breaking news
card cloning
-
బీఅలర్ట్ : ఏటీఎంలలో నయా మోసం
జేబులు కత్తిరించకుండానే ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. బీరువాలను ముట్టుకోకుండానే సొమ్ము మాయం చేస్తున్నారు. అర్ధరాత్రి నిద్దర మానుకుని దొంగతనాలు చేసే పని లేకుండా ఏ సమయంలోనైనా ఈజీగా నగదు కొల్లగొడుతున్నారు. అందుకు వారు వాడే ఆయుధం జనం అమాయకత్వం మాత్రమే. ఏటీఎం కార్డుదారులు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వైట్ కాలర్ మాయగాళ్లు రెచ్చిపోతారు. దీనిపై పోలీసులు సైబర్ అవేర్నెస్ వీక్ పేరిట అవగాహన కల్పించారు. కార్డుదారులు పాటించాల్సిన జాగ్రత్తలు వివరించారు. శ్రీకాకుళం: ఇటీవలి కాలంలో జరుగుతున్న అనేక సైబర్ నేరాల్లో ఏటీఎం కార్డు నేరాలు చాలా ఎక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, అవగాహన రాహిత్యం గల ప్రజలు ఇలాంటి నేరాల్లో బాధితులు అవుతున్నారు. దీనిపై పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. అవగాహన పెంచుకుంటే మోసాల బారిన పడకుండా ఉంటారని సూచిస్తున్నారు. ఏటీఎం మోసాల్లో కొన్నింటిని పరిశీలిస్తే.. ఏటీఎం కార్డు మార్చడం.. ఇలాంటి మోసాలు ఎక్కువగా ఏటీఎం సెంటర్లో జరుగుతుంటాయి. నేరస్తుడు ఏటీఎం గది లోపలే ఉండి వృద్ధులు, అవగాహన రాహిత్యం గల వారిని టార్గెట్గా చేసుకొని మోసపూరితమైన మాటలతో వారి ధ్యాసను మళ్లించి, ఏటీఎం పిన్ నంబరును గమనించి వారి ఏటీఎం కార్డును మార్చేస్తాడు. దాని బదులు తన వద్ద ఉండే అదే రకమైన కార్డు ఇచ్చి మోసం చేస్తాడు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, అవగాహన రాహిత్యం గల ప్రజలు ఇలాంటి నేరాల్లో బాధితులవుతున్నారు. ఎలా జాగ్రత్త పడాలి..? ►ఏటీఎం సెంటర్లో కార్డు వినియోగం కోసం అపరిచిత వ్యక్తుల సహాయం కోర కూడదు. మనతో అనవసరంగా మాటలు కలిపేందుకు ప్రయత్నించే అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. ►పిన్ నంబర్ను కార్డు/పేపరుపైన రాయడం చేయకూడదు. ఏటీఎంకు దగ్గరగా నిలబడి చేతిని అడ్డుపెట్టుకుంటూ పిన్ నంబర్ను ఎవరూ గమనించకుండా జాగ్రత్తపడాలి. ►ఏటీఎంలో కార్డును పెట్టే ప్రదేశంలో ఏదైనా అసాధారణమైన డివైస్ అమర్చినట్లు గమనించినా లేదా ఏటీఎం రూమ్లో ఏవైనా సీక్రెట్ కెమెరాలు ఉన్నట్లు గమనించినా లేదా కీ పాడ్ పైన ఏవైనా లేయర్స్ (కీ–లోగెర్స్) ఉన్నట్లు గమనిస్తే అలాంటి ఏటీఎంలో ఎలాటి లావాదేవీలు చేయకూడదు. ►మన ఏటీఎం కార్డు పోయినా/దొంగిలించినా వెంటనే బ్యాంకును సంప్రదించి కార్డు బ్లాక్ చేయించుకోవాలి, పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయాలి. గుర్తు పెట్టుకోండి.. ►బ్యాంకులు/ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన ఉద్యోగులు వారి కస్టమర్లకు ఫోన్కాల్స్ ద్వారా గాని, ఎస్ఎంఎస్/ఈ–మెయిల్ ద్వారా గాని ఏ విధమైన వ్యక్తిగత సమాచారం, ఓటీపీ నెంబర్, పాస్వర్డ్లను గురించి అడగదు. ►అలాంటి కాల్స్/ఎస్ఎంఎస్/ఈ–మెయిల్స్కు ఎప్పుడూ రెస్పాండ్ అవ్వకూడదు. పొరపాటున ఏదైనా సమాచారం ఇస్తే వెంటనే పాస్వర్డ్ మా ర్చుకోవాలి. సంబంధిత బ్యాంకులను సంప్రదించాలి, పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయాలి. ఫోన్ ద్వారా.. ఈ మధ్య కాలంలో సైబర్ నేరస్తులు/మోసగాళ్లు కొత్త పంథాలను ఎంచుకున్నారు. వారు ఏదో ఒక బ్యాంక్/ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఉద్యోగులుగా చెప్పుకుంటూ మన డెబిట్/క్రెడిట్ కార్డు బ్లాక్ అవుతుందని, బ్యాంక్ కేవైసీ అప్డేట్ చేయాలని లేదా బ్యాంకు అకౌంట్కు ఆధార్ లింక్ చేయాలనే నెపంతో మనకు ఫోన్ కాల్స్ చేస్తారు (విషింగ్). కొన్ని సార్లు ఎస్ఎంఎస్ (స్మిషింగ్) పెడతారు. మరికొన్ని సార్లు ఈ–మెయిల్స్ (ఫిషింగ్) ద్వారా లింక్స్ పంపిస్తారు. ఈ పద్ధతుల్లో మన డెబిట్/క్రెడిట్ కార్డుకు సంబంధించిన 16 డిజిట్ కార్డు నంబర్, కార్డు ఎక్స్పైరీ తేదీ, సీవీవీ నంబర్, ఓటీపీ నంబర్, ఏటీఎం పిన్ నంబర్, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించి వాటిని మనకు తెలియకుండా వారి వ్యక్తిగత ఆర్థిక అవసరాల నిమిత్తం వాడుకుంటూ నేరాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో సైబర్ మోసగాళ్లు గవర్నమెంట్ ఆఫీషియల్స్గా చెప్పుకుంటూ కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ కోసం ఆధార్ కార్డు, ఇతర వివరాలను సేకరించి నేరాలు చేస్తున్నారు. కార్డ్ క్లోనింగ్ సాధారణంగా మన డెబిట్/క్రెడిట్ కార్డుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా కార్డు వెనుక వైపు ఉండే మాగ్నెటిక్ స్ట్రిప్లో నిక్షిప్తమై ఉంటుంది. సైబర్ నేరస్తులు స్కిమ్మర్ అనే ఎలక్ట్రానిక్ సాధనాన్ని ఉపయోగించి మన కార్డు సమాచారాన్ని ఆ మాగ్నెటిక్ స్ట్రిప్ నుంచి మోసపూరితంగా సేకరిస్తారు. మనం పిన్ నంబరును కొట్టేటప్పుడు దాన్ని గమనిస్తారు. ఇలాంటి నేరాలు ఎక్కువగా రెస్టారెంట్లు, బార్లు, పెట్రోలు బంకులు, స్కిమ్మింగ్ డివైస్లు అమ ర్చిన ఏటీఎంలలో మన కార్డు ద్వారా లావాదేవీలు చేయడం వల్ల జరుగుతాయి. -
‘క్లోన్’ చేసి రూ.కోటి కొట్టేశారు!
