breaking news
weaponry
-
అలనాటి అస్త్రాలు... బ్రహ్మాస్త్రం... బ్రహ్మాండాస్త్రం
మహాభారత కాలంలో ఉపయోగించిన అస్త్రశస్త్రాల గురించీ, వాటి విశిష్ఠత గురించీ, వాటిని ఎవరు ఉపయోగించారు అనే విషయాలను గురించి గతవారం కొంత తెలుసుకున్నాం కదా... ఈ వారం ఆ అస్త్రాలలో కొన్ని ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాం... బ్రహ్మాస్త్రం... సృష్టికర్త అయిన బ్రహ్మ తన తపఃశక్తితో రూపొందించినదే ‘బ్రహ్మాస్త్రం’. అత్యంత శక్తిమంతమైన బ్రహ్మాస్త్రం గురించి ఇతిహాసాలలో వివరించారు. ఇది అత్యంత విధ్వంసకర, ప్రమాదకరమైన ఆయుధం. విశ్వంలో అన్ని కార్యకలాపాలూ సక్రమంగా జరగడానికీ, నియంత్రణను కొనసాగించడానికీ, ఇది ఉద్దేశింపబడింది. ఈ ఆలోచనతోనే, బ్రహ్మదేవుడు ఈ ఆయుధాన్ని సృష్టించాడు. ఇది సంపూర్ణ శక్తిమంతమైన ఆయుధం. దీనిని కేవలం, రోజులో ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. త్రేతాయుగం నాటి రామాయణ కాలంలో విభీషణుడూ, లక్ష్మణుడూ మాత్రమే దీనిని వాడారు. మహాభారత యుద్ధంలో, ద్రోణాచార్యుడూ,అర్జునుడు అశ్వత్థామ, శ్రీకృష్ణుడు, యుధిష్ఠిరుడు, కర్ణుడు, ప్రద్యుమ్నుడు, ఈ అస్త్ర ప్రయోగం తెలిసిన వారు. అయితే కురుక్షేత్ర యుద్ధంలో, కర్ణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేద్దామనుకొంటే గురువైన పరశురాముని శాపం వల్ల అస్త్రాన్ని సంధించే మంత్రం జ్ఞాపకం రాకపోవడంతో సంధించలేకపోయాడు.బ్రహ్మశీర్షాస్త్రం...ఇది బ్రహ్మాస్త్రం కంటే, నాలుగు రెట్లు శక్తిమంతమైనది. ఈ అస్త్రాన్ని ఉపయోగించడం వల్ల, వినాశనం కలుగుతుంది. దీనిని ప్రయోగించిన ప్రాంతం, 12 సంవత్సరాల పాటు నిర్మానుష్యంగా మారిపోతుంది. బ్రహ్మ రూపొందించిన ఈ అస్త్రాన్ని, పరశురాముడు ద్రోణాచార్యుడికి ప్రసాదించాడు. ఇంత శక్తిమంతమైన బ్రహ్మశీర్షాస్త్రాన్ని ద్రోణాచార్యుడు, తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి ఇస్తూ, పూర్వం రాముడి దగ్గర ఈ అస్త్రం ఉన్నా, దాని వలన సంభవించే వినాశనాన్ని ఆలోచించి, రామ రావణ యుద్ధంలో దీనిని ప్రయోగించలేదు. దీనివలన ఈ అస్త్రం ఎంత ప్రమాదకరమైనదో, శక్తిమంతమైనదో అర్థం చేసుకో. అనివార్యమైన సమయంలో తప్ప, ఎట్టి పరిస్థితులలోనూ దీనిని ప్రయోగించవద్దని అర్జునుడికి హితబోధ చేసి మరీ ఈ అస్త్రాన్ని ఉపదేశించాడు. బ్రహ్మాండాస్త్రం...ఈ ఆయుధం, మొత్తం సౌర వ్యవస్థను, అంటే, ఈ బ్రహ్మాండాన్నే నాశనం. చేసేంత శక్తిమంతమైనది. ఈ ఆయుధం కొనపై బ్రహ్మ దేవుని నాలుగు తలలతో పాటు ఊర్ధ్య ముఖంగా మరో తల ఉంటుంది. ఈ అస్త్రంలో బ్రహ్మాస్త్ర బ్రహ్మ శీర్షాస్త్రాల రెండు శక్తులూ సమ్మిళితమై ఉంటాయి. ఒకసారి ఈ అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత దీనిని ఆపడం ఎవరి తరం కాదు. ముఖ్యంగా దీనిని ప్రయోగించినవారు కూడా దాని వల్ల జరగబోయే ముప్పును, అనర్థాలనూ తప్పించలేరు. ఈ అస్త్రం ద్రోణాచార్యుడి వద్దనే ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ధర్మం కోసం పోరాడుతుండటంతో వారిపై ప్రయోగించవద్దని దేవతల కోరిక మేరకు ద్రోణాచార్యుడు ప్రయోగించలేదు.త్రిశూలం... త్రిశూలం శివుని ఆయుధం.. పార్వతీదేవి శివునికి ప్రసాదించిన అత్యంత శక్తిమంతమైన అస్త్రం ఇది. దీనికున్న మూడు కొనలు సృష్టి, స్థితి, లయ అనే మూడింటికి ప్రతీకలు. మొత్తం విశ్వమంతా ఈ మూడు శక్తుల మీదే నడుస్తుంది. లక్ష్య భేదితమైన త్రిశూలం శైవ సంప్రదాయం ప్రకారం అత్యంత శక్తిమంతమైన ఆయుధం. కేవలం శివుడు, శక్తి దేవతలు మాత్రమే దీనిని భరించగలరు.– సి. ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
