breaking news
The couple
-
అనుమానం పెనుభూతం
చేతనబడి అన్నదమ్ముల మధ్యలో అనుమానపు మంత్రం వేశారు. ధూపం వేసి పెనుభూతం చేశారు. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్ ఆడుకున్నారు. చేతివాటంతో ఆస్తులు హరించారు. అది సికింద్రాబాద్లో ఓ గల్లీ. ఓ ఇంటి ముందు జనం బారులు తీరి ఉన్నారు. అందరి ముఖాల్లోనూ ఆందోళన, ఆశాభావం, మరికొంత అస్థిమితం కనిపిస్తున్నాయి. వారిలో యాదగిరి, అతడి భార్య సావిత్రి దంపతులు తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. విపరీతంగా భయపడుతున్న యాదగిరికి ధైర్యం చెబుతోంది సావిత్రి. ఇంతలో వారి వంతు రానే వచ్చింది. లోపలికి వెళ్లారు. చిన్న పిల్లలు భయపడేటట్లు ఉంది అక్కడి వాతావరణం. పసుపు కుంకుమల రాశులు, నిమ్మకాయల గంప, తాయెత్తుల పళ్లెం, ఓ త్రిశూలం, వాటి ఎదురుగా ఓ మంత్రగత్తె. జుట్టు విరబోసుకుని, కళ్లు విప్పార్చి భయానకంగా ఉంది. యాదగిరి దంపతులు వెళ్లి కూర్చోగానే అతడిని నఖశిఖ పర్యంతం చూసి, వేళ్లను లెక్కించింది మంత్రగత్తె.. అతడి ముఖంలోకి పరీక్షగా చూసింది. గాల్లోకి చూస్తూ అతీంద్రియ శక్తితోనో మంతనాలు జరిపినట్లు హావభావాలు పలికించి... నింపాదిగా... ‘నీకెవరో చేతబడి చేశారు, అందుకే ఈ అనారోగ్యం’ అన్నది. అంతే... భార్యాభర్తలిద్దరూ ‘మనం అనుకున్నది నిజమే’ అన్నట్లు ముఖముఖాలు చూసుకున్నారు. సనైన చోటకే వచ్చాం, ఇక కష్టం తీరినట్లే అనుకుని సమాధానపడ్డారు. వారి కష్టం తీరాలంటే చేతబడికి విరుగుడు పూజ చేయాలి. అందుకు పది నుంచి ఇరవై వేలవుతుంది- మంత్రగత్తె మాటల్ని మంత్రముగ్ధులై విన్నారా దంపతులు. మంత్రగత్తె మాటల్ని అంతగా నమ్మిన యాదగిరి నేపథ్యం ఏమిటంటే... అన్నదమ్ముల అనుబంధం అతడిది నల్గొండ జిల్లా, రామన్నపేట మండలంలో నెర్నెమల గ్రామం. అత్యంత సామాన్యమైన ఊరు. ఎవరైనా ఏ క్లర్కుగానో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే వారికి కలెక్టర్కి లభించినత గౌరవాలు. ఊళ్లో ఎవరికి సర్కారాఫీసుకెళ్లాల్సిన అవసరం వచ్చినా అందరికీ కనిపించేది ఆ ఉద్యోగి మాత్రమే. అలాంటి నెర్నెమలలో నలుగురు అన్నదమ్ముల్లో రెండవ వాడు యాదగిరి. పెద్దన్న వ్యవసాయం చేస్తాడు. యాదగిరికి వ్యవసాయంతోపాటు గొర్రెల పెంపకం కూడా ఉంది. మూడవ సోదరుడు నర్సింహ చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యాడు. ఇక చిన్న తమ్ముడు సేద్యం, పాల వ్యాపారంలో బాగానే రాణిస్తున్నాడు. ఎవరి ఉపాధి వారిది, ఎవరి కుటుంబం వారిది. విడివిడిగా జీవిస్తూ కలివిడిగా ఆత్మీయతలు పంచుకునేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఐకమత్యానికి మారుపేరు వారే అన్నట్లుండేవి నాలుగు కుటుంబాలు ఒకప్పుడు. మరి ఇప్పుడేమైంది? యాదగిరికి స్వల్ప అనారోగ్యం. కాళ్లునొప్పులు, నీరసం తప్ప మరే సూచనలూ లేవు. ఈ లక్షణాలకు డాక్టరు దగ్గరకు వెళ్లాలనిపించలేదు వారెవ్వరికీ. తెలిసిన మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్లాడు నర్సింహ. ఎన్ని వారాలు గడిచినా నీరసం తగ్గడం లేదు. ఆ తమ్ముడే ఏదో కీడు చేయించి తనకు తెలిసిన మంత్రగాడి దగ్గరకే తీసుకెళ్తున్నాడని సావిత్రి బంధువుల అనుమానం. మరో మంత్రగాని దగ్గరకు వెళ్తే తప్ప జబ్బు నయం కాదన్నారు. పుట్టింటి బంధువుల సూచన శిరోధార్యం అయింది సావిత్రికి. యాదగిరికి కూడా తమ్ముడి మీద అనుమానం వచ్చింది. అనుమానపుబీటలు ఆత్మీయతను దూరం చేశాయి. నర్మింహకు తెలియని చోట వైద్యం చేయించుకోవాలని సికింద్రాబాద్ చేరారా దంపతులు. పూజలు, తవ్వకాలు! ఇద్దరు అనుచరులతో టాటా సుమో ఎక్కి నెర్నెమల దారి పట్టింది సికింద్రాబాద్ మంత్రగత్తె. యాదగిరి ఇంటి పెరడే పూజకు వేదిక. మంత్రగత్తె ఒక చోటును చూపించి నలుచదరంగా ముగ్గుపోసింది. అనుచరులు తవ్వడం మొదలుపెట్టారు. మంత్రగత్తె పసుపు - కుంకుమలు చల్లుతూ మంత్రాలు చదువుతోంది. గజం లోతు తవ్వాక ఆగారు. ‘ఇంకా తవ్వండి’ పూనకంతో ఊగిపోతూ అన్నదామె. అనుచరులు పని కొనసాగించారు. పలుగుకేదో తగిలింది. పని ఆపి ఆమెకేసి చూశారు. ‘దొరికావా’ అంటూ నాటకీయంగా గుంటలో చేయిపెట్టి ఓ మూటను తీసింది. పాత గుడ్డతో కట్టిన ఆ మూటలో పసుపు, కుంకుమ, చచ్చి ఎండి పోయిన కప్ప, చిన్న ఎముక, నల్లదారాలు, ఎండిన నిమ్మకాయలు, తాయెత్తులు