breaking news
crusher machines
-
రోడ్లు ఛిద్రం..! దుమ్ముతో నిత్యం నరకం అనుభవిస్తున్నాం..!!
కుమరం భీం: ప్రకృతి వనరులు కొల్లకొడుతూ క్వారీల నుంచి యాజమాన్యాలు భారీగా ఆదాయం అర్జిస్తున్నాయి. అయితే క్రషర్ల నుంచి కంకర తరలించే వాహనాలతో స్థానిక రహదారులన్నీ ధ్వంసమవుతున్నా మరమ్మతులకు కనీస మొత్తంలో నిధులు కేటాయించడం లేదు. గనులశాఖకు ఏటా సీనరేజీ నిధులు వస్తున్నా ప్రభావిత పల్లెల అభివృద్ధికి పైసా ఖర్చు చేయడం లేదు. పరిశ్రమల శాఖ, మైనింగ్, విద్యుత్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి శాఖల అధికారులు నిబంధనల అమలులో చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుంతలతో తిప్పలు.. కౌటాల మండలం ముత్తంపేట నుంచి పార్డీ గ్రామానికి వెళ్లే మార్గంలో ఐదు కంకర క్వారీలు, క్రషర్లు ఉన్నాయి. జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులకు నిత్యం వందలాది భారీ వాహనాల్లో ఇక్కడి నుంచే కంకర తరలిస్తున్నారు. ఫలితంగా వాహనాలు వెళ్లే కాగజ్నగర్, కౌటాల, ముత్తంపేట, తలోడి, సిర్పూర్(టి), టోంకిని గ్రామాల వద్ద ప్రధాన రహదారి అనేకచోట్ల గుంతలతో అధ్వానంగా మారింది. పరిమితికి మించిన లోడ్తో డ్రైవర్లు అతివేగంగా లారీలను నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం నరకం.. దుమ్ముతో నిత్యం నరకం అనుభవిస్తున్నాం. వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుండడంతో కంకర దుమ్ము పంటలపై పడుతుంది. దిగుబడి తగ్గుతోంది. క్రషర్లతో మా గ్రామానికి వెళ్లే రోడ్డు ఎప్పుడూ గుంతలతోనే ఉంటుంది. రోడ్డుకు మరమ్మతులు చేపట్టి బీటీ రోడ్డు వేయాలి. – డి.సంజీవ్, పార్డి, మం.కౌటాల ► ఐదేళ్ల క్రితం కౌటాల – కాగజ్నగర్ మార్గంలో డబుల్ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు పైనుంచి అధిక లోడుతో వాహనాలు వెళ్తుండడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ముత్తంపేట సమీపంలో గుంతల్లో వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ► కౌటాల మండలం పార్డీ, సాండ్గాం, వీరవెల్లి పంచాయతీలతోపాటు కౌఠి గ్రామానికి 20 ఏళ్ల కిందట ప్రపంచ బ్యాంకు నిధులతో మొరం రోడ్డు వేశారు. మ్తుతంపేట ప్రధాన ఆర్అండ్బీ రోడ్డు నుంచి పార్డీ మీదుగా సాండ్గాం వరకు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు ఉంది. రోడ్డును ఆనుకుని ఉన్న స్టోన్ క్రషర్ల నుంచి లారీలు వెళ్తుండడంతో గుంతలు పడుతున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు రోడ్డు బురదమయంగా మారింది. మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామాలకు ఇప్పటికీ తారురోడ్డు సౌకర్యం లేకపోవడం గమనార్హం. మరమ్మతులు చేయిస్తాం.. అధిక లోడు వాహనాలతో బీటీ రోడ్లపై గుంతలు పడుతున్నాయి. గతేడాది రోడ్లకు మరమ్మతులు చేపట్టాం. మూడు నెలల క్రితం