డీఆర్డీఓ పనితీరు ప్రశంసనీయం
న్యూఢిల్లీ: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్ఈఓ) అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థలు ఆపరేషన్ సిందూర్లో నిర్ణయాత్మక పాత్ర పోషించాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడే విషయంలో డీఆర్డీఓ అంకితభావం, వృత్తి నిబద్ధతకు ఇదొక ప్రతీక అని ఉద్ఘాటించారు. డీఆర్డీఓ 68వ వార్షికోత్సవం సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గురువారం ఢిల్లీలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ భద్రతా కవచమైన ‘సుదర్శన చక్ర’ తయారీ వెనుక డీఆర్డీఓ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. సుదర్శన చక్ర మిషన్ పూర్తిస్థాయిలో విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. త్వరలోనే ఈ రక్షణ కవచం మనకు అందుబాటులోకి వస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. 2025లో ఎర్రకోట నుంచి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ‘మిషన్ సుదర్శన్ చక్ర’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మిషన్లో భాగంగా గగనతల రక్షణ కోసం బలమైన వ్యవస్థను డీఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది. ఆధునిక యుద్ధాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చాలా కీలకమన్న సంగతిని ఆపరేషన్ సిందూర్ సమయంలో అందరూ గుర్తించినట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి డీఆర్డీఓను 1958లో ఏర్పాటు చేశారు. అప్పటికే పనిచేస్తున్న టీడీఈలు, డీటీడీపీ, డీఎస్ఓను కలిపేసి ఒకే సంస్థగా నెలకొల్పారు. మొదటి 10 ల్యాబ్లో ప్రారంభమైన డీఆర్డీఓ క్రమంగా ఇంతింతై అన్నట్లుగా ఎదిగింది. ప్రపంచంలో అతిపెద్ద రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో ఒకటిగా పేరుగాంచింది. భారత సైన్యానికి అవసరమైన ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. కాలానుగుణంగా అత్యాధునిక ఆయుధాలను అందిస్తోంది. వేగంగా మారిపోతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లాలని డీఆర్డీఓకు రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. నవీన ఆవిష్కరణలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని కోరారు. అదే సమయంలో రక్షణ పరిశోధనల్లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు.సైంటిస్టులు, సిబ్బందికి శుభాకాంక్షలు డీఆర్డీఓ తయారు చేసిన ఆయుధాలు ఆపరేషన్ సిందూర్లో అద్భుతంగా పనిచేశా యని, సైనికుల ఆత్మస్థైర్యం పెంచాయని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఆధునిక టెక్నాలజీ, ఆయుధాలతో సైన్యానికి స్వదేశీ శక్తిని సమకూరుస్తోందని చెప్పారు. డీఆర్డీఓ విశ్వసనీయ సంస్థగా మారిందన్నారు. స్టార్టప్ లు, ఎంఎస్ఎంఈలతో కలిసి పనిచేయాలని సూచించారు. డీఆర్డీఓ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, డిపార్టుమెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆర్అండ్డీ కార్యదర్శి, డీఆర్డీఓ చైర్మన్ సమీర్ వి.కామత్ తదితరులు పాల్గొన్నారు. 2025లో సంస్థ సాధించిన విజయాలు, ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమాల గురించి అధికారులు రాజ్నాథ్ సింగ్కు వివరించారు. అనంతరం డీఆర్డీఓ సైంటిస్టులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్నాథ్ సింగ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’కు వారు చేయూత ఇస్తున్నారని, అంకితభావంతో పని చేస్తున్నారని ఉద్ఘాటించారు. -
సరికొత్త ఆయుధ రేసులో ప్రపంచం!