► క్రెడిట్, డెబిట్ కార్డుల్నిక్లోనింగ్ చేసిన ముఠా ► స్వైపింగ్ మెషీన్ల ద్వారా రూ.కోటి స్వాహా ► నలుగురి అరెస్టు సాక్షి, హైదరాబాద్: కరెంట్ ఖాతాల ఆధారంగా బ్యాంక్ నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ మెషీన్లు తీసుకు ని క్లోనింగ్ కార్డుల్ని వినియోగించి రూ.1.1 కోట్ల స్వాహా చేసిన అంతర్రాష్ట్ర ముఠాను నగర సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. కరెంట్ ఖాతాల ద్వారా.. నగరానికి చెందిన మామిడి మహేశ్ జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్లో 4 కరెంట్ ఖాతాలు తెరిచి.. వ్యాపార లావాదేవీలకు ఫిబ్రవరిలో నాలుగు స్వైపింగ్ మెషీన్లు తీసుకున్నాడు. ఓ కేసులో నిందితునిగా ఉన్న మహేశ్కు ఇటీవలే కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో జైలుకు వెళ్తూ తన స్వైపింగ్ మెషీన్లను స్నేహితుడైన కిరణ్కుమార్కు అప్పగించాడు. వనస్థలిపురం లో చిన్న దుకాణం నడుపుతున్న కిరణ్కు కొన్నాళ్ల క్రితం చాంద్పాషాతో పరిచయమైంది. తనకు కేరళ నుంచి క్లోనింగ్ చేసిన క్రెడిట్, డెబిడ్ కార్డులతో పాటు పిన్ నంబర్, డేటా వస్తుందని అతను కిరణ్తో చెప్పాడు. స్వైపింగ్ మెషీన్లు తనకిస్తే లావాదేవీలపై 10 శాతం కమీషన్ ఇస్తానంటూ ఎర వేశాడు. కమీషన్ కోసం పక్కదారి.. కమీషన్ కోసం కిరణ్ స్వైపింగ్ మెషీన్లను పాషాకు అప్పగించాడు. పాషా వాటిని కేరళకు చెందిన అబుబాకర్కు అందించాడు. కేరళలోని యూసుఫ్ నుంచి క్లోన్డ్ కార్డుల్ని తీసుకుంటున్న ఇతను వాటిని స్వైపింగ్ మెషీన్లలో స్వైప్ చేస్తూ నిర్ణీత మొత్తం మహేశ్ కరెంట్ ఖాతాల్లో పడేలా చేస్తున్నాడు. కిరణ్ ఆ మొత్తంలో 10 శాతం కమీషన్గా తీసుకుని మిగిలినది అబుబాకర్ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అబుబాకర్ తన ఖాతాల్లోకి చేరిన మొత్తంలో 40 శాతం కమీషన్గా తీసుకుని మిగిలింది యూసుఫ్ ఖాతాల్లోకి జమ చేస్తున్నాడు. ఈ వ్యవహారాల్లో కిరణ్కు రామ్ప్రసాద్.. అబుబాకర్కు కేరళకే చెందిన హనీఫ్ హంజా సహకరించారు. రెండు నెలల్లో రూ.కోటి స్వైప్ ఈ గ్యాంగ్ రెండు నెలల్లో అనేక మంది క్లోన్డ్ కార్డులను వినియోగించి రూ.1.1 కోట్లు స్వాహా చేసింది. జేఅండ్కే బ్యాంక్ జారీ చేసిన స్వైపింగ్ మెషీన్ల ద్వారా తమ కస్టమర్లకు తెలి యకుండానే వారి కార్డుల్ని క్లోన్ చేసి, నగదు కాజేస్తున్నారని దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. దీంతో జేఅండ్కే బ్యాంక్ అధికారి మహ్మద్ అల్తాఫ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీ సులు కిరణ్, అబుబాకర్, హనీఫ్, రామ్కుమార్ను అరెస్టు చేశారు. జైల్లో ఉన్న మహేశ్ను పీటీ వారెంట్పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. పరారీలో ఉన్న కీలక సూత్రధారి యూసుఫ్తో పాటు చాంద్పాషా కోసం గాలిస్తున్నారు.