వేసిన బీటీ రోడ్డుపై కూడా పగుళ్లు వచ్చాయి. గుంతలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధుల మంజూరు కాగానే గుంతలు పడిన చోట మరమ్మతులు చేయిస్తాం. – లక్ష్మీనారాయణ, ఆర్అండ్బీ డీఈ, కాగజ్నగర్ పంటలకు తీవ్ర నష్టం.. కంకర లారీలతో రోడ్లు ఛిద్రం కావడంతోపా టు రహదారుల వెంబడి సాగు చేస్తున్న పంట పై దుమ్ము ప్రభావం పడుతోంది. పార్డీ– సాండ్గాం గ్రామాల సమీపంలో సాగు చేస్తున్న పంటలపై విపరీతమైన దుమ్ము పడుతోంది. దీంతో పంట దిగుబడి సగానికి పడిపోతుంద ని రైతులు వాపోతున్నారు. పంటలకు పరిహా రం చెల్లించాలని కొంతమంది అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా లారీ ల నుంచి పడుతున్న కంకరతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. అదుపు తప్పి బైక్లు కిందపడిపోతున్నాయి. ఇప్పటికైనా స్పందించి ఓవర్లోడ్తో కంకర తరలిస్తున్న క్రషర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
లూనాను ఢీకొట్టిన కారు..∙ వాచ్మెన్ మృతి
ధారూరు: లూనా(ద్విచక్ర వాహనం)పై వెళుతు న్న ఓ వ్యక్తిని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో వ్యక్తి దుర్మరణం చెందాడు. కారుతో సహా పారిపోతున్న డ్రైవర్ను అక్కడే ఉన్న యువకులు వెంబడించి పట్టు కుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ధారూరు మండలంలోని రాంపూర్తండా బస్స్టేజీ వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... పెద్దేముల్ మండలం రేగొండి గ్రామానికి చెందిన మొయినుద్దీన్(55) వికారాబాద్ పట్టణ సమీప శేఖర్రెడ్డి క్రషర్ మిషన్ వద్ద నైట్ వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ సాయంత్రం ఇంటి నుంచి క్రషర్ మిషన్ వద్దకు వెళ్లి తిరిగి ఉదయం పూట ఇంటికి చేరుకుంటాడు. ఆదివారం రాత్రి విధులు నిర్వహించి ఉదయం తన లూనాపై ఇంటికి వస్తున్నాడు. ధారూరు మండలం రాంపూర్తండా బస్స్టేజీ వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి వస్తున్న కారు లూనాను బలంగా ఢీకొట్టింది. లూనాపై నుంచి మోయినుద్దీన్ కారుపై ఎగిరిపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. లూనాను కారు కొద్దిదూరం అలాగే లాక్కెళ్లింది. ఇది గమనిస్తున్న ఇద్దరు యువకులు కారును పట్టుకునే ప్రయత్నం చేయగా వారి నుంచి తప్పించుకునేందుకు వేగంగా తాండూర్ వైపు పరుగు తీసింది. ఓ యువకుడు వెంటనే తన సెల్ ద్వారా ముందు స్టేజీ వద్ద మిత్రునికి సమాచారం ఇవ్యగా అతను గ్రామస్తులతో కలిసి కారును రోడ్డుపై నిలిపివేశారు. కారులో ఉన్న ఓ మహిళ, డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు. బైక్లపై కారును వెంబడించిన యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చి కారును అప్పగించారు. కుటుంబానికి పెద్ద దిక్కు మృత్యువాత పడటంతో కుటుంబీకులు శోక సంద్రంలో మునిగారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి శవ పంచానామ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం మోయినుద్దీన్కు ఇద్దరు భార్యలు, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరు భార్యలు మృతి చెందగా.. కొడుకులు కూలీ పనులు చేస్తున్నారు. ఇతర ఆదాయ వనరులు లేకపోవడంతో కుటుంబం అంతా తండ్రి సంపాదనపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆ పిల్లలు అనాథలయ్యారు. -
నేమకల్లు..గుండె ఝల్లు
గుండెల్లో గునపం! మృత్యు ఘోష 2000 : కుటుంబాలు 26 - కంకర యంత్రాలు 23 - పని చేస్తున్నవి 19 - అనుమతి ఉన్నవి 100 - బ్లాస్టింగ్ కారణంగా పూడిపోయిన బోర్లు 50 - సిలికోసిస్ వ్యాధి మృతులు(ఏడాదిలో) 1000 - మృత్యువాత పడిన జీవాలు(ఏడాదిలో) రూ.6లక్షలు - గొర్రెల మృతితో ఏటా వస్తున్న నష్టం రూ.50లక్షలు - ఏటా పంట నష్టం ఊరు వల్లకాడుగా మారుతోంది. బంగారు భవిష్యత్తు దుమ్ము కొట్టుకుపోతోంది. ఇళ్లు బీటలు వారుతుంటే.. పొలాలు నాశనమవుతుంటే.. జీవాలు మృత్యువాత పడుతుంటే.. వ్యవసాయ బోర్లు ఎండిపోతుంటే.. నేమకల్లు కన్నీరు పెడుతోంది. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన గ్రామం కాస్తా.. అదే చరిత్రలో కలిసిపోతోంది. ఒక్కడ ఒకప్పుడు గ్రామం ఉండేదని చెప్పుకునే రోజులు ఎంతో దూరంలో లేవనే విషయం తాజా పరిస్థితిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అనుమతిలేని కంకర యంత్రాలు మరణ శాసనం రాస్తుంటే.. అనుమతి ఉన్నా నిబంధనలు కాలరాస్తున్న తీరు గుండెల్లో గుణపం దించుతోంది. నాయకులు ఏమి చేస్తున్నట్లు? అధికారులు ఏమైనట్లు? ఓ గ్రామం కళ్లెదుటే శ్మశానంగా మారుతున్నా కళ్లు తెరవరేం? నేమకల్లు ‘దుమ్ము’కొట్టుకుపోతోంది! - అనుమతిలేని కంకర మిషన్లతో అనర్థం - యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన - చిదిమేస్తున్న సిలికోసిస్ వ్యాధు - చిన్నా పెద్ద తేడా లేకుండా మరణాలు - మృత్యువాత పడుతున్న జీవాలు - కంకర యంత్రాలతో వెలువడుతున్న దుమ్ము, ధూళి - కాలుష్యం కోరల్లో నేమకల్లు జనం - ఊపిరితిత్తుల వ్యాధితో అనంతలోకాలకు.. - ఏటా 50కి పైగానే మృతులు - పనికిరాకుండా పోతున్న పంటపొలాలు - బ్లాస్టింగ్ దెబ్బతో ఇళ్లకు బీటలు - ఊళ్లో ఉండలేమంటున్న ప్రజలు - పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు అది ఓ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం... జిల్లా నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడి స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. అభయమిచ్చే ఆ దేవుడి సాక్షిగా ఆ ఊరు వళ్లకాడు అవుతోంది. కారణం కాలుష్యమే. దుమ్ము, ధూళితో నిత్యం ఆ గ్రామ ప్రజలు రోగాలతో సావాసం చేస్తుంటారు. యేటా 50 మందికి పైగానే చనిపోతున్నా మన పాలకులకు, అధికారులకు మాత్రం పట్టడం లేదు. అనంతపురం అర్బన్/బొమ్మనహాల్ : రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి దేవాలయానికి ఎంతో పేరుంది. ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతుంటోంది. స్వామి వారి సన్నిధిలో ప్రశాంతంగా ఉండాల్సిన నేమకల్ ప్రజలు దుర్భర జీవితాలను గడుతున్నారు. కారణం గ్రామానికి అర్ధ కిలోమీటరు దూరంలో నెలకొల్పిన కంకర యంత్రాలు. వీటి నుంచి వెలువడుతున్న ధూళి (డస్ట్) వీరి బతుకులను చిద్రం చేస్తున్నాయి. ఇక్కడ అకాల మరణాలు నిత్యకృత్యం అయిపోయారు. ఎక్కువ మంది ఊపిరితిత్తుల వ్యాధి (సిలికోసిస్) బారిన పడి అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ధూళి పడిన నీటిని తాగిన మూగ జీవాలు చనిపోవడం సర్వసాధరణంగా మారింది. పొలాలపై దుమ్ము కప్పెస్తుండటంతో రైతులు పంటలను కూడా నష్టపోతున్నారు. కంకర కోసం కొండల్లో నిర్వహిస్తున్న పేలుళ్ల దాటికి ఇళ్లు బీటలు వారుతున్నాయి. పాత మిద్దెలు కూలిపోతున్నాయి. కంకర ఫ్యాక్టరీల పరిసరాల్లోని పొలాల్లో బోర్లు మూసుకుపోతున్నాయి. గ్రామస్తులు తమ సమస్యను అధికారులకు చేసుకుంటున్న వినపాలు, చేపడుతున్న ఆందోళనలు వృథా అవుతున్నాయి. ఓరకంగా వారి గోడు ‘‘అరణ్య రోదన’’ గా మారింది. ఎప్పుడు చస్తామో – గోవిందప్ప, సిలికోసిస్ వ్యాధిగ్రస్తుడు నా పేరు గోవిందప్ప. వయస్సు 60 లోపే ఉంది. గ్రామంలో ఎవరు ఎప్పుడు చస్తామో మాకే తెలియదు. కంకర యంత్రాల నుంచి వచ్చే దూళిని పీల్చడంతో అదేదో మాయ రోగం ‘‘సిలికోసిస్’’ అంట. మమ్మల్ని బలితీసుకుంటోంది. నేను కూడా అదే రోగంతో బాధపడుతున్నాను. నాలుగు ఆపరేషన్లు చేయించుకున్నాను. పది అడుగులు నడిస్తే దగ్గు, ఆయసం వస్తుంది. ఏ పనిచేయలేకపోతున్నా. గ్రామంలో దాదాపు 100 మంది ఇదే వ్యాధితో బాధపడుతున్నారు. పది రోజుల క్రితం వీరేశ్ అనే 36 ఏళ్ల యువకుడు చనిపోయాడు. రెండు రోజుల క్రితం 65 ఏళ్ల వయస్సుండే తాయన్న చనిపోయాడు. ఇలా నెలలో నలుగురైదుగురు చనిపోతుంటారు. ఏటా 50 మందికి పైగానే చనిపోతున్నారు. నేను కూడా ఎక్కువ రోజులు బతుకుతాననే నమ్మకం లేదు. ఎప్పుడైనా చనిపోవచ్చు. ఏటా రూ.లక్షల్లో పంట నష్టపోతున్నా – హీరోజీరావ్, రైతు నాకు మూడు ఎకరాలు పొలం ఉంది. టమాట, మిర్చి, ఆనప, మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు పండిస్తాను. పంట పూతకొచ్చే సమయంలో కంకర మిషన్ల నుంచి దుమ్మువచ్చి చేరుతోంది. దీంతో పంట పండటం లేదు. ప్రస్తుతం టమాట వేశాను. ప్రస్తుతం ధర బాగుంది. కొద్ది రోజుల్లో పంట చేతికొస్తుంది. కంకర దుమ్ము పంటపై చేరుతోంది. దీంతో పంట నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఏటా ఇదే పరిస్థితి. ఏటా లక్షల రూపాయల్లో పంట నష్టపోతున్నాను. నేనే కాదు నాలాంటి రైతులు గ్రామంలో చాలా మంది ఉన్నారు. కంకర యంత్రాలను బంద్ చేయాలంటూ మేము చేస్తున్న పోరాటం ఎవరికీ పట్టడం లేదు. మూగజీవాలు