ఉన్నాయి. వాటిని చూడగానే యాడగిరి, సావిత్రి నిలువెల్లా వణికి పోయారు. మంత్రగత్తె విజయం సాధించినట్లు ముఖం పెట్టింది. ‘మీ మీద చేయించిన చేతబడి ఇదే’నంది. నమ్మడానికి సిద్ధంగా ఉన్న వారికి అంతకంటే గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుగు పూజ చేయాలి! అవును. చేతబడికి విరుగు పూజ చేయకపోతే మీ అందరి ప్రాణాలు పోతాయి. పీడ ఊరందరి మీద చెలరేగి పోతుంది. బయటకు తీసిన నన్ను కూడా బతకనివ్వదు... కాబట్టి విరుగుడు పూజ చేయాలి. అందుకు మూడు లక్షలవుతుంది- అన్నదా మంత్రగత్తె. అంత డబ్బు మావల్ల కాదనడంతో లక్షన్నరకు బేరం కుదిరింది. డబ్బు తీసుకుని యాదగిరి ఇంటినుంచి బయటపడుతుంటే పొట్టేళ్లు కంటపడ్డాయి. దేవతకు బలిస్తానంటూ ఓ పొట్టేలును కూడా తీసుకెళ్లిందామె. పిటీ ఏంటంటే... ఆ లక్షన్నరతో రోగం కుదరలేదు. చేతబడి మూట వెలికి తీసి రెండు వారాలైనా అనారోగ్యం ఏ మాత్రం తగ్గడం లేదు. దాంతో మరో పూజకు రంగం సిద్ధమైంది. మీకింకా ఎక్కడెక్కడ స్థలాలు, ఇళ్లు ఉన్నాయంటూ ఆరా తీసిందామె. యాదగిరికి భువనగిరిలో ఉన్న ప్లాట్లో కూడా ఇదే తంతు. నేల తవ్వడం, పాతగుడ్డ మూట తీయడం, తిరుగు పూజకు మరో లక్షన్నర పట్టుకెళ్లడం జరిగిపోయాయి. అయినా నయం కాలేదు. ఇంకేం చేయాలి? బంధువుల ఇళ్ల మీదకు మళ్లిందామె చూపు. అల్లుడింటి ఆవరణలో తవ్వి మరో లక్షన్నర వసూలు చేసింది. ఈ క్రమం ఎంతవరకు వెళ్లేదో, ఏ అనర్థానికి దారి తీసేదో. ఇంతలో... అన్న సం‘గతి’ ఏంటో? నర్సింహ చైతన్యవంతమయ్యాడు. మిగిలిన సోదరులంతా ఏకమయ్యారు. ముఖ్యంగా ఈ అనర్థాలు ఇలాగే కొనసాగితే అన్న అప్పుల పాలవుతాడు. అసలే ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తోంది. జనవిజ్ఞానవేదిక కార్యకర్తల దగ్గరకు వచ్చి ‘నిజానికి చేతబడికి విరుగుడు ఉంటుందా. విరుగుడు పూజ చేసినా ఆరోగ్యం కుదుటపడలేదు. ఇదిలా కొనసాగితే అన్న మరణిస్తాడేమో, ఒకవేళ అదే జరిగితే ఊరు ఊరంతా మేము చేతబడి చేసి అన్నయ్యను చంపేశామని నిందిస్తుంది. నిజానికి మాకే పాపమూ తెలియదు. దీనికి పరిష్కారమెలా’ అని గోడు వెళ్లబోసుకున్నారు. నీరసం ఎందుకంటే... అతడు బాధపడుతున్నది నరాల బలహీనతతోనే. దానికి వైద్యం అందకపోవడంతో సమస్య తీవ్రమైంది. పొలం పనులు చేసుకోలేకపోవడంతో మొదలైన అనారోగ్యం కాస్తా ఇంట్లో తన పనులకు కూడా మరొకరి మీద ఆధారపడాల్సినంత దీనమైన స్థితికి చేరుకుంది. న్యూరో స్పెషలిస్టుకు చూపించి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వైద్యం మొదలైంది. ఇది జరిగి నాలుగేళ్లవుతోంది. అన్నదమ్ముల కుటుంబాల మధ్య అపోహలు తొలగి పోయి, ఆత్మీయతలు వెల్లివిరిశాయి. ఒక మూఢనమ్మకమే ఆ కుటుంబాల మధ్య సంబంధాలను అతలాకుతలం చేసింది. ఆరోగ్యం క్షీణించే వరకు ఉపేక్షించేలా చేసి మనిషిని పిప్పి చేసింది. జనవిజ్ఞాన వేదిక కౌన్సెలింగ్తో వారికి చేతబడి అపోహ తొలగింది. వైద్యం మొదలైంది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఎవరి మాట నమ్ముతాడో వారి చేతనే... అతడిని వైద్యం కోసం ఒప్పించడానికి చాలా కష్టపడ్డాం. ఆ ఊళ్లో ఆయన ఎవరితో స్నేహంగా ఉంటాడో, ఎవరి మాట మీద ఆయనకు గురి ఉందో కనుక్కుని వారికి కౌన్సెలింగ్ ఇచ్చాం. వారి ద్వారా ఇతడిని డాక్టరు దగ్గరకు వెళ్లేలా ఒప్పించగలిగాం. - టి. రమేశ్, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ మరి.. ఆ మూట ఎలా వచ్చింది? భూమిని తవ్వినప్పుడు బయటపడే మూటలోనే కనికట్టు ఉంటుంది. గుంట తవ్వే మనుషులు ధోవతి కట్టుకుంటారు. ధోవతితో ఈ మూటను దాచుకుంటారు. తవ్వేది రాత్రిపూట, మంత్రగత్తె పసుపుకుంకాలు చల్లుతూ, ఊగిపోతూ ఏం జరుగుతుందో గ్రహించలేని అయోమయాన్ని సృష్టిస్తుంది. ఇంటి వాళ్లు బిక్కుబిక్కు మంటూ ఉంటారు. మధ్యమధ్యలో నిమ్మకాయలు తెండి, ఎర్రదారం, ఎండుమిరపకాయలు... అంటూ ఇంటి వాళ్లు దూరంగా వెళ్లేలా చేస్తుంది. ఆ సమయంలో ధోవతిలోని మూట గుంటలో పడేట్టు చేస్తారొకరు. మరొకరు దాని మీద మట్టి తోస్తారు. మరికొంతసేపటి తర్వాత దానిని వెలికి తీసి ‘మీ మీద చేసిన చేతబడి ఇదే’ అని నమ్మిస్తారు. -
ప్రణాళికా బద్ధంగా నడుచుకోవాలి
