాల్లో ఇరువర్గాల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. మంత్రి పదవి ఏడాదితో ముగియనుంది. సీఎం రమేశ్ ఆరేళ్లు పదవిలో ఉండనున్నారు. అదేసందర్భంలో మంత్రి ఆదికి చెక్ పెట్టడానికి పావులు కదుపుతున్నారు. ప్రొద్దుటూరు : జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేశ్ మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది.. వీరి మధ్య ఆది నుంచి విభేదాలు ఉన్నాయి.. రెండో సారి రాజ్యసభ సభ్యుడి పదవీ కోసం సీఎం రమేశ్ ఇటీవల తీవ్రంగా ప్రయత్నించారు.. ఆయనకు మోకాలొడ్డడానికి ఆదినారాయణరెడ్డి ప్రయత్నించారు.. రమేశ్కు ప్రత్యామ్నాయంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేరును సీఎం చంద్రబాబు వద్ద ఆయన ప్రతిపాదించారు. అయితే ఎట్టకేలకు రమేశే ఆ పదవి దక్కించుకున్నాడు. ఆయన ప్రతివ్యూహంగా ఆదినారాయణరెడ్డికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నేడు స్వగ్రామానికి ఎంపీ రాక: ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి గ్రామానికి చెందిన సీఎం రమేశ్ రాజ్యసభ సభ్యుడిగా రెండో సారి ఎన్నికైన అనంతరం తొలిమారు స్వగ్రామానికి శనివారం వస్తున్నారు. ఈ సందర్భంగా కడప ఎయిర్పోర్టు నుంచి పోట్లదుర్తి వరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రమేశ్ ఎంపికతో అటు జమ్మలమడుగు, ఇటు ప్రొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాల్లో రాజకీయం వేడెక్కింది. భవిష్యత్తులో రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, సీఎం రమేశ్.. వీరిద్దరిదీ ఒకే నియోజకవర్గం (జమ్మలమడుగు) కావడంతో.. వారి వర్గాల మధ్య తొలి నుంచి విభేదాలు ఉన్నాయి. ఆదినారాయణరెడ్డి వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు సీఎం రమేశ్తో పోటీ పడే వారు. 2014 ఎన్నికలు పూర్తవుతూనే ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి చెందిన 8 మంది కౌన్సిలర్లను సీఎం రమేశ్ తీసుకెళ్లడం.. అదే సందర్భంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఆది ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో తీవ్ర స్థాయిలో పోట్లదుర్తి సోదరులపై విమర్శలు చేయడం జరిగింది. ఎర్రగుంట్ల పరిధిలోని సుందరయ్య నగర్లో ఏడాది క్రితం సబ్స్టేషన్ నిర్మించగా.. ఇద్దరి పోటీ కారణంగా ఇప్పటి వరకు సిబ్బందిని నియమించలేదు. ఎర్రగుంట్ల నగర పంచా యతీకి సంబంధించి ఓ చౌకదుకాణం విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆ సందర్భంగా ఆదినారాయణరెడ్డి పోట్లదుర్తి సోదరులనుద్దేశించి బహిరంగంగా విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. గండికోట ప్రాజెక్టు పునరావాస పనులు తమకు దక్కలేదన్న ఉద్దేశంతో ఇటీవల ఆది, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గీయులు.. కొండాపురంలోని సీఎం రమేశ్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. శ్రీనివాసరెడ్డిని ప్రతిపాదించిన ఆది సీఎం రమేశ్ రాజ్యసభ సభ్యునిగా రెండో మారు పోటీ చేసేందుకు ఇటీవల తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సభ్యుడి పదవి ఇవ్వాలని ఆది సీఎం చంద్రబాబు వద్ద ప్రతిపాదన పెట్టారు. సీఎం రమేశ్ను అడ్డు తొలగించుకోవాలన్న కారణంతోనే.. మంత్రి ఇలా చేశారనే విమర్శలు ఉన్నాయి. ఎట్టకేలకు సీఎం రమేశ్ను ఎంపీ పదవి వరించింది. ఏర్పాట్లలో ముందున్న నేతలు సీఎం రమేశ్ శనివారం స్వగ్రామానికి