
అత్యాధునిక ఆయుధ కొనుగోళ్లపై అగ్రదేశాల దృష్టి
దాయాదుల నిలువరింపు, సైనిక మార్కెట్ల విస్తరణే లక్ష్యం
2019 తర్వాత తొలిసారి అతిపెద్ద సైనిక కవాతు చేపట్టిన చైనా
పెంటగాన్ పేరును డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా మార్చిన అగ్రరాజ్యం
రక్షణ బడ్జెట్ను అమాంతం పెంచేసిన నాటో దేశాలు
న్యూఢిల్లీ: ప్రపంచంపై ఆధిపత్యం నిలుపుకొనేందుకు అగ్రదేశాలు సరికొత్త పోటీకి తెరతీశాయి. అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టాయి. అత్యంత శక్తివంతమైన దేశాలైన అమెరికా, చైనా ఇప్పటికే ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేయగా యూరొప్ నుంచి ఆసియా దాకా ఇతర దేశాలు సైతం తామేమీ వెనకబడలేదన్నట్లుగా రక్షణ బడ్జెట్లను అమాంతం పెంచేశాయి.
సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మించి ఆయుధ కొనుగోళ్ల అంశానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. దాయాది దేశాలను నిలువరించాలన్న లక్ష్యంతోపాటు కొత్త ఆయుధ మార్కెట్లను సృష్టించుకోవాలన్న ఆకాంక్షను నెరవేర్చుకొనేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. దీంతో గత కొన్ని దశాబ్దాల్లోకెల్లా ఎప్పుడూ లేనంత స్థాయికి ప్రపంచ దేశాల రక్షణ బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. వెరసి ప్రపంచమంతా ప్రపంచ యుద్ధాల కాలంనాటి పరిస్థితుల వైపు తిరిగి మళ్లుతోంది.
చైనా దూకుడు..
డ్రాగన్ దేశం చైనా 2019 తర్వాత తొలిసారి అతిపెద్ద సైనిక పరేడ్ను టియాన్మెన్ స్క్వేర్లో అట్టహాసంగా నిర్వహించింది. ఉక్రెయిన్ అంశంతోపాటు దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం విషయంలో అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో తన సైనిక పాటవాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంత దూరంలో ఉన్న లక్ష్యాలనైనా ఛేదించగల అత్యాధునిక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులతోపాటు జలాంతర్గాములు, డ్రోన్లతో పరేడ్ నిర్వహించింది.
అగ్రరాజ్యం ప్రతిస్పందన..
చైనా సైనిక కవాతు జరిగిన రోజుల వ్యవధిలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రాగన్ దూకుడుకు ప్రతిస్పందనగా తమ దేశ రక్షణశాఖ కేంద్ర కార్యాలయమైన పెంటగాన్ పేరును తిరిగి ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’గా మార్చాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో పాత పేరును పునరుద్ధరించడమే సరైన చర్య అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తద్వారా యావత్ ప్రపంచానికి తమ యుద్ధకాంక్ష, సన్నద్ధతను మరోసారి చాటిచెప్పారు. 1789 నుంచి రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ పేరిటే అమెరికా సైన్యం పోరాడింది.
అదే బాటలో నాటో దేశాలు
యూరొప్ సైతం తమ ఆయుధ సంపత్తిని పెంచుకోవడంపై దృష్టిపెట్టింది. ఈ ఏడాది రక్షణ బడ్జెట్ను జీడీపీలో 5 శాతానికి పెంచాలని నాటో సభ్య దేశాలు నిర్ణయించాయి. మౌలిక రక్షణ సరీ్వసులు, కీలక రక్షణ వ్యవస్థల బలోపేతానికి ఈ నిధులను ఖర్చు చేయాలని తీర్మానించాయి. సభ్య దేశాలన్నీ ప్రచ్ఛన్న యుద్ధ కాలంనాటి సైనిక సన్నద్ధతను 2030 నాటికల్లా సంతరించుకోవాలని నాటో నూతన సెక్రటరీ జనరల్ మార్క్ వ్యాఖ్యానించడం ప్రస్తుత పరిణామాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఇతర దేశాలూ రేసులోనే..
ఇతర దేశాలు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లుగా ఆయుధ సంపత్తి పెంచుకొనే రేసులోకి వచ్చాయి. ఉత్తర కొరియా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా.. పోలాండ్తో కోట్లాది డాలర్ల ఆయుధ కొనుగోళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరోవైపు బ్రిటన్ సైతం 10 బిలియన్ డాలర్ల విలువైన యుద్ధనౌకలను నార్వేకు విక్రయించింది. అలాగే టర్కీ కూడా తమ డ్రోన్లను ప్రపంచవ్యాప్తంగా యుద్ధ జోన్ల ప్రాంతాలకు ఎగుమతి చేస్తోంది.
సైనిక ఖర్చు అంకెల్లో..
2.718 ట్రిలియన్ డాలర్లు: 2024లో ప్రపంచ దేశాలు చేపట్టిన సైనిక వ్యయం. ఇది భారత్, దక్షిణాఫ్రికా, కెనడా, బ్రెజిల్ దేశాల వార్షిక బడ్జెట్లకన్నా అధికం కావడం గమనార్హం. ప్రచ్ఛన్న యుద్ధకాలంనాటి స్థాయిలను సైతం ఈ వ్యయం దాటేసింది. స్టాక్హోం అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (ఎస్ఐపీఆర్ఐ) అంచనా ప్రకారం 2023తో పోలిస్తే 2024లో ప్రపంచ దేశాల సైనిక ఖర్చు 9.4% పెరిగింది.
60%: ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, రష్యా, చైనా, జర్మనీ వాటా.
343 బిలియన్ డాలర్లు: 2024లో రక్షణ రంగంపై యూరోపియన్ యూనియన్ చేసిన ఖర్చు.
జీడీపీలో 5%: నాటో సభ్య దేశాల నూతన రక్షణరంగ వ్యయ లక్ష్యం.
10 బిలియన్ డాలర్లు: నార్వేతో బ్రిటన్ కుదుర్చుకున్న యుద్ధనౌకల విక్రయ ఒప్పందం. ఇది బ్రిటన్ అతిపెద్ద ఎగుమతిగా నిలిచింది.