breaking news
Dam project
-
రైతుబంధు అక్రమార్కులకు షాక్.. రూ. 300 కోట్లు ఆదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూముల బదలాయింపు జరగకపోవడంతో, రైతుల పేరిట దర్జాగా ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయం తీసుకుంటున్న అక్రమార్కులకు షాక్ తగిలింది. భూముల లెక్కలు పక్కాగా తేలడంతో, ప్రాజెక్టుల కిందికి వచ్చే సుమారు లక్షా యాభై వేల ఎకరాల భూమిని ఇరిగేషన్ శాఖ స్వాధీనం చేసుకుంది. మ్యుటేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆర్థిక భారం తగ్గింది. అక్రమార్కులకు ఏటా కనీసంగా రూ.300 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రాజెక్టుల ముంపు భూములతో పాటు, గుట్టలకు, ఎప్పుడో ఏర్పడిన కాలనీల భూములకు సైతం కొందరు అక్రమార్కులు.. రైతుల పేరిట ‘రైతుబంధు’ సాయం పొందుతుండటంపై ‘సాక్షి’ ఇటీవల కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఏడాదిగా కసరత్తు..ఎట్టకేలకు కొలిక్కి రాష్ట్రంలో వివిధ సాగు నీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు, వాటిల్లో కబ్జాకు గురైన భూములు, మ్యుటేషన్ జరగని భూముల వివరాలు తేల్చాలని గత ఏడాది కేసీఆర్ ఇరిగేషన్ శాఖను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇన్వెంటరీ (ఆస్తుల జాబితా) పేరుతో శాఖ ఆస్తులు, భూముల వివరాలు సేకరించారు. ఇందులో భాగంగానే నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, బీమా, నెట్టెంపాడు, కాళేశ్వరంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల కింద ఉన్న భూముల వివరాలు సేకరించారు. ఆయా భూముల నిమిత్తం రైతులకు పరిహారం అందజేసినా, మ్యుటేషన్ కాని కారణంగా వాటిని భూ యజమానులే అనుభవిస్తున్నారని, రైతుబంధు సైతం పొందుతున్నారని గుర్తించారు. అలాగే కొన్నిచోట్ల ముంపులో ఉన్న భూములకు కొందరు అక్రమార్కులు పెట్టుబడి సాయం పొంతున్నారని తేల్చారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో భూములు మ్యుటేషన్ కాలేదని గుర్తించిన సాగునీటి శాఖ, ఆయా ప్రాజెక్టుల పరిధిలోని జిల్లాల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయాల్లో రికార్డుల ఆధారంగా ఆ భూముల వివరాలను బయటకు తీసింది. భారీ ప్రాజెక్టుల కింద 6.19 లక్షల ఎకరాలు, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 76 వేల ఎకరాలు, చిన్నతరహా ప్రాజెక్టుల కింద 5.84 లక్షల ఎకరాలు కలిపి మొత్తంగా 12.79 లక్షల ఎకరాలు శాఖకు చెందినవిగా గుర్తించింది. ఇందులో సుమారు 1.50 లక్షల ఎకరాల భూమి మ్యుటేషన్ జరగలేదని గుర్తించింది. వీటిల్లో ప్రధాన ప్రాజెక్టులైన ఎస్సారెస్పీ స్టేజ్–1లో సుమారు 10,600 ఎకరాలు, స్టేజ్–2లో 6,300 ఎకరాలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలో 7,170 ఎకరాలు, ప్రాణహితలో 5 వేలు, వట్టివాగులో 740, సత్నాలలో 730, బీమాలో 425 ఎకరాలు, నెట్టెంపాడులో 2,700 ఎకరాలు, కాళేశ్వరం ప్రాజెక్టులో సుమారు 22 వేలు, వరద కాల్వ పరిధిలో 4,500, మిడ్మానేరులో 2వేల ఎకరాల మేర మ్యుటేషన్ కాలేదని గుర్తించారు. ఈ భూములకు అక్రమార్కులు రైతుబంధు పొందుతున్నారని తేల్చారు. ఇటీవల ఈ భూముల తిరిగి స్వాధీనంపై సమావేశాలు నిర్వహించి, రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటూ భూములను శాఖ పేరుపై బదలాయించారు. దీంతో ప్రభుత్వంపై ఏటా రూ.300 కోట్ల మేర రైతుబంధు భారం తగ్గుతుందని లెక్కగట్టారు. -
ఎట్టకేలకు ‘మెయింటెనెన్స్’కు మోక్షం!
