breaking news
career planning
-
Engineering Special: బీటెక్ తర్వాత.. కెరీర్ ఆప్షన్స్
ఇంటర్మీడియెట్(ఎంపీసీ) విద్యార్థుల కలల కోర్సు.. ఇంజనీరింగ్(బీటెక్/బీఈ). నేటి యువత క్రేజీ కెరీర్ ఇది. దేశవ్యాప్తంగా ఏటా లక్షల మంది ఇంజనీరింగ్లో చేరుతున్నారు. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తయ్యాక ఏం చేయాలి?! అనే ప్రశ్న ఎదురవుతోంది. ఉద్యోగమా.. ఉన్నత విద్యా.. ఏ మార్గం ఎంచుకోవాలి.. వాస్తవానికి బీటెక్ ఉత్తీర్ణులైన విద్యార్థుల ముందు అనేక ఉన్నత విద్య, ఉద్యోగ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు భవిష్యత్ గురించి ఆందోళన చెందకుండా.. తమ కెరీర్ లక్ష్యాలకు ఏది అనుకూలమో అది ఎంచుకోవడం మేలు అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో.. బీటెక్ తర్వాత ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం.. బీటెక్ పూర్తయ్యాక ఇంజనీరింగ్ కోర్ విభాగంలోనే కొనసాగాలనుకుంటే.. ఎంటెక్లో చేరొచ్చు. లేదా మేనేజ్మెంట్ వైపు వెళ్లాలనుకుంటే.. ఎంబీఏలో అడుగుపెట్టొచ్చు. ఇటీవల కాలంలో ఎంబీఏను ఎంచుకునే ఇంజనీరింగ్ అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. మరికొందరు ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్యూ) ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంకొందరు సివిల్ సర్వీసెస్కు సన్నద్ధమవుతున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ బీటెక్ కోర్సు పూర్తికాగానే ఉద్యోగంలో చేరాలనుకునే ఇంజనీరింగ్ విద్యార్థులకు వరం.. క్యాంపస్ ప్లేస్మెంట్స్. నిజానికి ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ ద్వారా ఉద్యోగం పొందడం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కు అందుబాటులో ఉన్న ఉత్తమ మార్గంగా చెప్పొచ్చు. ప్రముఖ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు.. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రతి ఏటా ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ నిర్వహిస్తుంటాయి. ఈ ప్లేస్మెంట్స్ ప్రక్రియలో పాల్గొనాలనుకునే విద్యార్థులు అందుకోసం ముందుగానే కసరత్తు ప్రారంభించాలి. రిక్రూటర్లను ఆకట్టుకునేలా రెజ్యూమ్ని రూపొందించుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే బీటెక్ మొదటి ఏడాది నుంచే సబ్జెక్ట్ల్లో మంచి స్కోరు వచ్చేలా చూసుకోవాలి. అంతేకాకుండా కంపెనీల్లో ఇంటర్న్షిప్తోపాటు బీటెక్ ప్రాజెక్ట్ వర్క్పైనా పట్టు సాధించాలి. కాలేజీలో జరిగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పాల్పంచుకోవడం మేలు చేస్తుంది. ప్లేస్మెంట్స్ ప్రక్రియలో విజయం సాధించేందుకు సబ్జెక్టు నైపుణ్యాలతోపాటు, ప్రాక్టికల్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్, కంపెనీలు, మార్కెట్లు, తాజా టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి. ఉన్నత విద్య.. ఎంటెక్/ఎంబీఏ ► ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉన్నత చదువుల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. స్వదేశంలో ఎంటెక్ లేదా విదేశాల్లో ఎంఎస్ చేయాలని ప్రణాళికలు వేసుకుంటారు. దేశలోని టాప్ కాలేజీల్లో ఎంటెక్లో చేరేందుకు చక్కటి మార్గం.. ‘గేట్’(గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్). బీటెక్ సబ్జెక్టులపై సమగ్ర అవగాహన, బేసిక్ కాన్సెప్ట్లపై గట్టి పట్టు, ప్రశ్నల ప్రాక్టీస్ ద్వారా గేట్లో మంచి ర్యాంకు సాధించొచ్చు. ► గత కొన్నేళ్లుగా ఇంజనీరింగ్ అభ్యర్థులు మేనేజ్మెంట్ కోర్సులను ఎంచుకుంటున్నారు. బీటెక్+ఎంబీఏ.. గొప్ప కెరీర్ కాంబినేషన్గా గుర్తింపు పొందింది. వీరికి కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే చాలామంది విద్యార్థులు బీటెక్ తర్వాత ఎంబీఏలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. టాప్ బిజినెస్ స్కూల్స్ ఐఐఎం(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)ల్లో పీజీ కోర్సుల్లో చేరాలంటే..క్యాట్(కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్)లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. క్యాట్తోపాటు మ్యాట్,సీమాట్, ఐసెట్, జీమ్యాట్ వంటి ఎంట్రెన్స్ల ద్వారా ఎంబీఏలో చేరేందుకు అవకాశం ఉంది. పీఎస్యూల్లో ఉద్యోగం బీటెక్ అభ్యర్థులకు మరో మంచి అవకాశం.. ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్యూ) ఉద్యోగం. వీరు గేట్లో టాప్ ర్యాంకు ద్వారా సదరు పీఎస్యూలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీహెచ్ఈఎల్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, నాల్కో, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ వంటి వాటిల్లో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగం దక్కించుకోవచ్చు. గేట్ స్కోరుతో సంబంధం లేకుండా.. డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఎన్ఎండీసీ, బార్క్, ఇస్రో వంటి ప్రముఖ సంస్థల్లో ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఉద్యోగాలు లభిస్తాయి. సివిల్స్, ఈఎస్ఈ పరిపాలన విభాగంలో చేరాలనుకునే బీటెక్ అభ్యర్థులకు చక్కటి మార్గం.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఇందుకోసం యూపీఎస్సీ ఏటా విడుదల చేసే నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవాలి. మూడంచెల సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించేందుకు సన్నద్ధమవ్వాలి. ఇది దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. అలాగే ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం యూపీఎస్సీ విడుదల చేసే మరో ప్రతిష్టాత్మక నోటిపికేషన్..ఈఎస్ఈ(ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్). దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ ఏ స్థాయి పోస్టులు భర్తీ చేస్తారు. అలాగే యూపీఎస్సీ విడుదల చేసే మరో ఉన్నత నోటిఫికేషన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్)కు కూడా బీటెక్ అభ్యర్థులు పోటీ పడొచ్చు. దేశ సేవకు ‘డిఫెన్స్’ భారత సైన్యానికి అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక విభాగం ఉంది. దీంతో భారత సైన్యంలోని టెక్నికల్ వింగ్స్లో ఇంజనీర్లకు అవకాశాలు లభిస్తున్నాయి. టెక్నికల్ ఎంట్రీ లెవెల్తో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఆర్మీ/నేవీ/ఎయిర్ఫోర్స్ల్లో చేరొచ్చు. బీటెక్ తర్వాత యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్(యూఈఎస్), ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఏఎఫ్ క్యాట్), షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్ఈ) వంటి వాటి ద్వారా త్రివిధ దళాల్లో చేరొచ్చు. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(టీజీసీ)కు దరఖాస్తు చేసుకొని.. ఇండియన్ మిలటరీ అకాడమీలో చేరొచ్చు. రక్షణ దళాల్లో ఉద్యోగం అంటే.. అత్యంత గౌరవప్రదమైన కెరీర్స్లో ఒకటిగా చెప్పొచ్చు. ఇందులో చేరిన అభ్యర్థులకు మంచి వేతనం, ఉద్యోగ భద్రత, సౌకర్యాలతోపాటు దేశానికి సేవ చేస్తున్నామని సంతృప్తి సైతం లభిస్తుంది. ప్రైవేట్ రంగంలో కొలువు బీటెక్ ఉత్తీర్ణులకు ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలకు కొదవలేదు. నైపుణ్యాలుంటే.. ప్రభుత్వ రంగం కంటే ఎన్నో రెట్లు అధిక వేతనాలు కార్పొరేట్ కంపెనీల్లో లభిస్తున్నాయి. బీటెక్ గ్రాడ్యుయేట్లను ఇంజనీర్లుగానే కాకుండా.. పరిశోధకులుగా, కన్సల్టెంట్లుగా, సాఫ్ట్వేర్ డవలపర్లుగా నియమించుకుంటున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్, సివిల్/ఎలక్ట్రికల్ ఇంజనీర్, సిస్టమ్ అనలిస్ట్, ఐటీ కో ఆర్డినేటర్, అప్లికేషన్ డెవలపర్ వంటి జాబ్స్ ఐటీ రంగంలో దక్కించుకోవచ్చు. అలాగే క్వాలిటీ ఇంజనీర్, ప్రాసెస్ ఇంజనీర్, ఇండస్ట్రియల్ మేనేజర్, ప్లాంట్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ టెక్నీషియన్ వంటి కొలువులు సైతం తయారీ రంగంలో సొంతం చేసుకోవచ్చు. సీ, సీ++, జావా, ఎస్క్యూఎల్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, నెట్వర్కింగ్, ఐవోటీ, బ్లాక్చైన్ టెక్నాలజీ, ఎంబెడెడ్ టెక్నాలజీ, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నైపుణ్యాలు పెంచుకుంటే వివిధ విభాగాల్లో కొలువులు లభించే అవకాశం ఉంటుంది. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇటీవల ఎక్కువ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని, కొత్త ఆలోచనతో స్టార్టప్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. విద్యార్థులు ప్రారంభించిన పలు స్టార్టప్స్ విజయవంతం కావడం.. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రేరణగా నిలుస్తోంది. కాని సొంత వ్యాపారం అనే మార్గంలో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించేందుకు ఎంతో ఓపిక, సహనం అవసరం!! -
కెరీర్ ప్లానింగ్ ఇలా..
పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిశాయి. తర్వాత ఎలాంటి కోర్సులు ఎంపిక చేసుకోవాలి? ఆ కోర్సులతో భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే సందేహాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉన్నాయి. వీటికి సమాధానం.. కెరీర్ ప్లానింగ్.. సరైన ప్లానింగ్తో అడుగులు వేస్తే ఏ కోర్సయినా.. ఏ రంగమైనా.. ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో కెరీర్ ప్లానింగ్ విషయంలో నిపుణులు అందిస్తున్న సలహాలు.. ఆసక్తే ప్రధానం: విద్యార్థులు వ్యక్తిగత ఆసక్తికి అనుగుణంగా కోర్సుల వివరాలు తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి పజిల్స్, సుడోకు వంటివాటిపై ఆసక్తి ఉంటే మ్యాథమెటిక్స్, సైన్స్ విభాగాల్లో రాణించగలరు. జనరల్ నాలెడ్జ్ అంశాలపై ఆసక్తి ఉన్నవారికి ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సులు కలిసొస్తాయి. యాటిట్యూడ్.. ఆప్టిట్యూడ్: విద్యార్థికి వ్యక్తిగతంగా ఉన్న లక్ష్యాలు, వాటిని అందుకునే దిశగా వారి దృక్పథాన్ని పరిశీలించాలి. విద్యార్థులు పేర్కొన్న లక్ష్యాలకు అనుగుణంగా వారి దృక్పథం ఉందా? లేదా? అని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అత్యున్నత అవకాశాలు: ఆయా కోర్సులతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకోవాలి. ఇటీవల మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా కొత్త కోర్సులు రూపొందుతున్నాయి. ఇలాంటి అప్కమింగ్ కోర్సులు, కెరీర్స విషయంలో ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, జాబ్ ట్రెండ్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ గురించి బేరీజు వేసుకుని ఆచితూచి అడుగులు వేయాలన్నది నిపుణుల సలహా. కోర్స్ వర్సెస్ కాలేజ్: కెరీర్ ప్లానింగ్లో ముఖ్య దశ... తమకు ఆసక్తి ఉన్న కోర్సుకా?లేదా కాలేజ్కు ప్రాధాన్యమివ్వాలా? అనే అంశంపై స్పష్టత. ముఖ్యంగా ఇంజనీరింగ్, సైన్స్ విభాగాలను లక్ష్యంగా నిర్దేశించుకున్న విద్యార్థులు ఈ విషయంలో ఎంతో కసరత్తు చేయాలి. తమకు ఆసక్తి ఉన్న బ్రాంచ్/కోర్సుకు సంబంధించి ప్రతిష్టాత్మక కళాశాలలు, మంచి చరిత్ర ఉన్న కళాశాలలను గుర్తించాలి. కోర్స్ వర్సెస్ కాలేజ్ విషయంలో కోర్స్కే ప్రాధాన్యమివ్వాలి అనేది నిపుణుల సూచన. లక్ష్య సాధన దిశగా: ఏ కోర్సు విద్యార్థులకైనా తుది లక్ష్యం చక్కటి జాబ్ సొంతం చేసుకోవడం. సుస్థిర కెరీర్కు మార్గం వేసుకోవడం. ఇంటర్మీడియెట్ తర్వాత పలు బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులు తాము లక్ష్యంగా చేసుకున్న కెరీర్స్.. వాటికి లభించే అవకాశాలు.. అందుకు అవసరమైన అర్హతలు తెలుసుకుని వాటిని మెరుగుపరచుకునేందుకు పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించాలి. -
భవిష్యత్ను తీర్చిదిద్దుకొనేదిలా!