వస్తున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. ఇందులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఎయిర్పోర్టు నుంచి ఎర్రగుంట్ల వరకు అక్కడక్కడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ర్యాలీకి వాహనాలు సమకూర్చడంతోపాటు అన్ని పనుల్లో ముందున్నారు. తొలి నుంచి సీఎం రమేశ్ రామసుబ్బారెడ్డిని బలపరుస్తున్నారు. కమలాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డి టికెట్ను ఆశిస్తున్నారు. అయితే తాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వీరశివారెడ్డి ఇటీవల ప్రకటించడంతో కమలాపురం రాజకీయం రసకందాయంగా మారింది. టికెట్ కోసమే వీరశివారెడ్డి సీఎం రమేశ్తో ఎక్కువగా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. పుత్తా నరసింహారెడ్డికే టికెట్ వస్తుందని జనవరిలో జరిగిన జన్మభూమి గ్రామ సభలో మంత్రి ఆది ప్రకటించడం గమనార్హం. ప్రొద్దుటూరులో వరదతో... ప్రొద్దుటూరు నియోజకవర్గ రాజకీయాలకు సంబంధించి వరదరాజులరెడ్డికి సీఎం రమేశ్తో పూర్తి స్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం జరిగిన మైదుకూరు – బద్వేలు హైవే రోడ్డు టెండర్ నుంచి సీఎం రమేశ్ నామినేషన్ రోజు జరిగిన ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు టెండర్ల వరకు ఇరువురు నేతలు పోటీ పడుతున్నారు. సీఎం రమేశ్ రాక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గీయులైన వీఎస్ ముక్తియార్, ఈవీ సుధాకర్రెడ్డితోపాటు పలువురు కౌన్సిలర్లు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముక్తియార్ సీఎం రమేశ్కు 60 వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. వరద మాత్రం వీటికి దూరంగా ఉన్నారు. తొలి నుంచి సీఎం రమేశ్ ప్రొద్దుటూరుపై దృష్టి సారిస్తున్నారు. అదే నేపథ్యంలో వరద వారిని వ్యతిరేకిస్తున్నారు. -
ఎత్తులు...పై ఎత్తులు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దశాబ్దం తరువాత దశ తిరిగింది. అధికారం అందివచ్చింది. ఇక పదవులు చేపట్టడమే ఆలస్యం. సరిగ్గా ఇక్కడే టీడీపీలో ఆధిపత్య పోరు ఊపందుకుంది. రసవత్తరంగా సాగుతోంది. జిల్లాలో పార్టీ.. ప్రభుత్వంపై పట్టు బిగించడానికి టీడీపీలో ఇరువర్గాలు నడుం బిగించాయి. ఎత్తులు పై ఎత్తుల్లో నిమగ్నమయ్యాయి. తమ మాట నెగ్గించుకునేందుకు కళా, కింజరాపు వర్గాలు చాపకింద నీరులా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే తమ మనోగతాన్ని అధినేత దృష్టికి తీసుకువెళ్లిన ఇరువర్గాలు మహానాడు తరువాత తమ వ్యూహాలకు మరింత పదును పెట్టనున్నాయి. దాంతో రాబోయే రెండు వారాల్లో టీడీపీ రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ‘కళా’కళలాడకూడదని.. సీనియర్ నేతగా కళా వెంకట్రావు జిల్లాపై ఆధిపత్యం సాధిస్తారేమోనని కింజరాపు వర్గం కలవరపడుతోంది. ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు జిల్లాలో కళాకు ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కళాకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖ కట్టబెడితే జిల్లా అంతటినీ ఆయన తన గుప్పిట్లో పెట్టుకుంటారన్నది కింజరాపు అచ్చెన్నాయుడు ఆందోళన. కళాకు పార్టీ ఎమ్మెల్యేలు శివాజీ, గుండ లక్ష్మీదేవి సహకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఆయనకు మంత్రి పదవి కాకుండా స్పీకర్ పదవి ఇస్తే జిల్లా లో తమ ఆధిపత్యానికి అడ్డుండదన్నది కింజరాపు వర్గం వ్యూహం. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్నవారు ప్రత్యక్షంగా రాజకీయాలు చేయలేరు. అందుకే రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరిలతోపాటు మరికొందరి ద్వారా చంద్రబాబు దృష్టికి ఈ ప్రతిపాదన తీసుకువెళ్లారు. దీనిపై చంద్రబాబు స్పందన ఇంతవరకు తెలియరాలేదు. కానీ అచ్చెన్నలో మాత్రం ఆశ మిగిలే ఉంది. మరో సీనియర్ నేత గౌతు శివాజీని అసలు మంత్రివర్గంలోకే తీసుకోవద్దని కూడా కింజరాపు వర్గం గట్టిగా కోరుతోంది. తనకంటే సీనియర్ అయిన శివాజీ మంత్రి అయితే అచ్చెన్నకు జిల్లాలో ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అందుకే శివాజీ కాకుండా తానొక్కడినే మంత్రిగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం. తాను అయితేనే జిల్లాలో పార్టీకి దూకుడుగా ముం దుకు తీసుకువెళ్లగలనని.. శివాజీ ఆ పని చేయలేరని అచ్చెన్న అధినేత చంద్రబాబుకు వివరించారని సమాచారం. ఇలా అటు కళాను తప్పించడం... మరోవైపు శివాజీని ఎమ్మెల్యే పాత్రకే పరిమితం చేయాలన్నది కింజరాపు వర్గం ఎత్తుగడగా ఉంది. తమ సన్నిహితుడైన చౌదరి బాబ్జీ భార్య ధనలక్ష్మిని జెడ్పీ చైర్పర్సన్గా ఎంపిక చేయడం ద్వారా జిల్లాను పూర్తిగా తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్నది కింజరాపు వర్గం అసలు లక్ష్యం. మహానాడు తరువాత ఈ ప్రతిపాదనలను మరింత గట్టిగా చంద్రబాబు వద్ద వినిపించాలని అచ్చెన్న భావిస్తున్నారు. జెడ్పీ పీఠం పాలకొండ డివిజన్కు! కింజరాపు వర్గానికి దీటుగానే కళా వెంకట్రావు రాజకీయ వ్యూహానికి తెరతీశారు. తన సీనియారిటీ, అధిష్టానం వద్ద తనకున్న పలుకుబడిని రంగరించి చాపకింద నీరులా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తాను స్పీకర్గా వెళ్లనని.. మంత్రిమండలిలోనే చేరుతానని కళా ఇప్పటికే చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు సమాచారం. తద్వారా కీలకమైన మంత్రి పదవి చేపట్టేందుకు ఆయన మార్గం సుగమం చేసుకుంటున్నారు. మరోవైపు జిల్లాలో కింజరాపు వర్గం పాత్రను పరిమి తం చేయడంపైనా దృష్టి సారిం చారు. అచ్చెన్న కంటే గౌతు శివాజీయే మంత్రి పదవికి మెరుగైన నేత అవుతారని కళా అధినేతకు వివరించినట్లు సమాచారం. అచ్చెన్న కంటే సీనియర్ అయిన శివాజీకి ఇవ్వాలని చెబుతున్నారు. వెలమ సామాజికవర్గం కోటాలో విశాఖ జిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, విజయనగరం జిల్లాకు చెందిన కోళ్ల లలితకుమారిలకు అవకాశం కల్పించాల్సి ఉంది కాబట్టి.. శ్రీకాకుళంలో ఇతర సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు చంద్రబాబు మొగ్గుచూపితే అచ్చెన్నకు మంత్రి యోగం చేజారుతుంది. మరోవైపు జెడ్పీ పీఠం విషయంలోనూ మరో వ్యూహానికి తెరతీశా రు. కింజరాపు వర్గీయుడైన చౌదరి బాబ్జీ సతీమణి ధనలక్ష్మికి కాకుండా ఇతరులకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి ఎమ్మెల్యేలు లేని పాలకొండ డివిజన్కు జెడ్పీ చైర్పర్సన్ పదవిని కేటాయించాలని ఆయన ప్రతిపాదించినట్లు సమాచారం. వాస్తవానికి జెడ్పీ చైర్పర్సన్గా ఎవర్ని ఎంపిక చేస్తారన్న దానిపై కళాకు పెద్దగా ఆసక్తిలేదని తెలుస్తోంది. కానీ జెడ్పీ పీఠానికి వేరొకరిని ప్రతిపాదించడం ద్వారా అచ్చెన్నను ఆత్మరక్షణలో పడేయాల్నదే ఆయన వ్యూహం. జెడ్పీ చైర్పర్సన్ విషయంలో అచ్చెన్న పట్టుబడితే మంత్రి పదవి విషయంలో ఆయన మాట చెల్లుబాటు కాకుండా పోతుంది కదా అన్నది కళా ఎత్తుగడగా ఉంది. ఈ నేపథ్యంలో మహానాడు అనంతరం కింజారపు, కళా వర్గాలు హైదరాబా ద్ కేంద్రంగా తమ రాజకీయ వ్యూ హాలకు పదును పెట్టనున్నాయి.