breaking news
dead body recovered
-
18 నెలలుగా ఇంట్లోనే మృతదేహం.. గంగా జలం చల్లుతూ..!
తిరువనంతపురం: కోమాలోకి వెళ్లిన వ్యక్తి ఎప్పుడు స్పృహలోకి వస్తాడో వైద్యులు సైతం చెప్పలేరు. అందుకు రోజుల నుంచి సంవత్సరాలు పడుతుంది. అలా.. ఓ వ్యక్తి మరణించినప్పటికీ కోమాలో ఉన్నాడని, ఎప్పటికైనా తిరిగి స్పృహలోకి వస్తాడని నమ్మిన ఓ కుటుంబం మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేసింది. దాదాపు 18 నెలలుగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేసి.. ప్రతిరోజు గంగా జలం చల్లుతున్న ఈ సంఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో జరిగింది. ఏం జరిగింది? ఆదాయ పన్ను విభాగంలో పని చేస్తోన్న విమలేశ్ దీక్షిత్ అనే వ్యక్తి గత ఏడాది ఏప్రిల్లో గుండె పోటుతో మరణించాడు. కానీ, అతడు కోమాలో ఉన్నాడని భావించిన కుటుంబం అంత్యక్రియలను నిర్వహించేందుకు అంగీకరించలేదు. ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచేశారు. ఈ క్రమంలోనే కుటుంబానికి అందాల్సిన పింఛన్ దస్త్రాలు ముందుకు కదలటం లేదని ఆదాయ పన్ను శాఖ అధికారులు చీఫ్ మెడికల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. దీంతో పోలీసులతో కలిసి ఆరోగ్య విభాగం అధికారులు రావత్పుర్లోని దీక్షిత్ ఇంటికి శుక్రవారం వెళ్లారు. ఆయన కోమాలోనే ఉన్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సుదీర్ఘ చర్చల తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో దీక్షిత్ బాడీని లాలా లజపత్ రాయ్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. మృతి చెందినట్లు నిర్ధరించారు. మరోవైపు.. మృతదేహాం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. భర్త మరణంతో మానసిక రోగిగా మారిన అతడి భార్య.. ప్రతిరోజు ఉదయం మృతదేహంపై గంగాజలం చల్లుతున్నట్లు చెప్పారు. కోమా నుంచి బయటపడేందుకు గంగా జలం దోహదపడుతుందని ఆమె నమ్ముతున్నారని తెలిపారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం ప్రకారం.. గుండె పోటుతో 2021, ఏప్రిల్ 22న దీక్షిత్ మరణించాడని వెల్లడించారు. చుట్టుపక్కల వారికి సైతం దీక్షిత్ కోమాలోనే ఉన్నాడని చెప్పేవారని, కొన్ని సార్లు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్లటం గమనించినట్లు స్థానికులు తెలిపినట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: రిసార్టులో 19 ఏళ్ల యువతి హత్య.. బీజేపీ నేత కుమారుడు అరెస్టు -
గుర్తుతెలియని మహిళ శవం లభ్యం
హత్యగా అనుమానిస్తున్న పోలీసులు రాఘవాపురం: గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని ఆదిలాబాద్ జిల్లా రాఘవాపురం గ్రామ సమీపంలోని ముక్కిడి గుట్టలో సోమవారం ఉదయం కనుగొన్నారు. మృతదేహాన్ని చూసిన గొర్రెల కాపరులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి, క్లూస్ టీం పోలీసు జాగిలంతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలం మృతదేహం ఉన్న వద్ద నుంచి గుట్ట పరిసర ప్రాంతాలను అటు ఇటుగా కలియ తిరిగింది. తర్వాత గుట్ట దిగి రాఘవాపురం - నర్సాపురం రోడ్డు వద్ద గల ట్రాన్స్ఫార్మర్ వద్ద వరకు వచ్చి ఆగిపోయింది. హత్యగానే అనుమానం గుర్తు తెలియన మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. సంఘటన వద్ద లభించిన ఆధారాలను పరిశీలించినట్లయితే హత్యగానే పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 6న ఉదయం 5:51నిముషాలకు శంషాబాద్ నుంచి శివరాంపల్లికి బయలు దేరినట్లుగా మహేశ్వరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు టికెట్ సంఘటన స్థలానికి కొద్ది దూరంలో లభ్యమైంది. సంఘటన స్దలంలో పది రూపాయల నోట్లు రెండు, జోడాబైల్ ఖైనీ ప్యాకెట్లు రెండు లభ్య అయ్యాయి. ముఖం కనిపించకుండా ముఖానికి లుంగీ కట్టి మెడకు చున్నీ చుట్టి ఉరి తీసి చెట్ల పొదల్లో పడేసినట్లుగా ఉంది. దీన్ని బట్టి ఎవరో హత్యే చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వయసు సుమారు 28 ఏళ్లు ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అనంతరం సంఘటన స్దలం వద్దనే పోస్టుమార్టం నిర్వహించి అక్కడే ఖననం చేశారు.