హైదరాబాద్: నేటి తరం విద్యార్థుల్లో మెళకువలు, నైపుణ్యాలు కొరవడుతున్నాయి. ఉన్నత విద్య అభ్యసించినా సరైన ఉద్యోగావకాశాలు అందుకోలేకపోతున్నారు. తాము చదివిన చదువుకు సంబంధం లేని కొలువులు చేస్తూ అరకొర వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇంకొందరు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. వారిని సరైన మార్గనిర్దేశం లేకపోవడం వల్లే కెరీర్ పరుగులో వెనుకంజ వేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి పాఠశాల స్థాయి నుంచే అకడమిక్ కెరీర్ ప్లానింగ్పై అవగాహన కల్పించే నూతన కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ ఇటీవల చేపట్టింది. సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ లెర్నింగ్(సీఎఫ్ఐఎల్) సహకారంతో ప్రయోగాత్మకంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. దీన్ని ఇతర జిల్లాల్లోనూ కొనసాగించాలని అధికారులు యోచిస్తున్నారు. ఎటు వెళ్లాలి? ఏం చేయాలి? సీఎఫ్ఐఎల్ అధ్యయనం ప్రకారం.. అకడమిక్ కెరీర్ ప్లానింగ్, మార్గనిర్దేశం లేకపోవడం వల్ల విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తిచేసినప్పటికీ తాము ఎటువైపు వెళ్లాలో, ఏం చేయాలో అర్థంకాని అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం వారు నిర్ణీత నైపుణ్యాలను అలవర్చుకోలేకపోవడమే. సీఎఫ్ఐఎల్ గణాంకాల ప్రకారం.. ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారిలో 83 శాతం మంది నిరుద్యోగులుగా ఉంటున్నారు. కొందరు నెలకు రూ.5 వేల జీతంతో తమ చదువులకు సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అటెండర్, క్లర్క్ వంటి కిందిస్థాయి ఉద్యోగాలకూ వేలల్లో దరఖాస్తులు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఏటేటా పెరుగుతున్నట్లు సీఎఫ్ఐఎల్ అధ్యయనంలో తేలింది. ఈ పరిస్థితిని మార్చాలంటే పాఠశాల స్థాయి నుంచే అకడమిక్ కెరీర్ ప్లానింగ్పై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్నది విద్యాశాఖ ఉద్దేశం. పదో తరగతి తరువాత కోర్సులెన్నో... అకడమిక్ కెరీర్ కౌన్సెలింగ్లో భాగంగా పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రికార్డు చేయిస్తూ దాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తారు. ఆయా విద్యార్థులు ఏయే అంశాల్లో పరిణతి కనబరుస్తున్నారు? వారిలో ఎలాంటి సృజనాత్మక శక్తి ఉంది? వంటి అంశాలను లోతుగా పరిశీలిస్తారు. తద్వారా పదో తరగతి తరువాత వారు ఏ కోర్సులను ఎంచుకొంటే అద్భుతంగా రాణిస్తారో సూచిస్తారు. ప్రస్తుతం విద్యార్థుల్లో అవగాహన కొరవడడం వల్ల తమ అభిరుచికి తగని కోర్సుల్లో చేరుతూ మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. పదో తరగతి తరువాత వివిధ రంగాలకు సంబంధించి వందలాది కోర్సులున్నా వాటి గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి కనీస అవగాహన కూడా ఉండడం లేదు. అకడమిక్ కెరీర్ కౌన్సెలింగ్లో పదో తరగతి తరువాత అందుబాటులో ఉన్న కోర్సులు, వాటిని అభ్యసిస్తే లభించే ఉద్యోగావకాశాల గురించి తెలియజేస్తారు. విద్యార్థుల అభీష్టాన్ని అనుసరించి దేనిలో చేరితే కెరీర్ బాగుంటుందో మార్గనిర్దేశం చేస్తారు. ముందుగా ప్రధానోపాధ్యాయులకు దీనిపై శిక్షణ ఇస్తారు. అనంతరం స్కూళ్లవారీగా విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తారు.