breaking news
chilkur village
-
పింఛన్ కోసం వెళ్తే చనిపోయావన్నారు
సాక్షి, హైదరాబాద్: పింఛన్ కోసం అధికారులను ఆశ్రయించిన వృద్ధురాలికి వింత అనుభవం ఎదురైంది. పింఛన్ మంజూరైందో, లేదో తెలుసుకునేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్తే ఆన్లైన్లో ఆమె చనిపోయినట్లుగా ఉందన్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శుక్రవారం జరిగింది. చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామానికి చెందిన బుడిగె వెంకటనర్సమ్మ వృద్ధాప్య పింఛన్ కోసం ఏడాదిక్రితం దరఖాస్తు చేసింది. ప్రభుత్వం ఇటీవల కొత్త పింఛన్లు మంజూరు చేయడంతో ఆ జాబితాలో తన పేరు ఉందో లేదో తెలు సుకునేందుకు కుమారుడు నరేష్తో కలిసి వెంకటనర్సమ్మ శుక్రవారం ఉదయం పంచాయతీ కార్యాలయానికి వెళ్లింది. వెంకటనర్సమ్మ ఆధార్ కార్డు నంబర్ను కార్యదర్శి సౌమ్య ఆన్లైన్లో ఎంటర్ చేయగా ఆమె చనిపోయినట్లుగా చూపించింది. అనంతరం మీసేవ, మండల పరిషత్ కార్యాలయాల్లో విచారిస్తే.. అక్కడెక్కడా ఆ ధ్రువీకరించిన దాఖలాలు లేవు. కానీ ఆన్లైన్లో మాత్రం మరణించినట్లుగా నమోదై ఉండడంతో వెంకటనర్సమ్మ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాను బతికే ఉన్నానని, పింఛన్ మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటోంది. చదవండి: Munugodu Politics: మునుగోడు బరిలోకి వైఎస్సార్టీపీ! -
చిలుకూరు.. వెలుగురేఖలు!
- నేత్రదానానికి ముందుకొచ్చిన 2వేల మంది గ్రామస్తులు - రేపు అంగీకార పత్రాలపై సంతకాలు చేసేందుకు సన్నద్ధం - ‘మాధవనేత్రం’ స్వచ్ఛంద సంస్థకు అప్పగించేందుకు సన్నాహాలు మొయినాబాద్: హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామం అందరికీ సుపరిచితమే. చిలుకూరు గ్రామ పంచాయతీకి దేవంల్వెంకటాపూర్, అప్పోజీగూడ అనుబంధ గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం జనాభా 7,265 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 3,900 మంది, మహిళలు 3,365 మంది. గ్రామంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. చాలా మంది వ్యవసాయంపైనే జీవిస్తున్నారు. కొంత మంది యువకులు, మహిళలు చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద షాపులు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. అయితే చిలుకూరు గ్రామానికి చెందిన కొంత మంది యువకులకు నేత్రదానంపై ఆలోచన వచ్చింది. దీంతో గ్రామపెద్దలు, స్థానిక యువజన సంఘాలతో చర్చించి నేత్రదానానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని ఉషోదయ, చైతన్య, శివాజీ, అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులతోపాటు మరికొన్ని యువజన సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు నేత్రదానానికి ముందుకొచ్చారు. మొత్తం 10 సంఘాల్లోని సుమారు 500 మంది సభ్యులతోపాటు సుమారు 1500 మంది గ్రామస్తులు నేత్రదాన అంగీకార పత్రాలపై సంతకాలు చేసేందుకు సిద్ధమయ్యారు. అంగీకార పత్రాలపై సంతకాలు చేసి ‘మాధవ నేత్రం’ సంస్థకు అప్పగించనున్నారు. అందుకోసం సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో... చేవెళ్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు నేత్రదానం చేసేందుకు ఇప్పటికే ముందుకొచ్చారు. నాలుగేళ్ల క్రితం చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లిలో సుమారు 2వేల మందికిపైగా నేత్రదానం చేసేందుకు అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. అదే విధంగా మొయినాబాద్ మండలంలోని రెడ్డిపల్లిలో సైతం యువజన సంఘాల సభ్యులు, గ్రామస్తులు నేత్రదానానికి ముందుకొచ్చారు. 2011లో నేత్రదాన పత్రాలపై సంతకాలు చేసి మాధవ నేత్రం సంస్థకు ఇచ్చారు. రెండు సంవత్సరాల క్రితం రెడ్డిపల్లికి చెందిన మోర యాదయ్య మరణించడంతో ఆయన కళ్లను మాధవ నేత్రం సంస్థకు అప్పగించారు. ఇదే స్ఫూర్తితో చిలుకూరు గ్రామస్తులు సైతం నేత్రదానానికి ముందుకురావడం అభినందనీయం. అంధుల జీవితాల్లో వెలుగులు నింపాలనే.. అంధత్వంతో ఎంతో మంది బాధపడుతున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతో నేత్రదాన కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నాం. గ్రామపెద్దలతో చర్చించి నేత్రదాన కార్యక్రమం చేపడుతున్నాం. - మహేష్, యువజన సంఘం సభ్యుడు, చిలుకూరు