2016 వార్షిక ఫలాలు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ప్రేమికులు లేదా దంపతుల మధ్య అన్యోన్యత కుదురుతుంది. ముందుకు దూసుకెళతారు. శక్తిసామర్థ్యాలను పుంజుకుంటారు. మీ మనసు చెప్పినట్లుగా నడుచుకుంటారు. సంప్రదాయ విలువలవైపు మొగ్గు చూపుతారు. ఔదార్యాన్ని అలవరచుకుంటారు. విజయాలు వరిస్తాయి. అయితే మీ విజయంలో ప్రేమ, కమ్యూనికేషన్లదే కీలక పాత్ర అని గుర్తించండి. భాగస్వామ్య వ్యవహారాలు మెరుగుపడతాయి. వివాహం లేదా నిశ్చితార్థం జరగవచ్చు. ప్రేమ ఫలిస్తుంది. బాస్ని మంచి చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తొందరగా ఎడ్జస్ట్ అయ్యే ధోరణి మీకు మంచి చేస్తుంది. ఆగస్ట్,సెప్టెంబర్, అక్టోబర్లలో పెద్ద పెట్టుబడులు, ముఖ్యనిర్ణయాలు వద్దు. లక్కీ కలర్: గ్రీన్; లక్కీ నంబర్:8 టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఈ సంవత్సరం మీకెంతో అదృష్టాన్నిస్తుంది. అయితే కీలకనిర్ణయాలలో తొందరవద్దు. ఆచితూచి ఆలోచించడం అవసరం. బంధుమిత్రులతో ఉన్న మనస్పర్థలను పరిష్కరించుకోవడం మంచిది. గుడ్డిగా మనసిచ్చేయడం మంచిది కాదు. ప్రేమ వ్యవహారంలో నిదానించడమే మేలు. పత్రాలు రాసుకోవడమంటే మీకు ముందు నుంచి ఉన్న బెరుకు లేదా బద్ధకం వల్ల మీరు పెద్ద మూల్యాన్నే చెల్లించవలసి వస్తుంది. ఇప్పటికైనా జాగ్రత్త పడండి. జనవరి మీకు అదృష్టాన్నిస్తుంది. మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్లలో కీలక నిర్ణయాలు వద్దు. మే, ఆగస్ట్ ప్రోత్సాహకరంగా ఉంటాయి. పెళ్లి ప్రతిపాదనల్లో తొందరపాటు వద్దు. కలిసొచ్చే రంగు: పర్పుల్; అదృష్ట సంఖ్య: 10 జెమిని (మే 21-జూన్ 21) ఈ సంవత్సరం మీ జీవితంలో మైలురాయిగా నిలుస్తుంది. మీ కలలన్నీ నెరవేరతాయి. మీ నమ్మకాలు, నిర్ణయాల విషయంలో స్థిరంగా ఉండండి. జీవితంలో కొత్త మలుపులు సంభవించవచ్చు. మీ ప్రేమ ఫలిస్తుంది. వివాహితులైతే మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. మిమ్మల్ని సదా అంటి పెట్టుకుని ఉండే కొందరు హితుల మూలంగా మీరు ప్రమాదంలో పడకుండా తప్పించుకోగలుగుతారు. మేలో మీకు ఫారిన్ చాన్స్ ఉంది. జనవరి నుంచి జూన్ వరకు, నవంబర్, డిసెంబర్ నెలలు మీకు మంచివి. జులై నుంచి అక్టోబర్ వరకు కీలక నిర్ణయాలు వాయిదా వేయండి. ఆయా నెలల్లో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. లక్కీ కలర్: ఎల్లో; లక్కీ నంబర్: 7. క్యాన్సర్ (జూన్22-జూలై 23) కొత్తసంవత్సరం ప్రజాసంబంధాలు పెరగడంలోనూ, గుర్తింపును తీసుకు రావడంలోనూ సాయం చేస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవకాశాలను జారవిడుచుకోవద్దు. మీరు రచయితలయితే మీ రచనల గురించి బ్లాగులో పెట్టుకోండి. పాకశాస్త్ర ప్రవీణులైతే మీరు చేసిన కొత్త వంటకాలను యూ ట్యూబులో అప్లోడ్ చేయడం, విదేశీయానం చేసే వారయితే ప్రయాణంలో పాటించవలసిన మెలకువల వంటివి సామాజిక మీడియాతో షేర్ చేసుకోండి. లవ్ లైఫ్లో కొత్తదనాన్ని నింపుకోండి. భార్యతో అన్యోన్యతను, తలిదండ్రులతో ప్రేమానుబంధాలను కాపాడుకోండి. జనవరిలో కెరీర్ బాగుంటుంది. మే, జూన్లల్లో కీలక నిర్ణయాలు వద్దు. లక్కీ కలర్: క్రీమ్; లక్కీ నంబర్: 1 లియో (జూలై 24-ఆగస్టు 23) నూత్న సంవత్సరం అదృష్టకరంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోండి. పనిని శ్రద్ధతో చేయండి. ఈ సంవత్సరం మీ ముందు కొత్త సవాళ్లుండవచ్చు. కొన్ని సందర్భాల్లో సందిగ్ధావస్థలో కూరుకుపోవచ్చు. అయితే తొట్రుపడకండా జాగ్రత్తగా పని చేసుకుపోండి. నిధుల దుర్వినియోగానికి, మోసపు పనులకు పాల్పడటానికి మీకు అవకాశాలున్నప్పటికీ మీ నిజాయితీని, మీకున్న మంచి పేరును నిలుపుకోండి. అవిశ్రాంతంగా పని చేయాల్సి వస్తుంది. భయపడకండి. తగ్గ ఫలితం కూడా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరిలో కీలక నిర్ణయాలు వద్దు. ఏప్రిల్ వరకు ఆన్లైన్ వ్యవహారాలకు దూరంగా ఉండండి. షేర్మార్కెట్ జోలికే వెళ్లవద్దు. లక్కీ కలర్: ఆరంజ్; లక్కీ నంబర్: 5 వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు వద్దు. భయాందోళనలు విడిచిపెట్టండి. మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు మీ వల్ల బాగా లబ్ధిపొందుతారు. రిస్క్తో కూడుకున్న పెట్టుబడులకు దూరంగా ఉండండి. డబ్బు, నగలు, బంగారం కన్నా, అవసరంలో ఆదుకోగలిగే ఆప్తులు మాత్రమే నిశ్చింతని ఇవ్వగలరని గుర్తుంచుకోండి. మీ సహోద్యోగులు