చచ్చిపోతున్నాయి – గోనేహల్ బసవ గ్రామంలో పంటలు దెబ్బతింటుండటంతో ప్రత్యామ్నయంగా గొర్రెలను పెంచుతున్నాము. మేపు కోసం కొండల్లోకి తీసుకెళ్తాం. అక్కడ నీళ్లలో కంకర ధూళి కలుస్తోంది. వాటిని తాగిన గొర్రెలు కడుపుబ్బరంతో చనిపోతున్నాయి. ఈ ఏడాదిలో నావి 40 పెద్ద గొర్రెలు చనిపోయాయి. ఐదేళ్లలో దాదాపు 150 గొర్రెలు చనిపోయి ఉంటాయి. గ్రామంలో ఏటా 1000 గొర్రెలకు పైగానే వరకు చనిపోతుంటాయి. పేలుళ్లకు బోర్లు మూసుకుపోతున్నాయి – రమేశ్,రైతు నాలుగున్నర ఎకరాల్లో ఆనప పంట పెట్టాను. కంకర యంత్రాల వారు కొండల్లో నిర్వహిస్తున్న పేలుళ్ల కారణంగా వచ్చే అదుర్లకు బోర్లు పూడిపోతున్నాయి. దాదాపు 100కు పైగా బోర్లు మూసుకుపోయాయి. నా పొలంలో రెండు బోర్లు వేయించా. అవి పూడిపోయాయి. కొత్తగా మరో బోరు వేయించాను. ఇప్పుడు అదీ పూడిపోయింది. పంట పూత దశలో ఉంది. నీరు లేదు. రెండు ఎకరాల్లో పంట పోయింది. బసవప్ప అనే రైతు రూ.4 లక్షలు ఖర్చుచేసి 12 బోర్లు వేయించాడు. మాలాంటి రైతులు గ్రామంలో వందల్లో ఉన్నారు. బ్లాస్టింగ్తో ఇల్లు కూలిపోయింది – అంజనమ్మ, ఎస్సీ కాలనీ వృద్ధురాలు నా కొడుకు వీరరాజు కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొండల్లో జరుపుతున్న పేలుళ్లకు రెండు గదుల ఇంటిలో వెనుకగది కూలింది. దీంతో ముందుపక్క ఉన్న రేకుషెడ్డులోనే భార్య, ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నాడు. కూలీ చేసుకుని బతికే మా వాడికి ఇల్లు కట్టుకునే స్థోమతలేదు. కాలనీలో మా లాంటివారి పాత మిద్దెలు చాలానే కూలిపోయాయి. భయం భయంగా బతకాల్సి వస్తోంది. ఇళ్లు కూలిపోతే రేకులు షెడ్డు వేసుకున్నా – కల్లమ్మ, ఎస్సీ కాలనీ కాలనీకి దగ్గరలోని కొండల్లో పెట్టిన పేలుళ్లకు మా ఇళ్లు కూలిపోయింది. దీంతో రేకులు షెడ్డు వేసుకుని గడుపుతున్నాము. మాలాంటి పేదోళ్లకు ప్రభుత్వం ఇల్లు ఇవ్వడం లేదు. ఇళ్లు ఉన్నవారికే ఇస్తున్నారు. కొందరు రెండు ఇళ్లు కూడా తీసుకున్నారు. మాలాంటి వారికి ఇల్లు మంజూరు చేయడం లేదు. ఈ ఊరిలో నరకం అనుభవిస్తున్నాము. ఈ ఊళ్లో ఉండలేం – ఎస్సీ కాలనీ మహిళలు ఈ ఊరిలో ఉంటూ బతకలేము. మాకు ఈ ఊరే వద్దు... దూరంగా అడవిలో ఇళ్లు కట్టించి ఇచ్చినా వెళతామని లక్ష్మి, పెద్దగంగమ్మ, చిన్నగంగమ్మ, నీలమ్మ, హనుమక్క, ఇతర మహిళలు వాపోయారు. కంకర దుమ్ముతో రోగాలు వస్తున్నాయి. ఇళ్లు బీటలు వారుతున్నాయి. పాత మిద్దెలు కూలిపోతున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందోననే భయంతో బతుకుతున్నాము. ఏ అధికారి మమ్మల్ని కానీ, మా సమస్యలను కానీ పట్టించుకోవడం లేదు. మా గోడు అరణ్య రోదనే – కె.