breaking news
Core Income
-
టమాటా లీలలు... అన్ని ఇన్ని కావయా...
పుణే: విపరీతంగా పెరిగిపోయిన టమాటా ధరలతో సామాన్య వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. మహారాష్ట్రలో పుణే జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం టమాటాలతో కేవలం ఒక నెల వ్యవధిలో ఏకంగా రూ.3 కోట్లు ఆర్జించాడు. ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు. పుణే జిల్లాలో జున్నార్ తహసీల్ పరిధిలోని పాచ్గఢ్ గ్రామంలో రైతు ఈశ్వర్ గాయ్కర్(36) చాలా ఏళ్లుగా టమాటా పంట సాగు చేస్తున్నాడు. ఇన్నాళ్లూ నష్టాలే చవిచూశాడు. ఈ ఏడాది మే నెలలో సరైన ధర లేక టమాటాలను వృధాగా పారబోశాడు. ఇప్పుడు ధరలు పెరగడంతో ఈశ్వర్ పంట పండింది. అతడి శ్రమ ఫలించింది. జూన్ 11 నుంచి జూలై 18 మధ్య 3,60,000 కిలోల టమాటాలను సమీపంలోని నారాయణగావ్ మార్కెట్లో విక్రయించాడు. రూ.3 కోట్ల ఆదాయం కళ్లజూశాడు. తన పొలంలో మరో 80,000 కిలోల పంట ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని, మరో రూ.50 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు ఈశ్వర్ చెప్పాడు. టమాటా పంట సాగు, రవాణాకు రూ.40 లక్షలు ఖర్చయినట్లు తెలిపాడు. తనకు 18 ఎకరాల భూమి ఉందని, అందులో 12 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నానని వెల్లడించాడు. జూన్ 11న కిలోకు రూ.38 చొప్పున, జూలై 18న కిలోకు రూ.110 చొప్పున ధర పలికిందని ఆనందం వ్యక్తం చేశాడు. టమాటా సాగుదారులకు ఇది మంచి కాలమని, కానీ, ఒక రైతుగా ఎన్నో గడ్డు రోజులు కూడా చూశానని అన్నాడు. టమాటాలకు కిలోకు రూ.రెండున్నర సైతం రాని రోజులు ఉన్నాయని వివరించారు. టమాటాల సాగు వల్ల 2021లో తనకు దాదాపు రూ.16 లక్షల నష్టం వచ్చిందని, 2022లో మాత్రం స్వల్పంగా లాభపడ్డానని చెప్పాడు. ఇదిలా ఉండగా, మహారాష్ట్రకు చెందిన మరో రైతు రాజు మహాలే టమాటాల సాగుతో ఈ సీజన్లో రూ.20 లక్షలు సంపాదించాడు. అలా అయితే కిలో టమాటాలు ఫ్రీ ఛండీగఢ్ ఆటోవాలా వినూత్న ఆఫర్ తన ఆటో ఎక్కితే కిలో టమాటాలు ఫ్రీగా ఇస్తానంటూ చండీగఢ్లో అరుణ్ అనే ఓ ఆటో డ్రైవర్ ఆఫర్ ప్రకటించాడు. అయితే కనీసం ఐదుసార్లు తన ఆటో ఎక్కిన వారికే ఆఫర్ వర్తిస్తుందంటూ తిరకాసు పెట్టాడు! మనవాడిది ముందునుంచీ సేవా గుణమే. 