లేదా కిందివాళ్లు చేసిన పని నచ్చనప్పుడు నేర్పుగా తెలియజెప్పండి. కంపెనీ మీకు కొత్త కారు ఆఫర్ చేస్తుంది. కెరీర్పరంగా దూసుకుపోతారు. మేలో స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి. మార్చి, ఏప్రిల్ ప్రోత్సాహకరంమైనవి. లక్కీ కలర్: సముద్రపు నురగ రంగు; లక్కీ నంబర్: 2 లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ప్రశాంతంగా జీవించడం ఎలాగో ఈ సంవత్సరం తెలుసుకుంటారు. వచ్చిన దాంతో సంతృప్తిని, సంతోషాన్ని పొందకపోతే చిక్కులు తప్పవు. ఎంతకాలం జీవించామన్నది కాదు... ఎంత సంతృప్తితో జీవిస్తున్నామన్నది ముఖ్యం. కొత్త ప్రాజెక్టులో లేదా వ్యాపారంలో ఉన్నప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించడం, మసలుకోవడం అవసరమని గుర్తుంచుకోండి. అహం వల్ల చిక్కులు తప్పవు. కంటికి నచ్చినవారికన్నా, మనసుకు దగ్గరగా ఉన్నవారిని ఎంచుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారని గుర్తుంచుకోండి. పెట్టుబడులకు ఫిబ్రవరి మంచిది. మేలో కీలక నిర్ణయాలు వద్దు. ఏప్రిల్లో తీవ్ర ఒత్తిడి తప్పదు. సెప్టెంబర్ తర్వాత జాగ్రత్త అవసరం. లక్కీ కలర్: ఆరంజ్; లక్కీనంబర్: 8 స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ఇది చాలా అదృష్టకరమైన సంవత్సరం. ప్రశంసలు, బహుమానాలు, ఇంక్రిమెంటులు పొందే సమయం ఇది. మీకు, మీ భాగస్వామికి మధ్య ప్రేమానురాగాలు ఇనుమడిస్తాయి. సంవత్సరమంతా ప్రశాంతంగానే గడుస్తుంది. ఏ పని చేసినా లాభనష్టాలను బేరీజు వేసుకోండి. ఏం చేయొచ్చో, ఏం చేయకూడదో ఆలోచించి చేయండి. వీలైనంత వరకూ ప్రాక్టికల్గా ఆలోచించండి. సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇదో గొప్ప తరుణం. బాంధవ్యాలు సంతోషాన్ని కలిగిస్తాయి. చిన్నపాటి అనారోగ్యాలు విసిగించే అవకాశం ఉంది. జనవరి బాగుంటుంది. మార్చిలో శ్రద్ధగా పని చేయండి. ఆగస్ట్లో చిన్న దుస్సంఘటన ఎదురు కావచ్చు. లక్కీ కలర్: వైట్; లక్కీ నంబర్: 6 శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఎప్పటి నుంచో అనుకుంటోన్న కొత్త వ్యాపారాన్ని ఈ సంవత్సరం ప్రారంభిస్తారు. మీ తెలివితేటలు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. అయితే ఆలోచనలను అమలు చేయడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి మరి. ప్రేమ వ్యవహారాలు చేదును మిగల్చవచ్చు. మీకు తగిన వ్యక్తి తప్పకుండా వస్తారన్న నమ్మకంతో ఆ బాధను అధిగమించండి. వృత్తిపరంగా ఒడిదుడుకులు వస్తాయి. చేసే పనిలో నిరాసక్తత వల్ల ఓ మంచి అవకాశం చేజారిపోతుంది. అయితే తొందరలోనే మరో అవకాశం వస్తుంది కాబట్టి నిరుత్సాహపడకండి. నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రయాణాలు ఉండవచ్చు. ఫిబ్రవరి, జూన్లు బాగుంటాయి. లక్కీ కలర్: బేబీ పింక్, లక్కీ నంబర్: 11 క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఈ సంవత్సరం కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఇది మిమ్మల్ని ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా చేస్తుంది. బహుశా ఈ మార్పు మీ అంతట మీరుగా కాక పరిస్థితుల ప్రభావం కారణంగా ఏర్పడవచ్చు.వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంకాస్త ప్రిపరేషన్ అవసరం. ఆచి తూచి అడుగేయండి. సంవత్సరమంతా విహార, వినోదయాత్రలతో సరదాగా గడిచిపోతుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు చోటు చేసుకుంటాయి. అయితే చిన్న చిన్న విషయాలకే మనసు కష్టపెట్టుకోకండి. మార్చి, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కీలక నిర్ణయాలు వద్దు. మే, ఆగస్ట్లు బాగుంటాయి. లక్కీ కలర్: పర్పుల్; లక్కీ నంబర్: 10 అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ఈ సంవత్సరం ఆర్థికంగా బలపడతారు కానీ అది క్రమంగా జరుగుతుంది. మీ జీవిత భాగస్వామికి మీ పట్ల ఉన్న ప్రేమ ఇనుమడిస్తుంది. తనతో గడిపే మధుర క్షణాలను ఆనందమయం చేసుకోండి. ఊహించని గొప్ప అవకాశమొకటి మీ తలుపు తడుతుంది. దాన్ని వీలైనంత త్వరగా అందిపుచ్చుకుని పనిలో దిగండి. ఎప్పటి నుంచో ఉన్న ఓ బలమైన కోరిక నెరవేరుతుంది. ఇతరులను ప్రోత్సహించి ముందుకు నడుపుతారు. గతంలో మీ జీవితంలో ఉండి వెళ్లిన ఓ వ్యక్తితో మీ బంధాన్ని పునరుద్ధరించుకోవాలని ప్రయత్నిస్తారు. బాగా ఆలోచించుకోండి. పనిపరంగా, ఆర్థికంగా మార్చి చాలా బాగుంటుంది. లక్కీ కలర్: ఆరంజ్, లక్కీ నంబర్: 5 పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) పెద్ద మొత్తంలో లాభాలు వచ్చి, ఈ సంవత్సరం సంతోషంగా గడుపుతారు. విజయం మీకు దగ్గరలోనే ఉంది. దాన్ని అంది పుచ్చు కోవాలంటే మీలోని సృజనాత్మకతను వెలికి తీయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు కూడా ఇది కలసివచ్చే సమయం. ఎంతో డైనమిక్గా, నిజాయతీగా ఉండే ఓ వ్యక్తితో ప్రేమలో పడతారు. ఒకవేళ ఇప్పటికే ప్రేమలో ఉండివుంటే... మీకు తనపై ఉన్న నమ్మకం, ప్రేమలను మరింత బలపర్చుకోవడానికి ప్రయత్నించండి. మేనుంచి జులై దాకా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆగస్ట్లో కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం విస్తృతంగా ప్రయాణాలు ఉంటాయి. లక్కీ కలర్: సీ గ్రీన్; లక్కీ నంబర్: 4 టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) అష్టమ శని కారణంగా ఈ రాశివారు బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలు చేయవలసి ఉంటుంది. కష్టాలూ నష్టాలు రావచ్చనే అభిప్రాయంతో ఉంటూ, ముందుగానే తగినంత ముందుచూపుతో వ్యవహరించాలి ఈ సంవత్సరమంతా. ఏదో జరిగిపోబోందనే భయం, మనోవ్యధ అసలు వద్దేవద్దు. ఏ సంశయం లేకుండా మీ పనిని మీరు చేసుకుంటూ సాగిపోండి. ధర్మబద్ధంగా చేస్తుండే మీ వ్యవహారశైలి కారణంగా ఏ నష్టమూ కష్టమూ మీకు కలగదు. పిల్లల పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకి కొంత సమయం పట్టవచ్చు కాబట్టి దిగులుపడిపోకండి. మానసికమైన బెంగ తప్ప, జరిగే పనులు జరుగుతూనే వెళ్తాయి. ఇంట్లో ఏ దుర్వార్తలనీ వినరుగానీ ఆందోళన తప్పకపోవచ్చు. టారస్ (ఏప్రిల్ 21-మే 20) రోజులు ఎప్పుడూ ఇలాగే ఉంటాయని భావించవద్దు. ముఖ్యంగా రుణాలను ఈయడం, అనవసర వ్యవహారాల్లో జోక్యం, అంతపనినీ తామే చేయగలమని భావించడం సరి కాదు. అన్నిటికీ మించి ఈ రాశివారు తమని తాము ప్రశంసించుకోకూడదు. జీవితంలో ఒక కొత్తకోణంలో మీరు మీ దృష్టిని ప్రసరింపజేస్తారు. నిర్వేదం నిస్పృహ పూర్తిగా తొలగిపోయి పనిని సాధించి తీరాలనే పట్టుదల, పనికోసం వెంటపడటం, ముగిసేవరకు విశ్రమించకపోవడం, కొత్త పనుల్ని నెత్తిమీద వేసుకోకపోవడం, నా పనే నాకు ముఖ్యమనే ధోరణిలో ఉండడం... ఇలా అయిపోతారు. స్వప్రయోజనాలే ముఖ్యమనే ధోరణితో ఉంటే అవసరంలో మీకు ఎవరూ కలిసిరారు అని గ్రహించుకోండి. జెమిని (మే 21-జూన్ 21) ఏదో ఒక విషయాన్ని గురించి బాగా ఆలోచించి, అనుభవజ్ఞుల్ని సంప్రదించి ఆ సమస్య పరిష్కారానికి ఓ నిర్ణయాన్ని తీసుకోండి. మంచిదే. అయితే ఆ నిర్ణయాన్ని గురించి మళ్లీ వెనక్కి వెళ్లి ఆలోచిస్తూ సరికాదేమో అని మథనపడుతూ ఉండద్దు. మీ నిర్ణయం తప్పుకా(బో) దు. దాన్ని గురించిన వ్యధ సరికాదు. ఉద్యోగపరంగా స్థానచలనం, అద్దె ఇల్లు మారడం లేదా నివసిస్తున్న ఊరు మారడం లేదా స్వదేశాన్నే మారడం జరగవచ్చు. అలా వచ్చిన మార్పు పట్ల నిర్లక్ష్యం, మార్పు వచ్చేసిందన్నధీమా ఏమాత్రం సరికావు. జాగ్రత్తని పాటించండి. ఉన్నంతలోనే ఉండండి తప్ప, ఆడంబరాలకోసం ధనవ్యయం ఏ మాత్రమూ సరికాదు. ధనవిషయంలో మరింత జాగ్రత తప్పనిసరి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) మీకు ఇబ్బందులు రావుగాని, మీ కుటుంబ సభ్యులకో, మీ ఆప్తులకో వచ్చిన ఇబ్బందులని తీర్చడం కోసం మీరు శ్రమపడాల్సి వస్తుంది. ఈ రాశివారి దశ బాగున్న కారణంగా వీరి వల్ల సమస్యలు తీర్చబడతాయి గాని చిక్కు ముడిపడిపోవు. రచయితలూ వినోదరంగం వారూ గుర్తింపును పొందుతారు. లోపల అగ్నిపర్వతం ఉడుకుతున్నా, పైకి పెరుగుకుండలా చక్కగా ఉండగల శక్తి మీకు భగవంతుడిచ్చిన వరం. ఆ కారణంగానే సంతానం ఆరోగ్యం ఉద్యోగమనే వ్యవహారాల్లో మనోవ్యధని అనుభవిస్తున్నా బయటపడకుండా జీవిస్తుంటారు మీరు. నడిలోతు దాటి మెల్లగా ఒడ్డువైపుకి వస్తున్నారు కాబట్టి చెప్పుకోదగిన ఇబ్బందులుండవు. క్రమక్రమంగా సమస్యలు పరిష్కరింపబడుతూ వెళ్తాయి. లియో (జూలై 24-ఆగస్టు 23) ఆరిపోయిందనుకున్న నిప్పు మళ్లీ చిన్నగా చెలరేగుతూ ఉంటుంది అర్ధాష్టమ శని కారణంగా. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి ఆ లాభంతో రుణాలని తీర్చాలనే ఆలోచన వద్దు. మీకు ఎందరో సహాయపడుతూ మీ కష్టాల ఎండలకి చక్కని గొడుగు పడతారు. భయం వీడండి. అప్పు చేసి, ప్రయోజనాత్మకమైన స్థలాన్నో ఇంటినో వ్యాపార నిమిత్తం తీసుకుంటారు. అది మంచికే అవుతుంది. భర్త/భార్య ఆరోగ్యాన్ని గమనించుకుంటూ ఉండాలి. సంతానానికి విద్య అబ్బుతుంది. వ్యాపారం చేయాలనే ఆలోచన మంచిదే గాని, తగ్గ ప్రణాళికని ముందే స్థిరంగానూ, దృఢంగానూ వేసుకోవాల్సి ఉంది. సహాయం చేస్తామన్నవారు సహాయపడరని అనుకుంటూ ఆ ప్రణాళికని రచించుకోవాలి. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ శరీరారోగ్యాన్ని సక్రమంగా రక్షించుకోలేక అశ్రద్ధ చేయడమే మీకు రాబోయే సమస్య. అనారోగ్యమనేది తీవ్ర ఉండదు కాని, నిరంతరం అనారోగ్యాన్ని గురించిన ఆలోచనని చేయకుండా ఉండ(లే)రు. వ్యాపారంలో భాగస్వాముల్ని గమనిస్తూ ఉండాలి. ‘ఇది తప్పు’ అని తెలిసీ చేయాల్సిన పరిస్థితిలో పడతారు. ‘వద్దు’ అనుకున్న వివాహమే నిర్ణయించుకోవలసి వస్తుంది. ఇలాంటి క్లిష్టపరిస్థితిలో ఏమాత్రమూ సంశయించకుండా ‘కాదు- కుదరదు- వద్దు’ అని దృఢంగా నిశ్చయించుకోండి తప్ప మనస్సాక్షికి వ్యతిరేకంగా వెళ్లద్దు. కొంతకాలమయ్యాక ‘అయ్యో! అలా చేసి ఉంటే బాగుండేది’ అని మీకు అనిపించినా ఆ పనిని చేసి ఉండకపోవడమే మంచిదని మీకు అర్థమౌతుంది అనుభవంలో. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) గట్టి పట్టుదలతోనూ, ఎందరో మిమ్మల్ని రెచ్చగొట్టిన కారణంగానూ అనవసరమైన న్యాయ(స్థాన)వివాదంలో పడి- మీకున్న అభిమానం కారణంగా వెనక్కి తిరిగి రాలేకపోతారు. సమస్య ఎవరితో వచ్చిందో నేరుగా వారితోనే మెత్తగా మాట్లాడినట్లయితే తప్పక చిక్కు వీడిపోతుంది. మీ జీవితం ఇతరులకోసం కాదు- మీ కోసమని ఆలోచించుకోవాలి. ఆర్థికమైన లోటుని అనుభవిస్తూ ఉండవచ్చు. చేస్తున్న పని లేదా చేసిన పని సరికాదనే ఆలోచన మనసుకి వచ్చినా- మంచిదే అని మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు. దానిక్కారణం మీ తలిదండ్రులూ విశేషించి తల్లీ కారణం కావచ్చు. ఆస్తిని అమ్మకానికి పెట్టి దాన్ని ఉపసంహరించుకోవచ్చు. మనశ్శాంతి లోపించడం, మరపు కూడా ఏర్పడవచ్చు. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మీ ధైర్యం మీ ధర్మబద్ధ విధానం మీ నిజాయితీలే మీ ఆయుధాలుగా యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో కొంత ఎలా నష్టపోక తప్పదో, అదే తీరుగా కొంత (ధనం పరిచయాలు పలుకుబడి, గౌరవం...) నష్టపోతారు తప్ప విజయం మీదే. మీరెవరెవరికి సహాయపడ్డారో, వారే మీ మార్గానికి అడ్డుపడుతూ మిమ్మల్ని యాతనలకి గురి చేయవచ్చు- బెదిరించవచ్చు-కోర్టుకి పోవచ్చు కూడా. బెదిరిపోవాల్సిన పని లేదని గ్రహించండి. ఆవేశం సాహసం, ఎదురు దాడిని చేయదలచడం వద్దు. మీకు కాలం సరిలేదు కాబట్టి, సముద్రపు కెరటం బలంగా వచ్చినప్పుడు తలవంచినట్లు తప్పుకోవడం మంచిది. వాగ్దానాలూ హామీలూ రాతకోతలూ వద్దు. శాంతి ఖడ్గమనేది కోట్ల తలల్ని నరకగలదు. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీరు ఆత్మస్థైర్యంతో పనిని చేయడమనేది స్వాగతించదగినదే అయినా, మీ కుటుంబ సభ్యులతో ముందుగా చెప్పడం అవసరం. లేనిపక్షంలో పనికి అభ్యంతరం కలగవచ్చు. భార్యాభర్తల అన్యోన్య విషయంలో భార్య తప్పక భర్తకి అనుకూలంగా ఉండవలసిందే. లేనిపక్షంలో ఈ రాశివారిలో పొరపచ్చాలు పెద్దవి అయ్యే అవకాశం ఉంది. సొమ్మువిలువ మీకు బాగా తెలిసొచ్చే కాలమిదే. ఇకనుండి రూపాయినీ వందగా లెక్కించవలసి వస్తుంది. రుణాలని పై వ్యక్తులనుంచి తీసుకోకూడని కాలమిది. పై అధికారులతోనూ కింది ఉద్యోగులతోనూ, తోటివారితోనూ మీ గొప్పదనాన్ని చాటుకోవద్దు- ఇతరుల అసూయ కారణంగా పరిస్థితులు తారుమారు కావచ్చు. ఎవరినీ విరోధించకండి. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) చేపట్టిన పని ఒక సందర్భంలో పూర్తి కాకపోవచ్చు. ఏమైనా సరే అని దూసుకుని వెళ్తే మొదటికి మోసం రావచ్చు. వివాదాల జోలికి వెళ్లద్దు. స్థానచలనం మంచిది కాదు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు తగినంత సిబ్బంది ఉన్నారా లేదా? పరిశీలించుకుని దిగండి. అనుకున్న ప్రయాణాలు వాయిదా పడవచ్చు. చేద్దామనుకున్న ఉద్యోగం దూరం జరిగిపోవచ్చు. తీసుకున్న రుణాన్ని తీర్చడం లేదా పొందుదామనుకున్న రుణం తీసుకోవడం అనేవి వాయిదా పడుతూ వెళ్లవచ్చు. బంధుమిత్రుల ఉదాశీన వైఖరి వల్ల కొంత నిర్వేదం - మీలో కలగవచ్చు. కుటుంబ రహస్యాలని మీ తలిదండ్రులకీ అత్తమామలకీ తప్ప మరెవరికీ తెలియడం నాకిష్టమైనది కాదనే విషయాన్ని అందరికీ చెప్పండి. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) న్యాయస్థానంలో ఉన్న అపరిష్కత సమస్యల గురించి వ్యర్థ ప్రయత్నాలని మానండి. సంతానానికి సంబంధించిన ఓ సమస్యని గుర్తించిన తొలిరోజుల్లో మానసికంగా కుంగిపోవచ్చు. భయం అనవసరం. ఏదో ఇల్లూ స్థలం యంత్రం... ఇలా పెద్దమొత్తంలో దేన్నో ఒకదాన్ని కొనే ఆలోచన మీకు బలంగా రావచ్చు. దానికి తగిన ఆదాయం రుణసౌకర్యం... ఇవన్నీ అప్రయత్నంగా మీకు సిద్ధించవచ్చు. ఇంతకుముందు లేని విధంగా ఈసారి మీ అత్తమామలతోనూ దగ్గర బంధువులతోనూ సత్సంబంధాలని మీరు కొనసాగించవచ్చు. మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడంలో మీరు వెనకడుగు వేయడం సరికాదుగాని, చెప్పే శైలిలో తీరులో మాత్రం కాఠిన్యం ఉండకూడదని గ్రహించండి. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) ఒకప్పుడు పెద్దల సమక్షంలో చేసుకున్న ఒప్పందం తారుమారు కావచ్చు. మీదైన ఇల్లు, పొలం వాహనం వంటి వాటిని మొగమాటానికి పోయి మరెవరికో తాత్కాలికంగానైనా రిజిస్టర్ చేయకండి. ఇబ్బంది పెట్టే భార్యాభర్తల్లో భార్యతో ఆ భర్త మంచిగా ఉండగలిగితే సమస్య నివారింపబడుతుంది. సంతానాన్ని గురించి బాగా పట్టించుకుంటారు. పిల్లల చదువులకోసం మీరు, వాళ్లకి దగ్గరగా మీ నివాసాన్ని మార్చుకోవడం గాని, వాళ్లని మంచి చోటులో చేర్చాలనే ఆలోచనకి రావడంగాని చేస్తారు. మీ సమీప బంధువులు జీవితంలో ఓ సమస్యకి గురికావచ్చు. దాని ప్రభావం మీమీద పడవచ్చు. దానిని ఏమాత్రమూ పట్టించుకోకపోవడం మంచిది. దూరాభార ప్రయాణాల్లో ఆరోగ్యం చెడవచ్చు. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
స్వగృహంలో కేసీఆర్ పెళ్లిరోజు వేడుక
హైదరాబాద్: తమ పెళ్లి రోజును పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దంపతులు గురువారం బంజారాహిల్స్ నందినగర్లోని తమ స్వగృహానికి వచ్చారు. ఉదయం 12 గంటలకు కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి ఇక్కడికి వచ్చి సాయంత్రం వరకు గడిపారు. ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు విచ్చేశారు. పెళ్లి రోజు విందు భోజనం కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. తన బంధుమిత్రులతో కేసీఆర్ ఈ వేడుకలను జరుపుకున్నారు. పలువురు ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ తన స్వగృహానికి రావడంతో పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఆస్తికోసమే హత్య
ముస్తాబాద్ : ఆస్తి కోసం వరుసకు కొడుకు అయిన యువకుడిని హత్యచేసిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్ల రూరల్ సీఐ రంగయ్య గురువారం నిందితుల వివరాలు వెల్లడించారు. మద్దికుంట గ్రామానికి చెందిన కదిరె దేవయ్య(30) గత నెల 30 నుంచి కనిపించకుండా పోయాడు. ఆయన కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో తండ్రి చిన్నలింగం ఈనెల 2వ తేదీన పోలీసులకు ఫిర్యాదుచేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఈనెల 4వ తేదీన మద్దికుంట, చీకొడు గ్రామాల మధ్య పాడుబడ్డ బావిలో దేవయ్య మృతదేహం కనిపించింది. విచారణ చేపట్టగా దేవయ్యతో గత నెల 30న వరుసకు చిన్నాన్న అయిన కదిరె సత్తయ్య (50), చిన్నమ్మ భూదవ్వ (48), వీరి కొడుకు వెంకటేశ్(23) పొలం వద్ద ఘర్షణకు దిగారు. ముగ్గురు కలసి దేవ య్య మెడకు నైలాన్ తాడుతో ఉరివేసి చంపారు. తర్వాత సంచిలో దేవయ్య మృతదేహాన్ని సైకిల్పై తీసుకెళ్లి ఓ పాడుబడ్డ బావిలో పడేశారు. ఆస్తికోసం పంచాయితీ... మద్దికుంటకు చెందిన కదిరె చిన్నలింగం, సత్తయ్య, నర్సింహులు అన్నదమ్ములు. నర్సింహులు ముంబాయి వెళ్లి ఆచూకీ లేకుండా పోయాడు. వీరందరికి కలిపి 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నర్సింహులుకు చెందిన ఆరెకరాల భూమి కదిరె దేవయ్య ఆధీనంలో ఉంది. ఇందులోని మూడు ఎకరాలు ఇవ్వాలని సత్తయ్య దేవయ్యతో గొడవపడ్డాడు. పలుమార్లు పంచాయతీ పెట్టాడు. ఈ క్రమంలోనే దేవయ్యను