పరమేశ్, మాజీ ఎంపీటీసీ గ్రామంలో దుర్భర జీవితాలను గడుపుతున్నాము. కంకర ఫ్యాక్టరీల నుంచి వస్తున్న ధూళితో ప్రాణహాని ఉందంటూ అధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నా ఎవరికీ పట్టడం లేదు. ఇక్కడి పరిస్థితిని కలెక్టరేట్లోని మీ కోసంలో అధికారులకు వివరించాం. ఈ ఏడాది ఫిబ్రవరి 20న తహశీల్దారు కార్యాలయాన్ని దిగ్భందించాము. మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఆర్డీఓ, డీఎస్పీ హామీ ఇచ్చారు. అప్పట్లో 20 రోజుల పాటు కంకర యంత్రాలను నిలిపివేశాము. మళ్లీ మామూలుగానే పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 23 కంకర యంత్రాలు ఉన్నాయి. వాస్తవంగా వీటిలో 19 వాటికి అనుమతి ఉన్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఊరికి రెండు కిలోమీటర్ల దూరం వరకు కంకర యంత్రాలు ఉండకూడదు. అయితే మా గ్రామానికి అర్ధ కిలోమీటరు దూరంలోనే కంకర మిషన్లు ఉన్నాయి. డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఐదు బృందం పర్యటించి పరీక్షలు చేసి గ్రామంలో చాలా మందికి సిలికోసిస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. అటు తరువాత వారు వచ్చింది లేదు. రోగాలకు మందులిచ్చింది లేదు. కంకర మిషన్లు తొలగిస్తేనే మా ఊరు, ఇక్కడి ప్రజలు బతుకుతారు. పంటలకు అపార నష్టం పంటల పొలాలపై దుమ్మూ ధూళి పడి పంట పొలాలు సర్వనాశనం అయిపోతున్నాయని నేమకల్లు రైతులు వాపోతున్నారు. దీంతో లక్షల్లో నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది దానప్ప అనే రైతు 5 , శంకరప్ప మూడు ఎకరాల్లో వేరుశనగ, కురబ నాగేంద్ర మూడు ఎకరాల్లో మిరప, మూడు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. అలాగే గోనాల సిద్ధప్ప నాలుగు ఎకరాల్లో, అంజన్ మూడు ఎకరాల్లో, ముక్కన్న ఐదు ఎకరాల్లో, లక్ష్మమ్మ 3 ఎకరాల్లో, గౌరమ్మ ఐదు ఎకరాల్లో వేరుశనగ పంట వేశారు. దేవునూరి పరమేశ్ ఐదు ఎకరాల్లో , కాశీం వలి మూడు ఎకరాల్లో ఆనప వేశారు. కాలుష్యం వల్ల ఈ పంటలన్నింటినీ కోల్పోయామని వారు కన్నీరు మున్నీరయ్యారు. వీరు మాత్రమే కాదు వందలాది మంది రైతులది ఇదే పరిస్థితి. రెండు కంకర మిషన్ల అనుమతి రద్దు చేశాం – రాజేంద్రరెడ్డి, జోనల్ అధికారి, కాలుష్య నియంత్రణ బోర్డు, కర్నూలు బొమ్మనహల్ మండలం నేమకల్ గ్రామంలో కాలుష్య పరీక్షలు నిర్వహించాం. ఊరికి సమీపంలోని కంకర మిషన్లలో రెండింటికి అనుమతులు రద్దు చేశాము. సిలికోసిస్ ముదిరితే ప్రాణాంతకమే – డాక్టర్ వెంకటేశ్వరరావు, వైద్య కళాశాల ప్రిన్సిపల్ సిలికోసిస్ అనే వ్యాధి ధూళి పీల్చడం ద్వారా వస్తుంది. ఇది ఎక్కువగా ధూళి ఉండే ప్రాంతంలో పనిచేసేవారికి, ఆ ప్రదేశాల్లో నివాసముండేవారికి, తిరిగే వారికి వస్తుంది. దగ్గు, ఆయసంతో ఇబ్బంది పడారు. చిన్న పనిచేసినా, కొద్ది దూరం నడిచినా ఆయాసం, దగ్గు విపరీతంగా వస్తుంది. జబ్బుని తొలి దశలో గుర్తిస్తే మందుల ద్వారా నయం చేయవచ్చు. వ్యాధి ముదిరితే ప్రాణాంతకమే . ఈ వ్యాధితో బాధపడే వారు దుమ్ము, ధూళి ఉండే ప్రదేశాల్లో ఉండకూడదు, అలాంటి ప్రాంతాల్లో పనిచేయకూడదు.