12 ఏళ్లుగా సైనికులను ఫ్రీగా ఆటో ఎక్కించుకుంటున్నాడు. అంతేకాదు, గర్భిణులను ఉచితంగా ఆస్పత్రికి కూడా చేరేస్తుంటాడు. ‘‘ఆటోయే నా జీవనాధారం. కాబట్టి టమాటాల హవాను ఇలా అదనపు ఆదాయ మార్గంగా మార్చుకోవాలని వినూత్న ఆలోచన చేశానంతే. అయితే మన సైనిక వీరులకు, కాబోయే తల్లులకు చేసే సేవలోనే నాకు అమితమైన తృప్తి దొరుకుతుంది’’ అని చెబుతాడు అరుణ్. అక్టోబర్లో పాకిస్తాన్తో చండీగఢ్లో జరగబోయే క్రికెట్ మ్యాచ్లో భారత్ గెలిస్తే వరుసగా ఐదు రోజుల పాటు అందరికీ తన ఆటోలో ఉచిత ప్రయాణమేనని ప్రకటించేశాడు అరుణ్! కిలో.70కే సబ్సిడీ టమాటా: కేంద్రం టమాటాలను ఇప్పటికే కిలో కేవలం రూ.80కి విక్రయిస్తున్న కేంద్రం, తాజాగా సబ్సిడీని మరో 10 రూపాయలు తగ్గించింది. గురువారం నుంచి రూ.70కే కిలో టమాటాలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. టమాటాల రేటు కొంతకాలంగా చుక్కలనంటుతున్న నేపథ్యంలో ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగా పలు ఇతర కీలక నగరాల్లోనూ వాటిని సబ్సిడీపై కేంద్రం అందుబాటులోకి తేవడం తెలిసిందే. -
కోటక్ బ్యాంకు ఫలితాలు భేష్
♦ జూన్ క్వార్టర్లో లాభం 1,347 కోట్లు ♦ 26 శాతం పెరుగుదల ♦ కలిసొచ్చిన సబ్సిడరీల పనితీరు ముంబై: అనుబంధ సంస్థల చక్కని పనితీరు, కోర్ ఆదాయం పెరగడంతో జూన్ త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంకు మెరుగైన ఫలితాలను ప్రకటించింది. లాభం 26 శాతం వృద్ధితో రూ.1,346.82 కోట్లుగా నమోదైంది. స్టాండలోన్ ప్రాతిపదికన ఆర్జించిన లాభం చూసుకున్నా 23 శాతం వృద్ధితో రూ.913 కోట్లుగా నమోదయింది. నికర వడ్డీ ఆదాయం సైతం 17 శాతం పెరిగి రూ.2,246 కోట్లకు చేరింది. అయినప్పటికీ నికర వడ్డీ మార్జిన్ మాత్రం తగ్గడం గమనార్హం. 0.20 తగ్గి 4.4 శాతానికి పరిమితమైంది. వడ్డీయేతర ఆదాయం రూ.733 కోట్ల నుంచి రూ.906 కోట్లకు వృద్ధి చెందింది. వాహన రుణాల విబాగం ఆదాయం 10 శాతం పెరిగి రూ.132 కోట్లుగా నమోదైంది. కొత్తగా యాప్ ఆధారిత డిజిటల్ సేవింగ్స్ ఖాతాలు, ఇతర సేవలకు సంబంధించి మార్కెటింగ్ కోసం చేసిన వ్యయాల రూపేణా బ్యాంకుపై రూ.63 కోట్ల భారం పడింది. చీఫ్ ఫైనాన్షియల్ అధికారి జైమిన్ భట్ మాట్లాడుతూ... ఎంసీఎల్ఆర్ రేటు మార్జిన్లపై ప్రభావం చూపిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్ 4.2–4.3 శాతానికి పరిమితం అవుతుందని చెప్పారు. రుణాల్లో 19 శాతం వృద్ధి నమోదైంది. వాణిజ్య వాహనాలు, నిర్మాణ రంగ ఎక్విప్మెంట్ విభాగాల్లో అధికంగా రుణాలివ్వడమే దీనికి కారణం. పెద్ద కార్పొరేట్లు, కన్జ్యూమర్ రుణాల్లోనూ వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఆస్తుల నాణ్యత విçషయానికొస్తే... స్థూల ఎన్పీఏలు 1.07%గా ఉన్నాయి. వీటికి కేటాయించిన నిధులు మాత్రం రూ.232కోట్లకు పెరిగాయి. దివాళా చర్యలకు ఆర్బీఐ గుర్తించిన 12 భారీ ఎన్పీఏ కేసుల్లో నాలుగింటిలో కోటక్ బ్యాంకు వాటా కూడా ఉంది.