న్యూఢిల్లీ: ప్రపంచంపై ఆధిపత్యం నిలుపుకొనేందుకు అగ్రదేశాలు సరికొత్త పోటీకి తెరతీశాయి. అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టాయి. అత్యంత శక్తివంతమైన దేశాలైన అమెరికా, చైనా ఇప్పటికే ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేయగా యూరొప్ నుంచి ఆసియా దాకా ఇతర దేశాలు సైతం తామేమీ వెనకబడలేదన్నట్లుగా రక్షణ బడ్జెట్లను అమాంతం పెంచేశాయి. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మించి ఆయుధ కొనుగోళ్ల అంశానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. దాయాది దేశాలను నిలువరించాలన్న లక్ష్యంతోపాటు కొత్త ఆయుధ మార్కెట్లను సృష్టించుకోవాలన్న ఆకాంక్షను నెరవేర్చుకొనేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. దీంతో గత కొన్ని దశాబ్దాల్లోకెల్లా ఎప్పుడూ లేనంత స్థాయికి ప్రపంచ దేశాల రక్షణ బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. వెరసి ప్రపంచమంతా ప్రపంచ యుద్ధాల కాలంనాటి పరిస్థితుల వైపు తిరిగి మళ్లుతోంది. చైనా దూకుడు.. డ్రాగన్ దేశం చైనా 2019 తర్వాత తొలిసారి అతిపెద్ద సైనిక పరేడ్ను టియాన్మెన్ స్క్వేర్లో అట్టహాసంగా నిర్వహించింది. ఉక్రెయిన్ అంశంతోపాటు దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం విషయంలో అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో తన సైనిక పాటవాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంత దూరంలో ఉన్న లక్ష్యాలనైనా ఛేదించగల అత్యాధునిక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులతోపాటు జలాంతర్గాములు, డ్రోన్లతో పరేడ్ నిర్వహించింది. అగ్రరాజ్యం ప్రతిస్పందన.. చైనా సైనిక కవాతు జరిగిన రోజుల వ్యవధిలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రాగన్ దూకుడుకు ప్రతిస్పందనగా తమ దేశ రక్షణశాఖ కేంద్ర కార్యాలయమైన పెంటగాన్ పేరును తిరిగి ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’గా మార్చాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో పాత పేరును పునరుద్ధరించడమే సరైన చర్య అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తద్వారా యావత్ ప్రపంచానికి తమ యుద్ధకాంక్ష, సన్నద్ధతను మరోసారి చాటిచెప్పారు. 1789 నుంచి రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ పేరిటే అమెరికా సైన్యం పోరాడింది. అదే బాటలో నాటో దేశాలు యూరొప్ సైతం తమ ఆయుధ సంపత్తిని పెంచుకోవడంపై దృష్టిపెట్టింది. ఈ ఏడాది రక్షణ బడ్జెట్ను జీడీపీలో 5 శాతానికి పెంచాలని నాటో సభ్య దేశాలు నిర్ణయించాయి. మౌలిక రక్షణ సరీ్వసులు, కీలక రక్షణ వ్యవస్థల బలోపేతానికి ఈ నిధులను ఖర్చు చేయాలని తీర్మానించాయి. సభ్య దేశాలన్నీ ప్రచ్ఛన్న యుద్ధ కాలంనాటి సైనిక సన్నద్ధతను 2030 నాటికల్లా సంతరించుకోవాలని నాటో నూతన సెక్రటరీ జనరల్ మార్క్ వ్యాఖ్యానించడం ప్రస్తుత పరిణామాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇతర దేశాలూ రేసులోనే.. ఇతర దేశాలు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లుగా ఆయుధ సంపత్తి పెంచుకొనే రేసులోకి వచ్చాయి. ఉత్తర కొరియా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా.. పోలాండ్తో కోట్లాది డాలర్ల ఆయుధ కొనుగోళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరోవైపు బ్రిటన్ సైతం 10 బిలియన్ డాలర్ల విలువైన యుద్ధనౌకలను నార్వేకు విక్రయించింది. అలాగే టర్కీ కూడా తమ డ్రోన్లను ప్రపంచవ్యాప్తంగా యుద్ధ జోన్ల ప్రాంతాలకు ఎగుమతి చేస్తోంది.