హతమార్చారు. నిందితులను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. వెంకటేశ్ పరారీలో ఉన్నాడని చెప్పారు. హత్య ఘటన వెలుగు చూసిన 24 గంటల్లో నిందితులను పట్టుకున్న ఎస్సై మారుతి, హెచ్సీ శంకర్, కానిస్టేబుళ్లు మిట్టపల్లి శ్రీధర్, బాల శ్రీనివాస్లను సీఐ అభిన ందించారు. నిందితుడిని తప్పించారని ఆందోళన హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు తప్పించారని ఆరోపిస్తూ ముస్తాబాద్ పోలీస్స్టేషన్ ఎదుట మద్దికుంట గ్రామస్తులు గురువారం ఆందోళన చేపట్టారు. కదిరె దేవయ్యను భూమి కోసం సొంత చిన్నాన్న, చిన్నమ్మలు కదిరె సత్తయ్య, భూదమ్మ, సోదరుడు కదిరె వెంకటేశం చంపాలేరని, ఇందులో సత్తయ్య అల్లుడు సతీష్ హస్తం ఉందని గ్రామస్తులు ఆరోపించారు. సత్తయ్య అల్లుడు సతీష్ చంపుతానంటూ బెదిరింపులకు గురిచేశాడని తెలిపారు. దేవయ్య అదృశ్యమైన రోజు సతీష్ గ్రామంలో సంచరించాడని వెళ్లడించారు. దేవయ్యను హత్యచేసేంత శక్తి వృద్ధ దంపతులకు లేదని.. సంచిలో శవం వేసుకుని పాత సైకిల్పై ఎలా వెళ్తారని ప్రశ్నించారు. దేవ య్య హత్యపై తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో మామ అల్లుళ్లపై అనుమానం వ్యక్తం చేశాడని ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మల్లయ్య, కదిరె తిరుపతి, పిట్ల రమేశ్, రామచంద్రం, వైకుంఠం, జింక ఎల్లం అన్నారు. 30వ తేదీన మద్దికుంట శివారులో కొంత మంది సంచిరించిన విషయం కూడా గొర్రెలకాపరులు చూశారని అన్నారు. -
ఆ విషయంలో... వయసును బట్టే వాయిదా!
కౌన్సెలింగ్ సంతానం కలగక ఇబ్బంది పడేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. కాలుష్యం, ఒత్తిడి, ఆహారపుటలవాట్లు... కారణమేదైతేనేం అనేకమంది మాతృత్వానికి నోచుకోలేకపోతున్నారు. పిల్లలు కలగకపోవడం ఒక సమస్య అయితే ఆ సమస్య కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతూ డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. పెళ్ళయ్యాక చాలామంది దంపతులు ముందుగా వారు ఆర్థికంగా, ఉద్యోగపరంగా స్థిరపడాలని కోరుకుంటున్నారు. అలా చేయడం మంచిదే కాని మీ వయసును దృష్టిలో పెట్టుకుని అలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మూడేళ్ళు...నాలుగేళ్ళు అంటూ నియమం పెట్టుకునే మందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ముప్ఫై ఏళ్ళు దాటాక పిల్లలు కనడం మహిళల విషయంలో మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. చాలామంది దంపతుల విషయంలో డాక్టర్లు ఏ లోపమూ లేదని చెబుతారు. ఇంకొంత కాలం ఎదురు చూడమంటారు. ఈలోగా ఇంట్లో పెద్దవాళ్ళ మాటలు దంపతుల్ని అనవసరపు ఒత్తిడికీ, ఆందోళనకూ గురి చేస్తుంటాయి. మాటిమాటికీ పిల్లల తలంపు ఎత్తడం వల్ల ఏర్పడే ఒత్తిడి దాంపత్య జీవితంపై చాలా ఉంటుంది. ముఖ్యంగా ఈ విషయంలో మహిళలపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇటు పుట్టింటివారు, అటు అత్తింటి వారు మాటిమాటికి అమ్మాయినే అడగడం, తోటివారితో పోల్చడం వల్ల మానసికంగా కుంగిపోతున్న మహిళలు చాలా మంది ఉన్నారు. దంపతులిద్దరూ పెద్దవాళ్ళకు నిర్మొహమాటంగా తమ ప్లానింగ్ గురించి చెప్పేయడం ఉత్తమం. ఒకవేళ డాక్టర్లు లోపం ఉందని చెబితే దాని గురించి కూడా వివరంగా చెప్పి, మీ భవిష్యత్ ప్రణాళిక గురించి ముందుగా మీరే చెబితే వారు కూడా ప్రశాంతంగా ఉంటారు. పిల్లలు పుట్టకపోవడానికి లోపం దంపతులిద్దరిలో ఉంటుంది. మహిళలకు లోపం ఉంటే ఆ విషయాన్ని వెంటనే అందరికీ చెప్పేస్తారు. అదే అబ్బాయికి ఏదైనా సమస్య ఉంటే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. ఇలా చేయడం వల్ల భార్య అనవసరపు అభాండాలకు గురవుతూ డిప్రెషన్లోకి వెళ్లిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో మగవాళ్ళు అవసరమైన చికిత్సకు ముందుకెళ్ళి సమస్యను పరిష్కరించుకోవాలి. ఎంత వైద్యం చేయించుకున్నా ప్రయోజనం లేకపోతే అనవసరపు బెంగలు పెట్టుకోకుండా దత్తత మార్గాన్ని ఎంచుకోవడంలో తప్పు లేదు. ఏళ్ళ తరబడి పిల్లల కోసం ఎదురుచూస్తూ, వైద్యం పేరుతో ఆరోగ్యం పాడుచేసుకునే బదులు ఓ బిడ్డను పెంచుకుని ప్రశాంతంగా ఉండొచ్చు. - డాక్టర్ పద్మా పాల్వాయి, సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పటల్