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల నిర్వహణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మరో రెండు రోజుల్లో పనులను ప్రారంభించనున్నట్లు ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ డ్యాం వద్ద మొత్తం 42 వరద గే ట్లు ఉన్నాయి. అలాగే కాకతీయ కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లు నాలుగు, లక్ష్మీ కాలువ గేట్లు రెండు, సరస్వతి కాలువ గేట్లు రెండు వీటన్నింటితో పాటు ప్రస్తుత సంవత్సరం వ రద కాలువ ఆరు గేట్లకు ప్రతి ఏటా వేసవి కాలంలో ప్రాజెక్ట్ అధికారులు నిర్వహణ (మెయింటెనెన్స్) పనులు చేపడతారు. దీనికి సుమారు 10 లక్షల బడ్జెట్ అవసరం ఉండగా, గేట్లకు గ్రీస్, గేట్ల రోప్కు ఆయిల్, ప్యూజ్లు తదితర పనులు చేయాల్సి ఉంటుంది. అయితే మే 20 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో గేట్ల నిర్వహణ పనులకు ఏఎంఏ ( ఏన్యువల్ మెయింటెనెన్స్ ఎస్టిమేట్) మంజూరు కాలేదు. రెండు రోజుల క్రితం గేట్ల నిర్వహణకు బడ్జెట్ మంజూరు చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రాజెక్ట్ ఈఈ రామారావు తెలిపారు. గతేడాది చేపట్టిన నిర్వహణ పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదు. దీంతో ప్రస్తుత సంవత్సరం పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో గేట్ల ‘నిర్వహణ’ ఆలస్యమైంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రాజెక్ట్పై డ్యాం నిర్వహణకు ఏఎంఏ మంజూరుకు ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించడంవల్ల వేసవి కాలంలో చేపట్టాల్సిన నిర్వహణ పనులను వర్షకాలంలో చేపట్టాల్సిన దుస్థితి నెలకొంది. వర్ష కాలంలో పనులు చేపట్టిన వెంటనే వర్షం కురిస్తే ప్రయోజనం శూన్యమని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పనులు చేపట్టకుంటే గేట్ల పరిస్థితిని ఊహించడం కష్టంగానే ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా వారే వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా ఏఎంఏ మంజూరు చేసి ఉంటే ఇప్పటి వరకు నిర్వహణ పూర్తయ్యేదని రైతులు అంటున్నారు. ప్రాజెక్ట్ నుంచి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు వచ్చి ప్రాజెక్ట్ నిండు కుండలా మారితే వరద గేట్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది వరకే ప్రాజెక్ట్ వరద గేట్లు (18, 19 ) టన్బక్కెల్ చెడిపోయి పని చేయడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు. ప్రతి ఏటా సీజన్కు ముందు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు జూన్ మధ్యలో నుంచి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు వచ్చి చేరుతాయి. నీటి మట్టం ఆధారంగా ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వా రా నీటి విడుదలను అధికారులు గోదావరిలోకి విడుదల చేపడతారు. ప్రతి ఏట సీజన్కు ముందు గేట్ల మరమ్మతులు, నిర్వహణ పనులు చేపడతారు. సీజన్లో అత్యవసరంగా గేట్లను ఎత్తి నప్పుడు ఎలాంటి సమస్య తలెత్తకుండా గేట్ల మెయింటెనెన్స్ చేపడుతారు. అంతేకాకుండా గేట్లను ఎత్తడానికి ఉప యోగించే క్రేన్ రోప్ కు కూడా మెయింటెనెన్స్ చేపడతారు. ఇవన్నీ ప్రస్తుత సంవత్సరం సీజన్లో జరిగే అవకాశం ఉంది.