సైనిక ఖర్చు అంకెల్లో.. 2.718 ట్రిలియన్ డాలర్లు: 2024లో ప్రపంచ దేశాలు చేపట్టిన సైనిక వ్యయం. ఇది భారత్, దక్షిణాఫ్రికా, కెనడా, బ్రెజిల్ దేశాల వార్షిక బడ్జెట్లకన్నా అధికం కావడం గమనార్హం. ప్రచ్ఛన్న యుద్ధకాలంనాటి స్థాయిలను సైతం ఈ వ్యయం దాటేసింది. స్టాక్హోం అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (ఎస్ఐపీఆర్ఐ) అంచనా ప్రకారం 2023తో పోలిస్తే 2024లో ప్రపంచ దేశాల సైనిక ఖర్చు 9.4% పెరిగింది. 60%: ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, రష్యా, చైనా, జర్మనీ వాటా. 343 బిలియన్ డాలర్లు: 2024లో రక్షణ రంగంపై యూరోపియన్ యూనియన్ చేసిన ఖర్చు. జీడీపీలో 5%: నాటో సభ్య దేశాల నూతన రక్షణరంగ వ్యయ లక్ష్యం. 10 బిలియన్ డాలర్లు: నార్వేతో బ్రిటన్ కుదుర్చుకున్న యుద్ధనౌకల విక్రయ ఒప్పందం. ఇది బ్రిటన్ అతిపెద్ద ఎగుమతిగా నిలిచింది. -
విజయవంతంగా రుద్రం-1 క్షిపణి ప్రయోగం
భువనేశ్వర్ : శత్రుదేశాల నుంచి వచ్చే ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాల సన్నాద్ధమవుతోంది. దేశ రక్షణ రంగంలో అత్యాధునిక ఆయుధ సంపత్తిని సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే వాయుసేన అమ్ముల పొదలోని తిరుగులేని అస్త్రాన్ని పరీక్షించింది. శత్రు దేశాల రాడార్లను మట్టి కరిపించే భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన రుద్రం -1 క్షిపణిని శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్లో సుఖోయ్-30 నుంచి శుక్రవారం ఉదయం ప్రయోగించిన ఈ మిసైల్ నిర్దేశిత లక్ష్యాలను ఛేదించినట్లు డీఆర్డీఓ అధికారికంగా ప్రకటించింది. చదవండి: 'శౌర్యం' చూపుతున్న భారత క్షిపణి సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి కూడా ప్రయోగించిన ఈ మిసైల్ శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను దెబ్బతీయగలదు. ఇది కనిష్టంగా 500 మీటర్లు, గరిష్టంగా 15 కిలోమీటర్ల ఎత్తు నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. ఇటీవల వరుసగా క్షిపణి పరీక్షలను డీఆర్డీవో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే భారత్.. స్మార్ట్ టార్పిడో మిస్సైల్ను పరీక్షించింది. క్షిపణి ప్రయోగం విజయవంతమవడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. చదవండి: సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు -
ఇక 'చికెన్ బాంబులు' !
లండన్: ఇస్లామిక్ తీవ్రవాదులు ప్రత్యర్థులపై దాడికి సరికొత్త వ్యూహా రచనకు శ్రీకారం చుట్టారని సమాచారం. అందులోభాగంగా కోళ్లను ఆయుధాలుగా మలచుకుని ప్రత్యర్థుల ఉసురు తీసేందుకు సన్నాహాలు చేస్తోంది. అందుకోసం 'చికెన్ బాంబు'లను తెరపైకి తీసుకు వచ్చింది. ప్రత్యర్థుల వద్దకు బాంబులు అమర్చిన కోళ్లను పంపి రిమోట్ సహాయంతో వాటిని పేల్చివేయాలని ఐఎస్ తీవ్రవాదులు పథక రచనలో ఉన్నారని మీడియా మంగళవారం వెల్లడించింది. అందుకోసం కోళ్లకు బాంబులు అమర్చిన ఫొటోలు ఇప్పటికే సోషల్ నెట్వర్కింగ్ సైట్ల్లో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే సొంతంగా బాంబులు తయారు చేసుకుంటున్న ఐఎస్ తీవ్రవాదులు ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారని మీడియా పేర్కొంది.


