breaking news
doctors suspended
-
చితిపై బతికొచ్చాడు
జైపూర్: మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించిన ఓ వ్యక్తి శ్మశానంలో చితిపైకి చేర్చగానే శ్వాస పీల్చడం ప్రారంభించాడు. అతడు ప్రాణాలతోనే ఉన్నట్లు తేలింది. దీంతో ఆంత్యక్రియలకు వచ్చినవారంతా షాక్ తిన్నారు. అయితే, కొన్ని గంటల తర్వాత ఆ వ్యక్తి తుదిశ్వాస విడిచాడు. ఆశ్చర్యకరమైన ఈ సంఘటన రాజస్తాన్లోని జుంఝున్లో చోటుచేసుకుంది. ప్రాణంతో ఉన్న వ్యక్తి మరణించినట్లు ప్రకటించడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు వైద్యులను జుంఝునూ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. 25 ఏళ్ల రోహితాశ్ కమార్ దివ్యాంగుడు. వినలేడు, మాట్లాడలేడు. అతడి కుటుంబం ఏమైందో, ఎక్కడుందో తెలియదు. అనాథగా మారాడు. అనాథాశ్రమంలో ఉంటున్నాడు. గురువారం హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో జుంఝునూ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అతడు చనిపోయినట్లు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్లు ప్రకటించారు. దాంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రెండు గంటలపాటు అక్కడే ఉంచారు. పోలీసులు పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తరలించారు. దహనం చేయడానికి చితిపైకి చేర్చారు. చితికి నిప్పంటించడానికి సిద్ధమవుతుండగా రోహితాశ్ శ్వాస పీల్చుకోవడం ప్రారంభించాడు. అతడు బతికే ఉన్నట్లు గుర్తించి వెంటనే అంబులెన్స్ రప్పించారు. జుంఝునూలోని బీడీకే హాస్పిటల్కు తరలించారు. ఐసీయూలో చేర్చి చికిత్స ప్రారంభించారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం జైపూర్లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలిస్తుండగా, మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. బతికి ఉన్న వ్యక్తి మరణించినట్లు నిర్ధారించినందుకు జుంఝున్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ సందీప్ పచార్తోపాటు మరో ఇద్దరు డాక్టర్లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
నర్సు మృతి.. ఐదుగురు ఎయిమ్స్ వైద్యుల సస్పెన్షన్
సొంత సిబ్బంది విషయంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు సీనియర్ వైద్యులతో పాటు ఇద్దరు జూనియర్ డాక్టర్లపై ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సస్పెన్షన్ వేటు వేసింది. ప్రసవం కోసం చేరిన నర్సు మరణించడంతో ఎయిమ్స్ ఈ చర్య తీసుకుంది. దాంతో ఇప్పుడు నర్సుల యూనియన్లు, రెసిడెంట్ డాక్టర్ల యూనియన్లు పరస్పరం తలపడుతున్నాయి. రాజ్బీర్ కౌర్ (28) ఎయిమ్స్లోని మెడిసిన్ డిపార్టుమెంటులో నర్సింగ్ ఆఫీసర్గా పనిచేసేవారు. ఆమె జనవరి 16న ప్రసవం కోసం ఆస్పత్రిలోని గైనకాలజీ విభాగంలో అడ్మిట్ అయ్యారు. ప్రసవానికి కొద్ది గంటల ముందు శిశువు గుండె కొట్టుకునే వేగం బాగా తక్కువగా ఉందని వైద్యులు గుర్తించారు. శిశువు ప్రాణాలకు ముప్పు ఉండటంతో వెంటనే సిజేరియన్ చేయాలని నిర్ణయించారు. కానీ, అనెస్థటిస్టు ఆలస్యంగా రావడంతో ఆపరేషన్ లేటయింది. ఎట్టకేలకు సిజేరియన్ ఆపరేషన్ చేసినా, మృత శిశువు బయటపడింది, కౌర్కు తీవ్రంగా కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. ఆమెకు కార్డియో పల్మనరీ రీససికేషన్ (సీపీఆర్) చేసినా ఫలితం లేకపోవడంతో కౌర్ కోమాలోకి వెళ్లిపోయారని ఎయిమ్స్ నర్సింగ్ యూనియన్ అధ్యక్షుడు హరీష్ కుమార్ కజ్లా చెప్పారు. నొప్పులు రప్పించడానికి కౌర్కు బాగా ఎక్కువ మొత్తంలో మందు ఇవ్వడం వల్లే ఆమెకు తీవ్ర అనారోగ్యం వచ్చిందని ఆయన ఆరోపించినా, ఆస్పత్రి వర్గాలు ఖండించాయి. ఈ విషయమై నిజానిజాలు తెలుసుకోడానికి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డీకే శర్మ అధ్యక్షతన నిజనిర్ధారణ కమిటీని నియమించామని, రెండు రోజుల్లో ప్రాథమిక నివేదిక వస్తుందని ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ అమిత్ గుప్తా తెలిపారు. కాగా ఇప్పటికే ఎనస్థీషియా శాఖకు చెందిన ఇద్దరు జూనియర్ డాక్టర్లు, గైనకాలజీ విభాగానికి చెందిన ముగ్గురు సీనియర్ డాక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే వైద్యుల సస్పెన్షన్పై రెసిడెంట్ డాక్టర్ల సంఘం తీవ్రంగా మండిపడి, సమ్మె చేస్తామని బెదిరించింది. మరోవైపు ఎయిమ్స్కు చెందిన 500 మంది నర్సింగ్ ఆఫీసర్లు ఇప్పటికపే డైరెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తప్పు చేసినవారచిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తాము తమ సహోద్యోగిని కోల్పోయామని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు.